విచ్చలవిడిగా వాడకం
పిల్లల ప్రిస్కిప్షన్లలోనూ 76 శాతం అవే
డేంజర్బెల్స్ మోగిస్తున్న తాజా నివేదికలు
పెద్దల్లో 83 శాతం మందిలో ఏఎంఆర్
అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఔట్ పేషెంట్ (ఓపీ)కి వచ్చిన ప్రతి నలుగురు పిల్లల్లో ముగ్గురికి యాంటీబయాటిక్స్ సూచించడం..వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే పెద్దల్లో 83 శాతం మందిలో ఏఎంఆర్ బ్యాక్టీరియా ఉందని ఏఐజీ పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా జ్వరం, జలుబు, గాయం, ఒళ్లు నొప్పులకు ఓవర్ది కౌంటర్లో యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఇవి వినియోగించడం, కోర్సు పూర్తి చేయకపోవడం, ఇతర కారణాలతో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరుగుతుంది. రోగం వచ్చినపుడు ప్రాణాలు కాపాడాల్సిన మందులు పనిచేయకుండా ఏఎంఆర్ అడ్డుకుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఓపీలో పిల్లలకు ఇచ్చే ప్రిస్కిప్షన్లలో 76 శాతం మందికి వైద్యులు యాంటీబయాటిక్స్ సూచిస్తున్నారని కేర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. 891 మంది పిడియాట్రిక్ ఔట్ పేషెంట్ల (ఓపీ) వివరాలను విశ్లేíÙంచగా అందులో 65.8 శాతం బాలురు, 34.2 శాతం బాలికలు ఉన్నారు. అధ్యయనం చేసిన పిల్లల్లో శ్వాసకోస ఇన్ఫెక్షన్లు (49.6) అత్యంత సాధారణంగా ఉన్నాయి. 678 మంది ప్రిస్కిప్షన్లలో 96.9 శాతం ఒకే రకమైన యాంటీబయాటిక్ ఉండగా, 3.1 శాతం మరో రెండు రకాలు ఉన్నాయి. అత్యధిక భాగం బ్రాండెడ్ మందులే ఉండగా కేవలం 2.4 శాతం మాత్రమే జనరిక్ మందులు రాస్తున్నారని కళాశాల ప్రాక్టీస్ హెచ్ఓడీ సత్యనారాయణ వివరించారు.
83 శాతం మంది రోగుల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఉంటోందని ఏఐజీ ఆసుపత్రి పరిశోధనల్లో తేలింది. ఇది మందులు పనిచేయకుండా అడ్డుకుంటుందని, ఈ పరిస్థితిని నియంత్రించకపోతే భవిష్యత్తులో వైద్యం ఖర్చులు పెరగడంతో పాటు, హై డోస్ మెడిసిన్ వాడాల్సి ఉంటుందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ నాగేశ్వర్రెడ్డి పేర్కొంటున్నారు. అయినా ఖచ్చితంగా రోగం నయం అవుతుందన్న గ్యారంటీ ఇవ్వలేమన్నారు.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు..
శరీరంలో వైరస్, ఫంగల్, ప్యారాసైట్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఇందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అతిగా యాంటీబయాటిక్స్ వినియోగం మానవ ఆరోగ్యానికి కీడు చేస్తుంది. దీనిపై రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ అధికారులు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
ఫొటో కేఎస్ అని ఉంటుంది.
‘కోర్సు’ మేర మందులు వాడాలి..
మెదడు, ఉదరం, యూరిన్, శ్వాసకోశ వ్యవస్థ.. ఇలా శరీరంలోని అవయవాలకు యాంటీబయాటిక్ మోతాదు ఉంటుంది. దీన్ని మించి ఇవ్వకూడదు. యాంటీబయాటిక్ ఇవ్వండని తల్లిదండ్రులే అడుగుతున్నారు. అడినోవైర్తో వచ్చే జ్వరం 15 రోజులు ఉంటుంది. డెంగీ, కోవిడ్, మలేరియా వంటి రోగాలకు యాంటీబయాటిక్స్ అవసరం లేదు. సీబీపీ, సీఆర్పీ, యూరిన్ వంటి చిన్నచిన్న పరీక్షల ఆధారంగా యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఎంత డోస్, ఎన్ని రోజులు వినియోగించాలో చెబుతారు. కోర్సు పూర్తి చేయాలి. మధ్యలో ఆపేసినా రెసిస్టెన్స్ పెరుగుతుంది. పరిస్థితిని చక్కదిద్దకపోతే భవిష్యత్తులో రోగాలను నయం చేయడం కష్టంగా మారుతుంది.
– డా. కావలి సత్యనారాయణ, రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రి


