హైదరాబాద్: చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత (52) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ సాయి బృందావన్ కాలనీలో ఏసీపీ చంద్రశేఖర్, హేమలత దంపతులు నివాసముంటున్నారు.
వీరికి కుమారుడు చంద్రహాస్, కుమార్తె గీతాంజలి ఉన్నారు. హేమలత ఇంటి వద్ద జ్యువెలరీ షాపు నిర్వహిస్తున్నారు. సోమవారం నూతనంగా ప్రారంభించే ఆఫీస్కు అవసరమయ్యే ఎలక్ట్రికల్ సామాను కొనుగోలు కోసం కుమారుడు అల్వాల్లోని ఎలక్ట్రికల్ దుకాణానికి వెళ్లారు. ఈ సమయంలో చంద్రశేఖర్ కుమారుడికి ఫోన్ చేసి త్వరగా ఇంటికి వెళ్లాలని చెప్పారు. దీంతో చంద్రహాస్ ఇంటికి వెళ్లగా పడక గదిలో తల్లి లోపలి నుంచి గడియ వేసుకుని తలుపులు తీయలేదు.
అపార్ట్మెంట్ వాచ్మన్ సహాయంతో తలుపులు తెరిచి చూడగా సీలింగ్ ఫ్యాన్కు హేమలత ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను కొంపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన తల్లి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఆదివారం మసాజ్ థెరపిస్ట్ ఇంటికి వచ్చి వైద్యం చేసి వెళ్లినట్లు కుమారుడు తెలిపారు. అనారోగ్య సమస్యలతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.


