ఏపీ రాజధాని అమరావతిలో దోమలు ఉండవట.. ఇదినిజంగా మంత్రి నారాయణ చెప్పిన మాట. తెలుగుదేశం పత్రిక ఈనాడులో రాసిన వార్తే. అందువల్ల ఇక్కడ భవనాల నిర్మాణానికి అయ్యే వ్యయంతో ఇతర చోట్ల నిర్మాణాలతో పోల్చరాదట. వినేవ్యక్తి వెర్రివాడు అయితే చెప్పేవ్యక్తి ఏపీ మంత్రి నారాయణ అనుకోవాలి. విద్యా సంస్థలను పెద్ద ఎత్తున నిర్వహించే నారాయణ ఇలాంటి మాటలు చెబుతుంటే కనీసం ఆయన విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్ధులైనా నమ్ముతారా? ఇంతకీ విషయం ఏమిటి?
ఇంతకాలం అమరావతిలో జరిగే నిర్మాణాల వ్యయంపై తీవ్ర విమర్శలు వస్తున్నా, వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు సాగింది. కాని కేంద్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో నిర్మించదలచిన భవనాల సముదాయం నిమిత్తం చదరపు అడుగుకు సుమారు ఐదువేల రూపాయల నుంచి ఆరువేల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అంచనా వేసింది. ఇదే చంద్రబాబు సర్కార్ గొంతులో వెలక్కాయిపడినట్లు చేసింది. కేంద్రంతో పోల్చితే నాలుగురెట్లు అధికంగా వ్యయం చేస్తుండడంపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చెలరేగాయి. చదరపు అడుగుకు రాష్ట్రం సుమారు చదరపు అడుగుకు 17వేల రూపాయల నుంచి 20వేల రూపాయల వరకు వెచ్చిస్తుండడంలో అవినీతి భారీగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి ప్రభుత్వం బదులు ఇవ్వలేకపోయింది.
ఈ నేపథ్యంలో ఎలాగోలా తాము చేస్తున్న అధిక వ్యయాన్ని సమర్థించుకోవడానికి నారాయణ గత కొన్నాళ్లుగా రకరకాలుగా తంటాలు పడుతున్నారు. అమరావతిలో ఇలా వేల కోట్ల వ్యయం చేయడంపై ప్రజలలో కూడా అసహనం పెరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా జగన్ మావిగన్ అనే ప్రతిపాదనను తీసుకురావడం మరింత సమస్య అయింది. దాంతో జగన్ పైన, వైఎస్సార్సీపీపైన ఏవేవో ఆరోపణలు చేయడం, అమరావతి ఖర్చును సమర్ధించుకోవడానికి నానా పాట్లు పడడం టీడీపీ వంతు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మావిగన్ అన్న పదంతో తొట్రుపాటుకు గురవుతున్నట్లు కనిపిస్తుంది.
అమరావతిని ఎవరూ ఆపలేరని, మావిగన్ అని, విజయవాడ అని ఇలా రోజుకొకటి మాట్లాడుతున్నారని, మావిగన్ అంటే వాటికన్ కావాలంటారని అంటూ దీనిని ఒక మతపరమైన వివాదంగా మార్చడానికి చంద్రబాబు యత్నించిన తీరే ఇందుకు ఉదాహరణ అవుతుంది. ఎక్కడైనా రాజధానిలో ప్రజలు ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం దేవతల రాజధాని సెంటిమెంట్ డైలాగు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంటారు. అమరావతి దేవతల రాజధాని అయితే మిగిలిన రాష్ట్రం అంతా ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు ఏకంగా వాటికన్ ప్రస్తావన తెచ్చి తన అసహనాన్ని బయటపెట్టుకున్నారు.
చంద్రబాబుకు నిజంగానే మావిగన్ అంటే భయం ఏర్పడకపోతే, జగన్ చేసిన ట్వీట్ను సోషల్ మీడియా ప్లాట్ ఫారంలపై లేకుండా పోలీసుల ద్వారా ఎందుకు చేశారో చెప్పాలి. వచ్చే ఎన్నికలలో మావిగన్ VS అమరావతి ఒక అంశం అవుతుందని, మావిగన్ కావాలి అనేవారు వైఎస్సార్సీపీకి, అమరావతి కావాలనేవారు టీడీపీకి ఓటేస్తారు అన్న జగన్ చాలెంజ్ను స్వీకరిస్తున్నామని చంద్రబాబు లేదా టీడీపీ నేతలు ఎందుకు అనలేకపోతున్నారు? మావిగన్ అంటూ ఏదో ఎద్దేవ చేసేలా మాట్లాడుతున్న కూటమి నేతలు అమరావతిలో అయ్యే వ్యయంపై, వేల కోట్ల అప్పులపై మాత్రం నోరు మెదపలేకపోతున్నారు.
ఒకప్పుడు ప్రభుత్వ ధనం రూపాయి అవసరం లేదని అదే సొంతంగా సంపాదించుకుని నిర్మాణాలు చేసుకుంటుందని చంద్రబాబు చెప్పేవారు కదా! మరి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వ బడ్జెట్ నుంచి వేల కోట్ల నిధులే కాకుండా నలభైఏడువేల కోట్లను ఎందుకు అప్పు చేశారంటే జవాబు ఇవ్వలేకపోతున్నారు. ప్రజలలో కూడా రాజధాని పేరుతో లక్షల కోట్ల వ్యయం ఏమిటన్న చర్చ జరుగుతోంది. పైగా నిర్మాణ వ్యయంపై కేంద్ర ప్రకటన ద్వారా ఏపీలో కూటమి ప్రభుత్వం బాగా ఎక్స్ పోజ్ అయిపోయింది. రాష్ట్రం నాలుగు భవనాల అద్దాలకు చేసే ఖర్చు 2500 కోట్లుగా ఉంది. అంతే మొత్తంతో కేంద్రం తన భవనాలన్నిటిని నిర్మించుకుంటోంది. అది కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో జరుగుతుందని ఎల్లో మీడియానే రాసింది. అలాంటప్పుడు ఇంతకన్నా స్టాండర్డ్ ఏమి ఉంటుందన్న ప్రశ్న వచ్చింది. దీంతో నారాయణ సాధారణ నిర్మాణాలకు ఐకానిక్ భవనాలతో పోలికా అంటూ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చే యత్నం చేశారు. ఈ వ్యాఖ్య అర్ధరహితంగా కనిపిస్తుంది.
డిల్లీలో పార్లమెంటు భవనానికి 16,910 రూపాయలు చదరపు అడుగుకు ఖర్చు అయిందని, తెలంగాణ సచివాలయానికి అడుగుకు 13,762 రూపాయలు అయిందంటూ ఏవో కాకి లెక్కలు చెప్పడం ఆరంభించారు. అది నిజమే అయితే అంతా కలిపి పార్లమెంటు భవనానికి సుమారు 1100 కోట్లు, తెలంగాణ సచివాలయానికి వెయ్యి కోట్ల లోపు మాత్రమే ఎందుకు ఖర్చు అయింది? ఏపీలో మాత్రం సచివాలయ భవనాలకు వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారన్నదానికి సమాధానం దొరకదు. దీనిపై ఎందుకు శ్వేతపత్రం ఇవ్వలేకపోతున్నారు.
ఇక రాజధాని రహదారుల నిర్మాణం అంటే కేవలం రోడ్లు వేయడం కాదట. తాగునీరు, మురుగునీరు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, విద్యుత్, గ్యాస్, టెలికమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాలను రోడ్ల వెంటే ఏర్పాటు చేయాల్సి ఉంటుందట. అంటే ఇవేవి తెలంగాణలో, ఢిల్లీలో ఏర్పాటు చేయకుండానే నిర్మాణాలు చేశారా? ఎన్ని చెప్పినా జాతీయ రహదారులకు కిలోమీటర్కు 23 కోట్లు ఎందుకు అవుతుంది? ఏపీలో రాజధాని రహదారికి సుమారు ఏభై కోట్లు ఎందుకు అవుతోందో అర్ధం కాదు.
అంతేకాక అమరావతి రాజధానిని దోమల్లేని నగరంగా చేస్తున్నారట. దీనిని ఎవరైనా నమ్ముతారా? ఇప్పటికే అమరావతికి సంబంధించి చంద్రబాబు చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేశారు. ఉదాహరణకు అమరావతిలో పది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అదికారులను చంద్రబాబు కిందటి టరమ్లోనే ఆదేశించారు. గతంలో నవ నగరాలు, అంతర్జాతీయ నగరం అన్నారు. ఏ దేశం వెళితే ఆ దేశ రాజధాని మాదిరి అమరావతి అవుతుందంటూ కథలు చెబుతూ వచ్చారు. సింగపూర్ కబుర్లు సరేసరి.
మొదట సేకరించిన ఏభైవేల ఎకరాలు ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ నగరం ఎలా అయింది? రెండేళ్ల నుంచి అదే ప్రాంతం మున్సిపాల్టీగా ఎలా మారిపోయింది? అందుకే మళ్లీ లక్షన్నర ఎకరాలను సేకరిస్తాం అంటూ ఎందుకు బయల్దేరారు? కొండవీటి వాగు, పాలవాగులపై 69 వంతెనలు నిర్మాణం చేస్తామని నారాయణ ఎందుకు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఏ దేశంలో అయినా ఉంటుందా?పైగా ఎప్పటికప్పుడు వర్షం నీరు ఎత్తిపోసుకునే నగరం ఇంకేదైనా ఉందా? ఇలా పర్యావరణానికి విరుద్దంగా నగర నిర్మాణం చేయడం సరైనదేనా? దోమల సంగతి దేవుడెరుగు. రక్తాన్ని పీల్చే దోమల మాదిరి, అమరావతి అప్పుల పేరుతో ప్రజలపై భారం వేయకుండా ఉంటే అదే పదివేలు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


