శ్రీకాకుళం క్రైమ్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాకేంద్రంలోని ఆదివారంపేటలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్మేన్గా పనిచేస్తున్న కోనాడ నాగరాజు పొందూరు మండలం బొడ్డేపల్లికి చెందినషర్మిల(26)ను ఏడాది కిందట వివాహం చేసుకున్నాడు. నాగరాజు తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆదివారంపేటలో ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు.
ఆమ్లెట్ వేయనందుకు..!
నాగరాజు కాస్త అమాయకుడు కావడంతో అత్త దమయంతితో షర్మిలకు తరచూ తగాదాలొచ్చేవి. ఈ క్రమంలో ఈ నెల 8న షాపులో విధులు ముగించుకుని వచ్చిన భర్తకు భోజనంతో పాటు ఆమ్లెట్ పెట్టింది. పక్కనే తింటున్న చిన్న కుమారుడికి ఆమ్లెట్ పెట్టలేదని అత్త దమయంతి ప్లేట్ విసిరికొట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో భర్త నాగరాజు స్పందించకపోవడంతో శనివారం మరోసారి గొడవపడింది. దీంతో షర్మిల మనస్థాపానికి గురై అందరూ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


