సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న వేళ.. మరోసారి వివాదాలు తెరపైకి వచ్చాయి. మంగళవారంతో ఈ ప్రక్రియ ముగియనున్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదని తెలుస్తోంది.
ఒకవైపు సాంకేతిక సమస్యలు, మరోవైపు రాజకీయ జోక్యం కారణంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు కావడం, తప్పులను సరిదిద్దడం ఆలస్యమవుతోందని తెలుస్తోంది. చివరి దశకు వచ్చినా ప్రక్రియ పూర్తిగా కొలిక్కి రాకపోవడం ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
అంతేకాదు.. బూత్ లెవల్ అధికారులు (BLOలు) రాజకీయ ఒత్తిళ్ల మధ్య పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార టీడీపీ నేతలు బీఎల్వోలపై ఒత్తిడి తెస్తూ.. తమకు అనుకూలంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీకి మద్దతుగా భావిస్తున్న ఓటర్ల పేర్లు తొలగించాలని బెదిరిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇటు ఎన్నికల సంఘం విధుల్లో అధికార పార్టీ జోక్యం పెరిగిందని కూడా వైఎస్సార్సీపీ అంటోంది. ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రియను అధికార పార్టీ ప్రభావితం చేస్తోందని, దీంతో రాజ్యాంగబద్ధ సంస్థ స్వతంత్రత దెబ్బతింటోందని పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో పూర్తిస్థాయి తటస్థత కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు 'మై టీడీపీ' యాప్లో ఓటర్ల వివరాలు అందుబాటులో ఉండటంపై కూడా వైఎస్సార్సీపీ ప్రశ్నలు లేవనెత్తింది. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన సమాచారం అధికార పార్టీ యాప్లోకి ఎలా వెళ్లిందని నిలదీసింది. దీనిపై పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపిస్తోంది.
రేపటితో SIR ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం, ఓటర్ల జాబితా ఖచ్చితత్వం, రాజకీయ జోక్యంపై వచ్చిన ఆరోపణలకు ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వివాదాల మధ్య తుది ఓటర్ల జాబితా ఎంత పారదర్శకంగా సిద్ధమవుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.


