సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి (బుధవారం) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు.
రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ భీమవరం పర్యటన చేపడుతున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా ఆక్వా రైతులను పరామర్శించి, వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వివరాలు తెలుసుకుంటారు. రైతుల ఆవేదనను విని వారికి ధైర్యం చెప్పడంతో పాటు, వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్, ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరఫున పోరాటాన్ని మరింత బలోపేతం చేయనున్నారు.


