చైనాలోని ఓ మారుమూల రాష్ట్రంలో ఇవాళ (మంగళవారం) 18 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. క్వింగ్హై ప్రావిన్స్లో ఉదయం 11.16, 11.34 గంటలకు భూ ప్రకంపనలు కలకలం రేపాయి. 10 కిలోమీటర్ల లోతులో వరుసగా 5.7, 5.8గా తీవ్రత నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. అయితే.. ఆస్తి, ప్రాణ నష్టంపై సమాచారం ఇంకా అందలేదు.
చైనా వాయువ్య ప్రాంతంలోని క్వింగ్హై రాష్ట్రం జనాభా చాలా తక్కువగా ఉండే ప్రాంతం. ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. భూమి కంపించిన సమయంలో కొండచర్యల నుంచి ధూళి మేఘాలు ఎగసిపడుతున్న దృశ్యాలను ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఈ భూకంపాల ప్రభావం పొరుగున ఉన్న గాన్సు (Gansu) రాష్ట్రంలోని లాంఝౌ (Lanzhou) పై కూడా పడింది. ఇది ఆ ప్రాంతంలోని అతిపెద్ద నగరాలలో ఒకటి. నగరంలోని నివాస గృహాల్లో దీపాలు ఊగుతున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి.


