భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యోగ వలసల ధోరణిలో ఒక ఊహికందని, సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంటోంది. నిన్నటివరకు మెట్రో నగరాల్లోని భారీ ప్యాకేజీలు, ఆకాశాన్ని తాకే జీతాల కోసం పరుగులు తీసిన యువ ఐటీ, కార్పొరేట్ నిపుణులు.. ఇప్పుడు రూట్ మార్చుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యం, అధిక జీవన వ్యయంతో విసిగిపోయిన యువత.. భారీ జీతాల కంటే ప్రశాంతమైన జీవితానికే (క్వాలిటీ ఆఫ్ లైఫ్) ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘అడెక్కో ఇండియా’ నిర్వహించిన ‘ఎక్స్టర్నల్ డిస్రప్షన్స్ అండ్ వర్క్ఫోర్స్ ప్రొడక్టివిటీ రిపోర్ట్ 2026’ నివేదికలో వెల్లడైన ఈ నిజాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
జీతాల కంటే ప్రశాంతతకే ఓటు
భారతదేశంలో ప్రతిష్టాత్మక కంపెనీలకు, మెరుగైన కెరీర్ ఎదుగుదలకు బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తూ వచ్చాయి. అయితే ‘అడెక్కో ఇండియా 2026’ నివేదిక ప్రకారం, 35 ఏళ్లలోపు వయసున్న యువ నిపుణులలో దాదాపు 50 నుంచి 55 శాతం మంది మెట్రో నగరాల్లోని భారీ జీతాల కంటే సొంత ఊర్లకు దగ్గరగా ఉండటం, ప్రశాంతమైన జీవన ప్రమాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా, భారతదేశ ప్రతిభావంతులైన శ్రామిక శక్తి (టాప్ టాలెంట్) ఇప్పుడు మెట్రోల సరిహద్దులు దాటి చిన్న నగరాల వైపు వేగంగా విస్తరిస్తోంది.
చిన్న నగరాల్లో భారీగా పెరుగుతున్న ఉద్యోగాలు
ఈ మార్పు తాత్కాలికమైనది కాదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని మొత్తం ఫార్మల్ హైరింగ్ (ఉద్యోగ నియామకాల) వృద్ధిలో ఏకంగా 70 శాతం చిన్న నగరాల (నాన్-మెట్రోస్) నుంచే వస్తుండగా, మెట్రో నగరాల వాటా కేవలం 30 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం భారతదేశంలోని రిమోట్ ఉద్యోగులలో 30-35 శాతం మంది టైర్-2, టైర్-3 నగరాల నుంచే పని చేస్తున్నారు. ముఖ్యంగా కోయంబత్తూర్, ఇండోర్, సూరత్, వడోదర, లక్నో వంటి నగరాలు నైపుణ్యం కలిగిన నిపుణులను, సరికొత్త ఉద్యోగ అవకాశాలను భారీగా ఆకర్షిస్తూ కొత్త హబ్లుగా అవతరిస్తున్నాయి.
రంగాలవారీగా రిమోట్ ఉద్యోగాల జోరు
యువత మానసిక స్థితిని అర్థం చేసుకున్న కార్పొరేట్ కంపెనీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. దాదాపు 40 శాతం సంస్థలు ఇప్పటికే ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్ను అమలు చేస్తూ, ప్రధాన నగరాల్లో పెద్ద ఆఫీసులతో పాటు చిన్న పట్టణాలలో శాటిలైట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. రంగాలవారీగా చూస్తే, టెక్నాలజీ (ఐటీ) రంగంలో రిమోట్, హైబ్రిడ్ నియామకాలు ఏడాది ప్రాతిపదికన 30 శాతం పెరిగాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో 20-25 శాతం, హెల్త్కేర్ రంగంలో 15-20శాతం, అలాగే ఈ-కామర్స్ అండ్ రిటైల్ రంగంలో 15-18 శాతం మేర హైబ్రిడ్ ఉద్యోగాలు వృద్ధి చెందాయి.
వివిధ ప్రాంతాలకు శ్రామికశక్తి విస్తరణ
నగరాల్లో నిరంతరం తలెత్తుతున్న మౌలిక వసతుల లోపాలు, ప్రకృతి విపత్తులు ఈ వలసలను మరింత వేగవంతం చేస్తున్నాయి. దేశంలోని 97 శాతం మంది యజమానులు వాతావరణ మార్పులు, మౌలిక సదుపాయాల ఒత్తిడి, ప్రజారోగ్య సమస్యల వంటి బాహ్య అడ్డంకులను నిరంతరం ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది. కేవలం ఒకే నగరంలో కేంద్రీకృతమవ్వడం వల్ల వరదలు, రవాణా వ్యవస్థల స్తంభన వంటి సమయాల్లో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అందుకే సుమారు 95 శాతం కంపెనీలు తమ వ్యాపార కొనసాగింపు కోసం శ్రామిక శక్తిని వివిధ ప్రాంతాలకు విస్తరించడాన్ని (డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ఫోర్స్) ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయి.
హైదరాబాద్, బెంగళూరులో..
నగరాల్లో పెరుగుతున్న తీవ్ర ఒత్తిడి కారణంగా ఉద్యోగుల మానసిక స్థితి, ఉత్సాహం, ఉత్పాదకత దారుణంగా దెబ్బతింటున్నాయి. ఈ నివేదిక ప్రకారం, 42శాతం కంపెనీలు తమ ఉద్యోగులలో ఉత్సాహం తగ్గిందని, 40శాతం కంపెనీలు అబ్సెంటీయిజం (ఆఫీసులకు రాకపోవడం) పెరిగిందని తెలిపాయి. ఐటీ హబ్ బెంగళూరులో అత్యధికంగా 48శాతం మంది యజమానులు తమ ఉద్యోగుల మోరల్ పడిపోయినట్లు పేర్కొనగా, హైదరాబాద్ 44 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే, కాలుష్యం, వాతావరణ విపత్తుల కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో అత్యధికంగా 44 శాతం కంపెనీలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది.
భవిష్యత్ వ్యూహాలు, సవాళ్లు
ఈ సరికొత్త పరిణామాలపై అడెక్కో ఇండియా కంట్రీ మేనేజర్ సునీల్ చేమంకోటిల్ స్పందిస్తూ, ‘భారతదేశంలోని యజమానులు కేవలం విపత్తులను నిర్వహించడం లేదు, ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన వర్క్ఫోర్స్ మార్కెట్లో రీసైలెన్స్ (స్థిరత్వం) ను తిరిగి నిర్వచిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత విపత్తు నివారణ చర్యలలో కంపెనీలు తమ సామర్థ్యానికి 10 పాయింట్లకు గానూ కేవలం 5 పాయింట్లు మాత్రమే ఇచ్చుకోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో మెట్రో నగరాల ఆర్థిక ప్రాముఖ్యత తగ్గకపోయినప్పటికీ, భారతదేశ ప్రతిభావంతుల భవిష్యత్తు మాత్రం చిన్న నగరాల వైపే నడవబోతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదీలపై కుక్కలను ఉసిగొల్పి..


