యంగ్ టాలెంట్..
బహుశా పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో... నువ్వు 14 ఏళ్ల వయసులో ఏం చేసేవాడివి? అని మీ ఫ్రెండ్స్లో ఎవరినైనా అడిగి చూడండి... మహా అయితే ఎనిమిదో తరగతి చదువుతూ హోంవర్క్ చేస్తూ ఉండేవాడినని చెబుతారు కాని అదే వయసులో ఉన్న ఓ కుర్రోడు ఓ ఏఐ కంపెనీ స్థాపించాడు.
అంతేకాదు ప్రపంచంలోనే అతి ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో ఏకంగా ఆఫీస్ పెట్టేశాడు. పుణేకు చెందిన జైనమ్ జైన్ ఐదేళ్ల వయసున్నప్పుడే అతని తల్లిదండ్రులు దుబాయ్కి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి మంచి తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరిచే జైన్ కేంబ్రిడ్జ్ కరికులమ్ ద్వారా 13 ఏళ్ల వయసులోనే పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత బిజినెస్ చేయాలన్న ఆలోచనతో ఏఐ సాంకేతికతపై దృష్టి పెట్టాడు.
సరిగ్గా ఏడాది గడిచాక ‘మెంగో ఇంజిన్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ను స్థాపించాడు. కంపెనీల కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్, కస్టమర్ కమ్యూనికేషన్ వంటి పనులు ఆటోమేట్ చేయడానికి ఈ ప్లాట్ఫాం సహాయపడుతుంది. విశేషమేమిటంటే జైన్ సొంత ఆసక్తితోనే నేర్చుకుని చిన్న వయసులో కంపెనీని స్థాపించి ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించాడు.


