ఎకో–ప్రెండ్లీ
ఆమె చదివింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్. ఆ తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం శాటిలైట్ పేలోడ్స్ తయారు చేసే ఏరోస్పేస్ సంస్థలో ఉద్యోగం. కెరీర్ పరంగా ఎంతో ఉన్నతమైన స్థానం. కానీ, ఆ ఏసీ ల్యాబ్లు, కంప్యూటర్ స్క్రీన్లు ఆమెకు ఏ మాత్రం తృప్తినివ్వలేదు. తన మూలాల్లోకి తిరిగి వెళ్లాలని అనుకుంది. ఉద్యోగాన్ని వదిలేసి, మట్టితో మమేకమై, పర్యావరణానికి మేలు చేసే ఒక అద్భుతమైన ‘జీరో–వేస్ట్ కేఫ్’ను ప్రారంభించింది 27 ఏళ్ల నిష్ఠా చౌహాన్....
నిష్ఠా చౌహాన్ ఒక సాధారణ గుజరాతీ కుటుంబంలో పెరిగింది. ఆమె తాత చిరుధాన్యాలను పండించేవారు. అలా ఆమె తన చిన్నతనంలోనే రాగులు, జొన్నలు, సజ్జల వంటి సంప్రదాయ ఆహార ప్రాముఖ్యతను తెలుసుకుంది.
అహ్మదాబాద్లోని ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్’ ప్రాంగణంలో నిష్ఠా మొదటి కేఫ్ను ప్రారంభించింది. ఈ కేఫ్లో మిల్లెట్ వంటకాలు మాత్రమే ఉంటాయి. ప్లాస్టిక్, డిస్పోజబుల్ వస్తువులు ఇక్కడ పూర్తిగా నిషేధం. గాజు పాత్రల్లోనే ఆహారాన్ని అందిస్తారు. పార్సిల్స్ కోసం అరెకా లీవ్స్, చెరకు పిప్పితో చేసే పాత్రలను వాడుతున్నారు. ఇక్కడ పర్యావరణానికి హాని చేసే ఎయిర్ కండిషనర్లకు బదులుగా, కేఫ్ను చల్లబరచడానికి వాటర్–కూలింగ్ సిస్టమ్స్, మిస్టింగ్ ఫ్యాన్లను ఉపయోగిస్తున్నారు.
పిల్లలకు ఎకో వర్క్షాప్స్!
నిష్ఠా చౌహాన్ పలు ఇంటర్నేషనల్ స్కూల్స్తో కలిసి 5 నుంచి 11 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేకంగా ఎకో–వర్క్షాప్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లలు నేరుగా తోటలోకి వెళ్లి మట్టిని తాకడం, మొక్కలను గుర్తించడం, కూరగాయలను స్వయంగా కోయడం నేర్చుకుంటారు. ఆపై వంటింట్లోకి వెళ్లి సొంతంగా మిల్లెట్ సలాడ్లు, జ్యూస్లు తయారు చేస్తారు. సంప్రదాయక ఆహారానికి, జంక్ ఫుడ్కి గల తేడాని గమనిస్తారు.


