సాగుబడి
ఇంటి పంట 11
మిద్దె తోటలు, ఇంటి పంటలు, పెరటి తోటల్లో మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా కుండీల్లో పెంచే మొక్కలకు నీటిని అందించేటప్పుడు అదనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుండీల్లో మొక్కలకు నీరిచ్చే ఉత్తమ పద్ధతేమిటో తెలుసుకుందాం.
మొక్కలకు నీటిని ఎప్పుడూ ఉదయం ఎండ రాకముందే లేదా సాయంత్రం వేళల్లో అందించాలి. దీనివల్ల నీరు ఆవిరి కాకుండా వేర్లకు చేరుతుంది.
మొక్కలకు అవసరానికి మించి నీరు పెడితే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది, దీనివల్ల వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.
వేసవిలో కుండీల్లో లేదా నేల పైభాగంలో ఎండుటాకులు, గడ్డి లేదా పాత గోనె సంచులను కప్పటం ద్వారా మట్టిలోని తేమను ఎక్కువ కాలం నిలుపుకోవచ్చు.
కుండీల్లో అడుగున రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. నీరు నిలిచిపోతే మొక్కలు వ్యాధుల బారిన పడతాయి.
ఆకుకూరలు, పూల మొక్కలపై నీటిని తుంపర్లలా చల్లడం వల్ల ఆకులపై ఉన్న దుమ్ము పోవడమే కాకుండా మొక్కలు తాజాగా ఉంటాయి.
మట్టిలో నీరు ఎక్కువగా ఉంటే వేర్లకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది.
ఆకులు రంగు మారి, వాలిపోయినట్లు కనిపిస్తాయి. ఇది మొక్కకు నీరు ఎక్కువైందని చెప్పే ప్రాథమిక సంకేతం.
ఎక్కువ నీరు పోయటం వల్ల మట్టిలోని ముఖ్యమైన పోషకాలు కొట్టుకుపోతాయి, ఫలితంగా మొక్క ఎదుగుదల ఆగిపోతుంది.
తడిగా ఉన్న నేల బ్యాక్టీరియా, ఫంగస్ పెరగటానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల మొక్కల మొదళ్లు, ఆకులపై తెగుళ్లు వస్తాయి.
నిరంతరం నీటితో నిండి ఉండటం వల్ల మట్టిలోని రంధ్రాలు మూసుకుపోయి మట్టి గట్టిగా మారుతుంది, ఇది వేర్ల విస్తరణను అడ్డుకుంటుంది.
కుండీలోని మట్టి నుంచి దుర్వాసన రావటం, మట్టి పైన పాచి పట్టటం, కొత్తగా వచ్చే ఆకులు లేదా చిగుర్లు నల్లగా మారి రాలిపోతుంటే.. ఈ మూడు సమస్యలకు కారణం ఒక్కటే కావచ్చు. అదేమిటంటే.. మొక్కల కుండీల్లో నీరు బయటకు సరిగ్గా వెళ్లటం లేదని. నీరు వెళ్లడానికి తగినంత రంధ్రం ఉందో లేదో ఒకసారి తనిఖీ చేయండి.
మట్టిలో నీరు ఎక్కువగా నిలిచి ఉంటే వేర్లు ఊపిరి తీసుకోలేవు. ఈ ఒత్తిడి వల్ల మొక్క తనపై ఉన్న భారాన్ని తగ్గించుకోవటానికి పువ్వులు, మొగ్గలు, కాయలను రాల్చేస్తుంది.
అధిక నీరు పోయడం వల్ల మట్టిలోని పోషకాలు కొట్టుకుపోతాయి. పూత నిలబడటానికి అవసరమైన కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు అందక పిందెలు రాలిపోతాయి.
మట్టిలో నీరు ఎక్కువ ఉంటే శిలీంధ్రాలు చేరి వేర్లు కుళ్ళిపోతాయి. దీనివల్ల మొక్క బలహీనపడి పిందెలను పోషించలేక వాటిని రాల్చేస్తుంది.
నీరు ఎక్కువవటం వల్ల మొక్కలో ఎథిలిన్ వంటి హార్మోన్లు పెరిగి, పూలు, కాయలు కాండం నుంచి∙విడిపోయేలా చేస్తాయి.
మట్టి పై పొర 1–2 అంగుళాల వరకు ఆరితేనే నీరు పోయాలి, వేలితో తాకి చూస్తే ఇది తెలుస్తుంది.
మొక్క పూత మీద ఉన్నప్పుడు నీటిని తగ్గించి, నేల తేమగా ఉండేలా మాత్రమే చూసుకోవాలి.
మొక్క కాయను పెంచడానికి చాలా శక్తి కావాలి. నీరు ఎక్కువగా ఉండి వేర్లు సరిగ్గా పని చేయకపోతే, మట్టిలోని పోషకాలు కాయలకు చేరవు, ఫలితంగా కాయలు రాలిపోతాయి.
కొన్నిసార్లు మట్టి బాగా ఎండిపోయినప్పుడు ఒక్కసారిగా ఎక్కువ నీరు పోస్తే, ఆ తేమలో వచ్చే మార్పును భరించలేక మొక్క కాయలను రాల్చుతుంది.
కాయలు ఎదుగుతున్న దశలో నీరు సమానంగా అందాలి. ఒకరోజు తక్కువ, ఒకరోజు ఎక్కువ ఇవ్వకూడదు.
మట్టిలో నీరు ఎక్కువగా ఉంటే వేర్లకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. నీరు కుండీలో నిల్వ వుంటే మట్టిలోని పోషకాలు కాయలకు చేరవు, ఫలితంగా కాయలు రాలిపోతాయి.
- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


