వర్షాభావ పరిస్థితుల్లోనూ రైతన్నల విజయపథం.. ముందస్తు ప్రణాళికలు.. సాంకేతికత దన్ను
బిందు, తుంపర సేద్యంతో నీటి సంరక్షణ..
ఏడాది పొడవునా ఆరుతడి పంటల సాగు
తక్కువ నీరు, స్వల్ప పెట్టుబడితో లాభాల ఆర్జన
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కాలం కలిసి రాకపోయినా.. ఆలోచనలు కలిసొచ్చాయి. వర్షాలు ముఖం చాటేస్తేనేం.. సాంకేతికత తోడుగా నిలిచింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపోయినా ఈ రైతులు అధైర్య పడటం లేదు. నీటి ఎద్దడిని చూసి నిరాశ చెందడం లేదు. కరువు పరిస్థితుల్లోనూ తక్కువ నీటితో లాభదాయక వ్యవసాయం కొనసాగించవచ్చని నిరూపిస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో పంటల సాగు, ముందస్తు ప్రణాళికతో కూడిన సమర్థవంతమైన నీటి యాజమాన్యం, సాంకేతిక పరిజ్ఞానంతో సాగుబడిలో విజయం సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరిలోనూ స్ఫూర్తి నింపుతున్న రైతన్నలపై ‘సాక్షి’కథనం..
కుంట తవ్వి.. జలనిధిని ఒడిసిపట్టి..
రైతు పేరు: పార్శి రాములు
స్వగ్రామం: సోమేశ్వరం, కామారెడ్డి
పంటలు: మొక్కజొన్న, వరి
విజయ రహస్యం: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరేలా తన ఐదు ఎకరాల పొలంలో 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఆరు అడుగుల లోతుతో వ్యవసాయ కుంట (ఫాంపాండ్) నిర్మించాడు. దీంతో బోరు బావిలో నీరు సమృద్ధిగా ఉంటుండటంతో ఏటా రెండు పంటలు పండిస్తున్నాడు. నీటి కుంట ఏర్పాటు చేసినప్పటి నుంచి వర్షాల కోసం ఎదురుచూడకుండానే పంటలు పండిస్తున్నానని రాములు చెబుతున్నాడు.
ఆరు తడి అస్త్రం.. సాఫీగా సేద్యం
రైతు పేరు: బోడ మహేష్
స్వస్థలం: శాఖాజిపురం, గుర్రంపోడు, నల్లగొండ
పంటలు: టమాట, గుమ్మడి, దోస, పుచ్చ, వేరుశనగ
విజయ రహస్యం: బోరులో తక్కువ నీరు ఉండటంతో సంప్రదాయ పంటల వైపు వెళ్లకుండా, తనకున్న ఐదు ఎకరాల్లో అర ఎకరం పోనూ మిగిలిన భూమిలో టమాట, గుమ్మడి, దోస, పుచ్చ, వేరుశనగ వంటి ఆరుతడి పంటలు సాగు చేస్తున్నాడు. ఇందుకోసం మల్చింగ్ కవర్ వినియోగిస్తున్నాడు. ఒక్కసారి కవర్ పరిచి దాని ఆధారంగానే ఏడాదిలో 3 సార్లు కూరగాయలు పండిస్తున్నాడు. గత ఏడాది పుచ్చ సాగులో రూ.2 లక్షల లాభం వచ్చిందని.. ఆరు తడి పంటలతో పాడిలాగా నిత్యం ఆదాయం వస్తుందని అంటున్నాడు.
చుక్క చుక్కకూ లెక్క
రైతు పేరు: తిరుపతిరెడ్డి
స్వస్థలం: మాచాపూర్, చిన్న కోడూరు, సిద్దిపేట
పంటలు: బీరకాయ, కాకరకాయ, టమాట, మొక్కజొన్న
విజయ రహస్యం: తనకు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. బావిలో ఉన్న కొద్ది పాటి నీటితో 5 ఎకరాల్లో బీరకాయ, కాకరకాయ, టమాట, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నాడు. బిందు, తుంపర సేద్యంతో నీటిని వృధా చేయకుండా నేరుగా మొక్కలకందిస్తూ కాలంతో సంబంధం లేకుండా దిగుబడులు సాధిస్తున్నాడు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే మరో 3 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తానని వెల్లడించాడు.
కరువులోనూ జలసిరి.. వరిపైనే గురి
రైతు పేరు: పారుపల్లి
వెంకటేశ్వర్లు
స్వస్థలం: ముదిగొండ, ఖమ్మం
పంట: వరి
విజయ రహస్యం: తనకున్న 3 ఎకరాల్లో ఏటా రెండు పర్యాయాలు వరి సాగు చేస్తుంటాడు. ఇతని పొలానికి సమీపంలో సాగర్ కెనాల్ ఉంది. నీటి వసతి ఉన్నా.. కాలం ఎప్పుడెలా ఉంటుందోనన్న ఆలోచనతో బావి తవ్వించాడు. ఇదే ఇప్పుడు బాగా పనికొస్తోంది. ఈ సీజన్లో సరైన వర్షాలు కురవనప్పటికీ ఈ బావిలో మాత్రం జలకళ ఉట్టిపడుతోంది. మండు వేసవిలోనూ నీరు ఇంకిపోదని.. తనతో పాటు చుట్టుపక్కల మరో 8 ఎకరాల్లో సైతం వరి సాగవుతోందని వెంకటేశ్వర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
పంట మార్పిడి.. పెరిగిన రాబడి
రైతు పేరు: జి.దేవేందర్
స్వస్థలం: మద్దెలబీడు, దామరగిద్ద, నారాయణపేట
పంటలు: వరి, కంది, పెసర, వేరుశనగ
విజయ రహస్యం: తనకున్న 10 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలను కౌలుకు తీసుకుని ఆధునిక పద్ధతుల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నాడు. నేల స్వభావానికి తగ్గట్లు భూసారం పెరిగేలా పంట మార్పిడి, యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాడు. నీటి కొరత నేపథ్యంలో ఈసారి ఆరు తడి పంటల వైపు మొగ్గు చూపాడు. ఎప్పుడైనా ఆరు తడి పంటలే బెటర్ అని,. ఒక పంటలో నష్టం వస్తే.. మరో పంట కలిసి వస్తుందని చెబుతున్నాడు.
గేట్ వాల్వ్లతో భగీరథ యత్నం
మహిళా రైతు పేరు: మహేశ్వరం ఉపేంద్ర
స్వస్థలం: వడ్లకొండ, జనగామ
పంటలు: వరి
తన భర్త రాములుతో కలిసి ఇప్పటివరకు 6 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. మరో ఎకరం సిద్ధం చేశారు. గతంలో 3 బోర్లు వేయగా, రెండింటిలోనే నీళ్లు పడ్డాయి. దీంతో ఆలోచనకు పదును పెట్టారు. ప్రస్తుతం ఆ 2 బోర్లను ఒకేచోట అనుసంధానించి పొలానికి నీరు పారిస్తున్నారు. ప్రతి 2 మడులకు ఒక గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి నీరు వృధా కాకుండా చూస్తున్నారు.


