అర్హుల ఓట్లు తొలగిపోకూడదు
బీఆర్ఎస్ ‘సర్’ కమిటీతో సమీక్షలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పార్టీ ఏర్పాటు చేసిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం తన నివాసంలో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్.రమణ నేతృత్వంలోని కమిటీ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వివరించింది. లక్షల మంది ఓటర్ల పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో చాలామందికి నోటీసులు జారీ చేయాల్సిన విభాగంలో చేర్చారని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి వారికి వెంటనే మార్గనిర్దేశం చేసి అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలన్నారు.


