అక్రమాస్తులు రూ.400కోట్లు | ACB files case against Redco DE Mutyam Venkataramana | Sakshi
Sakshi News home page

అక్రమాస్తులు రూ.400కోట్లు

Jul 23 2026 2:43 AM | Updated on Jul 23 2026 2:43 AM

ACB files case against Redco DE Mutyam Venkataramana

ముత్యం వెంకట రమణ

రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణపై ఏసీబీ కేసు 

ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లు సహా 7 ప్రాంతాల్లో దాడులు 

పెద్ద ఎత్తున ఫ్లాట్లు, భవంతులు, రియల్టీలో భారీ పెట్టుబడులు 

బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.52,02,585, 2.09 కేజీల బంగారు ఆభరణాలు  

అధికారిక లెక్కల ప్రకారమే ఆస్తుల విలువ రూ.27.65 కోట్లు 

ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద కేసు 

గతంలోనూ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన వైనం

సాక్షి, హైదరాబాద్‌: అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు కొనసాగిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో బుధవారం తెలంగాణ పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ (రెడ్కో) డివిజినల్‌ ఇంజనీర్‌ (డీఈ) ముత్యం వెంకట రమణ నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లు సహా 7 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. భారీగా నగదు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. మార్కెట్‌లో అక్రమాస్తుల విలువ రూ.400 కోట్లుగా తేలింది. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద కేసుగా ఇది రికార్డు సృష్టించింది. ఏసీబీ లెక్కల ప్రకారం ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఈఎస్‌ఐ మందుల సరఫరా కుంభకోణంలో 2019లో అరెస్టు అయిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) మాజీ డైరెక్టర్‌ దేవికారాణి అక్రమాస్తులే ఇప్పటికీ ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఈమె నుంచి స్వా«దీనం చేసుకున్న వాటి మొత్తం విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.25,70,84,461గా తేల్చారు. దీన్ని తలదన్నుతూ వెంకట రమణ నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను రూ.27,65,02,133గా ఏసీబీ లెక్కకట్టింది. వీటి మార్కెట్‌ విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వెంకట రమణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ సిటీ రేంజ్‌–2 డీఎస్పీ మాజిద్‌ అలీ ఖాన్‌ ప్రాథమిక దర్యాప్తులో కొందరు బినామీలను గుర్తించారు.  

ఫ్లాట్లు, భవనాలు, బంగారు.. 
2019లోనూ వెంకట రమణ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. సాధారణంగా అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపించే రెవెన్యూ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్, పోలీసు విభాగాలను మించి ఐఎంఎస్, విద్యుత్‌ శాఖల అధికారులు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ సోదాల్లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలోని నాలుగు ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు (విలువ రూ.1,23,46,000), కూకట్‌పల్లి అంజనేయ నగర్‌లో 160 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న జీ+3 వాణిజ్య భవనం (విలువ రూ.1,82,00,000), గుట్టల బేగంపేట్‌లో 250 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న జీ+5 వాణిజ్య భవనానికి (విలువ రూ.2,90,03,550) సంబంధించిన పత్రాలు లభించాయి. వీటికి అదనంగా తన భార్య పేరుతో నమోదై ఉన్న నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో తేలింది. అంజనేయ నగర్, మూసాపేట, కూకట్‌పల్లిలో 10 అపార్ట్‌మెంట్లు నిర్మించగా, వాటి నిర్మాణ వ్యయం సుమారు రూ.20 కోట్లుగా ఏసీబీ అధికారులు అంచనా వేశారు. వీటికి తోడు రూ.52,02,585 బ్యాంక్‌ బ్యాలెన్స్, 2.09 కేజీల బంగారు ఆభరణాలు, కియా, మహీంద్రా, బలెనో కార్లు (విలువ రూ.45 లక్షలు), రూ.30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, రూ.2.5 లక్షల విలువైన 20 మద్యం సీసాలు స్వా«దీనం చేసుకున్నారు. మరిన్ని ఆస్తులపై విచారణ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.  

అడ్డదారిలో మళ్లీ పోస్టింగ్‌ 
వెంకట రమణ గతంలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో పని చేశారు. సైబర్‌సిటీ సర్కిల్‌లో డివిజనల్‌ ఇంజినీర్‌గా (టెక్నికల్‌) పనిచేస్తున్న సమయంలో ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు. 2019 డిసెంబర్‌ 12న ఓ కాంట్రాక్టర్‌కు సంబంధించిన ఫైనల్‌ ఎస్టిమేట్‌ ఆమోదం కోసం రూ.25 వేల లంచం స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కారు. ఆ మర్నాడు వెంకట రమణను అరెస్టు చేశారు. ఆయన కొద్దిరోజులు జైల్లో గడిపాడు. అప్పట్లో చేసిన సోదాల్లో ఏసీబీ అధికారులు రూ.26.52 లక్షల నగదు, రూ.22,60,565 విలువైన బంగారు ఆభరణాలు స్వా«దీనం చేసుకున్నారు. వాటితో కలిపి వెంకట రమణ మొత్తం ఆస్తుల విలువను రూ.28,14,14,700గా ఏసీబీ తేల్చింది. రమణ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత డిప్యూటేషన్‌పై రెడ్కోలో పోస్టింగ్‌ పొందారు. అక్కడ కూడా ఆయన తన బుద్ధిని మార్చుకోలేదు. ఇప్పుడు వెంకట రమణను అరెస్టు చేసిన అధికారులు గురువారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement