breaking news
pantangi RamBabu
-
సాగుబడి: వానను బట్టి పంట విస్తీర్ణం..
వాతావరణ మార్పుల నేపథ్యంలో వర్షాధార భూముల్లో పెట్టుబడి నష్టపోకుండా పంటలు పండించే వినూత్న మెళకువలను అంతర్జాతీయ మెట్ట ప్రాంత వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్డీఏ) ఐక్యరాజ్యసమితితో కలిసి ప్రచారం చేస్తోంది. పంటకు పూర్తిగా సరిపడా వర్షపాతం కురిసే పరిస్థితి లేనప్పుడు, రైతు తనకున్న వర్షాధార భూమి మొత్తంలో పంటలు వేసుకుంటే తేమ చాలక పంట అసలేమీ చేతికి రాదు. దీనివల్ల రైతుకు పూర్తి నష్టం వాటిల్లుతుంది.దీనికి ప్రత్యామ్నాయంగా, వాన నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా పొలంలో కురిసే వర్షాన్ని వీలైన పద్ధతిలో ఒడిసిపట్టుకోవాలని సంస్థ సూచిస్తోంది. పొలంలో కొంత భాగాన్ని ఖాళీగా ఉంచి, మిగతా భాగంలో పంట వేసుకుంటే ఆ కాస్త పంటయినా దక్కుతుంది. పొలంలో ఎత్తయిన ప్రాంతంలో కురిసి, లోతట్టు భాగంలోకి ప్రవహించే నీటిని మాత్రమే మనం సంరక్షించుకోగలమని, దీనివల్ల కరువును కొంతవరకు అధిగమించవచ్చని ఐసీఏఆర్డీఏ పేర్కొంది.ఉదాహరణకు.. ఒక రైతుకు 4 హెక్టార్ల భూమి ఉంది. ఏడాదికి 150 మి.మీ. వర్షపాతం కురిస్తే అక్కడ సాధారణంగా ఏ పంటా పండదు. కానీ వాన నీటిని బయటకు పోనివ్వకుండా సంరక్షించుకుంటూ.. సగం పొలాన్ని ఖాళీగా ఉంచి, రెండో సగంలో పంటలు వేస్తే ఆ భాగానికి 300 మి.మీ. నీరు లభిస్తుంది. ఆ నీటితో కరువును తట్టుకునే పంటలు చేతికొస్తాయి. అదేవిధంగా, ము΄్పావు వంతు (3 హెక్టార్లు) భూమిలో వాన నీటిని సంరక్షించుకొని, మిగిలిన పావు వంతు (1 హెక్టారు) భూమికి మళ్లిస్తే, అక్కడ ఏకంగా 600 మి.మీ. నీరు అందుబాటులోకి వచ్చి పంటలు సమృద్ధిగా పెరుగుతాయి. వర్షపు నీటి సేకరణ ద్వారా తక్కువ వర్షపాతంలోనూ లాభదాయక వ్యవసాయం చేయవచ్చన్నది ఐసీఏఆర్డీఏ భావన. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సాగుబడి: బత్తాయితో 'టీ' కూడా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో బత్తాయి తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురం, కడప, నల్గొండ, మహబూబ్నగర్ వంటి పూర్వపు జిల్లాల్లో ఎక్కువగా ఈ తోటలు విస్తరించాయి. గిట్టుబాటు కాకపోవటం, క్లైమేట్ ఛేంజ్, చీడపీడల దాడి తదితర సమస్యలతో కొన్ని జిల్లాల్లో బత్తాయి సాగు విస్తీర్ణం తగ్గుతున్న పరిస్థితి.మార్కెట్లో ధర బాగా తగ్గినప్పుడు బత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోతుండటాన్ని శివరామ్ దగ్గరగా గమనించారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి రైతులకు విముక్తి కల్పించి, వారి ఆదాయ వనరులను పెంచాలనే ఆశయంతో శివరామ్ ‘సహస్తి సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట వినూత్న స్టార్టప్ను ప్రాంభించారు. బత్తాయి పంట ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.శాస్త్ర, సాంకేతిక తోడ్పాటుఅనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ‘అటల్ ఇంక్యుబేషన్ సెంటర్’, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐఆర్– సీఎఫ్టీఆర్ఐ), బయో–నెస్ట్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ పరిశోధనా సంస్థల సాంకేతిక సహాయం, శాస్త్రీయ మార్గదర్శనంతో వినూత్న పరిష్కారాలను అన్వేషించారు. బాలారిష్టాలను అధిగమించి తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటంలో విజయం సాధించారు.పండులో ప్రతిదీ పనికొచ్చేదే..బత్తాయి తోటల ఆధారంగా సరికొత్త ‘వాల్యూ యాడెడ్’ (విలువ ఆధారిత) వెల్నెస్ ఉత్పత్తులను తయారు చేసిన శివరామ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. సాధారణంగా బత్తాయి పండును కేవలం జ్యూస్ తీసుకోవడానికే ఉపయోగిస్తారు, ఆ తర్వాత మిగిలిన తొక్కలను పారేస్తుంటారు. కానీ పండులోని ప్రతి భాగాన్నీ.. అంటే రసం, గుజ్జు, తొక్క, చివరికి విత్తనాలను కూడా వంద శాతం సద్వినియోగం చేసుకుంటూ అనేక ఉత్పత్తులను తయారు చేశారు. ‘జీరో–వేస్ట్ సర్క్యులర్ ఎకానమీ’ వినూత్న మోడల్ను విజయవంతంగా ఆవిష్కరించారు.ఈ సరికొత్త ప్రయోగాలలో అత్యంత ప్రజాదరణ ΄÷ందుతున్న ఆవిష్కరణలు ‘బత్తాయి ఇ¯Œ ఫ్యూజ్డ్ టీ క్యూబికల్స్’, బత్తాయి టీ బ్యాగులు, ప్రత్యేక హెర్బల్ టీ ΄ûడర్. బత్తాయి తొక్కలను సౌర శక్తితో ఎండబెట్టి, బయోటెక్నాలజీ సాంకేతికత ద్వారా శుద్ధి చేస్తు్తన్నారు. దీనివల్ల సహజసిద్ధమైన సిట్రస్ ఫ్లేవర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్–సి, ముఖ్యమైన పోషకాలు నశించిపోకుండా 95% పైగా సురక్షితంగా ఉంటాయి. వీటితో పాటు బత్తాయి స్క్వాష్, అత్యవసర సుగంధ తైలాలు, ఫేస్ ΄ûడర్లు, న్యూట్రాస్యూటికల్ బయో–్ర΄÷డక్ట్స్ను కూడా శివరామ్ తయారు చేస్తున్నారు. రైతులకు అదనపు ఆదాయంమార్కెట్లో బత్తాయి ధర కిలో ఆరు రూపాయలకు పడిపోయిన తరుణంలో సైతం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓల) ద్వారా బత్తాయి తొక్కలను సేకరించి, వాటికి మంచి ధర చెల్లించటం ఈ ఆధునిక సాంకేతికత వల్ల సాధ్యమవుతోంది. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. నల్గొండ, అనంతపురం జిల్లాల పరిధిలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ డీహైడ్రేషన్ ప్రక్రియలపై శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ఈ ఉత్పత్తులను పాక్షికంగా ప్రాసెస్ చేయిస్తున్నారు. తద్వారా గ్రామీణ మహిళలకు పనుల్లేని కాలంలోనూ స్థిరమైన ఉపాధి లభిస్తోంది.పర్యావరణ పరంగా కూడా ఈ ఆవిష్కరణ ఎంతో మేలు చేస్తోంది. సాధారణంగా కుళ్ళిపోయే బత్తాయి వ్యర్థాలను చెత్తకుప్పల్లో వేయటం వల్ల ప్రమాదకరమైన మీథేన్ వాయువు విడుదలవుతుంది. ఈ వ్యర్థాలను సేకరించి వివిధ ఉత్పత్తులను తయారు చేయటం ద్వారా వాయు కాలుష్యాన్ని అరికడుతున్నారు. సాంప్రదాయ వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మారుస్తూ, అటు రైతులకు, ఇటు పర్యావరణానికి మేలు చేస్తున్న ఈ ఆవిష్కరణ జాతీయ పురస్కారానికి ఎంపిక కావటం ప్రశంసనీయం.బత్తాయి (చీనీ) తోటలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నప్పటికీ గిట్టుబాటు ధర రాక రైతులు తరచూ ఇక్కట్ల పాలవుతున్నారు. బత్తాయి రైతుల కష్టాలకు ముఖ్య కారణం విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చెయ్యకపోవటమే. ఈ దిశగా క్రియాశీలకంగా కృషి చేసిన ఒక స్వతంత్ర వ్యవసాయ శాస్త్రవేత్త సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో రైతుల ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఆయనే తెలంగాణకు చెందిన బండారు ఉషన్న శివరామ్.అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన శివరామ్ అనేక సంవత్సరాలు కృషి చేసి బత్తాయి ఆధారిత వెల్నెస్ ఉత్పత్తుల సాంకేతకతలను ఆవిష్కరించి గ్రామీణ పారిశ్రామికవేత్తగా మారారు. ఆయన కృషికి జాతీయ స్థాయిలో సముచిత గుర్తింపు లభించింది. నీతి ఆయోగ్కు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)’ ద్వారా ఈ ఏడాది ఎంపికైన ‘గ్రామీణ ఆవిష్కర్త’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 31న న్యూఢిల్లీలో పురస్కారాన్ని అందుకోబోతున్నారు బలరామ్.రైతులకు ఆదాయం... మహిళలకు ఉపాధిబత్తా కాయలతో రసం ఒక్కటే పనికొచ్చేది అనుకోవటం వల్ల రైతులకు పెద్దగా ఆదాయం రావటం లేదని గుర్తించి.. వాల్యూ ఎడిషన్పై పరిశోధనలు చేపట్టాను. ప్రతిష్టాత్మక సంస్థల శాస్త్ర,సాంకేతికతల తోడ్పాటుతో బత్తాయితో ఆరోగ్యదాయకమైన టీ క్యూబికల్స్, టీ బ్యాగులు, ప్రత్యేక హెర్బల్ టీ ΄÷డి, స్క్వాష్, సుగంధ తైలాలు, ఫేస్ ΄ûడర్లు, పోషకాలతో కూడిన బయో ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతలను ఆవిష్కరించాం. పైలట్ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే బత్తాయి రైతుల ఆదాయం సుమారు 20–35 శాతం వరకు పెంచాం.గ్రామీణ మహిళల ద్వారా ఈ ఉత్పత్తులను తయారు చేయిస్తూ ఉపాధి కల్పిస్తున్నాం. నీతి ఆయోగ్కు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)’ ద్వారా గ్రామీణ ఆవిష్కర్త జాతీయ పురస్కారాన్ని ఈ నెల 31న అందుకోనుండటం సంతోషంగా ఉంది. రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో 5 వేల మందికి పైగా బత్తాయి రైతులకు లబ్ధి చేకూర్చటం, వందలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించటమే ధ్యేయంగా కార్యకలాపాలను దేశవ్యాప్త విస్తరణకు సిద్ధమవుతున్నాం.– బండారు ఉషన్న శివరామ్ (99854 77736), వ్యవసాయ పట్టభద్రుడు, బత్తాయి ఉత్పత్తుల ఆవిష్కర్తనిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
మట్టి ద్రావణంతో ఎన్నో మేళ్లు!
మిద్దెతోటలు లేదా ఇంటిపంటలు లేదా పెరటి తోటల్లో కుండీలలో పెరిగే మొక్కలకు మట్టి ద్రావణం అత్యంత చౌకైన, శక్తివంతమైన సేంద్రియ పోషకంగా పనిచేస్తుంది. స్థల పరిమితి ఉండే మిద్దె తోటలలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఇది ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.1. మిద్దె తోటలో కుండీలలోని మట్టి కాలక్రమేణా తన సారాన్ని కోల్పోవచ్చు. మట్టి ద్రావణాన్ని అందించడం వల్ల మట్టిలోని సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, అది మళ్లీ సారవంతంగా మారుతుంది.2. మిద్దె /పెరటి తోటల్లో సాధారణంగా వచ్చే ఆకుముడత, పేనుబంక, తెల్ల దోమ వంటి సమస్యలను మట్టి ద్రావణం పిచికారీ చేయడం ద్వారా సమర్థవంతంగా అరికట్టవచ్చు.3. కుండీలలో పెరిగే కూరగాయలు, పండ్ల మొక్కలకు వేర్ల కంటే ఆకుల ద్వారా పోషకాలు త్వరగా అందుతాయి. మట్టి ద్రావణాన్ని స్ప్రే చేయడం వల్ల ఆకులు పచ్చగా, బలంగా పెరుగుతాయి.4. రసాయన ఎరువులు లేకుండానే టమాటా, మిర్చి, ఆకుకూరల దిగుబడిని పెంచడానికి ఇది సహాయపడుతుంది.5. ఆకులపై మట్టి ద్రావణం ఒక పొరలా ఏర్పడి, కీటకాలు గుడ్లు పెట్టకుండా అడ్డుకుంటుంది. 6. మొక్కలకు చీడపీడలు ఉన్నప్పుడు లేదా తక్షణ పోషకాలు కావాలనుకున్నప్పుడు ఆకులపై పిచికారీ చేయాలి. 7. ఆకుల పైన, ఆకుల అడుగు భాగంలో, కొమ్మల మీద పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.8. ఎండ లేని సమయంలో, అంటే ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత, మాత్రమే స్ప్రే చేయాలి.9. మొక్క వేర్లు బలంగా పెరగడానికి, మట్టి సారవంతం కావడానికి ఈ ద్రావణాన్ని మొక్క మొదళ్లలో పోయాలి. దీనివల్ల మట్టిలోని సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి.10. మట్టి ద్రావణం తయారీ కోసం భూమిపై పొరను 1 అడుగు వరకు తీసివేసి, లోపలి నుండి తీసిన జిగటగా ఉండే మట్టి (నల్లరేగడి లేదా ఎర్రమట్టి)ని 1 నుండి 2 కిలోలు తీసుకోవాలి.11. పది నుండి ఇరవై లీటర్లు నీరు తీసుకోవాలి.12. ఆముదం 20 నుండి 50 మి.లీ. (చీడపీడల నివారణకు) తీసుకోవాలి. 13. కుంకుడు కాయలు 2–3ని నీటిలో నానబెట్టి తీసిన రసం.. మట్టి ద్రావణం ఆకులకు అంటుకోవడానికి కలపాలి.14. మట్టి ద్రావణం తయారీ విధానం: సేకరించిన లోపలి మట్టిలో రాళ్లు, గడ్డలు లేకుండా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మెత్తని మట్టిలో ఆముదం, ముందుగా నానబెట్టి తీసిన కుంకుడు రసాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో వేసి ఒక కర్రతో 5 నిమిషాల పాటు బాగా తిప్పాలి. దీనివల్ల మట్టిలోని పోషకాలు నీటిలోకి విడుదలవుతాయి.15. కలిపిన తర్వాత ద్రావణాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు కదపకుండా వదిలేయాలి. అప్పుడు బరువైన మట్టి రేణువులు అడుగుకు చేరుకుంటాయి.16. పైన తేరిన గోధుమ రంగు తేట నీటిని మాత్రమే వడపోసి స్ప్రే బాటిల్లో పోయాలి.17. స్ప్రేయర్ నాజిల్కు మట్టి అడ్డుపడకుండా ఉండాలంటే ద్రావణాన్ని పల్చటి గుడ్డతో రెండుసార్లు వడపోసుకోవాలి. వడపోసిన తేట నీటిని స్ప్రేయర్ బాటిల్లో పోసి మొక్కల ఆకుల పైన, కింద తడిచేలా పిచికారీ చేయాలి. అప్పుడే ఆకుల అడుగున దాక్కున్న పురుగులు కూడా నశిస్తాయి.18. మట్టి ద్రావణాన్ని తయారు చేసిన 24 గంటల లోపు వాడుకోవడం మంచిది. నిల్వ ఉంచితే దాని ప్రభావం తగ్గుతుంది.19. సాధారణంగా వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఇలా స్ప్రే చేయడం వల్ల మొక్కలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి.20. మట్టి ద్రావణంను కేవలం నీటిలా కాకుండా, ఒక సహజ సిద్ధమైన ‘టానిక్‘, ‘రక్షణ కవచం’గా భావించవచ్చు. 21. భూమి లోపలి మట్టిలో మొక్కలకు అవసరమైన మైక్రో, మాక్రో న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ద్రావణాన్ని ఆకులపై స్ప్రే చేసినప్పుడు, అవి వేర్ల కంటే 8 నుండి 20 రెట్లు వేగంగా పోషకాలను గ్రహిస్తాయి.22. ద్రావణంలో ఉండే ఆముదం, జిగట మట్టి ఒక పొరలా ఆకులపై ఏర్పడి, పురుగులు గుడ్లు పెట్టకుండా అడ్డుకుంటాయి.23. ఆకుముడత, తెల్లదోమ, పేనుబంక, లద్దెపురుగు వంటి మొండి చీడలను ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది.24. పోషక లోపాల వల్ల ఆకులు పసుపు రంగులోకి మారినప్పుడు ఈ ద్రావణం పిచికారీ చేస్తే, కేవలం 48 గంటల్లోనే మొక్క తిరిగి పచ్చగా మారుతుంది.25. పూత రాలడం తగ్గుతుంది. కాయల పరిమాణం, నాణ్యత పెరుగుతాయి. ఇది మొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది.26. రసాయన ఎరువులు, ఖరీదైన పురుగుమందుల అవసరం లేకుండానే కేవలం మట్టితో తోటను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.27. అధిక వర్షాలు వల్ల వేర్లు పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు, ఈ ఫోలియర్ స్ప్రే మొక్కకు ్రపాణం పోస్తుంది. 28. మిద్దె తోటలోని మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా ఉండాలంటే వారానికి ఒకసారి పిచికారీ చేయడం సరిపోతుంది.29. ఒకవేళ ఆకుముడత, తెల్లదోమ లేదా పేనుబంక వంటివి ఎక్కువగా ఉంటే, 3 నుండి 4 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేయాలి. సమస్య తగ్గిన తర్వాత మళ్లీ వారానికి ఒకసారికి మార్చుకోవచ్చు.30. మొక్కలు పూత మీద ఉన్నప్పుడు 10 రోజులకు ఒకసారి ఇస్తే పూత రాలకుండా కాయ బాగా వస్తుంది.31. పశువుల ఎరువు మట్టిలో కలిసి వేర్ల ద్వారా నెమ్మదిగా పోషకాలను అందిస్తుంది. మట్టి ద్రావణం ఆకుల ద్వారా తక్షణమే అందుతుంది. కాబట్టి, వారానికి ఒకసారి మట్టి ద్రావణాన్ని పిచికారీ చేయవచ్చు. 32. ఒక వారం మట్టి ద్రావణం, తర్వాతి వారం జీవామృతం లేదా తౌడు ద్రావణం వంటివి మార్చి మార్చి ఇవ్వటం వలన మొక్కకు రకరకాల సూక్ష్మపోషకాలు అందుతాయి.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పోషకలోపాన్ని తగ్గించే 'ఎర్రజాన'
ఎర్ర జాన కూడా ఉష్ణ మండలపు ఆకులురాల్చే చెట్ల తెగకు సంబంధించినది. ఈ చెట్లు 5–8 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు, పూలు ఇంచు మించు ఫాల్సా ఆకులను పోలి ఉంటాయి. కొమ్మలు కిందికి సాగి ఉంటాయి.ఈ చెట్లు నలమల అడవి అంతటా లేవు. మల్లాపూర్, అప్పాపూర్ పోయే దారిలో తారసపడుతాయి. ఎర్ర జాన ఎక్కువగా ఇండియన్ సబ్ కాంటినెంట్ మొదలు చైనా వరకు ఉంటాయి. యున్సోవ్, మలేషియా, మైన్మార్, లాహోస్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా తదితర దేశాలు వీటి స్థలాలు. ఈ చెట్లు దాదాపు సముద్ర మట్టం నుంచి 100 మీటర్ల ఎత్తులో కూడ ఆటు పోట్లను తట్టుకొని పెరుగుతాయి.తెలుగు: ఎర్ర జానబెంగాలీ: ధమిన్మరాఠీ: థమన్మలయాళం: చడచి, దనౌనిఇంగ్లీష్: థమన్కన్నడ: బుటలెగుజరాతీ: థమన్తమిళం: వృక్షం, అన్నంహిందీ: థమన్, కహ్ రాచిసంస్కృతం: దన్ వృక్షం అని పిలుస్తారు. ప్రాంతాలను బట్టి ఉచ్ఛారణలో కొంత తేడా ఉంటుంది.పూత: మార్చి– ఏప్రిల్పండ్లు: మే– జూన్ ఉపయోగాలు...ఈ చెట్ల అన్ని భాగాలు ఉపయోగపడుతాయి. ఎర్ర జాన పండ్ల పై పొట్టు ఎరుపు– కాషాయ వర్గం కలిగి ఆకరణీయంగా ఉంటాయి.పండ్లలో ఒక గింజ, రెండు గింజలు, కొన్నిటిలో మూడు, నాలుగు గింజలు కూడా ఉంటాయి.గింజలపై ఉండే పలుచటి పొర రుచికరంగా తీపిదనం కలిగి ఉంటుంది. ఈ పండ్లను చెంచులు ఇష్టంగా తింటారు.ఆకులను పశువులు, జీవాలు ఇష్టంగా తింటాయి. కలపను చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లకు, ఇతర కట్టె వస్తువుల తయారీలో వాడవచ్చు.వంట చెరకుగా కూడా ఉపయోగపడుతుంది.బెరడు నుండి కషాయం చేసి, దాన్ని అనేక రుగ్మతలను ముఖ్యముగా పుండ్లు నయం చేయటానికి, వాత, పిత్త, కఫాలను తగ్గించటానికి వైద్యంలో వాడతారు.కడుపులో మంట పోటానికి ఈ బెరడు ఎంతో ఉపయోగపడుతుందని చెంచులు చెప్పారు.ఎర్ర జాన పండ్లలో సూక్ష్మ ధాతువులు, ముఖ్యంగా విటమిన్లతో పాటు యాంతోసైనిన్స్, ఫినాల్స్, ప్లేవనైడ్స్ మొదలగునవి ఉంటాయి.పండ్లలో ఓ మోస్తరు యాంటిఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.వ్యవసాయం పంటలు, చెట్లతో కలిపి (ఆగ్రో–ఫారెస్ట్రీ) పెంచదగిన అనువైన చెట్టు.ఎన్నో ఉపయోగాలు కలిగిన ఈ చెట్ల జాతిని అభివృద్ధి ఎంతో అవసరం.ఎర్ర జాన చెట్లపై తగిన పరిశోధనలు జరిపి పల్లపు ప్రాంతాల్లో వీటి ఉనికిని చాటాలి.తద్వారా ప్రజల్లో, ముఖ్యంగా పేద ప్రజల్లో, పోషకలోపాన్ని తగ్గించటంలో ఎంతో ఉపయోగపడగలదని ఆశించవచ్చు.- డాక్టర్ మొరుపోజు పద్మయ్యవిశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: ఆ దేశాల్లో 20 రెట్లు ఎక్కువ!
2035 నాటికి సంపన్న దేశాల్లో వ్యవసాయ కార్మికుల ఆదాయాలు దక్షిణాసియా, సబ్–సహారా ఆఫ్రికా కంటే 20 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని ఒక నివేదిక పేర్కొంది. 2035 నాటికి ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తి 13% పెరుగుతుంది. అదే సమయంలో అధికాదాయ దేశాల్లో వ్యవసాయ కార్మికుల వార్షిక ఆదాయం 22,155 డాలర్లు ఉంటుందని అంచనా.దక్షిణాసియా, ఉప–సహారా ఆఫ్రికాలో ఈ ఆదాయాలు 1,100 డాలర్ల స్థాయిలోనే ఉండిపోతాయని అంచనా. ప్రత్యక్ష వ్యవసాయ గ్రీ¯Œ హౌస్ వాయు ఉద్గారాలు పెరుగుతున్నప్పటికీ, అల్పాదాయ దేశాల్లో ఆహార భద్రత, పోషకాహార అంతరాలు కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ), ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా విడుదల చేసిన కొత్త నివేదిక హెచ్చరిస్తోంది.ఉత్పాదకత మెరుగుదల కారణంగా రాబోయే దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి కార్మికునికి సగటు స్థూల వ్యవసాయ ఆదాయం 9 శాతం మేర పెరుగుతుందని అంచనా. ముడిసరుకుల ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, వాస్తవ వ్యవసాయ ధరలు స్థిరంగానే ఉంటాయని ఆశిస్తున్నారు.ఈ నివేదిక ప్రకారం, ప్రతి వ్యవసాయ కార్మికుని వాస్తవ స్థూల ఆదాయంగా లెక్కించిన ప్రపంచ సగటు వ్యవసాయ కార్మిక ఉత్పాదకత 2035 నాటికి 3,800 డాలర్లుగా ఉంటుంది. ఇది సగటు మాత్రమేన. అధికాదాయ, అల్పాదాయ దేశాల్లోని కార్మికుల మధ్య అంతరం కూడా పోరిగిపోతోంది. అధిక ఆదాయ దేశాలలో 2023–25లో వ్యవసాయ కార్మిక ఉత్పాదకత 21,100 డాలర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. 2035 నాటికి ఇది 22,155 డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నారు.ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా, ఓషియానియాప్రాంతాల్లో అత్యధిక తలసరి వ్యవసాయోత్పత్తి నమోదవుతుందని అంచనా. ఈప్రాంతాల్లో విస్తారమైన భూకమతాలు ఉంటాయి. తక్కువ శ్రమ, అత్యధిక స్థాయి యాంత్రీకరణ జరుగుతుందని నివేదిక పేర్కొంది. మరోవైపు, సహారా ఉప–్రపాంత ఆఫ్రికా, దక్షిణాసియాలోని అల్ప ఆదాయప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు ప్రస్తుతం సగటున సంవత్సరానికి సుమారు 930 డాలర్లు సంపాదిస్తున్నారు. ఈ ఆదాయం 2035 నాటికి కేవలం 1,100 డాలర్లకు మాత్రమే పెరుగుతుంది. అంటే దశాబ్ద కాలంలో సుమారు 170 డాలర్లు మాత్రమే పెరుగుతుందని నివేదిక అంచనా వేస్తోంది.వ్యవసాయ కార్మికుల సగటు ఆదాయాల్లో అంచనా వేసిన 9 శాతం పెరుగుదల ఏమాత్రం సురక్షితం కాదు. వ్యవసాయ మార్కెట్లు అస్థిరతకు గురవుతూ ఉంటాయి. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, 2035లో ప్రతి కార్మికునికి స్థూల వ్యవసాయ ఆదాయం, అంచనా వేసిన ్రపాథమిక స్థాయి కంటే కనీసం 12 శాతం తక్కువగా ఉండే అవకాశం లేకపోలేదని నివేదిక చెబుతోంది. అల్పాదాయ దేశాల్లో అ లోటు 20 శాతానికి మించి ఉండవచ్చని అంచనావేస్తున్నారు.ఆదాయాల్లో ఈ వ్యత్యాసం ఆహార భద్రత, వినియోగ సరళిలో కూడా ప్రతిబింబిస్తుందని నివేదిక కనుగొంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ్రపోత్సహించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, సంపన్న దేశాల్లో అధిక ఆహార వినియోగం కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు, తక్కువ గృహ ఆదాయాలు, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా, అల్పాదాయ దేశాలు ఆహార భద్రత, పోషణలో వెనుకబడి ఉంటాయని అంచనా.పెరగనున్న వ్యవసాయ ఉద్గారాలువ్యవసాయ ఉత్పత్తిలో అధిక వృద్ధి నమోదవుతుందని అంచనా వేసినప్పటికీ, సాగుభూమి, పశువుల సంఖ్యను రానున్న పదేళ్లలో ఇంకా కొంత విస్తరించాల్సి ఉంటుంది. దీని ఫలితంగా, రాబోయే దశాబ్దంలో ప్రత్యక్ష వ్యవసాయ గ్రీ¯Œ హౌస్ వాయు ఉద్గారాలు 6.5 శాతం మేర పెరుగుతాయని అంచనా. రానున్న పదేళ్లలో పెరిగే వ్యవసాయ ఉద్గారాలలో సుమారు 77 శాతం వాటా పశువుల పెంపకందే ఉంటుందని అంచనా. అధిక నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాల ద్వారా కృత్రిమ ఎరువులు మిగిలిన 23 శాతానికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.‘ఉత్పాదకత వృద్ధిని వేగవంతం చేయటం, సాంకేతిక అంతరాలను పూడ్చటం ద్వారా ఉద్గారాల పెరుగుదలను నెమ్మదింపజేయడానికి లేదా తగ్గించటానికి వీలు కల్పించటమే విధానపరమైన సవాలు. పెరుగుతున్న జనాభాలో మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో.. ప్రపంచ ఆహార భద్రతను, మెరుగైన పోషకాహారాన్ని అందిస్తూనే వ్యవసాయ ఉద్గారాలను నియంత్రించాలి’ అని నివేదిక పేర్కొంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఉపాధి!
మన దేశంలో గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, పోషకాహార భద్రతను పటిష్టం చేయడానికి పెరటి కోళ్ళ పెంపకం ఒక శక్తివంతమైన సాధనంగా అవతరించిందని భువనేశ్వర్లోని కేంద్రీయ మహిళా వ్యవసాయ సంస్థ (ఐసిఎఆర్–సిఐడబ్ల్యూఏ) శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్ కుమార్ పాండా తన పరిశోధనా పత్రంలో వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధిని, మహిళా సాధికారతను అందించే ఈ రంగంపై డా. అరుణ్ కుమార్ పాండా ఏమంటున్నారంటే..అంతరం... దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అయితే, వాణిజ్యపరమైన కోళ్ళ పరిశ్రమల లాభాలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడిమాంసంలో 75–80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే.. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది. 2019 పశుగణన ప్రకారం.. దేశంలో పెరటి కోళ్ళ సంఖ్య 31.37 కోట్లకు చేరింది. మొత్తం గుడ్ల ఉత్పత్తిలో పెరటి గుడ్ల వాటా 21 శాతం ఉంటుంది.మహిళా సాధికారత... సాధారణంగా గ్రామాల్లో పెరటి కోళ్ళ నిర్వహణ, వాటికి మేత వేయటం, గుడ్ల అమ్మకం వంటి పనులన్నీ మహిళలే చూసుకుంటారు. దీనివల్ల వచ్చే అదనపు ఆదాయం వల్ల వారి కుటుంబ నిర్ణయాధికారం పెరిగి, సామాజిక హోదా మెరుగుపడుతుంది. ఇది స్త్రీ పురుష సమానత్వానికి దారితీస్తుంది.లాభసాటి కావాలంటే..? పెరటి కోళ్ళ పెంపకంలో తక్కువ ఉత్పాదకత, కొక్కెర వ్యాధి వంటి ప్రాణాంతక వ్యాధులు, సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం ప్రధాన సమస్యలు. వీటిని అధిగమించడానికి గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలు రకం కోడి పిల్లలను ప్రభుత్వాలు పంపిణీ చేయాలి. స్థానికంగా లభించే మేతను వాడుకోవటం, మహిళలకు వ్యాక్సినేష¯Œ పై శిక్షణ ఇవ్వటం, మహిళా సహకార సంఘాల ద్వారా గ్రామీణ మార్కెట్లను ఏర్పాటు చేయటం వంటి చర్యలు చేపడితేనే కుటుంబ స్థాయిలో పెరటి కోళ్ళ పెంపకం మరింత లాభసాటిగా మారుతుంది. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, శ్రీనిధి వంటి మేలైన పెరటి కోడి పిల్లల కోసం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ ‘డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్’ను సంప్రదించవచ్చు. హెల్ప్ లైన్: 040–24015651.కోడిగుడ్డులో 44 పోషకాలుగ్రామీణప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే. సంప్రదాయ భారతీయ ఆహారంలోప్రోటీన్ల లోపం ఉంటుంది. మానవ శరీరానికి అవసరమైన 45 రకాల పోషకాల్లో 44 పోషకాలు కోడిగుడ్డులో లభిస్తాయి. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైనప్రోటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతంప్రోటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.- ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
జీవవైవిధ్య పరిరక్షణలో ఊడుగ చెట్ల పాత్ర..
ఊడుగ పండు పేర్లు వేర్వేరు భాషల్లో: తెలుగు: నల్ల అంకోలము, నల్ల ఊడుగ ఇంగ్లీష్: సేజ్ లీవ్డ్ ఆలంజియం, హిల్ సాక్ ట్రీ, సోన్ మ్యాంగో ఉర్దూ: అంకోల్ ఒరియా: మొరట, బంగ అంకోల్ తమిళం: ఏలంజి, ఎరలిన్సిల్ పంజాబీ: ఆకోల్ బెంగాలీ: ఆకర కాంటా మరాఠీ: అంకోల్ మలయాళం: అంకోలం. కరంకొలం హిందీ: అంకోల, అంకోల్ సంస్కృతం: అంకోల, అంకోలక, అంకోత నేపాలీ: ఆంఫీ, అంకోల్ అని అంటారు.పూత : ఫిబ్రవరి – ఏప్రిల్. పండ్లు : మే – జూన్.ఊడుగ చెట్టుకు ముళ్లు ఉంటాయి. పండ్లు ఒగరుతో కూడుకొని జిగటగా ఉంటాయి. గుత్తులుగా కాస్తుంటాయి. పండ్లు నశ్యం రంగులో ఉంటాయి. ఈ చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కల్గి ఉంది.ఉపయోగాలు...ఊడుగ చెట్లను రైతులు వీటిని జీవ కంచెగా పెంచుతారు.పండ్లు తింటారు. వగరు, తీపి కలయిక రుచితో ఉంటాయి.ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వీటి వేర్లు, పండ్లను కీళ్ళ నొప్పులు, పైల్స్ తగ్గించడానికి ఉపయోగిస్తారు.వేర్ల బెరడును నులి పురుగులను విసర్జించడానికి వినియోగిస్తారు.వెన్ను నొప్పిని అదుపులో ఉంచడానికి ఉపకరిస్తుంది.పండ్లు, విత్తులు చలువనిస్తాయి. అట్లే శరీరానికి సత్తువనియ్యగలవు.ఆకులు కూడా వాపును, ఎముకల పెళుసుదనాన్ని తగ్గించడానికి వాడుతారు.జ్వరాలను తగ్గించడానికి వాడుతారు.పచ్చి పుల్లలతో పండ్లు తోముకుంటే మంచిది. చిగుర్లు గట్టి పడుతాయి.విత్తనాల నుండి తీసిన నూనెను చర్మంపై పూసినటైతే దురదలు తగ్గుతాయి. అలాగే గజ్జి కూడా తగ్గుతుంది. ఈ నూనెను బొడ్డు చుట్టు పూసుకుంటే మగత సమస్యకు చెక్ పెట్టవచ్చు.కొమ్మల కషాయంతో విరేచనాలు, వాంతులను తగ్గించవచ్చు. ఆకులను ఉబ్బసాన్ని, కీళ్ల నొప్పులను తగ్గించడానికి వాడుతారు.పండ్ల రసాన్ని కంటి సమస్యలకు ఉపయోగిస్తారు.వేర్ల బెరుడును పసుపుతో కలిపి సుఖరోగాలను తగ్గించడానికి పై పూతగా వాడుతారు.డెంగ్యూను తగ్గించడానికి వాడుతారు. మూడు గ్రాముల వేర్లు, రెండు గ్రాముల శొంఠిని దంచి పొడిని సేవించడం వల్ల డెంగ్యూ రోగం నుండి విముక్తి చెందవచ్చని చెబుతారు.రేబీస్ రోగాన్ని నయం చేసే గుణం వీటి వేర్లకున్నది. వీటి వేర్ల కషాయం చేసి రోజుకు రెండుసార్లు, ఈ విధంగా ఒక నెల సాధన చేసే రేబీస్ రోగం నుండి విముక్తి పొందవచ్చునంటారు.పాము కాటు నుండి ఉపశమనానికి వేర్ల బెరుడు పొడిని దాదాపు 350 ఎం.ఎల్.ను గ్లాసు ఆవు పాలలో బాగా కలిపి రోజుకు మూడుసార్లు సేవించడం వల్ల (వారం రోజులైనా చేయవలసి ఉంటుంది. పాము పాము కాటు నుండి విముక్తి పొందవచ్చని చెబుతారు. విషానికి విరుగుడుగా పనిచేస్తుంది).మూత్ర విసర్జన మంటగా ఉంటే 5 గ్రాముల వేర్లను శుభ్రంగా కడిగి, 400 మిల్లి లీటర్ల నీళ్ళల్లో మరగనిచ్చి (ఆ నీళ్ళు ఒక భాగం అయ్యే వరకు) చల్లారిన తరువాత రోజుకు రెండుసార్లు తాగితే ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.ఏదైనా అతిగా తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే అజీర్తి, విరేచనాలు కూడా కావచ్చు. మోతాదుకు మించి వాడరాదు.కట్టెలను వంట చెరుకుగా వాడుతారు. పెద్ద మండలను ఇటుక బట్టీలను కాల్చటానికి కూడి వాడుతారు.జీవవైవిధ్య పరిరక్షణలో ఊడుగ చెట్టు పాత్ర ఎంతో ఉంటుంది.ఉనికి...ఊడుగ చెట్లు ఎక్కువగా వాగులు వంకలు, అడవులు, ఒడ్డుల వెంబడి పెరుగుతాయి. పొదలుగానే ఎక్కువగా ఎదుగుతాయి. కానీ అక్కడక్కడా ఎత్తు చెట్లుగా పెరుగుతాయి. ఇవి రమారమి 5–10 మీటర్ల వరకు స్థలాన్ని బట్టి పెరుగుతుంది. ఈ చెట్లు ఆకులను రాల్చుతాయి. ఇది ఉష్ణమండలానికి చెందిన చెట్టు. పవిత్ర వృక్షంగా గుర్తింపు వుంది. ఈ చెట్లు ఉన్న దగ్గర దేవాలయాలు వెలుస్తాయి. అలాగే గ్రామ దేవతల గుళ్ళ దగ్గర ఈ చెట్లు ఉంటాయి. వీటి స్వస్థలం భారత ఉపఖండం, కొమోరో ద్వీపాలు, ఆఫ్రికా తూర్పు ఉష్ణమండలం. భారత దేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాలలో వీటిని గమనించవచ్చు. ఇతర దేశాలలో కూడా వీటి ఉనికి ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, కెన్యా, టాంజనియాలలో ఉంది.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
వాతావరణ మార్పులను తట్టుకునే సమీకృత వ్యవసాయం!
వ్యవసాయం అంటే పంటలు పండించటం. సమీకృత వ్యవసాయం అంటే ఒకే భూమిలో పంటల సాగుతో పాటు పశువులు/ కోళ్లు/ చేపల పెంపకం వంటివి కలిపి చెయ్యటం. దీనివల్ల ఖర్చులు తగ్గి, లాభాలతో పాటు భూసారం పెరుగుతాయి. వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే చిన్న, సన్నకారు రైతులకు సైతం ఆహార, ఆరోగ్య భద్రత కలుగుతాయి. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వర్షాధార సమీకృత వ్యవసాయంపై విస్తృతమైన కృషి చేస్తోంది. ఒడిషాలో ఈ ఫౌండేషన్ అనుభవాలపై కథనం..ఒడిషాలోని కోరాపుట్ జిల్లాలో వర్షాధారంగా వ్యవసాయం చేసే (మెట్ట) రైతులు సమీకృత వ్యవసాయాన్ని అనుసరించి బాగుపడుతున్నారు. వర్షపు నీటిని నిల్వ చేసుకొని.. ఆ నీటిని పంటలు, కూరగాయల సాగుకు ఉపయోగించుకోవడానికి వ్యవసాయ చెరువులు సహాయపడుతున్నాయి. వర్షాధారంగా వ్యవసాయం చేసే రైతులు వర్షాకాలంలో మాత్రమే ముఖ్యంగా వరి సాగు చేస్తుంటారు. అయితే, కోరాపుట్, నబరంగ్పూర్లోని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ పరిధిలో రైతులు ఒకడుగు ముందుకు వేశారు. ఈ రైతులకు చేపల సాగు, కూరగాయలు, పండ్ల చెట్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగు, పుట్టగొడుగుల పెంపకంతో పాటు వర్మీకంపోస్ట్ తయారు చేసుకొని బహుళ పంటలను సాగు చేయటంలో ఫౌండేషన్ రైతులకు శిక్షణ ఇచ్చింది.ఈ నమూనా కాలానుగుణ ఇబ్బందులను తగ్గించిందని, ప్రతి ఇంట్లో ఆహార భద్రతను మెరుగుపరిచిందని, అలాగే వాతావరణంలో ఏర్పడే పెను మార్పులకు తట్టుకునే వ్యవసాయాన్ని మార్చుకునేలా చేసిందని రైతులు అంటున్నారు.2017 నుంచి ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలు చేస్తున్న సమీకృత వ్యవసాయ వ్యవస్థప్రాజెక్ట్ చక్కటి ఫలితాలనిస్తోంది.ప్రారంభంలో 20 మంది చేపలæ రైతులతో పైలట్ప్రాజెక్ట్గా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఆదాయాలు రెట్టింపయ్యాయి. ఈ ఫలితాల నేపథ్యంలో, కోరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లోని 193 మంది రైతులకు ఈ కార్యక్రమాన్ని విస్తరించారు.చేపల పెంపకంఈ వ్యవస్థకు ప్రధానమైనది వర్షపు నీటిని సేకరించే చెరువు. దీన్ని చేపల పెంపకం, అదనపు నీటిపారుదల కోసం ఉపయోగిస్తారు. ఉదజని సూచిక (పిహెచ్)ని సరిచేయటానికి చెరువుల్లో సున్నం వేసి శుభ్రపరుస్తారు. ఆవు పేడతో కూడిన స్లర్రీ వెయ్యటం వల్ల నీటిలో ΄్లాంక్టన్(ప్లవకాలు) పెరుగుతాయి. ఇది చేపలకు సహజమైన మేతగా ఉపయోగపడుతుంది. రైతులు బొచ్చె తదితర మంచినీటి కార్ప్ చేపలను కలిపి ఒకే చెరువులో తగిన నిష్పత్తిలో పెంచుతారు. తక్కువ ఖర్చుతో ఇంట్లో తయారుచేసిన చేపల మేతను, నీటిపై తేలియాడే పెల్లెట్ల మేతను వేసి పెంచుతారు. క్రమం తప్పకుండా చేపల నమూనాలను సేకరించి పరీక్షిస్తూ మేత పద్ధతులను సర్దుబాటు చేస్తుంటారు.సమీకృత సేద్యం ఓ పరిష్కారం వర్షపు నీటిని సేకరించి, ఆ నీటిపై ఆధారపడి చేసే సమీకృత వ్యవసాయ పద్ధతులు కేవలం ఆదాయాన్ని పెంచడమే కాకుండా, ఇంకా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవి వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి, పోషకాల వైవిధ్యాన్ని మెరుగుపరుస్తాయి, నేల, నీటి వనరులను పరిరక్షిస్తాయి, భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం అస్తవ్యస్థంగా మారిపోవటం తీవ్రమవుతున్నందున, ఇటువంటి వికేంద్రీకృత, సమాజ ఆధారిత పరిష్కారాలు అత్యంత కీలకంగా మారాయి.వర్షం పడిన చోటనే పొలంలోనే ఆ నీటిని సేకరించడం అత్యంత సరళమైన పద్ధతి. భారతదేశ ఆహార భవిష్యత్తును కాపాడటానికి ఇది అత్యంత శక్తివంతమైన వ్యూహాలలో ఒకటిగా నిలుస్తుందని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చెబుతోంది. సమీకృత వ్యవసాయ వ్యవస్థ నమూనాని రైతులందరికీ విస్తరించాల్సిన అవసరం ఉంది, దీనికి విధానపరమైన ప్రోత్సాహం, క్షేత్రస్థాయిలో రైతుల సామర్థ్యం పెంపుదల, సామాజిక భాగస్వామ్యం అవసరం. రైతులు వాన నీటిని ఒక ఉమ్మడి పర్యావరణ వనరుగా గుర్తించి ఒడిసిపట్టినప్పుడు వ్యవసాయం సుస్థిరతకు మరింత చేరువ అవుతుందని ఫౌండేషన్ సూచిస్తోంది.అదేవిధంగా, రైతులు మెట్ట భూములలో ఖరీఫ్ కాలంలో రాగుల సాగును, ఖరీఫ్ చివరి కాలంలో ఉలవల సాగును చేపట్టారు. ఈ వైవిధ్యభరితమైన పంటల విధానం నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రైతుల జీవనోపాధిని బలపరుస్తుంది. ఆహార భద్రతను ప్రోత్సహిస్తుంది. కుటుంబ పోషణకు తోడ్పడుతుంది.వరి, రాగి పంటల గడ్డితో ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. వర్మీకంపోస్టు ఉత్పత్తి కేంద్రాల ద్వారా వ్యర్థాలను పునర్వినియోగిస్తున్నారు. తద్వారా రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గింది.సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే సమీకృత వ్యవసాయ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. అంతకంటే ముఖ్యంగా, సంవత్సరం పొడవునా పంటల ద్వారానో, కోళ్ల ద్వారానో, చేపల ద్వారానో ఏదో ఒక ఆదాయం వస్తుంటుంది. దీనివల్ల కాలానుగుణ ఇబ్బందులు తగ్గి, రైతులు మరింత సురక్షితమైన జీవితాలను గడపడానికి వీలు కలుగుతోంది.చెరువు గట్లపై పంటలు..సాంప్రదాయకంగా ఉపయోగించకుండా వదిలేసే చెరువు గట్లపై అరటి, బొ΄్పాయి, మునగ, జామ, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి వంటి పండ్ల చెట్లను నాటుతున్నారు. చెరువు నీటితో చెరువు గట్లపైనా, దాన్ని ఆనుకొని ఉన్న భూముల్లోనూ ఏడాది పొడవునా కూరగాయలు పండిస్తున్నారు. మెట్ట భూములలో వరి తర్వాత పండించే పెసర, మినుము వంటి పప్పుధాన్యాలు అదనపు ఆదాయాన్ని అందించడమే కాకుండా, నేలను సారవంతం చేస్తున్నాయి. తద్వారా కాలక్రమేణా పెట్టుబడి ఖర్చులను తగ్గింది.అదేవిధంగా, రైతులు మెట్ట భూములలో ఖరీఫ్ కాలంలో రాగుల సాగును, ఖరీఫ్ చివరి కాలంలో ఉలవల సాగును చేపట్టారు. ఈ వైవిధ్యభరితమైన పంటల విధానం నేల ఆరోగ్యాన్ని, రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తుంది. ఆహార భద్రతకు, కుటుంబ పోషణకు తోడ్పడుతోంది. వరి, రాగుల గడ్డితో ఆయిస్టర్ పుట్టగొడుగులు పెంచుతున్నారు. వర్మీకంపోస్టు తయారు చేస్తూ రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించుకుంటున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: చీడపీడల నివారణ..
కూరగాయ మొక్కలు పూత, కాత దశలో ఉన్నప్పుడు చీడపీడలు (ముఖ్యంగా ఆకు ముడత, తెల్ల దోమ లేదా పేనుబంక) రావడం సహజం. మిద్దెతోటల్లో వీటిని వదిలించుకోవడానికి రసాయనాల కంటే ఇంట్లోనే తయారు చేసుకునే కషాయాలు బాగా పనిచేస్తాయి:1. వేప నూనె స్ప్రే అన్నిటికన్నా ఉత్తమమైనది. ఒక లీటరు గోరువెచ్చని నీటిలో 5 ఎం.ఎల్. వేప నూనె, 2 స్పూన్లు శనగపిండి కలిపి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని ఆకులపైన, ముఖ్యంగా ఆకుల వెనుక భాగంలో (అక్కడే పురుగులు ఎక్కువగా ఉంటాయి) స్ప్రే చేయాలి. దీన్ని వారానికి ఒకసారి సాయంత్రం వేళల్లో స్ప్రే చేస్తే పురుగులు మాయమవుతాయి.2. అల్లం–వెల్లుల్లి–మిర్చి కషాయం – టమోటా, మిర్చి మొక్కలకు వచ్చే ఆకు ముడతకు ఇది బాగా పనిచేస్తుంది. 3. సమాన భాగాలుగా (50 గ్రాముల చొప్పున) అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకుని పేస్ట్ చేయాలి. దీన్ని లీటరు నీటిలో కలిపి ఒక రాత్రంతా ఉంచి, మరుసటి రోజు వడకట్టాలి.4. ఇలా వాడకట్టిన లీటర్ ద్రావణం కు మరో 10 నుండి 15 లీటర్ల సాధారణ నీటిని కలిపి మొక్కలపై స్ప్రే చేయాలి. ఈ ద్రావణం గాఢత ఎక్కువ ఉంటే మొక్కలు మాడిపోతాయి. 5. వేప నూనె లేదా అల్లం–వెల్లుల్లి కషాయాన్ని వారానికి ఒకసారి చొప్పున వరుసగా మూడు వారాలు స్ప్రే చేయాలి. ఒక్కసారి స్ప్రే చేస్తే పురుగులు పూర్తిగా పోవు, వాటి గుడ్లు కూడా నశించాలంటే క్రమం తప్పకుండా చేయాలి.6. పురుగులు ఆకుల అడుగునా దాక్కుంటాయి, కాబట్టి స్ప్రే చేసేటప్పుడు ఆకులను పైకి ఎత్తి మరీ కొట్టాలి.7. పుల్లటి మజ్జిగ (నిమ్మ మొక్కలకు): బాగా పులిసిన మజ్జిగను (3–4 రోజుల పాతది) నీటిలో కలిపి (1:5 నిష్పత్తి) మొక్కలపై స్ప్రే చేస్తే తెగుళ్లు తగ్గడమే కాకుండా, మొక్కకు మంచి పోషకాలు అందుతాయి.8. 1 లీటరు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వంట నూనె, లిక్విడ్ సోప్ కలపాలి. ఆకులపై మచ్చలు లేదా బూజు ఉన్నప్పుడు దీనిని పిచికారీ చేయాలి. 9. ఆకు ముడతను వ్యాపింపజేసే తెల్లదోమలు, తామర పురుగులు పసుపు రంగుకు ఆకర్షితమవుతాయి. తోటలో అక్కడక్కడా పసుపు రంగు జిగురు అట్టలు కడితే పురుగులు వాటికి అతుక్కుపోతాయి. దీనివల్ల సమస్య పెరగకుండా ఉంటుంది.10. ³క్షులను ఆకర్షించడం ద్వారా అంటే వాటికి ఏమైనా ఆహారం, నీరు అందిస్తే పక్షులు మిద్దె /పెరటి తోటకు రావటానికి అలవాటు పడి మొక్కలపై ఉన్న పురుగులను తింటాయి. ఇది సహజమైన నియంత్రణ పద్ధతి.11. ఏ రకమైన కషాయం లేదా స్ప్రే అయినా సరే సాయంత్రం ఎండ తగ్గాక మాత్రమే చేయాలి. ఎండలో చేస్తే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది.12. పూత మీద నేరుగా స్ప్రే చేయకూడదు. ఇది పరాగసంపర్కానికి అడ్డుపడవచ్చు. ఆకులపై మాత్రమే స్ప్రే చెయ్యాలి.13. బాగా ముడత వచ్చి పాడైపోయిన ఆకులు లేదా కొమ్మలు ఉంటే, వాటిని తుంచేసి దూరంగా పారవేయాలి. అవి ఉంటే పురుగులు మళ్ళీ వ్యాపిస్తాయి.14. మొక్కకు లోపలి నుండి బలం ఉంటేనే అది రోగాలను తట్టుకోగలదు. కాబట్టి మనం ఇంతకుముందు తెలుసుకున్న ద్రవ పశువుల ఎరువును 15 రోజులకు ఒకసారి అందిస్తూ ఉండాలి.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
కష్టకాలంలో కూరగాయల సాగు వ్యూహాలు!
ఎల్నినో వల్ల ఏర్పడిన అనిశ్చిత వర్షపాత పరిస్థితులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉద్యాన పంటలు ముఖ్యంగా కూరగాయ పంటల సాగులో రైతులు కొన్ని ముఖ్యమైన మెళకువలు పాటించాల్సిన అవసరం ఉంది. కొన్నిప్రాంతాల్లో ఇప్పటికే ‘రుతుపవనాలు ఆలస్యం’ అయ్యాయి. మరికొన్నిప్రాంతాల్లో ‘తొలి కరువు’ నెలకొంది. ఇతరప్రాంతాల్లో మొదట్లో వర్షాలు కురిసినా తర్వాత ‘మధ్యకాలపు కరువు’ ఏర్పడింది.ఇటువంటి పరిస్థితుల్లో కూరగాయలు సాగు చేసే రైతులు ఎటువంటి ఏయే పంటలు పండించాలి? ఏయే రకాలను ఎంచుకోవాలి? ఎలాంటి మెళకువలు పాటించాలి? ఇటువంటి విషయాలను, మెళకువలను శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండా రాజిరెడ్డి ఈ ప్రత్యేక వ్యాసంలో వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులకు ఈ సూచనలు ఉపకరిస్తాయి.జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు వానాకాలం (ఖరీఫ్) పంటలు విత్తే కాలం. మరొక వారం రోజులు మాత్రమే విత్తే కాలం మిగిలి ఉంది. ఆరుద్ర కార్తె వెళ్లి, పునర్వసు కార్తె వచ్చింది. ఇప్పటికీ 60–75 మి.మీ. వర్షం కూడా కురవనిప్రాంతాల్లో ‘రుతుపవనాలు ఆలస్యం’ అయ్యాయని గుర్తించాలి. కొన్నిప్రాంతాల్లో ఇప్పటికే రెండు, మూడు వర్షాలు పడి భూమిలో తేమ సరిపోను ఉంది. అయితే, వర్షాల మధ్య 15–20 రోజుల విరామం వచ్చింది. కాబట్టి, ఆయాప్రాంతాలు ఇప్పటికే ‘తొలి కరువు’ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లే అర్థం.తొలి దశలో వర్షాలు పడినప్రాంతాల్లో రైతులు ఇప్పటికే విత్తుకొని ఉంటారు. మొలకవచ్చిన తర్వాత 15–20 రోజులు మళ్లీ వర్షం పడకపోతే ఆ పరిస్థితిని ‘మధ్యకాలపు కరువు’గా గుర్తించాలి. తొలి దశలో వర్షపాతం ఆధారంగా సాగు చేసిన పంటల్లో మొలక బాగా వచ్చినా, తర్వాత నెలకొన్న మధ్యకాలపు కరువు వల్ల మొక్కలు నీటి ఎద్దడికి గురవుతాయి. విత్తినా అసలు మొలకలే రాకపోతే మళ్లీ విత్తనాలు వేయాలి. కానీ, కచ్చితంగా నేలలో దున్నే పదును ఉన్నప్పుడే విత్తుకోవాలి. 1. వర్షాలు ఆలస్యమైనప్పుడు సాగు వ్యూహాలుస్వల్పకాలిక, కరువును తట్టుకునే కూరగాయ పంటలకు వెళ్లండి. వర్షాలు ఆలస్యమైన పరిస్థితుల్లో ఇక్కడ పేర్కొన్న అనువైన రకాలను సాగు చేసుకోవాలి.టొమోటో: అర్కా వికాస్, అర్కా రక్షక్, అర్కా సామ్రాట్, సాహూ, బాహూ, వీఎన్ఆర్ 3348, వీఎన్ఆర్ 3348, ఆదియా, ఆర్య ఎఫ్1. వంగ: శ్యామల, భాగ్యమతి, పూస క్రాంతి, అర్క నీలకంఠ, మంజరి, ఉత్కర్ష, వినాయక్మిరప: తేజ, ఎల్సీఏ–334, అర్కా లోహిత్, ఐఐహెచ్ఆర్ ఎస్ఇఎల్ 132, వీఎన్ఆర్ 978, ఉజాలా ఎఫ్1.బెండ: అర్కా నిఖితా, అర్క నామిక, వర్షా ఉపార్, హిసార్ ఉన్నత్, ఖాసీ లలిమా, వివాన్, వీబీహెచ్–11 (వీఎన్ఆర్), బ్రిగేడియర్, గౌరీ మునగ: పీకేఎం–1, పీకేఎం–2, కోకన్ రుచిరాచిక్కుడు: ఆర్ఎన్డీ–01, అర్కా జే గోరుచిక్కుడు: పూసా నవబహార్ బొబ్బర: అర్కా గరిమ, పూసా, కోమల్, తెలంగాణ కూర బొబ్బర తీగ జాతులు: సొర/ఆనప– అర్కా బహార్, కాకర– అర్కా హరిత్, బీర– అర్కా సుజాత్, దోసకాయ, వంట పుచ్చకాయ పాలకూర: ఆల్ గ్రీన్, అర్కా అనుపమ ∙తేమ ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించడానికి స్వల్పకాలిక రకాలు, హైబ్రిడ్లను సాగు చేయాలి.కరువును తట్టుకునే శక్తిని మెరుగుపరచడానికి, తేమ ఒత్తిడి పరిస్థితుల్లో పంట మనుగడను పొడిగించడానికి అంటుకట్టిన టొమాటో, వంగ నారుమొక్కలు నాటుకోవటం మంచిది. దశలవారీగా నర్సరీలను పెంచాలి.2. తొలి కరువు పరిస్థితుల్లో సాగు వ్యూహాలు∙నేలలో తేమను కాపాడటానికి, కలుపును అరికట్టడానికి, నేల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సేంద్రియ ఆచ్ఛాదనగా ఎండుగడ్డి లేదా ఇతర పంట అవశేషాలను హెక్టారుకు 7–10 టన్నుల చొప్పున వేసుకోండి. ∙నేల నిర్మాణాన్ని మెరుగుపరచడానికి, నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచడానికి మాగిన పశువుల ఎరువు హెక్టారుకు 15 టన్నులు లేదా వర్మీకంపోస్ట్ 10 టన్నుల చొప్పున నేలలో కలపండి. ∙నీటి వినియోగ సామర్థ్యం, నీటి పారుదల, వేర్ల అభివృద్ధిని మెరుగుపరచడానికి ఎత్తు మడుల (గట్టు–కాలువ లేదా వెడల్పాటి ఎత్తు మడుల)పై పంటల సాగు పద్ధతులను అవలంబించండి.పంట పెరుగుదలలోని కీలక దశల్లో, ముఖ్యంగా చురుకైన శాఖీయ పెరుగుదల, పూత, కాయల అభివృద్ధి దశల్లో ప్రాణరక్షక నీటి తడులు అందించండి. నీటి లభ్యత పరిమితంగా ఉన్నప్పుడు, నీటి వినియోగ సామర్థ్యాన్ని గరిష్ఠంగా పెంచడానికి ఒక కాలువ విడిచి ఒక కాలువ పద్ధతిలో నీటిపారుదల చేయండి.తేమ, పోషకాల కోసం మొక్కల మధ్య పోటీని తగ్గించడానికి, ముఖ్యంగా తొలి పెరుగుదల దశల్లో పంట పొలాన్ని కలుపు లేకుండా శుభ్రంగా ఉంచండి.నేలలోని తేమ నష్టాన్ని తగ్గించడానికి, లోతైన నేల తేమ నిల్వలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, దున్నే పనులను నేల పైభాగంలోని 5 సెం.మీ. పొర మట్టి వరకే పరిమితం చేయండి.పంట నాటిన 30 రోజుల తర్వాత,ప్రారంభ పెరుగుదలను ప్రోత్సహించడానికి, ఒత్తిడి పరిస్థితుల్లో మొక్క బలంగా ఉండేలా చేయడానికి, నీటిలో కరిగే ఎరువును (19:19:19 ఎన్పీకే) లీటరు నీటికి 5–7 గ్రాముల చొప్పున రెండుసార్లు ఆకులపై పిచికారీ చేయండి.చీడపీడల నుంచి రక్షణ వ్యూహాలుకరువు పరిస్థితుల్లో తెల్లదోమ, పేనుబంక, నల్లి వంటి రసం పీల్చే పురుగులు తరచుగా కూరగాయల ఉత్పత్తికి ప్రధాన ఆటంకాలుగా మారతాయి. పొడి వాతావరణంలో చాలా శిలీంధ్ర, బాక్టీరియా వ్యాధుల ప్రభావం సాధారణంగా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వాహకాలైన ఈ రసం పీల్చే పురుగుల కార్యకలాపాలు పెరగడం వల్ల వైరస్ వ్యాధులు ప్రబలవచ్చు. తెగుళ్లు, వ్యాధులను సమర్థవంతంగా నిర్వహించడానికి, పంట నష్టాలను తగ్గించడానికి, సకాలంలో పర్యవేక్షణ, మొక్కల రక్షణకు తగిన చర్యలు తీసుకోవండి. సిఫారసు చేసిన సమీకృత తెగులు, వ్యాధి నిర్వహణ పద్ధతులను అనుసరించండి.విత్తన శుద్ధి: రసం పీల్చే పురుగుల నుండి ముందస్తు రక్షణ కల్పించడానికి, విత్తనాలకు ఇమిడాక్లోప్రిడోర్ థియామెథాక్సామ్ను కిలో విత్తనానికి 3–5 గ్రాముల చొప్పున చల్లండి.రసం పీల్చే పురుగుల నివారణకు:- ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్: 0.5 మి.లీ/లీటరు నీటిలో- థియామెథోక్సామ్ 25 డబ్ల్యూజి: 0.35 గ్రా/లీటరు నీటిలో- థియాక్లోప్రిడ్ 21.7 ఎస్సి: 0.65 మి.లీ/లీటరు నీటిలో.నల్లి నివారణకు..- అబామెక్టిన్ 1.9% ఈసీ: 0.5 మి.లీ/లీటరు- స్పైరోమెసిఫెన్ ః 1.0 మి.లీ/లీటరు- క్లోర్ఫెనాపైర్: 1.0 మి.లీ/లీటరు- ప్రోపార్గైట్: 2–3 మి.లీ/లీటరు,- ఫెనాజాక్విన్ 1.9% ఈసీ: 2.5 మి.లీ/లీటరు.వృక్ష, జీవ నియంత్రణకు..- వేప ఆధారిత పురుగుమందులు: 5 మి.లీ/లీటరు నీటిలో- రసం పీల్చే పురుగులపై జీవ నియంత్రణ కారకంగా వెర్టిసిలియం లెకాని: 5 గ్రా/లీటరు నీటిలోపిండి నల్లి నివారణకు..- స్పైరోటెట్రామాట్ 0.5 మి.లీ/లీటరు నీటిలో, లేదా ఇమిడాక్లోప్రిడ్: 0.5 మి.లీ/లీటరు నీటి నిర్వహణలెపిడోప్టెరాన్ గొంగళి పురుగుల నిర్వహణ..- ఇండోక్సాకార్బ్: 0.5 మి.లీ/లీ- ఎమామెక్టిన్ బెంజోయేట్: 0.35 గ్రా/లీ- ఫ్లూబెండియామైడ్: 0.5 మి.లీ/లీ3. ‘మధ్యకాలపు కరువు’ ఉత్పత్తి వ్యూహాలుఅధిక వర్షపాతం సమయంలో నీటి పారుదలని మెరుగుపరచడానికి మరియు నీరు నిలిచిపోవడాన్ని తగ్గించడానికి, గట్లు–కాలువల పద్ధతిలో నాటటం (25–30 సెం.మీ. ఎత్తు గట్లు) లేదా కాలువల ద్వారా నీరు పెట్టేందుకు వీలుగా ఎత్తయిన మడుల(90 సెం.మీ. వెడల్పు, 20 సెం.మీ. ఎత్తు)పై పంటలు వేసుకోండి ∙తేమ కొరత ఏర్పడినప్పుడల్లా, ముఖ్యంగా పంట చురుకైన పెరుగుదల, పూత, కాయల అభివృద్ధి దశల్లో, కీలకమైన పంట పెరుగుదల దశల్లో రక్షక నీటి తడులను అందించండి ∙తేమ, పోషకాలు, సూర్యరశ్మి కోసం పోటీని తగ్గించడానికి, పంట పెరుగుదల తొలి దశల్లో పొలాల్లో కలుపు లేకుండా చూసుకోండి.– డాక్టర్ దండా రాజిరెడ్డి, వైస్ ఛాన్సలర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ, ఉద్యాన విశ్వవిద్యాలయంనిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
జ్వరాన్ని తగ్గించడంలో.. ఉల్లింద పండ్ల ప్రత్యేకత
ఉల్లింద జీనస్లో అనేక రకాల జాతులున్నాయి. అడవి పండ్ల జాతుల్లో ఉల్లింద పండ్లకు ప్రత్యేకత ఉంది. వీటికి ఉన్న ఔషధ గుణాలే అందుకు కారణం. దీనిపై గతంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి.ఉనికి: ఉల్లింద చెట్టు ఉష్ణమండలంలోని చిట్టడవులు, అడవులు, మైదానం ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆకులు రాల్చే తత్వం గలది. ఈ చెట్టు కొన్ని సందర్భాల్లో గొడుగు ఆకారం 6–10 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. ఇంచుమించు అన్నిరకాల నేలల్లో (చౌడు భూములు తప్ప) పెరుగుతుంది. విత్తనం ద్వారానే దీని ప్రవర్ధనం జరుగుతుంది. దీని పండు మొదలు ఆకుపచ్చగా ఉండి, పండినప్పుడు ఆరంజ్–ఎరుపుగా మారుతుంది.దీని స్వస్థలం మధ్య–దక్షిణ ఇండియా, బంగ్లాదేశ్ ఇతర ఉష్ణమండల దేశాలై ఉండవచ్చు. ఇండియాలో మాత్రం దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ (నల్లమల అడవులు), కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, ఒడిషా, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వీటి ఉనికి ఉంది. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉంటుంది. నల్లమల అడవుల్లో ఈ చెట్లు అధికంగానే ఉన్నాయి. అడవి విస్తరించిన అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయి. మొత్తానికి దీనిపై పరిశోధన చెప్పుకున్నంత జరగలేదు.ఉల్లింద ఉపయోగాలు:ఆకులు వగరుగా ఉన్నా మేకలు ఇష్టంగా తింటాయి. ఇది సతత హరితం. కాబట్టి వేసవిలో కూడా ఆకుల లభ్యత ఉంటుంది.పండ్లు వగరు–తీపిని కలబోసినట్లుగా ఉంటాయి. పండ్లు చిన్నవిగా, గుండ్రంగా ఉండి నిగనిగలాడుతుంటాయి. ఈ పండ్లను చక్కెర భీమారి ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు.వంట చెరకుగా ఉపయోగపడుతుంది.వీటి ఆకుల రసం రెండు పూటలా తాగిస్తే విరేచనాలు తగ్గుతాయి.ఈ పండ్లు తింటే అజీర్తి నివారింపబడుతుంది.ఎండిన పూల పొడిని నీటిలో కలిపి తాగించడం వల్ల మూత్రకోశ వ్యాధులు నివారించబడతాయి.ఉల్లిందను సిద్ధ ఔషధంలో విరివిగా వాడతారు.జ్వరాన్ని తగ్గించడంలో ఈ చెట్టుకు మంచి పేరుంది. చెట్టు బెరుడు/మాను పెచ్చులను నానబెట్టి మొక్కలపై చల్లినట్లైతే రసం పీల్చే పురుగుల బెడద నుంచి పంటను రక్షించుకోవచ్చు.నల్లమల అడవులు..నలమల అడవులు ఆవరించిన అన్ని జిల్లాల్లో ఈ చెట్లు ఉన్నాయి. పశువుల కాపరులకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, ఇది ఎప్పుడూ ఆకులతో పచ్చగా ఉండడం వల్ల ఎండాకాలంలో నీడతో ΄ాటు పండ్లు కూడా లభిస్తాయి. సేద తీర్చుకోవటానికి నీడనిచ్చే మంచి చెట్టు.ఈ చెట్లపై లోతైన పరిశోధనలు జరగలేదు. దేశంలో కొన్నిప్రాంతాలకే పరిమితం కావడం ఒక కారణం అయితే ఎక్కువగా అడవుల్లోనే ఇవి ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ఈ పండ్లకు ఔషధ, పోషక విలువలు ఉన్నందు వల్ల లోతైన పరిశోధనల అవసరం ఎంతైనా ఉంది. అట్లే వీటిని ఆగ్రోఫారెస్ట్రీలో భాగం చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉల్లింద పండ్ల చెట్లు ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా అడవుల్లో కూడా ఉన్నాయి. ఈ పండ్లలో పీచు పదార్ధం అధికంగా ఉన్నందున తినే ఆహారం అరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.ఉల్లింద చెట్టు పేర్లు: ఇంగ్లీష్: గ్రీన్ ఎబోని పర్సిమోన్ ఒరియా: బండోడి, గౌర్కస, కొసై కన్నడ: జగలగంటి, నిన్నె, నేన్సి, కరగరి యంతుమర తమిళం: కరువక్కనై, పెరియులిన్సి, వక్కనై తెలుగు: ఇల్లింటు, కవకీమాను, ఉల్లింద, కోషవో, నేల ఇల్మీర, ఇల్లింద, తొరిక, వల్లంజ, పుల్లిండే, పెద్ద ఉల్లింద, పెద్దఉలిని, కాయకిమాను మరాఠీ: నేన్సి, నినై హిందీ: కలటెండు, కిన్నూ. - డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
కమిషన్ లేని ఆన్లైన్ స్టోర్: రైతుల జీవితాల్లో వెలుగులు!
మహారాష్ట్రకు చెందిన ఇద్దరు స్నేహితులు ఐటీ ఉద్యోగాల వైపు వెళ్లకుండా, రైతుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారే అనికేత్ ఘార్గే, జయ్ సిద్ధపురా. వీళ్లిద్దరూ ఇంజనీరింగ్ చదివేటప్పటి నుంచి స్నేహితులు. మధ్యవర్తుల దోపిడీకి గురవుతున్న రైతులను ఆదుకోవటానికి ‘ఇండియన్ ఫార్మర్ ఆంట్రప్రెన్యూర్స్’ (ఐఎఫ్ఈ) స్టోర్ అనే ఆన్ లైన్ మార్కెట్ను 2022లో ప్రారంభి దిగ్విజయంగా నడుపుతున్నారు. కమిషన్ లేని ఆన్లైన్ మార్కెట్ కావటంతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు వీరు ఉత్పత్తులను అమ్మగలుగుతున్నారు. దీంతో రైతుల ఆదాయం రెట్టింపైందని చెబుతున్నారు.సతారాలోని వడగావ్ గ్రామానికి చెందిన అనికేత్ రైతు కుటుంబంలో పుట్టాడు. అతనికి బాల్యం నుంచే వ్యవసాయంపై మక్కువ ఉండేది. కంప్యూటర్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాక, అతను పూణేలోని ఒక వెబ్ డెవలప్మెంట్ కంపెనీలో ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. అయితే, 2017లో అతను ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని, రైతుల కథలను పంచుకోవడానికి తన సొంత యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించాడు. స్కూల్లో చదువుకునే రోజుల నుంచే రైతులతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవాలని అనుకునేవాడిని అంటాడాయన. ప్రస్తుతం ఆయన యూట్యూబ్ ఛానెల్లో సుమారు 2.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, రైతులు మధ్యవర్తుల సహాయం లేకుండా తమ ఉత్పత్తులను అమ్ముకోవటానికి ప్రత్యేకమైన మార్కెట్ దాదాపుగా లేదని అతను గుర్తించి ప్రత్యామ్నాయం వైపు ఆలోచన సారించాడు. వ్యవసాయంపై తనకున్న ఆసక్తిని, టెక్నాలజీ నేపథ్యాన్ని మేళవించి కళాశాల స్నేహితుడైన జయ్తో కలిసి రైతుల కోసం అనికేత్ ఒక ఆన్లైన్ మార్కెట్ప్లేస్ వెబ్సైట్ను ప్రారంభించాడు.సాధారణంగా రైతులు పండించిన పంటను అమ్ముకోవటానికి మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తుంది. వారు దాదాపు 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తూ లాభాలన్నీ తామే గడిస్తున్నారు. ఫలితంగా రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ‘ఐఎఫ్ఈ స్టోర్’ ఎలాంటి కమిషన్ లేకుండా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి, మధ్యవర్తుల బెడదను తొలగించడానికి సహాయపడుతోంది.రైతులు పండించిన ఆర్గానిక్ పంటలతో పాటు బెల్లం క్యాండీలు, పసుపు పొడి, మిల్లెట్ ఉత్పత్తులు, పచ్చళ్లు, మసాలాలు వంటి దాదాపు 25 రకాల విలువ ఆధారిత ఉత్పత్తులను ఈ వెబ్సైట్లో ఉంచుతారు. అనికేత్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులను సంప్రదించి, వారి పొలాలను సందర్శించి, ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ ఉన్న ఉత్పత్తులను సేకరిస్తారు. కేవలం రూ.10 ప్యాకేజింగ్ ఖర్చు మినహా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు. ఈ విధానం వల్ల కేవలం ఏడాది కాలంలోనే రైతుల ఆదాయం రెట్టింపు అయింది.మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతులకు చెందిన ఉత్పత్తులు ఈ ఆన్ లైన్ మార్కెట్ ద్వారా ఇప్పుడు గుజరాత్, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా 15కు పైగా రాష్ట్రాల్లోని వినియోగదారులకు చేరుతున్నాయి. కొరియర్ సేవల పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తూ వీరు ముందుకు సాగుతున్నారు. తల్లిదండ్రులు ఐటీ ఉద్యోగం చేయాలని కోరినప్పటికీ, అనికేత్ తన అభిరుచిని నమ్ముకుని సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల రైతులను ఈ వేదికపైకి తీసుకురావడమే వీరి లక్ష్యం. టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగిస్తే రైతుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఈ ఇద్దరు స్నేహితులు నిరూపించారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఐఐఎంఆర్లో చిరుధాన్య విత్తనాలు
ఎల్నినో నేపథ్యంలో తక్కువ నీటితో, అధిక ఉష్ణోగ్రతల్లోనూ మంచి దిగుబడిని ఇవ్వగలిగే సీ4 పంటలే చిరుధాన్య పంటలు. ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలి వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యల నివారణకు చిరుధాన్యాల ఆహారమే ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారిన విషయం తెలిసిందే. దేశంలో చిరుధాన్యాల సాగును మరింత విస్తరింపజేసేందుకు హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ఐసీఏఆర్ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐఐఎంఆర్) కృషి చేస్తోంది. రైతులు మంచి దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు వాడటం ఎంతో ముఖ్యం.ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో విత్తుకోవటానికి అనువైన నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాలను హైదరాబాద్ రాజేంద్రనగర్లోని తమ ప్రధాన కార్యాలయం నుంచి రైతులు నేరుగా కొనుగోలు చేయొచ్చని ఐసీఏఆర్–ఐఐఎంఆర్ సంచాలకులు డాక్టర్ తార సత్యవతి ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.జొన్న, సజ్జ, రాగు, కొర్ర, అరికె, సామ, ఒరిగ వంటి అన్ని రకాల చిరుధాన్యాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఐఐఎంఆర్ విత్తన శాస్త్రవేత్త డాక్టర్ సూగన్న తెలిపారు. అన్ని రకాల చిరుధాన్య విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. సూటి రకం పచ్చజొన్న, కొర్ర (సూర్యనంది) విత్తనాలు అధిక మొత్తంలో ఉన్నాయన్నారు. తెల్లజొన్న హైబ్రిడ్ రకాల విత్తనాలు కూడా తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.జొన్న వంటి పెద్ద గింజ చిరుధాన్యాలు ఎకరానికి 3 కిలోల విత్తనం అవసరం. కొర్ర వంటి చిన్న గింజ చిరుధాన్యాలు ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుందని డా. సూగన్న ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థకు స్వయంగా వచ్చి రైతులు విత్తనాలు కొనుక్కోవాల్సి ఉంటుంది. అదనపు సమాచారం కోసం 040–24599305 నంబరులో పని దినాల్లో ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 4 గం. మధ్య సంప్రదించవచ్చు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం నంద్యాల, విజయనగరం, పాలెం, రాజేంద్రనగర్లోని పీజేటీఏయూలలో కూడా చిరుధాన్యాల విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
వాన నీరు ఇంకిస్తే చాలు!
ఎల్ నినోతో రుతుపవనాలు అస్తవ్యస్థంగా మారుతున్న పరిస్థితుల్లో బోర్వెల్స్ కింద వ్యవసాయం చేసే రైతులు వాన నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేసుకునే పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకే దానికంటే ఎక్కువ నీటిని తోడటం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు అడుగంటాయి. అనేక ప్రాంతాల్లో 200 నుంచి 400 మీటర్ల (650–1300 అడుగుల) లోతు వరకు కూడా బోర్వెల్లు, ట్యూబ్వెల్లు తవ్వడం సర్వసాధారణమైంది. భూగర్భ జలాల లభ్యత రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. భూమిలోకి తగినంత వాన నీటిని ఇంకింపజేసే (రీఛార్జ్) ప్రయత్నాలు చెయ్యకుండా భూగర్భ జలాలను నిరంతరం ఎక్కువగా తోడుతుండటమే సమస్య. బోరుబావులు నిత్యం జలకళతో కళకళలాడాలంటే వాటి దగ్గర రీఛార్జ్ గుంతలు లేదా నీటి కుంటలు నిర్మించుకోవటం మేలు అంటున్నారు నిపుణులు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని భూగర్భంలో గట్టి రాతి జల పొరలు విస్తరించి ఉన్నాయి. మట్టి కింద 5 నుంచి 15 మీటర్ల లోతు వరకు రాతి పొరలు ఉంటాయి. నీటిని ఎక్కువగా నిల్వ చేయగల సామర్థ్యం ఈ పొరలకే ఉంటుంది. రాతి సమూహాల మధ్య ఉండే పగుళ్లు భూగర్భ జలాల నిల్వకు, కదలికలకు దోహదపడతాయి. ఒక బోర్వెల్ ద్వారా రీఛార్జ్ అయ్యే వర్షపు నీటి పరిమాణం, అక్కడి భూగర్భంలోని జల పొరల లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. రాళ్లలో పగుళ్లు, చీలికలు బాగా ఉంటే బోర్వెల్స్ ద్వారా ఎక్కువ వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకుతాయి. కొన్నిసార్లు, ఈ పగుళ్ల అనుసంధానం చాలా పరిమితంగా ఉంటే వాన నీరు ఇంకే సామర్థ్యం తక్కువగా ఉండవచ్చు. సాధారణ వాన నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా సుమారు 15% మాత్రమే భూగర్భంలోని పైపైన ఉండే నీటి పొరల్లోకి ఇంకుతోంది. సుమారు 20–40% ఆవిరైపోవచ్చు. లోతైన భూగర్భ జల పొరలు తిరిగి నిండటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. తక్కువ కాలం పాటు కురిసే భారీ వర్షాలను ఈ నిర్మాణాలు సమర్థవంతంగా సంగ్రహించలేకపోవచ్చు. ఇటీవలి కాలంలో లోతైన బోర్వెల్లను రీఛార్జ్ చేయడానికి, వాటి దిగుబడిని పెంచడానికి, సహేతుకంగా తక్కువ ఖర్చుతో ‘బోర్వెల్ రీఛార్జ్’ అనే పద్ధతి ఒక సమర్థవంతమైన విధానంగా ఆవిర్భవించింది.ఎండిన బోర్లకు తిరిగి జలకళఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దమగట్ల గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి తనకున్న రెండు ఎండిపోయిన బోరుబావులకు చుట్టూ వాన నీరు ఇంకేలా రీఛార్జ్ గుంతను నిర్మించారు. దీంతో ఆ బోరుబావులు వర్షపు నీటిని 70% వరకు భూమి లోపలికి ఇంకింపజేశాయి. ఆ బోర్లు తిరిగి జలకళను సంతరించుకున్నాయి. రోజంతా అపరిమితంగా నీటిని అందించడం ప్రారంభించాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి ఇప్పటికే ప్రచారం చేస్తున్న ఈ ప్రగతిశీల రైతు, బోర్ రీచార్జ్ గుంత ద్వారా నీటి భద్రత పొందటంపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నందికొట్కూరు చుట్టుపక్కల ప్రాంతం అంతా ఈ పద్ధతి ద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి అనువైన ప్రాంతమని తమ పరిశీలనలో తేలిందని వాటర్ అండ్ లైవ్లిహుడ్స్ ఫౌండేషన్ (డబ్ల్యూఎల్ఎఫ్) వ్యవస్థాపకులు డా. రామ్మోహన్ అన్నారు. నీటి కుంటలతో బోర్ల రీఛార్జ్నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం, దాని పరిసర ప్రాంతాల్లో వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటల సాగు పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. బోరుబావులు విఫలమైనప్పుడు, వారు అధిక ఖర్చుతో రైతులు కొత్త బోరుబావులను వేయిస్తుంటారు. ప్రత్యక్ష రీఛార్జ్ ప్రయోజనం కోసం బోరుబావులకు దగ్గరగా వర్షపు నీటి నిల్వ కుంటలను నిర్మించుకుంటే భూమిలోకి నీరు బాగా ఇంకుతుందని డబ్ల్యూఎల్ఎఫ్ చెబుతూ రైతుల ఆలోచనా విధానంలో మార్పు తెస్తోంది. ఉన్న బోరుబావులను కాపాడుకోవడానికి బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించుకోవటానికి గత 2–3 సంవత్సరాలుగా చిన్న రైతులకు తోడ్పాటునందిస్తోంది. రైతులు తమ వంతుగా కొంత మొత్తం చెల్లిస్తే పొలంలో బోరుకు దగ్గరగా నీటి కుంటను ఏర్పాటు చేయిస్తోంది. తమ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని, ఇప్పటివరకు 74 మంది రైతులు వర్షపు నీటి కుంటల నిర్మాణంతో లబ్ది పొందారని డా. రామ్మోహన్ తెలిపారు. బోరుకు 5 అడుగుల దూరంలో నీటి కుంట తవ్వుకుంటే బోరు నిండుగా నీరు పోస్తోందని నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అ΄్పాయిపల్లి గ్రామానికి చెందిన రైతు మార్కం రాములు యాదవ్ తెలిపారు. ఈ కుంటలో భవిష్యత్తులో చేపలు కూడా పెంచుతానన్నారు. 70% వాననీటి సంరక్షణబోర్వెల్ చుట్టూ వాన నీటి రీఛార్జ్ గుంతల నిర్మాణం, బోర్లకు దగ్గర్లో వ్యవసాయ చెరువుల నిర్మాణం వంటి పద్ధతులు కొద్దిపాటి వర్షం కురిసినా భూగర్భ జలాల పెంపుదలకు ఉపయోగపడతాయి. ఎల్నినో గడ్డు కాలాన్ని తట్టుకోవటానికి ఇవి ప్రభావశీలంగా పనిచేస్తాయి. పొలంలో కురిసిన వర్షపు నీటిలో 30 నుంచి 70% వరకు రీఛార్జ్ చేయడానికి వీలుంది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, బోరుబావిలో నీటి మట్టం తక్షణమే పెరుగుతుంది. స్థానికంగా లభించే వస్తువులతో బోర్ రీఛార్జ్ గుంతలను, బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించవచ్చు. ఇవి సాపేక్షంగా చౌకైనవి. రైతులు సులభంగానే వీటిని నిర్వహించుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో రైతుల అనుభవాలు ఈ విషయాన్ని నిర్థారిస్తున్నాయి.– డా. ఆర్. రామ్మోహన్ (94401 94866), భూగర్భ జల నిపుణులు, వాటర్ అండ్ లైవ్లిహుడ్స్ ఫౌండేషన్, సికింద్రాబాద్నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
ఆల్–ఇన్–వన్ లిక్విడ్ ఫెర్టిలైజర్..
సేంద్రియ ఇంటిపంటలు, మిద్దె తోటల పెంపకంలో నిరంతర పోషణ ముఖ్యమైన విషయం. ఇందుకు ఉపయోగపడే ద్రావణం ఆల్–ఇన్–వన్ లిక్విడ్ ఫెర్టిలైజర్. ఇది అన్ని మొక్కలకూ ఉపయోగపడుతుంది. పొటాషియంతో పాటు ఇతర పోషకాలను కూడా అందిస్తుంది.1. ఒక బకెట్లో 2–3 లీటర్ల బియ్యం కడిగిన నీటిని తీసుకొని అందులో 4–5 అరటి తొక్కలు, రెండు గుప్పిళ్ల ఉల్లిపాయ పొట్టు వేయాలి.2. ఈ మిశ్రమాన్ని 2–3 రోజులు నీడలో ఉంచాలి (రోజూ ఒకసారి కలపాలి). 3. మూడు రోజుల తర్వాత ఆ నీటిని వడకట్టి, ఒక వంతు ద్రావణానికి రెండు వంతుల సాధారణ నీటిని కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.4. గులాబీ, మందార లాంటి పువ్వులు మొక్కలు మొగ్గలు వచ్చే సమయంలో పైన చెప్పిన అరటి తొక్కల నీటిని వారానికి ఒకసారి ఇస్తే పూలు పెద్దవిగా పూస్తాయి. 5. టమోటా, మిర్చి, బెండ లాంటి కూరగాయ మొక్కలు పూత, పిందె మీద ఉన్నప్పుడు ఈ ఎరువు ఇస్తే కాయలు రాలిపోకుండా బలంగా పెరుగుతాయి. 6. ఆకుకూరలకు పొటాషియం కంటే నత్రజని (నైట్రోజన్) ఎక్కువ అవసరం. కాబట్టి, వీటికి బియ్యం కడిగిన నీరు లేదా పప్పులు కడిగిన నీరు సరిపోతుంది.7. ఇండోర్ ΄్లాంట్స్కు నెలకు ఒకసారి మాత్రమే చాలా తక్కువ పరిమాణంలో ఈ ఆల్–ఇన్–వన్ ద్రవ ఎరువును ఇవ్వాలి.8. ద్రవ ఎరువులు తయారు చేసిన 3–4 రోజుల్లోనే వాడేయాలి. ఎక్కువ రోజులు ఉంచితే వాసన వస్తుంది.9. ఎరువు వేసే ముందు మొక్క మొదల్లో మట్టి కొంచెం తేమగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఎరువులను ఉదయం పూట లేదా సాయంత్రం ఎండ తగ్గాక మాత్రమే వేయాలి. ఎండలో వేయకూడదు.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఈత చెట్టు.. కల్లు, పండ్లకే కాకుండా విలువాధారిత..
ఈత చెట్టు రూపురేఖలు ఖర్జూరపు చెట్టుకు అతి దగ్గరగా ఉంటాయి. పుష్పించే విధానం, పండ్ల గుత్తులూ ఒకేలాగ ఉంటాయి. ఈ చెట్టు తెలియని వారుండరు. తరతరాల నుండి గుర్తున్న చెట్లల్లో ఈత చెట్టు ఒకటి. పల్లెవాసులకే కాకుండా పట్టణవాసులకూ సుపరిచితమైన చెట్టు ఈత. దీని ఔషధ విలువల వల్ల ఈ చెట్టుకు చాలా ప్రాచుర్యమున్నది. దీన్ని ‘సిల్వర్ డేట్ పాం’ అని కూడా పిలుస్తుంటారు.ఉనికి..ఈ చెట్టు సుమారు 4 నుండి 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. పూత–కాత మాత్రం కొంత అటు–ఇటు అయినా (పరిస్థితులను బట్టి) ఏప్రిల్ నుండి ఆగష్టు మధ్య ఉంటుంది. తేమ ఎక్కువగా ఉన్న నేలల్లో పెరుగుతుంది. అట్లని ఇతర నేలల్లో రాదని కాదు. ఈత పల్లపుప్రాంతాల్లో కూడ వస్తుంది. ఎక్కువగా వాగులు, వంకలు ఉన్న దగ్గర పెరుగుతుంది. వీటి స్వస్థలం దక్షిణ పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, మైన్మార్, బంగ్లాదేశ్, మారిషస్, చగోస్ ఆర్చిపిలాగై, పుర్టోరికో, ‘లీవర్డ్ ఐలాండ్’లు.ఈత చెట్టు సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తువరకు ఉండే ప్రాంతాలలో కూడా రాగలదు. దీని కాయలు ఆకు పచ్చరంగులో ఉండి పక్వానికి వచ్చిన తరువాత పసుపు రంగుకు, పండుగా మారినప్పుడు కాషాయ రంగుకు మారతాయి. ఈత చెట్లు దేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటి జీవితకాలం దాదాపు 40–60 సంవత్సరాలు. కానీ కల్లు గీసే చెట్లు త్వరగా చనిపోతాయి. ఈత చెట్లపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.ఉపయోగాలుఈత ఆకులతో రకరకాల వస్తువులను తయారు చేస్తారు. చాలా మందికి ఇది ఉపాధి కూడా (చాపలు, ఈత పొరకలు, చిన్న చిన్న ఆట వస్తువులు)గుడిసెల పైకప్పుకు ఈ ఆకులను ఉపయోగిస్తారు.మొగిలోన పిండి పదార్థం రుచిగా ఉంటుందని గ్రామస్తులు దాన్ని సేకరించి వాడుతారు. మొగి తీయడం వల్ల చెట్టు చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ మొద్దును రెండుగా చీల్చి మధ్యన ఉన్న భాగాన్ని తీసి అనేక విధాలుగా వాడుతారు. (ఉ: చిన్న చిన్న కాలువలు దాటటానికి అడ్డంగావేస్తారు. దానిపై కాలినడక సాగిస్తారు. పందిళ్లకు పోల్స్గా వాడుతారు.ప్రధానంగా ఈత చెట్టు నుండి ‘నీరా, కల్లు’ తీస్తారు. ఉదయం సూర్యోదయం కాకముందు చెట్టు నుండి తీసేది ‘నీరా’. ఆ తర్వాత నీరా పులిసి కల్లుగా మారుతుంది. నీరాకు మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది.నీరాను సేవించడం వల్ల కిడ్నీలోని రాళ్ళు కరిగి పోతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం.నీర నుండి ‘ఈత బెల్లాన్ని’ తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు అంటారు.ఈత పండ్లు రుచిగా ఉంటాయి.ఈత పండ్ల నుండి జామ్, జల్లి వంటి విలువ ఆధారిత పదార్ధాలను తయారు చేస్తారు.ఈ పండ్లు తినడం వల్ల బ్యాక్ పెయిన్, పిరుదులపై కండరాలు పట్టినట్లు ఉంటే తగ్గుతాయి. (ఇవి టానిక్ లా పనిచేస్తాయి).పండ్లు కూడా ఎన్నో పోషక విలువలు కలవి.చెట్లను ల్యాండ్ స్కేపింగ్లో అందం కోసం నాటుతారు.వేర్లను పండ్ల నొప్పులను, నర్వస్ డెబిలిటీ, హెల్మింథియాసిస్ జబ్బులను నయం చేయటానికి ఉపయోగిస్తారు.నీరాను ఎండకాలంలో తాగితే చలువ చేకూర్చుతుంది. ఇందులో కూడా అనేక పోషక విలువలున్నవి.ఔషధంగా ఈతకు ప్రత్యేకత ఉంది. ఉదర సంబంధిత జబ్బులు, జ్వరాలు, మూర్ఛ, అజీర్తి, హృదయ సంబంధిత జబ్బులను నయం చేయటంలో ఈత నీరా గాని, బెల్లంగాని, మొగి గాని వాడుతారు.నీరాలోని ఇనుము వంటి సూక్ష్మపోషకాలు, బి12 వంటి విటమిన్లు రోగులకు చాలా మంచిది. రెగ్యులర్ గా సేవిస్తే వారిలో రక్తశుద్ధి జరిగి హిమోగ్లోబిన్ పెరుగుతుంది.పండ్లలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల పటుత్వానికి దోహద పడుతుంది.ఈతకు పెద్ద ఈత, ఈత అని రెండు పేర్లున్నాయి. ఇంగ్లిష్: వైల్డ్ డేట్ పాం, డేట్ సుగర్ పాం, ఇండియన్ వైల్జ్ డేట్, ఇండియన్ వైన్ పామ్ అస్సామీ: ఖాజురి;ఉర్దూ: ఖాజర్;ఒరియా: ఖర్జుర్;గుజరాతీ: ఖజ్జార్, ఖజా; కన్నడ: ఇచలు;తమిళంలో: ఇచం, పేరియా, ఇలచం;బెంగాలీ: ఖర్జూర, ఖఝూర్; పంజాబీ: ఖజుర్;మణిపురి: తంగటప్; మరాఠీ: సెండి, బైచంగ్, ఖర్జూర్, షిండ్రీ, షింధీ;మలయాళం: కట్టింతా, కట్టింతై, నీలన్ తెంట్ హిందీ: ఖజూర్;సంస్కృతం: ఖర్జూరహా, ఖర్జూర్ నేపాలీ: ఖండేలా, ధడ అంటారు.నల్లమల అడవులు:నలమలప్రాంతంలో ఈత చెట్లు ఉన్నాయి. ఇవి అంది నేలల్లో (చౌడు నేలల్లో) కూడా ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్నాయి. అడవిలోని సెలయేర్లు/వంకలు/ డొంకల దగ్గర ఉన్న వాటిలో పోషక విలువల్లో వ్యత్యాసం ఉండవచ్చు. కాబట్టి వీటిపై పరిశోధన చేపట్టి కొత్త వంగడాల అన్వేషణ మొదలు కావలసిన అవసరం ఎంతైనా ఉంది.ఈ చెట్టు కల్లు, పండ్లకే కాకుండా విలువాధారిత ఉత్పత్తులపై శోధించగలితే ఎంతో లాభసాటిగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఈత వనాలతో ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే కొందరు ఈత వనాలు పెంచి కేవలం నీరా–కల్లు కోసమే ఉపయోగిస్తున్నారు. ఈత చెట్లు తెలుగు రాష్ట్రాల్లోని అడవుల్లో కూడా ఉన్నాయి.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
నిలకడైన రొయ్యల సాగు.. కొన్ని మార్గదర్శకాలు!
రొయ్యల సాగు రంగం ప్రస్తుతం అధిక ఉత్పత్తి వ్యయం, వ్యాధులు, నాణ్యత లేని సీడ్, మేత ధరలు, విద్యుత్ ఛార్జీల వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటువంటి సంక్షోభ సమయంలో పంట విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించడం శాశ్వత పరిష్కారం కాదు. దీనివల్ల మౌలిక సదుపాయాల నష్టం, కార్మికుల కొరత, మార్కెట్ నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, శాస్త్రీయ నిర్వహణతో సాగు విధానాన్ని మార్చడమే నిజమైన పరిష్కారం.ఉత్పత్తి కాదు లాభమే లక్ష్యంఅధిక స్టాకింగ్ సాంద్రత వ్యాధులు, ఒత్తిడి, మరణాల రేటును పెంచుతుంది. 90% సర్వైవల్తో మధ్యస్థ దిగుబడి సాధించిన రైతు, 65% సర్వైవల్తో అధిక దిగుబడి సాధించిన రైతు కంటే ఎక్కువ లాభం పొందగలడు. కాబట్టి ‘తక్కువ సాంద్రత – ఎక్కువ సర్వైవల్’ విధానమే ఉత్తమం.నాణ్యమైన సీడ్ – నీటి నిర్వహణనాణ్యత లేని చౌక సీడ్ చివరికి భారీ నష్టాలకు కారణమవుతుంది. విశ్వసనీయ హేచరీల నుంచి జన్యుపరంగా నాణ్యమైన సీడ్ను ఎంపిక చేయాలి. అలాగే వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే, మూడు దశల నీటి రిజర్వాయర్ వ్యవస్థ ద్వారా ముందస్తు నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు నచ్చిన లాబ్లలో నాణ్యతా పరీక్షలు చేయించుకొని సీడ్ చెక్ చేసుకోవాలి.ఖర్చుల నియంత్రణమేత సాగులో అత్యధిక వ్యయం. ఫీడ్ ట్రేల ద్వారా మేత వినియోగాన్ని నిరంతరం పరిశీలించి, సరైన ఫీడ్ కన్వర్షన్ రేషియో సాధించాలి. అధిక సామర్థ్యం గల ఎయిరేటర్ల వినియోగం, శాస్త్రీయ ఎయిరేటర్ల ప్రణాళిక ద్వారా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చు. అవకాశమున్నచోట్ల సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేసుకోవాలి. సాగు ప్రాంతాల ప్రత్యేకతలుసముద్రపు ఉప్పు నీటితో సాగు చేసే ప్రాంతాల్లో సర్వైవల్ రేట్, షెల్ బలంగా ఉండి, ఖనిజాల ఖర్చు తక్కువగా ఉంటుంది. బోర్ నీరు లేదా మంచినీటి ప్రాంతాల్లో ఖనిజాల లోపం, అధిక ఎయిరేషన్ అవసరం వల్ల ఉత్పత్తి వ్యయం సుమారు 10–15% పెరుగుతుంది. సరైన ఖనిజ నిర్వహణ, నీటి నాణ్యత పర్యవేక్షణతో ఈ సమస్యలను అధిగమించవచ్చు.భద్రత, క్రమశిక్షణ, వ్యూహంపీతలు వంటి జీవులు రాకుండా చెరువు చుట్టూ కంచె (పీతలఫెన్సింగ్), బర్డ్ నెట్టింగ్, క్రిమిసంహారకాలతో పరికరాల శుద్ధి వంటి బయో సెక్యూరిటీ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. చెరువులను సత్వరం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పొందే అవకాశముంది. దైనందిన ఖర్చుల రికార్డులు నిర్వహించడం ద్వారా అనవసర రసాయనాల వినియోగాన్ని తగ్గించవచ్చు. మార్కెట్ ధరల హెచ్చు తగ్గులను ఎదుర్కోవడానికి పంట ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవడం, రైతు సహకార సంఘాల ద్వారా విక్రయాలు నిర్వహించడం ప్రయోజనకరం.సమూహ సాగు విధానంఒంటరిగా సాగు చేయడం కంటే, ఒకేప్రాంతంలోని రైతులంతా ఒక సమూహంగా (క్లస్టర్గా) ఏర్పడి సాగు చేయడం వల్ల పెట్టుబడి తగ్గి, లాభాలు పెరుగుతాయి. దీని వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:క్లస్టర్లోని రైతులంతా కలిసి నాణ్యమైన సీడ్, మేత, మినరల్స్ను పెద్ద మొత్తంలో ఒకేసారి ఆర్డర్ చేయడం ద్వారా కంపెనీల నుండి భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.నీటి శుద్ధి కోసం ఒకే పెద్ద రిజర్వాయర్ వ్యవస్థను, ఉమ్మడి ల్యాబ్ సౌకర్యాలను, పవర్ బ్యాకప్ కోసం పెద్ద జనరేటర్లను క్లస్టర్ తరఫున ఏర్పాటు చేసుకోవచ్చు.క్లస్టర్లోని రైతులంతా ఒకే పద్ధతిలో, ఒకే సమయంలో చెరువులు ఎండబెట్టడం, సీడ్ స్టాకింగ్ చేయడం, పంటను తీయడం చేయాలి. దీని వల్ల ఒకరి చెరువు నుండి మరొకరి చెరువుకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం 80% వరకు తగ్గుతుంది.వ్యాపారులతో లేదా ఎగుమతిదారులతో మాట్లాడేటప్పుడు ఒంటరి రైతుకంటే, ఒక సమూహంగా ఎక్కువ టన్నుల రొయ్యలను ఒకేసారి ఆఫర్ చేసినప్పుడు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. దళారుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది.ప్రభుత్వం లేదా ఆక్వా సొసైటీలు (ఉదాహరణకు ఎన్ఏసీఎస్ఏ వంటి సంస్థలు) అందించే సబ్సిడీలు, ఉచిత విద్యుత్ రాయితీలు, శిక్షణా తరగతులు క్లస్టర్ లేదా కో–ఆపరేటివ్ రూపంలో ఉన్న రైతులకు చాలా సులభంగా అందుతాయి.రైతులకు అదనపు సూచనలుప్రోబయోటిక్స్, ఎంజైమ్స్చెరువు అడుగు భాగంలో పేరుకు΄ోయే వ్యర్థాలను తొలగించడానికి, హానికర బ్యాక్టీరియాను అరికట్టడానికి మంచి నాణ్యత గల ప్రోబయోటిక్స్ను క్రమం తప్పకుండా వాడాలి. ఇది రొయ్యల జీర్ణశక్తిని పెంచి, వాటిలో వ్యాధుల నిరోధకతను మెరుగుపరుస్తుంది.క్రమం తప్పకుండా శాంప్లింగ్వారానికి కనీసం ఒకసారి రొయ్యల బరువును, వాటి మొప్పల రంగును, ఆరోగ్యాన్ని పరీక్షించాలి. దీనివల్ల రొయ్యలు ఎంత మేత తింటున్నాయో అర్థమవుతుంది. తద్వారా మేత వృథాను అరికట్టి, ఎఫ్.సి.ఆర్ని అదుపులో ఉంచుకోవచ్చు.విద్యుత్ బ్యాకప్ఎయిరేటర్లు నిరంతరం పనిచేయడం రొయ్యల మనుగడకు అత్యంత ముఖ్యం. పవర్ కట్ అయినప్పుడు ఎయిరేటర్లు ఆగి΄ోతే, ఆక్సిజన్ తగ్గి రొయ్యలు చని΄ోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఖచ్చితంగా జనరేటర్ లేదా సోలార్ బ్యాకప్ వ్యవస్థను సిద్ధంగా ఉంచుకోవాలి.వ్యర్థాల తొలగింపుచెరువు అడుగు భాగంలో పేరుకు΄ోయిన వ్యర్థాలను చేయడం లేదా ఎప్పటికప్పుడు తొలగించడం చాలా ముఖ్యం. ఇది అమోనియా సమస్యను తగ్గించి, నీటినాణ్యతను కాపాడుతుంది.రైతులతో నెట్వర్కింగ్రొయ్యల సాగులో వస్తున్న కొత్త టెక్నాలజీలు, మందుల వాడకం, మార్కెట్ పరిస్థితులపై అవగాహన కోసం స్థానిక విజయవంతమైన రైతులు లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారాన్ని పంచుకోవడం వల్ల కష్టసమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.వాతావరణ మార్పులపై అప్రమత్తతవర్షాకాలం లేదా వాతావరణం మారినప్పుడు నీటి ఉష్ణోగ్రత, పీహెచ్ స్థాయిలు అకస్మాత్తుగా మారవచ్చు. ఈ సమయంలో నీటి పారామీటర్లను రోజుకు రెండుసార్లు పరీక్షించి, అవసరమైన మినరల్స్ లేదా బఫర్స్ను అందించడం వల్ల రొయ్యలకు ఒత్తిడి కలగకుండా చూడవచ్చు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా రైతులకు నష్టభయం తగ్గి, సాగులో స్థిరమైన దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.రొయ్యల సాగు భవిష్యత్తు అధిక ఉత్పత్తిలో కాదు, అధిక సర్వైవల్తో స్థిరమైన లాభాల్లో ఉంది. నాణ్యమైన సీడ్, సమర్థవంతమైన నీటి నిర్వహణ, సమతుల్య స్టాకింక్ సాంద్రత, బయోసెక్యూరిటీ, ఖర్చు నియంత్రణ, శాస్త్రీయ నిర్వహణను అవలంబించినప్పుడే రైతులకు దీర్ఘకాలికంగా లాభదాయకమైన, స్థిరమైన రొయ్యల సాగు సాధ్యమవుతుంది. నిరాశ వద్దు.. నిలకడైన సాగే మన ముందడుగు!- డా. పొన్నపల్లి రామమోహన్ రావు (98851 44557) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ (రిటైర్డ్), కాకినాడనిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సాగుబడి: ‘బయో’ విత్తన పూతతో 25% అధిక దిగుబడి!
పంటల సాగులో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలను పరిష్కరించటానికి తెలివైన ఏకైక మార్గం, రసాయనాలతో కాకుండా, సహజ సిద్ధమైన పదార్థాల పూతతో కూడిన విత్తనాలను వినియోగించటమేనని హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఐఐఓఆర్) శాస్త్రవేత్తలు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.సాధారణ విత్తనాలు వేసుకొని పంటలు మొలకెత్తాక తలెత్తే సమస్యలను పరిష్కరించుకునే పిచికారీలు చెయ్యటం కన్నా.. విత్తనం వెయ్యటనికి ముందే తెలివిగా అనేక రకాల రక్షణ కల్పించే పదార్థాలతో విత్తనాలకు పూత పూసి విత్తుకోవటం ఎంతో తెలివైన పద్ధతి అని ఐఐఓఆర్ కీటక శాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.డి. ప్రసాద్, వ్యవసాయ రసాయనాల నిపుణురాలు డాక్టర్ కేఎస్వీపీ చంద్రిక ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. చెప్పటమే కాదు.. చాలా ఏళ్లు శ్రమించి రసాయనాలు లేని సహజ పద్ధతిలో రొయ్యల పొట్టు నుంచి తీసిన కైటోసాన్ అనే నాచురల్ బయోపాలిమర్ పదార్థంతో అద్భుతమైన విత్తన పూత పద్ధతిని ఆవిష్కరించి పేటెంట్ అందుకున్నారు. బయోపాలిమర్–ఆధారిత బహుళ పొరల స్మార్ట్ సీడ్ కోటింగ్ టెక్నాలజీగా దీన్ని చెబుతారు. ఐసీఏఆర్ రూపొందించిన అత్యంత ఆశాజనకమైన ఆవిష్కరణలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందటం విశేషం.ఈ సాంకేతికతను రూ. 25 లక్షలతో కొనుగోలు చేసిన మూడు కంపెనీలు నాచురల్ బయోపాలిమర్ ద్రావణాన్ని రైతులకు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయని, రాజేంద్రనగర్లోని తమ కార్యాలయంలో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయని డా. ప్రసాద్, డా. చంద్రిక తెలిపారు. ఈ ద్రావణాలను రైతులు కొనుగోలు చేసి తమ దగ్గరున్న సాధారణ విత్తనాలకు పూత పూసి అప్పటికప్పుడే నిమిషాల్లో విత్తుకోవచ్చు లేదంటే ఈ పూతలు పూసిన విత్తనాలనే కొనుగోలు చేసి విత్తుకోవచ్చు. ఏ పంటల విత్తనాలకైనా ఈ ద్రావణంతో పూత పూసి విత్తుకోవచ్చని వారు వివరించారు.25% అధిక దిగుబడిరక్షక మందులతో పూత పూయని సాధారణ విత్తనాలు విత్తుకుంటే పంటకు తొలి దశలోనే నానా ఇబ్బందుల వస్తాయి. మొలక శాతం తగ్గుతుంది. చీడపీడలు తొలి దశలోనే చుట్టుముడతాయి. అయితే, విత్తనానికి అవసరమైన పూతలు పూసి విత్తుకుంటే ఈ సమస్యలు ఉండవు కాబట్టి కనీసం 25% వరకు అధిక దిగుబడి సాధ్యమేనని గత రెండేళ్లుగా అనేక పంటల్లో రుజువైందని డా. ప్రసాద్, డా. చంద్రిక వివరించారు.శిలీంధ్రనాశకాలు, కీటకనాశకాలు, సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను విడివిడిగా పంటలపై వాడటానికి బదులుగా.. వీటన్నిటినీ ప్రత్యేకంగా రూపొందించిన పద్ధతిలో విత్తనాలకు పూతలుగా లేపనం చేసి విత్తుకుంటే చాలు. విత్తన పూతలు పంటలను బెట్ట నుంచి, పోషక లోపాల నుంచి, చీడపీడల నుంచి విత్తిన రెండు నెలల వరకూ రక్షిస్తాయని తెలిపారు.వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం రాంపూర్లో 24 మంది వేరుశనగ రైతులు గత మూడేళ్లుగా బయోపాలిమర్ పూత పూసిన విత్తనాలు వాడి ఎకరానికి 3 క్వింటాళ్ల దిగుబడి పెంచుకున్నారు. రసాయనిక ఎరువుల వాడకం 20% తగ్గింది. 2 నీటి తడులు తగ్గాయి. పురుగుమందుల అవసరం సగానికి సగం తగ్గింది. ఆకుమచ్చ తగ్గటంతో వేరుశనగ చొప్ప పశుగ్రాసంగా చక్కగా ఉపయోగపడుతోందని రైతులు చెప్పారు.విత్తన పూతలతో ప్రయోజనాలు∙పోషకాలను అధిక సామర్థ్యంతో వినియోగించుకోవటం ∙పురుగుమందుల వినియోగ సామర్థ్యం మెరుగుపడటం ∙రసాయనిక ఎరువులు, పురుగు/తెగుళ్ల మందులు నేల, నీటి ద్వారా వృథా కావటం తగ్గుతుంది ∙విత్తన పూతలోని మేలుచేసే సూక్ష్మజీవులు మొక్క వేర్ల దగ్గర మొలక దశ నుంచే పెరుగుతూ రక్షణ కల్పిస్తాయి ∙ఎరువుల అవసరం తగ్గుతుంది. పురుగు/తెగుళ్ల మందుల పిచికారీలు తగ్గుతాయి ∙దిగుబడితో పాటు రైతుకు నికరాదాయం పెరుగుతుంది ∙పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.సహజ విత్తన పూతతో పంటకు సమగ్రమైన రక్షణ!అస్తవ్యస్తమైన వర్షపాతం, దీర్ఘకాలిక కరువులు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, తక్కువ సేంద్రియ కర్బనంతో క్షీణించిన నేలలు వంటి వాతావరణ మార్పుల పరిస్థితులలో ఈ సాంకేతికత ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. సహజమైన పదార్థాలతో తయారు చేసిన బయోపాలిమర్ విత్తన పూతలు విత్తనం చుట్టూ అనుకూలమైన సూక్ష్మ వాతావరణాన్ని సృష్టిస్తాయి. మొలకెత్తడం, వేర్లు ఏర్పడటం, తేమ నిలుపుదల, పంట తొలిదశలో బలంగా పెరగటం వంటివి మెరుగుపడతాయి. అదే సమయంలో, వేర్ల చుట్టూ సూక్ష్మజీవులు పెరిగి చీడపీడలు, పర్యావరణ ఒత్తిళ్ల నుంచి పంట మొక్కలకు మరింతగా సహజ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. కీటకనాశకాలు తొలిదశలో కీటకాల వల్ల కలిగే నష్టం నుంచి లేత నారుమొక్కలను కాపాడతాయి. ఈ అంశాలన్నీ కలిసి, పంట పెరుగుదల తొలి దశల నుంచే సమగ్రమైన రక్షణ దొరుకుతుంది. అంతిమంగా 25% వరకు అదనపు దిగుబడి, ఆ మేరకు అదనపు ఆదాయం రైతుకు లభిస్తాయి. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి ప్రయోగాల్లో అనేక పంటల్లో సత్ఫలితాలు వస్తున్నాయి.– డాక్టర్ ఆర్.డి. ప్రసాద్, (92473 36334) ప్రధాన శాస్త్రవేత్త, కీటక శాస్త్ర విభాగం, ఐసీఏఆర్–ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్ 040–24598100– డాక్టర్ కేఎస్వీపీ చంద్రిక, శాస్త్రవేత్త (వ్యవసాయ రసాయనాలు)- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: నేల వైద్యుడు జీలుగ!
పచ్చి రొట్ట పంటల్లో మేలైనది జీలుగ. శాస్త్రీయ నామం: సెస్బానియా సెస్బాన్. త్వరగా పెరిగే పప్పు జాతి మొక్క. నిస్సారమైన భూమిని బాగు చేస్తుంది. కాబట్టి దీన్ని ‘నేల వైద్యుడు’ అంటారు. పంటలకు ముందు పొలంలో జీలుగ సాగుతో భూసారం పెరిగి తర్వాత వేసే పంటకు యూరియా అవసరం తగ్గుతుంది. పనిలో పనిగా ఫ్లోరోసిస్ నియంత్రణ కూడా జరుగుతుందని చెబుతున్నారు ఫ్లోరోసిస్ విమోచన సమితి వ్యవస్థాపకులు డా. కె. గోవర్దన్ రెడ్డి.ప్రతి పొలంలో జీలుగ ఎందుకు సాగు చెయ్యాలి?గాలి నుంచి సేకరించి ఎకరం నేలకు 80–100 కిలోల నత్రజనిని అందిస్తుంది. ఎకరానికి యూరియాపై రూ. 2 వేలకు పైగా ఆదా.త్వరగా పెరుగుతుంది 45–60 రోజుల్లో సిద్ధం. 6 నెలల్లో 3–4 మీటర్లు పెరుగుతుంది.నీళ్లు అక్కర్లేదు ∙మొదటి నెల తర్వాత కరువును తట్టుకుంటుంది. మెట్ట భూములకు సరైనది.నేలను సారవంతం చేస్తుంది. లోతైన వేర్లు గట్టి నేలను వదులు చేస్తాయి. జీలుగ సాగుతో ఎకరానికి 8–12 టన్నుల సేంద్రియ పచ్చిరొట్ట ఎరువు లభిస్తుంది.దీని సాగుకు ఎరువుల ఖర్చు లేదు. యూరియా, డీఏపీ అవసరం లేదు. తన ఆహారాన్ని తానే తయారు చేసుకుంటుంది.జీలుగ ఏ ఇతర పంటలు పండని చౌడు నేలల్లో కూడా బాగా పెరుగుతుంది.ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో రసాయన ఎరువులు నేలను మరింతగా పాడు చేస్తాయి. జీలుగ భూగర్భ జలాలకు హాని చేయకుండా సహజ నత్రజనిని ఇస్తుంది. ఫ్లోరైడ్ సమస్య తీవ్రతను తగ్గిస్తుంది. నేలకు ప్రాణం పోయండి, ఆ నేల మీకు ప్రాణం పోస్తుంది.పచ్చిరొట్ట పంటగా జీలుగ సాగు ఎలా?ఎకరానికి 25 కిలోల విత్తనం తీసుకోండి..జూన్–జూలై నెలల్లో తొలకరి వానలకు వెదజల్లి, తేలికగా దున్నండి.45–60 రోజులు (50% పూత వచ్చే వరకు) పెరగనివ్వండి.కోసి, భూమిలో దున్నేయండి. 15 రోజులు ఆగండి.నత్రజని పెరిగిన ఆ నేలలో జొన్న, సజ్జ, పప్పు ధాన్యాలు వంటి పంటలు వేయండి. తరువాతి పంటకు యూరియా అవసరం 25–30% తగ్గిపోతుంది. నేల మెత్తగా, సారవంతంగా మారుతుంది.విత్తనాలు – సలహాల కోసం మీ దగ్గరలోని వ్యవసాయ శాఖ కార్యాలయం / కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను గానీ, ఫ్లోరోసిస్ విమోచన సమితి వ్యవస్థాపకులు డా. కె. గోవర్దన్ రెడ్డి, (93933 13111)ని గానీ సంప్రదించండి. 1 ఎకరానికి ఖర్చు – లాభంఖర్చు.. విత్తనం 25 కిలోలుదుక్కి, విత్తనాలు వేసే ఖర్చు రూ. 1,500మొత్తం ఖర్చు: రూ. 3,300 ఆదా/లాభం..రూ. 1,800 / యూరియా ఆదా రూ. 2,200అధిక దిగుబడి రూ. 3,000 పైనే, మొత్తం లాభం రూ. 5,200 పైనే.మొదటి పంటలోనే రూ. 1,900పైగా లాభం.దానితో పాటు నేల సంవత్సరాల తరబడి ఆరోగ్యకరంగా ఉంటుంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్. -
Sagubadi: మొక్కలకు ఫర్టిలైజర్, పేస్ట్ కంట్రోల్ గా ఉపయోగపడే వేప పిండి..
మొక్కలకు ఫర్టిలైజర్, పేస్ట్ కంట్రోల్ గా ఉపయోగపడే వేప పిండి గురించి తెలుసుకుందాం. మిద్దె తోటలోని పువ్వులు, పండ్లు, కూరగాయల మొక్కలకు వేప పిండిని ఇలా వాడవచ్చు..1. మొక్కలు నాటడానికి కుండీలలో మట్టిని సిద్ధం చేసేటప్పుడే వేప పిండిని కలపడం అత్యంత ఉత్తమమైన సమయం. 2. మట్టి మిశ్రమంలో తప్పనిసరిగా 10% వేప పిండి కలపాలి.3. ఇది మట్టిలో ఉండే హానికరమైన నులిపురుగులు, శిలీంధ్రాల నుండి వేర్లకు రక్షణ ఇస్తుంది. 4. మొక్కలు పెరుగుతున్న సమయంలో కూడా నెలకు ఒకసారి వేప పిండిని ఎరువుగా వేయవచ్చు. 5. కుండీలోని మట్టిని పైన కొద్దిగా తవ్వి మొక్క సైజును బట్టి ఒక గుప్పెడు వేప పిండిని వేసి, మట్టితో క΄్పాలి.6. ఇది మొక్కలకు నత్రజని, ఇతర పోషకాలను నిలకడగా అందిస్తుంది.వేప పిండి ద్రావణం 7. మొక్కలకు చీడపీడలు ఆశించినప్పుడు లేదా నివారణగా వేప పిండి ద్రావణాన్ని వాడవచ్చు. 8. అర కిలో వేప పిండిని 10 లీటర్ల నీటిలో కలిపి 2 రోజుల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ ద్రావణాన్ని వడకట్టి, మరో 10 రెట్లు నీరు కలిపి మొక్కల మొదళ్లలో పోయవచ్చు.9. ఈ ద్రావణాన్ని ఆకులపై ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయడం వల్ల ఆకులను తినే పురుగులు దూరమవుతాయి. 10. అతిగా వేయకూడదు. 12 అంగుళాల కుండీకి 50–100 గ్రాముల ΄÷డి సరిపోతుంది.11. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులపై వేప ద్రావణాన్ని పిచికారీ చేయవద్దు, ఇది ఆకులను కమిలిపోయేలా చేస్తుంది.12. కల్తీ లేని, తాజాగా ఉండే వేప పిండిని ఎంచుకోవాలి. - కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సాగుబడి: 'ఇప్ప పండు..'తో బోలెడు ఉపయోగాలు!
నల్లమల అడవుల్లో ఇప్ప చెట్ల సాంద్రత తగ్గింది. ప్రస్తుతం ఈ చెట్లను నరకడంపై పూర్తి నిషేధం ఉంది. ఇప్పపై సమగ్రంగా పరిశోధించి, విలువ ఆధారిత పదార్థాలను ప్రజల చెంతకు చేకూర్చిననాడు, దీని ఉనికికి సార్ధకం చేకూర్చిన వారమవుతాం.20 మీటర్ల ఎత్తు.. వందేళ్లు!ఇప్ప ఉష్ణమండలంలోని ఆకులురాల్చే చెట్ల జాతుల్లో ఒకటి. నిటారుగా పెరిగేతత్వం గలది. ఇంచుమించు 16–20 మీటర్ల ఎత్తు వరకు పెరగగలదు. మాను చేవ కలిగి బలిష్ఠంగా ఉంటుంది. దీని ఆవాసం ఇండియా అని చెప్పవచ్చు. కానీ శ్రీలంక, నేపాల్, మయన్మార్ మొదలగు దేశాలలో కూడా ఇప్ప చెట్లు కనిపిస్తాయి.ఎక్కువగా అడవులలో ఉన్నప్పటికీ, మైదాన ప్రాంతాల్లో కూడా విరివిగా పెరుగుతాయి. ఇండియాలో ఇంచుమించు, ఉత్తర, మధ్య, దక్షిణాది రాష్ట్రాలే కాకుండా బీహార్, జార్ఖండ్, గుజరాత్, ఒడిషాలలోనూ ఉన్నాయి. ఒకప్పుడు నల్లమల అడవులు ఈ చెట్లకు మంచి ఆవాసంగా ఉండేది. వీటి సాంద్రత చాలా వరకు తగ్గినదనవచ్చు. వీటి జీవిత కాలం దాదాపు వంద సంవత్సరాలంటారు. కానీ పూత, కాత మాత్రం అరవై ఏళ్ల వరకు ఉండగలదంటారు. ఇప్ప బహుళ ప్రయోజనకారి. కాబట్టి దీన్ని రక్షించటం అందరి కర్తవ్యం. తెలుగు రాష్ట్రాలు ఈ చెట్టుకు పెట్టింది పేరు. దీని ఉనికి అపారమైనది.ఇప్ప చెట్టు పేర్లు వివిధ భాషల్లో ... అస్సామీ: మహారువ ఇంగ్లీష్: హానిట్రీ, బట్టర్ ట్రీ ఉర్దూ: చికన్, గర్, గులు, మహువ ఒరియా: మహుల మహ్వా కన్నడ: హిప్పే, ఇప్పె తమిళం: ఇలుప్పయి, కట్టిరుప్పెయి తెలుగు: ఇప్ప, విప్ప, మధుకము బెంగాలీ: మౌల్, మహూయ మరాఠీ: మౌహ, మవద, కట్ – ఇల్లిపి మలయాళం: ఇరిప్ప, ఇలుపు హిందీ: మహువ, మొహవ, మొవరి, గిలౌడ్, గర్, వన్ ప్రస్త్ సంస్కృతం: మధుక, మధుకం, మోహ అని అంటారు.ఇప్ప ఉపయోగాలు:ఏ చెట్టుకూ లేని ఉపయోగాలు ఇప్ప చెట్టుకు ఉన్నాయి.ఒక చెట్టు నుంచి ఏడాదికి 60–80 కిలోల గింజలు పొందవచ్చు. అదే పెద్ద చెట్టులో ఒక క్వింటాలు వరకు పూమొగ్గలను పొందవచ్చు.విత్తనాలలో 30–35% వరకు నూనె ఉంటుంది.విత్తనాలలో 14–16% వరకు ప్రోటీనులు ఉంటాయి.విప్ప పువ్వుల నుండి తీసిన నూనె వంట కోసం ఉపయోగిస్తారు. దీనికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి.గింజల నుండి తీసిన నూనెను చర్మ రక్షణ తైలంగా, కీళ్ళనొప్పులకు మర్దన తైలంగా కూడా వాడుతారు. శుద్దీకరించిన నూనెను వనస్పతి, సబ్బులు, కొవ్వొత్తులు, ఫ్యాటి ఆమ్లాలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు.గిరిజనులు ఇప్ప పూల అంబలి తయారు చేసి వాడుతారు.దేశవాళి సారాయి (ఇప్పసార)ని తయారీకి ఉపయోగిస్తారు. ఒక టన్ను ఇప్ప పూల నుంచి దాదాపు 400 లీటర్ల పైననే సారాయి వస్తుందని అంచనా.ఇప్ప సారాను సేవిస్తే త్వరగా వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఉంటాయని గిరిజనుల నమ్మకం.ఇప్ప పూల ఔషధాలను పక్షవాతం నయం చేయటానికి ఉపయోగిస్తారు. ఇప్ప పూలతో పండ్లు తోముకుంటే దగ్గు సమస్యలను నివారించవచ్చు.ఇప్ప పూల తైలానికి ఆయుర్వేదంలో మంచి విలువ ఉంది.ఇప్ప పూలతో లడ్డూలు, పచ్చళ్లు తయారు చేస్తారు.ఇప్ప గింజల (5.1%) నూనె నుంచి బట్టర్ను తయారు చేస్తారు.ఇప్ప పూలను పశువులకు మేతగా వేస్తారు. పశువులు ఇష్టంగా తింటాయి.ఇప్ప పండు తొక్కను తింటారు. పండు కింది పొరను పొడిచేసి కేక్ల తయారీకి ఉపయోగిస్తారు.ఇప్ప గింజల నూనె దీపాలకు కూడా వాడుతారు.నూనె తీయగా వచ్చిన చెక్కను ఎరువుగా వాడుతారు.ఇప్ప ఆకులను కరువు కాలంలో పశువులు తింటాయి.పూలలో ఉండే చక్కెర, విటమిన్లు, క్యాల్షియం, నూనె ఎంతో ఉపయోగకరమైనవి.ఆకులను,పూలను బ్రొంకైటీస్కు వైద్యంలో ఉపయోగిస్తారు.ఇప్పపూల లడ్డు..పదార్ధాల మోతాదు:ఇప్పపువ్వు – కిలో, మొలాసిస్ – 400 మిల్లీ లీటర్లు. రాగిపిండి–500 గ్రా., జీడిపప్పు– 100గ్రా., నువ్వులు 50 గ్రా., సోంపు పొడి 10 గ్రా., కొబ్బరిపొడి– 100 గ్రా., సిట్రిక్ ఆసిడ్–4 గ్రా., మెంతిపొడి–10 గ్రా., నెయ్యి 100 మీ.లీ. సొంఠి పొడి 5 గ్రా.తయారీ విధానం:- పొయ్యి మీద పాత్రలో మొలాసిస్ను 400 మి.లీ. నీళ్ళల్లో వేడి చేసి, దానికి 2 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని కలపాలి.- అది జిగటగా మారగానే నెయ్యిలో వేయించిన రాగి పొడిని అందులో కలపాలి.- ముందే నెయ్యిలో వేయించిన ఇప్ప పూలను అందులో కలపాలి.- ఆ తరువాత నువ్వులు, జీడిపప్పు, శొంఠి పొడి, మెంతి పొడి, సోంపు పొడిని కలుపాలి.- అన్నీ బాగా కలియ బెట్టాలి.- ఈ విధంగా చిరుమంటపై ఉంచి, పైన తెలిపిన పదార్థాలన్నీ దోరగా, చిక్కగా అయిన తర్వాత మంట ఆర్పివేయాలి.- వేడి తగ్గిన తర్వాత కొబ్బెర తురుముతో కలిపి లడ్డూల రూపం వచ్చే విధంగా గుండ్రంగా చేయాలి.- ఈ విధంగా తయారు అయిన లడ్లు చాలా రుచిగా ఉంటాయి.- మీరు చేసి చూడండి. ఏమైనా మార్పులు–చేర్పులు చేసి ఇంకా రుచికరంగా తయారుచేసే విధానాన్ని రూపొందించండి.ఇప్ప కలప గట్టిది..ఇప్ప చెట్టు కలప చాలా గట్టిది. దూలాలకు మిద్దె ర్యాప్టర్లకు, పలకలకు, ఫర్నీచర్ తలుపులు, కిటికీల ఫ్రేములకు, బ్రిడ్జిలు వేసేటప్పుడు సప్పోర్ట్ దిమ్మెలుగా, బండ్ల మణిగం, పలుగడి, పడవల చెక్కలు, ఓడల దిమ్మెలు, వ్యవసాయ పనిముట్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్ప చెట్టు కలప, పూలు, కాయలు, పండ్లల్లో ఎన్నో తెలియని ఉపయోగాలున్నాయి. వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్, ఆమ్లాలను మందుల తయారీలో వాడుతారు. దీని ఉపయోగాలపై ప్రయోగాలు చేసి, ఆ విషయాలను రైతుల చెంతకు చేర్చితే ఎంతో లాభసాటిగా ఉంటుంది. - డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సాగుబడి: ఎత్తు మడులపై సేంద్రియ వంగ.. మండే ఎండల్లోనూ నో బెంగ!
దీర్ఘకాలం దిగుబడినిచ్చే కూరగాయ పంటల సాగు ఎల్నినో కారణంగా ఈ ఏడాది కరువు బారిన పడే ముప్పు పొంచి ఉందా? ఏడాది పొడవునా కూరగాయ తోటలను ఎల్నినో కరువు నుంచి రక్షించుకుంటూ అధిక దిగుబడిని పొందటానికి ప్రత్యేక లేక సేంద్రియ సాగు వ్యూహాలేమైనా ఉన్నాయా? ముమ్మాటికీ ఉన్నాయంటున్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన సేంద్రియ వ్యవసాయ నిపుణులు శివశంకర్ షిండే! 47 డిగ్రీల సెల్సియస్ ఎండను, నీటి ఎద్దడిని దీటుగా తట్టుకునే వినూత్న సేంద్రియ సాగు పద్ధతిని తమ ‘న్యూలైఫ్ ఫౌండేషన్’ ప్రదర్శనా క్షేత్రంలో ఆవిష్కరించటం విశేషం. కరువొచ్చినా, భారీ వర్షాలొచ్చినా సరే భద్రత చేకూర్చే సంగతులతో ప్రత్యేక కథనం.నేల బాగా తడిచిన తర్వాతే..రుతుపవనాలు పూర్తిగా విస్తరించిన తర్వాత వారం వ్యవధిలో తగినంత వర్షం పడిందని నిర్ధారించుకున్న తర్వాతే వర్షాధార పంటలు విత్తుకోవాలని, ఒకటీ అరా వర్షాలు పడగానే తొందరపడి విత్తనాలు వేసుకోవద్దని నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. తగినంత వర్షం అంటే?.. తేలికపాటి, ఎర్ర నేలల్లో 50 నుంచి 60 మి.మీ., బరువు, నల్లరేగడి నేలల్లో 60 నుంచి 75 మి.మీ. వర్షపాతం నమోదైన తర్వాత లేదా 15–20 సెం.మీ. (6 నుంచి 8 అంగుళాల) లోతు నేల తడిచిన తర్వాతే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం తదితర పంటలను విత్తుకోవాలి. వరి సాగు చేయదలచిన రైతులు జనుము, జీలుగ, పెసర, పిల్లిపెసర, ఉలవ వంటి పచ్చిరొట్ట పైరులు విత్తుకోవాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవటానికి ఇది అనువైన సమయం.సేంద్రియ సేద్యంపై 9 నెలల ‘అక్షయకల్ప’ శిక్షణవ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ‘అక్షయకల్ప–రెయిన్ మ్యాటర్ ఫెలోషిప్’ కార్యక్రమం త్వరలోప్రారంభం కానుంది. పాడి పశువుల పెంపకం, బయోగ్యాస్ ఉత్పత్తి, బయోడైజెస్టర్ ద్వారా తయారుచేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక వ్యవసాయ పద్ధతిపై 19–27 మధ్య వయస్కులైన యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని ఈదులాపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ పరిశోధన–శిక్షణా కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి 3 నెలలు రెసిడెన్షియల్ శిక్షణ, తరువాత 6 నెలలుప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. ఉచిత భోజనం, వసతితో పాటు ఉపకారవేతనం ఇస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకుప్రాధాన్యం ఉంటుంది. వివరాలకు.. 70222 77155.శాశ్వత మడుల నిర్మాణంఈ సాగు పద్ధతిలో ఐదేళ్ల వరకు చెక్కుచెదరని శాశ్వత ఎత్తుమడులను (పర్మినెంట్ రెయిజ్డ్ బెడ్స్) ఒక అడుగు ఎత్తు, మూడు అడుగుల వెడల్పుతో నిర్మిస్తారు.భూమి తయారీ: మొదటి ఏడాది మాత్రమే దుక్కి అవసరం అవుతుంది.బయోచార్ వినియోగం: ఎకరానికి 5 టన్నుల వరి పొట్టు బొగ్గును (బయోచార్) మట్టిలో కలుపుతారు. ఇది మట్టి కన్నా 4 రెట్లు ఎక్కువగా నీటిని పట్టి ఉంచుతుంది.వీడ్ మ్యాట్: మడులపై డ్రిప్ లైన్లు పరిచి, నాలుగు అడుగుల నలుపు వీడ్ మ్యాట్ కప్పుతారు. ఇది వర్షపు నీటిని లోపలికి పంపిస్తూ, కలుపును పూర్తిగా నివారిస్తుంది.మొక్కలు నాటడం: ఈ మడులపై ఎకరానికి 2 వేల అంటుకట్టిన పర్పుల్ లాంగ్ వంగ మొక్కలను నాటుతారు.ద్రవరూప ఎరువులతో సమతుల్య పోషణపంటకు అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే అందిస్తారు.బయోడైజెస్టర్: ఎకరానికి ఏడాదికి 3 టన్నుల మాగిన పశువుల లేదా కోళ్ల ఎరువును బయోడైజెస్టర్లో వేసి 24 గంటల్లో పోషక ద్రవాన్ని తయారుచేస్తారు. దీనిని డ్రిప్, పిచికారీ ద్వారా వారానికి రెండు సార్లు ఇస్తారు.ద్రావణాలు: వేపాకులు, వయ్యారిభామ, తలంబ్రాల ఆకులను పది రోజులు నిల్వ చేసి ఆ రసాన్ని అందించడం ద్వారా సూక్ష్మపోషకాల లోపాన్ని అధిగమిస్తున్నారు. కొనుగోలు చేసిన సేంద్రియ పురుగుమందును అడపాదడపా వాడుతూ చీడపీడలను సమర్థవంతంగా అరికడుతున్నారు.రసాయన సాగు – సేంద్రియ సాగు పోలికరంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లిలో వడ్ల ఆనందాచారి రసాయనిక సేద్యంలో తెల్లవంగను పండిస్తున్నారు. రసాయన సాగుతో పోలిస్తే శివశంకర్ అనుసరిస్తున్న శాశ్వత మడులపై సేంద్రియ సాగులో పెట్టుబడి తొలి ఏడాది ఎక్కువగా ఉన్నప్పటికీ, దిగుబడి నాలుగింతలు వస్తుంది. ఐదేళ్ల పాటు మడుల నిర్మాణ ఖర్చు ఉండదు కాబట్టి, తర్వాతి సంవత్సరాలలో పెట్టుబడి తగ్గి నికర లాభం బాగా పెరుగుతుంది. వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడే ఈ విధానం రైతులకు ఆర్థిక భద్రతను చేకూరుస్తుంది. సాధారణ వంగ రకాల పంటకాలం 6–8 నెలలు మాత్రమే కాగా, అంటుకట్టిన వంగ తోట 12 నుంచి 18 నెలల పాటు (కొన్నిసార్లు రెండేళ్లు) దిగుబడినిస్తుంది.పర్మినెంట్ బెడ్సే పంటకు పునాది!వరి పొట్టు బొగ్గుతో కూడిన పర్మినెంట్ బెడ్సే పంటకు పునాది. మట్టి కన్నా 4 రెట్లు ఎక్కువగా నీటిని పట్టి ఉంచే శక్తి దీనికి ఉంది. అందువల్లే, రోహిణీ కార్తెలోనూ రెండు రోజులకోసారి డ్రిప్ నీరిచ్చినా వంగ తోట చూస్తున్నారుగా ఎలా ఉందో? వీడ్ మ్యాట్ లోపలికి వర్షం దిగుతుంది. మట్టికి గాలి ఆడుతుంది. కానీ, కలుపు అసలు పెరగదు. ఒకసారి వేస్తే ఐదేళ్ల వరకు చెక్కుచెదరదు. ఒక పంట అయిపోయాక మరో పంట.. బెడ్స్పై మొక్కలు నాటుకోవటమే. ఏళ్ల తరబడి నిలిచే శాశ్వత బెడ్స్పై విజ్ఞతతో చేసే సేంద్రియ సేద్యం ఇది. సమతుల్య పోషణపై అవగాహన, క్రమం తప్పని ఆచరణే కీలకం.– శివశంకర్ షిండే (81210 08002), సేంద్రియ వ్యవసాయ నిపుణుడు, బుచ్చిగూడెం, ఫరూక్నగర్ మండలం, రంగారెడ్డి జిల్లానిర్వహణ: పంతంగి రాంబాబు -
సమతుల్య పోషణతోనే సేంద్రియ దిగుబడులు
సేంద్రియ కూరగాయల సాగులో ఒకటికి నాలుగు రకాల సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కలిపి వాడినప్పుడు మాత్రమే అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందుతాయని, తద్వారా అత్యుత్తమ దిగుబడులు సాధించగలమని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, పరివృద్ధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాలీహౌస్లో రెడ్ క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలను ప్రయోగాత్మకంగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ 2025–26 శీతాకాల పంటలో ఉత్తమ ఫలితాలు సాధించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎ. రాజారెడ్డి పర్యవేక్షణలో హార్టికల్చర్ అసిస్టెంట్ ్రపొఫెసర్లు డా. సీహెచ్ షణ్ముఖి, డా. టి. శిరీష నిర్వహిస్తున్న ఈ మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ కిసాన్ సంఘ్కు చెందిన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.కాలీఫ్లవర్ ఎకరానికి 8 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై కాలీఫ్లవర్ను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 9 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడుతూ పాలీహౌస్లో కాలీఫ్లవర్ సాగు చేస్తే 5.8 టన్నుల దిగుబడి వచ్చింది. అయితే, కోళ్ల ఎరువుతో పాటు 3 రకాల జీవన ఎరువులు వాడితే అత్యధికంగా హెక్టారుకు 8 టన్నులకుపైగా సేంద్రియ కాలీఫ్లవర్ దిగుబడి వచ్చింది. హెక్టారుకు 7.5 టన్నుల కోళ్ల ఎరువుతో పాటు వామ్ 5 కిలోలు, అజోస్పిరిల్లం 2 కిలోలు, పీఎస్బీ 5 కిలోలు వాడినప్పుడు అత్యధికంగా ఒక్కో కాలీఫ్లవర్ బరువు 825 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 8టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. అయితే, జీవన ఎరువులతో పాటు వర్మీ కంపోస్టు లేదా జీవామృతం లేదా లిగ్నైట్ కలిపి వాడినప్పుడు.. కోళ్ల ఎరువుతో పాటు జీవన ఎరువులు వాడినప్పటికన్నా తక్కువ దిగుబడి రావటం విశేషం.రెడ్ క్యాబేజీ ఎకరానికి 9 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై రెడ్ క్యాబేజీ పంటను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 6 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. పాలీహౌస్లో హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడితే హెక్టారుకు 5 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడి వచ్చింది. అయితే, హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువుతో పాటు మరో 4 రకాల సేంద్రియ ఎరువులు వాడితే హెక్టారుకు అత్యధికంగా 9 టన్నులకుపైగా సేంద్రియ రెడ్ క్యాబేజీల దిగుబడి వచ్చింది. హెక్టారుకు 5 టన్నుల పశువుల ఎరువు, వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడారు. ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 962 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 9 టన్నులకు పైగా దిగుబడి రావటం విశేషం. అయితే, పశువుల ఎరువు అసలు వాడకుండా.. హెక్టారుకు వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడినప్పుడు ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 935 గ్రాములకు మాత్రమే పెరిగింది.సమతుల్య పోషణే కీలకంసేంద్రియ సాగులో పంటలకు అవసరమైన అన్ని పోషకాలనూ సమతుల్యంగా తగు పాళ్లలో అందించగలిగినప్పుడే రసాయన సేద్యంతో సమానంగా దిగుబడులు సాధించటం సాధ్యమవుతుందని మల్లారెడ్డి యూనివర్సిటీలో తాజా పరిశోధనలు తేల్చాయి. పాలీహౌస్ ప్రయోగాత్మక సాగులో ఎకరానికి 8 టన్నుల కాలీఫ్లవర్, 9 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడులు మాకు సంతృప్తి కలిగించాయి. అన్ని యూనివర్సిటీలూ ఈ దిశగా పరిశోధనలు చేస్తే రైతులకు మంచి ఆదాయంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యదాయకమైన ఆహారం లభిస్తుంది. – ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులుసేంద్రియ పరిశోధనలు కొనసాగిస్తాంపూర్తిగా సేంద్రియ కూరగాయల సాగులో మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టు తొలి ఏడాది ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మరో రెండు సంవత్సరాలు ఈ ప్రయోగాలు కొనసాగిస్తాం. సేంద్రియ ఎరువుల యాజమాన్యం, దిగుబడుల స్థిరీకరణ చేసి పూర్తి ఫలితాలు ఆ తర్వాత ప్రకటిస్తాం. – డాక్టర్ ఎ. రాజారెడ్డి, డీన్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మల్లారెడ్డి యూనివర్సిటీనిర్వహణ: పంతంగి రాంబాబు -
కరువు కాలపు పంట బ్రహ్మజెముడు
ముళ్ళు లేని బ్రహ్మజెముడు (స్పైన్లెస్ కాక్టస్) కరువుప్రాంతాల్లో రైతులకు చక్కని పశుగ్రాసం సహా 5 రకాలుగా ఉపయోగపడే ఒక చక్కని పంట. వాతావరణ మార్పులను తట్టుకోగల పంట. తక్కువ నీటితో పెరుగుతుంది. సారహీనమైన నేలల్లో కూడా (చౌడు భూముల్లో తప్ప) పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న తోటల్లో మధ్యలో వరుసలుగా దీన్ని పెంచవచ్చు. ఇది చిన్న రైతులను ఆదుకునే పంట. కరువు పీడిత రైతులకు బహుళ ఆదాయ మార్గాలను సృష్టిస్తుంది. సుస్థిర జీవనోపాధిని కల్పిస్తుంది.హెక్టారుకు 80 నుంచి 100 టన్నులుముళ్ళు లేని బ్రహ్మజెముడు ఒక్కసారి నాటితే 25 సంవత్సరాలకు పైగా ఫలసాయాన్నిచ్చే దీర్ఘకాలిక పంట. చిన్న పండ్లతో సహా ఈ చెట్టులోని ప్రతి భాగం విలువైన పశువుల మేతగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో సమకూరే పచ్చిమేతను అందిస్తుంది. సంవత్సరానికి హెక్టారుకు 80 నుంచి 100 టన్నుల వరకు బ్రహ్మజెముడు ఆకుల దిగుబడి వస్తుంది. కరువు సమయంలో నమ్మకంగా, తక్కువ ఖర్చుతో కూడిన పశుగ్రాసాన్ని అందిస్తుంది. తద్వారా పశుగ్రాస ఖర్చులను తగ్గిస్తుంది. దీని ఆకులను అంగుళం ముక్కలుగా కోసి పశువులకు మేపాలి. పాలిచ్చే పశువులకు రోజుకు 10–15 కిలోలు (రోజువారీ పచ్చిమేతలో 25% వరకు) మేపవచ్చని కర్నాల్లోని ఎన్డీఆర్ఐ నిపుణులు చెబుతున్నారు. ఇతర పశువులకు రోజుకు 8–12 కిలోల వరకు, ఆర్నెల్లు పైబడిన దూడలకు 2–4 కిలోలు మేతగా ఇవ్వొచ్చు. క్రమంగా అలవాటు చెయ్యాలి.బయోగ్యాస్ తయారీకి ఉపయోగంముళ్ళు లేని బ్రహ్మజెముడు బయోగ్యాస్ తయారీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని ఆకులకు 60–65% మీథేన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. బయోగ్యాస్ తయారీ తర్వాత వెలువడే స్లర్రీ విలువైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. 3 కిలోల బ్రహ్మజెముడు ఆకులతో 3.38 చదరపు అడుగుల విస్తీర్ణం గల బయో–లెదర్ షీట్ను తయారు చేయొచ్చు. దీనితో రెండు జతల బూట్లు లేదా మూడు చిన్న బ్యాగులు తయారు చేయవచ్చు. దీని పండ్లు పోషక విలువలతో కూడి ఉంటాయి. దీని ఆకులను కూరగానూ వండుకొని తినొచ్చు.ఎవరిని సంప్రదించాలి?ముళ్లులేని బ్రహ్మజెముడు పంట సాగును వ్యాప్తిలోకి తేవాలంటే రైతులకు దీని గురించి తెలియజె΄్పాలి. నాటుకునే బ్రహ్మజెముడు ఆకులను అందించాలి. మార్కెట్ను అనుసంధానం అవసరం. పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు కలసి పనిచేస్తే ఈ కరువు కాలపు పంటను వేగంగా రైతులకు అందించవచ్చు.ఉత్తరప్రదేశ్లోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ ఇండియన్ గ్రాస్ల్యాండ్ అండ్ ఫాడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనిపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. అదనపు సమాచారం కోసం డా. శివ్ కుమార్ అగర్వాల్ను సంప్రదించవచ్చు. sk.agrawal@cgiar.org -
వేడి ఒత్తిడి నివారణ ఎలా?
పాడి ఆవులు, గేదెల పెంపకంలో వేడి ఒత్తిడి ఒక కీలకమైన సమస్య. ఇది పాల దిగుబడిపై, పునరుత్పత్తిపై, మొత్తం పశువుల శ్రేయస్సుపై గణనీయ ప్రభావం చూపుతుంది. పశువులు తమ శరీరంలోని అధిక వేడిని బయటకు పంపటానికి ఇబ్బంది పడినప్పుడు ఒత్తిడికి గురవుతాయి. ఆవులు, గేదెలు 5 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటే సౌకర్యంగా ఉంటాయి. ఆపైన పెరిగే వేడితో పాటు గాలిలో అధిక తేమ శాతం కూడా వేడి ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా మేత తీసుకోవటం తగ్గుతుంది. పాల ఉత్పత్తి పడిపోతుంది. ఆవులు, గేదెలలో వేడి ఒత్తిడిని తగ్గించడానికి పోషకాహార నిర్వహణ, నివాస మార్పులు, మెరుగైన నిర్వహణ పద్ధతులతో కూడిన బహుముఖ విధానం పాటించటం అవసరమని అక్షయకల్ప ఆర్గానిక్కు చెందిన పశువైద్య నిపుణులు డాక్టర్ తేజేశ్వర రెడ్డి (63669 59100) అంటున్నారు.వేడిమి ఒత్తిడి అంటే ఏమిటి?పశువులు శరీరంలోని వేడిని బయటకు సమర్థవంతంగా వదలలేనప్పుడు శరీరంలో వేడి భారం పెరిగి ఒత్తిడి ఏర్పడుతుంది. ఎక్కువ పాలు ఇచ్చే ఆవులు/గేదెలపై వేడి ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.వేడిమి ఒత్తిడితో పశువులకు నష్టాలు:→ మేత తీసుకోవటం 10–20% తగ్గుతుంది. → ఆ మేరకు పశువుల ఒంట్లో శక్తి తగ్గుతుంది.→ పాల ఉత్పత్తి తగ్గుతుంది.→ దూడల్లో పెరుగుదల మందగిస్తుంది.→ చూడి కట్టే అవకాశాలు తగ్గుతాయి. → రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.→ అబార్షన్లు, వడదెబ్బ, మరణం సంభవించవచ్చు.వేడిమి భారం సూత్రంశరీరంలో పుట్టిన వేడి + వాతావరణం నుంచి గ్రహించిన వేడి – శరీరం నుంచి బయటికి వదిలే వేడి = మొత్తం వేడి భారం→ వాతావరణ మార్పు, తీవ్రమైన వేడి పశువుల ఆరోగ్య రక్షణకు కీలకమైన సవాళ్లుగా మారాయి.→ ఇతర పశువుల కన్నా అధిక పాల దిగుబడినిచ్చే పాడి పశువులు ఎక్కువగా వేడి ఒత్తిడికి గురవుతాయి.→ శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరుగుతుంది.→ ఆవుల కన్నా గేదెలు వేడి ఒత్తిడికి ఎక్కువగా గురవుతాయి. ఎందుకంటే గేదెలకు వేడిని శరీరం నుంచి బయటకు వదిలేందుకు స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. వాటి నలుపు శరీర రంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది.మేత నిర్వహణ:→ ఉదయం/ రాత్రి చల్లటి సమయాల్లో మాత్రమే మేత వెయ్యండి. → అధిక పీచు పదార్థాలు (ఎండు గడ్డి) మేపటం తగ్గించాలి. → పచ్చిమేత/ సైలేజ్ ఇవ్వాలి. → ఎలక్ట్రోలైట్లు, విటమిన్ సి, ఇ, సెలీనియం.. ఇవ్వాలి.→ ప్రొ బయోటిక్స్– ఎంజైమ్లు ఇవ్వాలి.చల్లపూటే పనులు→ పశువులపై ఒత్తిడిని తగ్గించడానికి పాలు పితకటం, మేత పెట్టటం, వాటిని పట్టుకొని కడగటం వంటి పనులను పగటి పూట చల్లగా ఉండే సమయాల్లోనే చేయండి.→ మధ్యాహ్నం ఎండు మేత ఇవ్వకూడదు.పర్యవేక్షణ:→ అధికంగా ఆయాస పడుతున్నాయా? శ్వాస రేటు పెరిగిందా? మేత తినటం తగ్గిందా? వంటి వేడి ఒత్తిడి సంకేతాల కోసం పశువుల శరీర పరిస్థితిని, ప్రవర్తనను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండండి.అత్యవసర ప్రణాళికలు:→ అతి తీవ్రమైన వేడి పరిస్థితుల్లో ఇబ్బంది వస్తే ఏం చెయ్యాలో అత్యవసర ప్రణాళికలను రూపొందించుకోండి.→ పశువులను త్వరగా చల్లబరిచే మార్గాలు ఆలోచించిపెట్టుకోండి. → అత్యవసరమైన వైద్య సహాయం అందించండిగాలి ప్రసరణ – శీతలీకరణ→ పశువుల షెడ్డులో నిలువు ఫ్యాన్లు అమర్చాలి ∙మిస్టర్లు/ స్ప్రింక్లర్లు వినియోగించాలి.→ పశువుల శాల లేదా షెడ్లోకి గాలి బాగా వచ్చి ΄ోయేలా చూసుకోండి. → పశువుల శరీరంపై నేరుగా నీటిని చల్లండి. → తడిపిన గోనె సంచులను పశువుల శరీరంపై కప్పండి. → షెడ్లో ఎక్కువ పశువులను ఉంచకుండా రద్దీగా లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది వాటి శరీరంలో వేడి ఉత్పత్తి తగ్గటానికి, గాలి ప్రసరణ పెరగటానికి దోహదపడుతుంది.షెడ్డు నిర్వహణ→ పశువులకు షెడ్కు పక్కనే అదనంగా చెట్ల నీడ ఉండేలా చూడాలి లేదా షేడ్ నెట్ను కట్టి నీడ ఏర్పాటు చెయ్యటం ద్వారా వేడిమి ఒత్తిడిని తగ్గించవచ్చు. → షెడ్ పైకప్పుపై తెల్లని పెయింట్ వేస్తే వేడి తక్కువగా ఉంటుంది. → షెడ్ ఎత్తు 12–14 అడుగులు; ΄÷డవు 8–10 అడుగులు ఉంటే గాలి ΄ారాడుతూ వేడి తీవ్రత తగ్గుతుంది. నీటి నిర్వహణ→ శుభ్రమైన నీటిని పశువులకు ఇవ్వాలి. రోజంతా నిరంతరాయంగా అందించాలి.→ వేడి వాతావరణంలో ఆవులు/ గేదెలు ఆయాసం, చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవటానికి ఎక్కువ నీరు తాగుతాయి. → 24 గంటలూ చల్లని నీరు ఇవ్వాలి. నీటి ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండాలి. → వేసవిలో నీటి తొట్టెల సంఖ్య పెంచాలి. → గేదెలు నీటిలో మునగటానికి ఇష్టపడతాయి.→ అందుకోసం వాలో ట్యాంకులు ఏర్పాటు చెయ్యాలి. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
సూక్ష్మంలో మోక్షం..నానో ఎరువులు!
పశ్చిమాసియా యుద్ధం ఇచ్చిన షాక్తో దేశంలో రసాయనిక ఎరువులకు తీవ్ర కొరత వచ్చి పడింది. యూరియా, డీఏపీ, ఫాస్ఫరస్ వంటి ఎరువులకు గత 60 ఏళ్లుగా మన రైతులు అలవాటైపోయారు. ప్రస్తుత సంక్షోభ కాలంలో ఈ అలవాటు మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రసాయనిక ఎరువులకు బదులుగా సులువుగా వాడదగిన ఎరువులేవైనా ఉన్నాయా? అంటే.. తప్పకుండా ఉన్నాయి. అవే ‘నానో ఎరువుల’ని ‘ఇఫ్కో’ ఘంటాపథంగా చెబుతున్నది. నానో ఎరువులపై రైతులు ఇప్పటికీ, ఎప్పటికీ, పూర్తిగా ఆధారపడొచ్చని ‘ఇఫ్కో’ ఘంటాపథంగా చెబుతోంది. నానో ఎరువులను వాడుతున్న రైతుల అనుభవాలు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయంటున్నారు. సబ్సిడీ లేని సహకార ఎరువులు కావటంతో ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ‘తక్షణ ఎరువుల కొరతను అధిగమించేందుకు నానో ఎరువులే ఉత్తమ మార్గం. దీర్ఘకాలంలో ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లోకి మారి పోవటమే ఉత్తమం..’ అని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఇంతకీ నానో ఎరువులంటే ఏమిటి? ఏయే పంటలు/తోటలకు ఎలా వాడాలి? రైతుల అనుభవాలేమిటి? పరిశీలిద్దాం.మన దేశంలో రైతులు ఏర్పాటు చేసుకున్న సహకార దిగ్గజ సంస్థల్లో ఒకటి ‘ఇఫ్కో’ (ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇఫ్కో దేశీయంగా తయారు చేస్తున్న నానో యూరియా, నానో డీఏపీ తదితర నానో ద్రవ రూప ఎరువులు ప్రపంచంలోనే అరుదైనవి. వీటిని గత ఐదేళ్లుగా ఇఫ్కో రైతులకు విక్రయిస్తోంది. సాంప్రదాయక గుళికల యూరియా, డీఏపీకి బదులుగా.. ద్రవరూపంలో ఉండే నానో యూరియా, నానో డీఏపీ, నానో పొటాష్ ఎరువులు వాడినప్పుడు ఎటువంటి దిగుబడి నష్టం లేదని, అధిక దిగుబడులే వస్తున్నాయని ఇఫ్కో క్షేత్రప్రయోగాల ద్వారా నిరూపించింది. రైతులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నానో ఎరువులు వల్ల దిగుబడి తగ్గుతుందన్న దిగుల్లేదు, ఖర్చు తక్కువ, నానో ఎరువులు దొరకవన్న భయం లేదు. నేల, నీరు, గాలి కాలుష్యం కూడా ఉండదని ఇఫ్కో చెబుతోంది. అర లీటరు సీసా ఒక బస్తాకు సమానం500 మి.లీ. నానో ద్రవ యూరియా సీసా ఒక బస్తా సాంప్రదాయ గుళికల యూరియాతో సమానం. ఎరువుల ఉత్పత్తిలో వాడే సహజ వాయువు విదేశీ దిగుమతులు తగ్గినా, నానో ఎరువుల రూపంలో రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేసే సామర్థ్యం ఉందని ఇఫ్కో స్పష్టం చేసింది. నానో ఎరువుల గురించి రైతులకు నచ్చజెప్పే లక్ష్యంతో 19 రాష్ట్రాల్లో ఇఫ్కో తాజాగా భారీ ప్రచారోద్యమం చేపట్టింది. నానో ఎరువుల ప్రత్యేకతేంటి?గుళికల ఎరువులు: చిన్న గుళికల రూపంలో ఉండే యూరియా, డీఏపీ, పొటాష్ వంటి సాధారణ రసాయనిక ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సహజ వాయువుతో తయారు చేస్తారు. వీటిని భూమిలో వేస్తే, వేసిన ఒకటి, రెండు రోజుల్లోనే ఆకులు ముదురు ఆకుపచ్చగా మారతాయి. కానీ, ఎక్కువగా పెరిగి పంట పడిపోతుంది. ఎక్కువగా చీడపీడలు ఆశిస్తాయి. 30–40% పోషకాలను మాత్రమే మొక్కలు వాడుకోగలుగుతాయి. నానో ఎరువులు: నానో యూరియా ప్లస్, నానో డీఏపీ, నానో పొటాష్ తదితర నానో ఎరువులు ద్రవ రూపంలో ఉంటాయి. ఇఫ్కో దేశీయ పరిజ్ఞానంతో తయారు చేస్తోంది. తక్కువ ఖర్చు. విరివిగా దొరుకుతాయి. వీటిలో పోషకాల కణం చాలా చిన్నగా 20–50 నానో మీటర్ల సైజులో ఉంటాయి. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తారు. ఆకులు ఈ పోషకాలను 80–90% మేరకు త్వరగా ఉపయోగించుకోగలుగుతాయి. మామూలు స్ప్రేయర్లు, డ్రోన్లతో చల్లితే పంటలు వెంటనే ముదురు ఆకుపచ్చ రంగులోకి మారవు. కానీ, బలంగా పెరుగుతాయి. రొట్ట ఎక్కువగా పెరగదు. గాలులకు పడిపోదు. తాలు ఉండదు. దిగుబడి పెరుగుతుంది. చీడపీడల సమస్య తగ్గుతుంది. శాస్త్రవేత్తల ఆమోదం ప్రపంచ ప్రమాణాల ప్రకారం సురక్షితమైనవిగా గుర్తింపు పొందిన నానో ఎరువులు ఇతర జీవరాశికి సురక్షితమైనవి. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), నానో అగ్రి ఇన్పుట్ ప్రొడక్ట్స్–2020 మార్గదర్శకాలకు అనుగుణంగా తయారుచేసినవని ఇఫ్కో తెలిపింది. నానో ఎరువుల సామర్థ్యంపై శాస్త్రీయ ధ్రువీకరణ కోసం వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయని ఇఫ్కో అధికారులు ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. హైదరాబాద్లోని కేంద్రీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–క్రీడ) వంటి అగ్రగామి వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో విస్తృతమైన క్షేత్ర పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ వ్యవసాయ కళాశాలల్లో జరుగుతున్న క్షేత్ర ప్రయోగాల్లో అత్యంత సంతృప్తికరంగా ఫలితాలు వస్తున్నాయని ఇఫ్కో అధికారులు ప్రకటించారు. ప్రభుత్వభాగస్వామ్యం, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు, తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ, ఐసీఏఆర్ పరిశో ధన సంస్థలు నానో ఎరువులపై విస్తృత ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది నానో సాంకేతికతపై రైతుల్లో విశ్వాసాన్ని పెంచిందని చెబుతున్నారు. విస్తృతంగా ప్రదర్శనా క్షేత్రాలునానో ఎరువులపై రైతుల సందేహాలను నివృత్తి చేయటానికి, పంట దిగుబడిపై నానో ఎరువుల సానుకూల ప్రభావాన్ని కళ్ళారా చూపించడానికి ఇఫ్కో విస్తృతంగా ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తోంది. నానో ఎరువుల వ్యాప్తికి ఈ క్షేత్రాలు బలమైన పునాది వేశాయి. గ్రామీణ యువతకు, మహిళలకు డ్రోన్లను అందించి, ఎకరానికి రూ. 300 ఖర్చుతో డ్రోన్లతో నానో ఎరువుల పిచికారీ జరుగుతోంది. పిచికారీ సమయం, శ్రమ తగ్గటంతో ఈ సాంకేతికతను రైతులు వేగంగా స్వీకరిస్తున్నారని ఇఫ్కో చెబుతోంది. నానో ఎరువుల వాడకం వేగంగా పెరుగుతోందిసంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా ఇఫ్కో ప్రవేశపెట్టిన నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వాడకం వేగంగా పెరుగుతోంది. రైతులు అనూహ్య వేగంతో అందిపుచ్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2025–26లో వానాకాలం, యాసంగి కలిపి 10.46 లక్షల సీసాల నానో ఎరువులను రైతులు వాడటమే ఇందుకు నిదర్శనం. విత్తనం వేసే ముందు లేదా మొక్కలు నాటే దశలో సంప్రదాయ గుళికల యూరియా, డీఏపీలను వాడుకోవాలి. పంట మొక్కలకు ఆకులు పెరిగినాక రెండో విడత, మూడో విడత వేసే గుళికల ఎరువులకు బదులుగా నానో యూరియా, నానో డీఏపీలను నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. గుళికల రూపంలో ఉండే సంప్రదాయ యూరియా, డీఏపీ, పొటాష్ వంటి రసాయనిక ఎరువుల మోతాదును 25 నుంచి 50% వరకు తగ్గించి, పంట కొన్ని రోజులు ఎదిగిన తర్వాత నానో యూరియా, నానో డీఏపీ వంటి ద్రవ రూప ఎరువులను రెండు సార్లు పిచికారీ చేస్తున్న చాలా మంది రైతులు ఖర్చు తగ్గించుకుంటూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అయితే, సంప్రదాయ గుళికల యూరియా, డీఏపీ ఎరువులను పూర్తిగా మానేసి.. కేవలం నానో ఎరువులు, జీవన ఎరువులు, సముద్రపు నాచు ద్రావణాలను కలిపి వాడి పంటలు పండిస్తూ మంచి దిగుబడులు పొందుతున్న రైతులు కూడా కొందరు ఉన్నారు. నానో ఎరువులు వాడితే ఎకరాకు సుమారు రూ. 2 వేల వరకు ఖర్చు తగ్గుతుందని, 8% వరకు దిగుబడి పెరుగుతుందని మా క్షేత్ర ప్రయోగాల్లో తేలింది. – ఎం.ఆర్. కృపాశంకర్, ఇఫ్కో, తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ఊళ్లో నాదే అత్యధిక దిగుబడి!వరి పంటకు అడుగున కొద్దిగా డీఏపీ మాత్రమే వాడాను. మిగతా పోషకాలకు బస్తాలు వేయకుండా.. నానో యూరియా, నానో డీఏపీ, సాగరిక కలిపి డ్రోన్ ద్వారా పిచికారీ చేయించాను. మా చుట్టుపక్కల పొలాలన్నింటిలో ఎండాకు తెగులు వచ్చినా, నా పొలానికి అస్సలు రాలేదు. పంట బలంగా నిలబడింది, గింజ కూడా బరువుగా, నాణ్యంగా ఉంది. ఈ కొత్త నానో ఎరువులతో ఎకరానికి 33 క్వింటాళ్లు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. మా ఊళ్లో నాదే అత్యధిక దిగుబడి!.– ఎం. కృష్ణార్జున రావు (90320 37954), మల్లుపల్లి, ఖమ్మం జిల్లాపత్తి దిగుబడి పెరిగింది!నేను పంటలతో పాటు పశువులను పెంచుకుంటూ సమగ్ర వ్యవసాయం చేస్తున్నా. పత్తి సాగులో ఖర్చులు తగ్గించుకోవాలని నానో ఎరువులు వాడటం మొదలుపెట్టా. సాధారణ ఎరువులు సగం తగ్గించి, వాటి బదులు నానో యూరియా, నానో డీఏపీ పిచికారీ చేశా. ఆశ్చర్యం ఏంటంటే, ఎరువుల ఖర్చు తగ్గి, దిగుబడి పెరిగింది! పక్క పొలంలో ఎకరానికి పత్తి 8.5 క్వింటాళ్లు వస్తే, నా పొలంలో 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నానో ఎరువులతో రైతుకు లాభమే.– మల్లారావు (99597 13273), రవిపహాడ్, సూర్యాపేట జిల్లాపూర్తిగా నానో ఎరువులే వాడుతున్నా..గత మూడేళ్లుగా నేను ఒక్క బస్తా గుళికల యూరియా, డీఏపీ కూడా వాడలేదు. పూర్తిగా నానో ఎరువులపైనే ఆధారపడుతున్నా. నానో డీఏపీతో విత్తనశుద్ధి చేస్తా, ఆ తర్వాత మూడు సార్లు నానో యూరియా పిచికారీ చేస్తా. దీనికి అదనంగా జీవ ఎరువులను కూడా వాడుతున్నా. ఈ విధానంతో పత్తి, వరి, మొక్కజొన్నలో నాణ్యమైన దిగుబడి సాధిస్తున్నా. నా పొలంలో వచ్చిన ఫలితాలు చూసి, మా ఊరి రైతులు చాలా మంది నానో ఎరువులు వాడటం మొదలుపెట్టారు.– బోయపాటి నరసింహారావు (88970 07608), అనంతారం, వరంగల్ జిల్లానానో ఎరువులతో కొత్త మార్పు సోయా, పత్తి పంటల్లో రెండు సంవత్సరాలుగా నానో ఎరువులు వాడుతున్నా. ముందు బస్తాల ఎరువులు ఎక్కువ వేస్తేనే పంట బాగుంటుందని అనుకునేవాళ్లం. కానీ నానో ఎరువులు వేసాక మొక్కలు ఇంకా ఆరోగ్యంగా, సమానంగా పెరుగుతున్నాయి. పత్తిలో కాయ పరిమాణం పెరగడం, సోయాలో పూత సమానంగా వస్తోంది. స్ప్రే చేసిన తర్వాత మొక్కల పెరుగుదల బాగుంది. పెట్టుబడి తగ్గినా పంట నాణ్యత మాత్రం బాగుంది. నానో ఎరువులతో కొత్త మార్పు వచ్చింది.– ఉగ్గె రాము (90005 91246), చందా(టీ), ఆదిలాబాద్ రూరల్ మండలం, ఆదిలాబాద్ జిల్లా -
ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్ కరదీపిక
ప్రకృతి వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిలోకి తేవాలన్న లక్ష్యంతో సమగ్రమైన ట్రైనింగ్ మాన్యువజీల్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ ఇటీవలే వెలువరించింది. ‘రైతులకు సాధికారత కల్పించటం: ప్రకృతి వ్యవసాయ శిక్షణా కిట్ – ఉత్తమ పద్ధతుల మార్గదర్శిని’ పేరుతో రూపొందించారు. ప్రకృతి సేద్య మూల సూత్రాలతో పాటు.. ముఖ్యమైన 22 రకాల పంటల సాగులో క్షేత్రస్థాయిలో ఆచరించదగిన ప్రామాణిక ప్రకృతి సేద్య పద్ధతులను పొందుపరిచారు. నీతి ఆయోగ్ వ్యవసాయం–సాంకేతిక విజ్ఞాన విభాగం ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ నీలం పటేల్, కన్సల్టెంట్ పరెమల్ బనఫర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం దీన్ని రూపొందించింది.రైతులు, విస్తరణ సిబ్బంది, విధాన నిర్ణేతలకు సుస్థిర వ్యవసాయ విస్తరణ దిశా నిర్దేశం చేయటానికి ఈ శిక్షణా మాన్యువల్, ఉత్తమ ప్రకృతి సేద్య పద్ధతులకు అక్షర రూపం ఇచ్చినట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ పేర్కొన్నారు. డాక్టర్ నీలం పటేల్ ఇలా అన్నారు: ‘దేశవ్యాప్తంగా రైతులు అనుసరిస్తున్న ప్రకృతి సేద్య పద్ధతులు, ఆవిష్కరణలు, సంప్రదాయ విజ్ఞానంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రకృతి సేద్య అనుభవాల ఆధారంగా ఈ శిక్షణా మాన్యువల్ను రూపొందించాం. దేశంలో సుస్థిర వ్యవసాయాన్ని విస్తరింపజేయటంలో ఇదొక కీలక ముందడుగు’. ప్రకృతి వ్యవసాయ వారసత్వాన్ని సుసంపన్నం చేసిన సుభాష్ పాలేకర్ (మహారాష్ట్ర), ఎల్. నారాయణరెడ్డి (కర్ణాటక), శ్రీపాద దబోల్కర్, జి. నమ్మాళ్వార్ (తమిళనాడు), దీపక్ సచ్దే (మధ్యప్రదేశ్), భాస్కర్ సావే (గుజరాత్)ల సేవలను ఇందులో ప్రస్తుతించారు. దేశవ్యాప్తంగా ప్రకృతి సేద్య పథకాలు అమలవుతున్నాయని, 9.4 లక్షల హెక్టార్లలో సుమారు 10 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. అధిక దిగుబడి.. అధిక నికరాదాయం!వరిని వరుసగా 4 ఏళ్లు ప్రకృతి వ్యవసాయం (ప్ర.వ్య.)లో పండిస్తే 2023 ఖరీఫ్లో ఎకరానికి 33.75 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. రసాయన వ్యవసాయం (ర.వ్య.)లో 31.5 క్వింటాళ్లు వచ్చింది. ఈ రెండు ధాన్యాలను క్వింటా రూ.2,040కే విక్రయించారు. ప్ర.వ్య.లో నికరాదాయం రూ.48 వేలు రాగా, రూపాయి ఖర్చుకు 2.3 రూపాయల ఆదాయం వచ్చింది. ర.వ్య.లో నికరాదాయం రూ.35,140 రాగా, రూపాయి ఖర్చుకు 1.2 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది. → ప్రధాన పంటలన్నింటిలో సాగు ఖర్చును కనీసం 5–10% తగ్గిస్తుంది. మరికొన్ని పంటల్లో, కొన్ని రాష్ట్రాల్లో 20–55% వరకు తగ్గింది. ∙ప్రకృతి వ్యవసాయం రైతులు, వినియోగదారుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. → నేలల్లో సేంద్రియ కర్బనం 1947లో 2.5% ఉండేది. ఇప్పటికి 0.4%కి తగ్గింది. ప్రకృతి వ్యవసాయం దీన్ని 45% వరకు పెంచుతుంది. ∙నీరు, విద్యుత్లో 50–60% ఆదా అవుతుంది. ∙కర్బన ఉద్గారాలను 55–85% తగ్గిస్తుంది. ∙పశువులను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచటం రైతులకు లాభదాయకంగా ఉంటుంది.→ పంటల వైవిధ్యం, అంతరపంటలు, బహుళ అంచెల పంటలతో వ్యవసాయా దాయ భద్రత, పోషకాహార భద్రత పెరుగు తాయి. రసాయనిక సేద్యం ఏకపంట సాగుతో పోలిస్తే 20–40% అధిక నికర ఆదాయం వస్తుంది. జీవామృతం.. 48 గంటలు పులిస్తే చాలు!జీవామృతం కోసం పేడ, మూత్రం, పప్పుల పిండి, బెల్లం, మట్టిని డ్రమ్ము నీటిలో కలిపిన తర్వాత 2–3 రోజులు పులియబెట్టి పంటలకు వాడుకోడానికి సిద్ధమైనట్లే. కలిపిన 48 గంటల్లో బ్యాక్టీరియా పూర్తిస్థాయిలో వృద్ధి చెందుతుంది. సిద్ధమైన జీవామృతాన్ని వేసవిలో 7 రోజుల వరకు, శీతాకాలంలో 8–10 రోజుల్లో వాడుకోవచ్చని నీతి ఆయోగ్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ మాన్యువల్ చెబుతోంది.ప్రకృతి సేద్యానికి మార్గదర్శకంరసాయనిక వ్యవసాయానికి ఒక సుస్థిరమైన ప్రత్యామ్నాయం ప్రకృతి వ్యవసాయం. ఇటు సంప్రదాయ విజ్ఞానాన్ని అటు ఆధునిక పర్యావరణ విజ్ఞానాన్ని ఇముడ్చుకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రూపొందాయి. ప్రస్తుతం ఆధునిక వ్యవసాయంలో ఎదురవుతున్న సవాళ్లకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు దీటైన సమాధానాలు ఇవ్వగలవు. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతోనే వ్యవసాయానికి సుస్థిరత చేకూర్చటం సాధ్యమని ఈ పద్ధతులు చాటి చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా రైతులకు, విస్తరణ సిబ్బందికి ప్రకృతి సేద్య పద్ధతులపై శిక్షణ ఇవ్వటానికి ఈ మాన్యువల్ మార్గదర్శకంగా నిలుస్తుంది. – ప్రొఫెసర్ రమేశ్ చంద్, వ్యవసాయ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సీనియర్ సభ్యులు -
రైతులకు అండగా ‘టాప్కో’
చిన్న, సన్నకారు రైతులను కూడగట్టి పంచాయతీ స్థాయిలో వారికి అవసరమైన అన్ని రకాల సేవలు అందించటంలో తిరునెల్లి అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ (టాప్కో) ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది. కేరళలోని వాయనాడ్ జిల్లా తిరునెల్లి పంచాయతీలో 9 ఏళ్ల క్రితం 51 మంది రైతుల భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రకృతి వ్యవసాయ శిక్షణ, దేశీ వరి వంగడాల పరిరక్షణ, రైతులు పండించిన ప్రతి గింజనూ సమంజసమైన ధరకు కొనుగోలు చెయ్యటం కీలకపాత్ర పోషిస్తోంది. దేశీ వరి, కూరగాయ విత్తనాలను సుమారు 5 వేల మంది రైతులకు అందిస్తోంది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తోడ్పాటుతో ప్రతి మంగళవారం గ్రామస్థాయిలో వాతావరణ సంబంధమైన సూచనలు, సలహాలను అందించటం విశేషం.గ్రామ స్థాయిలో వాతావరణ సూచనలు: వరి, కాఫీ, మిరియాలు, దుంప పంటలు, కూరగాయలు.. ఈ ఐదు రకాల పంటలకు సంబంధించి పంచాయతీలోని 8 కొండ ప్రాంత గ్రామాల్లో ప్రతి 5 కిలోమీటర్లను ఒక యూనిట్గా తీసుకొని వాతావరణ సూచనలు ఇందిస్తోంది. భారత వాతావరణ శాఖ జిల్లా స్థాయి వాతావరణ సూచనలతో సరిపెట్టుకుంటూ ఉన్నందున తాము గ్రామ స్థాయి సూచనలు అందించటం రైతులకు ఉపయుక్తంగా ఉంటున్నదని టాప్కో సీఈవో, సేంద్రియ రైతు రమేశ్ కృష్ణన్ చెప్పారు. మైసూరులో ఇటీవల జరిగిన ఆషా కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. అనూహ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులపై పంచాయతీ స్థాయిలో పరిశోధనలు చెయ్యటం, గమనించిన మార్పులను, వాటిని తట్టుకునేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజెయ్యటం ద్వారా టాప్కో సత్ఫలితాలు సాధిస్తోంది. తిరునెల్లి పంచాయతీ కూడా ఏమీ వెనుకబడి లేదు. ఈ ఏడాది నుంచి ప్రతి వార్డులో ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వర్షం తదితర వాతావరణ సమాచారాన్ని హ్యూమెస్ ట్రస్టు తోడ్పాటుతో ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు పంచాయతీ ప్రజలకు అందిస్తోందన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని బట్టి ధర: తమ సంస్థ సభ్యులైన రైతులు ఏమేమి పంటలు, ఎంత విస్తీర్ణంలో పండించాలన్నది ప్రతి ఏటా ఖరీఫ్కు ముందు క్రాప్ కేలండర్ను రూపొందించుకుంటున్నామని రమేశ్ కృష్ణన్ వివరించారు. ముఖ్యంగా అంతరించిపోతున్న సంప్రదాయ వరి వంగడాలను గుర్తించి, మార్కెట్ అవసరాల మేరకు సాగు చేయిస్తున్నామన్నారు. పూర్వం నుంచి వరి సాగు చేస్తున్న భూములను ఇతర అవసరాలకు మళ్లించకుండా రైతులకు నచ్చజెప్పటంతో పాటు సేంద్రియ సేద్యానికి, మార్కెటింగ్ సదుపాయం ద్వారా మంచి ఆదాయం రైతులకు అందించటానికి కృషి చేస్తున్నామన్నారు. ఏ రకం దేశీ వరి దాన్యం సగటున ఎకరానికి ధిగుబడి ఎంతో ఆ ఉత్పత్తి వ్యయాన్ని బట్టి సీజన్కు ముందుగానే రైతు నుంచి కొనుగోలు చేసే ధరను టాప్కో నిర్ణయించటం మరో విశిష్టత. ఎక్కువ దిగుబడి వచ్చే వంగడం ధాన్యం ధర తక్కువగా ఉంటుంది. తక్కువ దిగుబడి వచ్చే రకం ధర ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. ఎకరానికి 2 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే రెడ్ రైస్ ధాన్యానికి కిలో రూ. 34, తక్కువ దిగుబడినిచ్చే రకానికి రూ.130 చెల్లిస్తున్నారు.వయనాడ్ తొండి, పాల్ తొండి, చెంతడి, వలై చెన్నెల్లు, నవార, గంధకశాల, జీరకశల, ముల్లంకైమ తదితర రకాల దేశీ వరి రకాల బియ్యం, పిండి, రవ్వ, అటుకులను టాప్కో ప్రత్యేక దుకాణంలో విక్రయిస్తున్నారు. స్థానిక వాతావరణానికి పూర్వకాలం నుంచి అనువుగా ఉండే పాత పంటలను పరిరక్షించుకోవటం, రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయక మైన ఆహారాన్ని ప్రజలకు అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఈ పనులను రైతులకు గిట్టుబాటయ్యేలా చెయ్యటంలో తమ ఎఫ్పీసీ విజయం సాధిస్తోందని రమేశ్ కృష్ణన్ సంతోషంగా చెప్పారు. -
సక్సెస్ బాటలో సహజ ఆర్గానిక్స్
దేశంలో సేంద్రియ వ్యవసాయానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై అధ్యయనం చెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం డాక్టర్ కున్వర్జి భాయ్ జాధవ్ అధ్యక్షతన తొలి ఆర్గానిక్ ఫార్మింగ్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. దీని నివేదిక ఆధారంగానే ‘నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్’ (ఎన్పీఓపీ) పేరిట తొలి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వ్యవస్థ 2000 మార్చిలో అమల్లోకి వచ్చింది. సేంద్రియ వ్యవసాయం, సర్టిఫికేషన్ వ్యవహారాలను సమన్వయపరచడానికి ‘నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ (ఎన్సీఓఎఫ్)’ 2004లో ప్రారంభమైంది. తదనంతరం ఈ సంస్థ పేరులో ‘నేచురల్’ అనే పదాన్ని చేర్చటం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ దీని పరిధిలోకి తెచ్చింది. అదే ఏడాది తొలి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని 2004 మార్చి 24న అమల్లోకి తెచ్చిన ఘనత కర్ణాటక రాష్ట్రానికి దక్కింది. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న బెంగళూరుకు చెందిన సహజ ఆర్గానిక్స్ ఎఫ్పీఓ ప్రజల ఆదరణ పొందుతోంది.130 ఉత్పత్తులు... రూ.28 కోట్ల టర్నోవర్కర్ణాటకలో ఏర్పాటైన తొలి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ‘సహజ సమృద్ధ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’. 16 ఏళ్ల క్రితం కంపెనీ చట్టం ప్రకారం బెంగళూరులో రిజిస్టరైన ఈ ఎఫ్పీఓ తన వాటాదారులైన 1,024 మంది సేంద్రియ రైతులకు అధిక నికరాదాయాన్ని అందిస్తోంది. దానితో పాటు, 15 రాష్ట్రాల్లోని సేంద్రియ రిటైల్ విక్రయదారులకు, వినియోగదారులకు నమ్మకమైన రసాయన అవశేషాల్లేని ఆహారోత్పత్తులను ‘సహజ ఆర్గానిక్స్’ బ్రాండ్తో చేరవేస్తోంది. 130 పచారీ సామాన్లతో పాటు వంద రకాలకు పైగా కూరగాయలు, పండ్లను టోకుగా, రిటైల్గా విక్రయిస్తూ గత ఏడాది రూ.28 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించింది. ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా ఫస్ట్ ప్రైజ్ సహా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు గెల్చుకుంది. అన్నిటికీ మించి, 2018 జూన్ 24న ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు పొందటం విశేషం.రైతుకు 15–20% అదనపు ధరసహజ ఆర్గానిక్స్ తన వాటాదారులైన రైతుల నుంచి, దేశవ్యాప్తంగా 25కు పైగా సేంద్రియ రైతు బృందాల నుంచి∙ఈ ఎఫ్పీఓ దేశీ వరి బియ్యం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, బెల్లం, తేనె తదితరాలను సేకరిస్తుంది. బెంగళూరు పరిసరాల్లోని 5 గ్రామాల్లో సేంద్రియ రైతుల నుంచి కూరగాయలు, పండ్లను సేకరిస్తుంది. రైతులకు, ప్రాసెసింగ్ యూనిట్, మిల్లులకు ఎన్పీఓపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్తో పాటు ఐఎంఓ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ తప్పనిసరి చేశారు. రైతులకు మార్కెట్ ధరపై 15–20% అదనపు ధర చెల్లిస్తున్నట్లు సహజ ఆర్గానిక్స్ ప్రతినిధి ప్రసాద్ బెంగళూరులోని ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించిన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ప్రతి పంటకు బేస్ ధర ఉంటుంది. బహిరంగ మార్కెట్లో అంతకన్నా ధర పతనమైనా ఎఫ్పీఓ ఆ ధర చెల్లిస్తుందన్న మాట. ఉదా.. టొమాటో బేస్ ధర కిలోకు రూ. 10–12. ఎఫ్పీఓ ఖరారు చేసిన ముందస్తు ప్రణాళిక ప్రకారం.. రైతులు మిశ్రమ సేంద్రియ పంటలను నిర్దేశిత విస్తీర్ణంలో సాగు చేస్తారు. అవసరానికి మించి పండితే సాధారణ ధరలకే స్థానిక మార్కెట్లలో విక్రయిస్తారు. రైతులకు వారానికోసారి పైకం చెల్లిస్తున్నారు. ఎఫ్పీఓకి వచ్చిన లాభాల్లో నుంచి ఏడాదికి ఓసారి బోనస్ (విత్హెల్డ్ ప్రైస్) చెల్లిస్తున్నారు.అంతర్జాతీయ ప్రమాణాల వల్లనే ప్రజల ఆదరణఆరోగ్యకరమైన సేంద్రియ ఆహారోత్పత్తి ద్వారా వినియోగదారులకు, రైతులకు, మట్టికి, పర్యావరణానికి మేలు జరుగుతోంది. దీని ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రజలు మున్ముందు ఇంకా ఎక్కువగా గుర్తిస్తారు. బెంగళూరు, చెన్నై, కేరళ తదితర ప్రాంతాల్లో మా ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. మా వద్ద ఆర్గానిక్ ఉత్పత్తులను టోకుగా కొనుగోలు చేసి, ఎక్కడైనా రిటైల్గా విక్రయించుకునే వారి కోసం వైట్ ప్యాకింగ్తో లేదా వారి బ్రాండ్ కవర్తో ప్యాక్ చేసి ఇస్తున్నాం. నాణ్యత, విశ్వసనీయత, ట్రేసబిలిటీలకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నాం. మా సేంద్రియ ఉత్పత్తులకు గత 16 ఏళ్లుగా ప్రజాదరణ పెరుగుతోంది.– బి. సోమేశ్, సీఈవో, ఎండీ, సహజ సమృద్ధ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ కంపెనీ, సిద్ధనపాల్య, బెంగళూరు somesh@sahajaorganics.com -
‘ఎండోసల్ఫాన్’పై విజయం ఒక మలుపు
ఉషా సూలపాణి (63).. తిరువనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న సేంద్రియ వ్యవసాయోద్యమ ప్రచారకర్త. దేశీ వరి వంగడాల వైవిధ్యం, పురాతన ఆహార సంస్కృతుల పరిరక్షణ, పునరుద్ధరణ లక్ష్యంతో ఆమె ‘సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్’ను రెండు దశాబ్దాలకు పైగా ముందుండి నడిపిస్తున్నారు. వాతావరణ మార్పులను దీటుగా తట్టుకునే వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ వ్యవసాయంలో శక్తి వినియోగ సామర్థ్యంపై ప్రస్తుతం పని చేస్తున్నారు. ఆమె థనాల్ ట్రస్టు వ్యవస్థాపకురాలు. థనాల్ సేంద్రియ ఉత్పత్తిదారుల కంపెనీ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. ఎమ్మెస్సీ హార్టీకల్చర్ చదివి 1986లో వ్యవసాయ శాఖ అధికారిగా ఉద్యోగంలో చేరారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాన్ని వదిలి సేంద్రియ వ్యవసాయ ఉద్యమ ప్రచార కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించారు. ఎండోసల్ఫాన్ వంటి రసాయనిక పురుగుమందులకు వ్యతిరేకంగా ఉద్యమించి విజయం సాధించటం తన జీవితంలో గొప్ప మలుపు వంటిదని ఆమె అంటారు. ఇటీవల మైసూరులో కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో అతిథిగా పాల్గొన్న ఆమెతో ‘సాక్షి సాగుబడి’ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..→ వ్యవసాయాధికారి ఉద్యోగాన్ని వదిలి సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ ఉద్యమంలోకి మీరు ప్రవేశించారు. ఈ 35 ఏళ్లలో మీ జీవన అనుభవాలను వివరిస్తారా?భోపాల్ గ్యాస్లీక్ ఉదంతం, సైలెంట్ స్ప్రింగ్ (రాచెల్ కార్సెన్ రచన) పుస్తకం ప్రేరణతో వ్యవసాయ అధికారి ఉద్యోగానికి స్వస్తి చెప్పి పర్యావరణ ఉద్యమంలోకి వచ్చాను. ఎటుచూసినా పచ్చని చెట్లు, నీటితో ఆవరించి ఉండే కేరళ దశాబ్దాల నిర్లక్ష్యం కారణంగా పర్యావరణ వినాశనం జరుగుతోంది. సమాజం నానాటికీ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నప్పటికీ పర్యావరణ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. అందుకే, పర్యావరణాన్ని, స్థానిక పాత పంటలను, పురాతన వ్యవసాయ సంస్కృతిని పరిరక్షించుకోవాలనే చైతన్యాన్ని ప్రజల్లో రగిలించే ఆశయంతో పనిచేస్తున్నాం. 1986లో థనల్ ట్రస్టును ఏర్పాటుచేశాం. ఎన్నో అంశాలపై ప్రచారోద్యమా లను విజయవంతంగా నిర్వహించగలిగాం. ఈ ఉద్వేగభరిత ప్రయాణంలో మాతో చాలా మంది జత కలిశారు. → సేంద్రియ ఆహార మార్కెట్ల అభివృద్ధిలో మీ అనుభవాలు చెప్పండి.. 2002లో తిరువనంతపురం జిల్లాలో రెండు పంచాయితీల్లో పనిచేయటం ప్రారంభించాం. మహిళా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చెయ్యటం, సేంద్రియ సేద్యం, ఇంటి పంటల సాగుపై శిక్షణ ఇవ్వటంతో కొబ్బరి, కూరగాయలు, అరటి పండ్లు.. వంటి సేంద్రియ సాగు పెరిగింది. అయితే, ఎవరికి అమ్మాలి? ఎక్కడ అమ్మాలి? అనే సవాళ్లు వచ్చాయి. అప్పుడు సేంద్రియ రైతుల మార్కెట్లను తిరువనంతపురంలో ఏర్పాటు చేయించాం. రైతుల భాగస్వామ్యంతో 2009లో థనాల్ ఆర్గానిక్ బజార్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాం. నెలకోసారి సేంద్రియ సంతతో మార్కెట్ను ప్రారంభించాం. ప్రజాదరణతో రెండేళ్లలోనే వారాంతపు మార్కెట్లు నిర్వహించాల్సి వచ్చింది. 2011 నాటికి అనుదిన సేంద్రియ మార్కెట్ నిర్వహణ ప్రారంభమైంది. → ‘సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్’ ఎప్పుడు మొదలైంది..?మన పురాతన ఆహార, వ్యవసాయ సుసంపన్న సంస్కృతిలో భాగమైన దేశీ వరి వంగడాలు కనుమరుగైపోతున్న స్థితిలో 2004లో ‘సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్’ ప్రారంభించాం. అది ఐరాస అంతర్జాతీయ రెండవ వరి సంవత్సరం. కొచ్చిన్లో జాతీయ స్థాయి సమావేశం పెట్టాం. పది రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి పాల్గొనటంతో కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాం. దేశీ వరి రకాలను సేకరించి, పండించటమే కాదు నుంచి మార్కెటింగ్ వరకు వాల్యూ చెయిన్ నిర్మించాం. వినియోగదారుల్లో అవగాహన పెంచటం కోసం ప్రత్యేక కృషి చేశాం. సీడ్ ఫెస్టివల్స్, ఫుడ్ ఫెస్టివల్స్ ఇందుకు బాగా ఉపయోగపడ్డాయి. → ఇప్పటికి ఎన్ని రకాలను పరిరక్షించారు?ఈ 22 ఏళ్లలో 1,400 రకాల దేశీ వరి రకాలను పరిరక్షించి రైతులు, విత్తనోత్పత్తి సంఘాల ద్వారా సాగులోకి తెచ్చాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశీ రకాలను ప్రాధాన్యాన్ని గుర్తించాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు దేశీ రకాలను ప్రత్యేకంగా ఆర్గానిక్గా సాగు చేస్తున్నాయి. దేశీ రకాలను 95% సేంద్రియంగానే సాగు చేస్తున్నారు. అనేక యూనివర్సిటీలు కూడా దేశీ రకాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కూడా వచ్చాయి.→ ఏయే రాష్ట్రాల్లో ఆదరణ బాగుంది?కేరళ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిషా, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వరి తదితర దేశీ విత్తనాలకు ఎక్కువ ఆదరణ ఉంది. పశ్చిమబెంగాల్లో దేశీ వరి ఆధారిత సమీకృత వ్యవసాయ పద్ధతి అమల్లోకి వచ్చింది. వరి, కూరగాయలు, చేపలు, కోళ్లతో కూడి ఉంటుందీ పద్ధతి. → అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం 2026 కదా..అవును. వ్యవసాయం అంటేనే మహిళ కేంద్రంగా జరిగే పని. విత్తనం దగ్గరి నుంచి నూర్పిడి వరకు వ్యవసాయ పనుల్లో 70% మహిళల శ్రమ చాలా కీలకంగా ఉంది. మహిళా రైతుల హక్కుల అమలును ప్రోత్సహించడానికి అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం ఉపయోగపడుతుంది. → రైతులు వాతావరణ మార్పుల్ని తట్టుకోవాలంటే..?ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని, చీడపీడల్ని తట్టుకోవాలంటే పర్యావరణ హితమైన పద్ధతుల్లో బహుళ పంటలను సాగు చెయ్యాలని మా అనుభవాలు చెబుతున్నాయి. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించే రైతులు నేరుగా వినియోగదారులకు అమ్ముకునే విధంగా మార్కెట్ సదుపాయాల కల్పనపై ప్రభుతం దృష్టి పెట్టాలి. కానీ, ప్రభుత్వ శాఖలు దేనికదే అన్నట్లు ఒంటెద్దు పోకడలా పనిచేస్తున్నాయి. అన్నీ కలిసి పనిచేస్తేనే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. సేంద్రియ/ప్రకృతి సేద్య నమూనాలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది రైతులు ఈ పద్ధతిలోకి మారటానికి అవకాశం ఉంటుంది. సౌరశక్తిని వాడుకోవాలి. తద్వారా రసాయనిక వ్యవసాయ హరితగృహ వాయువులను 30% తగ్గించుకోవచ్చు. → వ్యవసాయం వైపు యువతను ఆకర్షించటం ఎలా?ఇటీవల కాలంలో సేంద్రియ/ప్రకృతి సేద్యం వైపు యువతీ యువకులు బాగానే ఆకర్షితులవుతున్నారు. మహిళలు కూడా సేద్యంలోకే కాదు మార్కెటింగ్ నైపుణ్యాలతో అగ్రిప్రెన్యూర్స్గానూ రాణిస్తున్నారు. కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలోనూ కొందరు పాల్గొన్నారు.ఎండోసల్ఫాన్ నిషేధానికి దారితీసిన ఉద్యమం గురించి చెప్పండి..1997–98 నుంచి రసాయనిక పురుగుమందులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించటం ప్రారంభించాం. ఎండోసల్ఫాన్ పురుగుమందును హెలికాప్టర్లతో జీడి తోటపై పిచికారీ చేయటం వల్ల ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యం నాశనమైంది. అప్పట్లో గణాంకాలు పెద్దగా అందుబాటులో లేవు. వైద్యులు, హెల్త్ వర్కర్స్ తదితరులు కలసి రావటంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి గణాంకాలు తయారు చేసి వెలుగులోకి తెచ్చాం. మీడియా తోడ్పాటుతో చైతన్యం తేగలిగాం. ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఎట్టకేలకు ఎండోసల్ఫాన్ను నిషేధించటం మా ఉద్యమానికి గొప్ప మలుపుతిప్పింది. ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఈ విజయం తర్వాతే సేంద్రియ వ్యవసాయంపై మరింత లోతుగా దృష్టి కేంద్రీకరించాం. -
సాధికారత @ బీబీజాన్!
బీబీజాన్ హలేమణి (40).. విశేష కృషితో లోకాన్ని తన వైపు తిప్పుకున్న ఓ సాధారణ మహిళా రైతు, స్వయం సహాయక సంఘం సారథి. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా కుందగొడ తాలూకాలో హుబ్లి నుంచి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉన్న ఒక గ్రామం ‘తీర్థ’ ఆమె స్వస్థలం. అంతా వర్షాధార వ్యవసాయమే. ఆమె కుటుంబం 3 ఎకరాల సొంత భూమి 7 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తోంది. రాజనీతి శాస్త్రంలో బీఏ చదివిన బీబీజాన్ భర్త మౌల వ్యాపారి. ఇద్దరు పిల్లలు. కొడుకు బీఎల్, కూతురు బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారు. చదువు, సామాజిక దృష్టి కలిగినప్పటికీ.. ఇంటి పనులతో పాటు కుటుంబ వ్యవసాయ పనులు చేస్తూ ఒకానొక కుగ్రామంలో కాలం వెళ్లదీస్తున్న ఆమె జీవితం ఏడేళ్ల క్రితం గొప్ప మలుపు తీసుకుంది. యూఎన్డీపీ ఈక్వేటర్ అవార్డు2019లో 15 మంది మహిళల భాగస్వామ్యంతో బీబీజాన్ సార«థ్యంలో ఏర్పాటైన ‘బీబీ ఫాతిమా స్వయం సహాయక సంఘ’మే అందుకు కారణం. ఆరేడేళ్లు గడిచే సరికి వారంతా సాధికారతను సాధించుకున్నారు. తమ ఊరితో పాటు 30 ఊళ్లలో వ్యవసాయాన్ని నిలబెట్టే దిశగా మరల్చేందుకు ఈ సంఘమే దోహదపడింది. అందుకే గత ఏడాది ప్రసిద్ధ ‘యూఎన్డీపీ ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డు’ను ఈ సంఘం గెల్చుకుంది. పంటల జీవవైవిధ్యానికి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను వ్యాప్తిలోకి తెచ్చే పది సంస్థలకు ఏటాఈ పురస్కారం ఇస్తుంటారు. దీనితో పాటు రూ.9 లక్షల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు. అంతరించిపోతున్న చిరుధాన్యాలతో కూడిన మిశ్రమ సాగు పద్ధతిని ఈ సంఘం వ్యాప్తిలోకి తేవటానికి కీలక సాధనంగా ఉపయోగపడింది. చిరుధాన్యాలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలను మిశ్రమ సాగు ద్వారానే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ రైతులు నిలదొక్కుకోగలరని తెలియజెప్పి, రైతులు సుమారు 2 వేల హెక్టార్లలో అనుసరించేలా చెయ్యటంలో బీబీజాన్ నేతృత్వంలోని మహిళా సంఘం అపూర్వ విజయం సాధించింది. ఇందులో 25% రైతులు ప్రకృతి, సేంద్రియ పద్ధతుల్లోకి మారారని చెబుతూ.. రైతులతో సాగు పద్ధతిని మార్పించటం అంత సులభం కాదని బీబీజాన్ ‘సాక్షి సాగుబడి’తో అన్నారు. సహజ సమృద్ధ స్వచ్చంద సంస్థ మార్గదర్శనంలో భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) తదితర సంస్థల తోడ్పాటు తీసుకుంది. మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రం, సౌర విద్యుత్తు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ ఈ సంఘం ఆదర్శవంతంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. బీబీ ఫాతిమా ఎస్హెచ్జి ఇతర సంఘాలతో కలసి ఏర్పాటు చేసుకున్న దేవధాన్య ఎఫ్పీసీ ఈ సంవత్సరం రూ. 1.5 కోట్ల వ్యాపారం చేసింది. 350 రకాలతో దేశీ విత్తన నిధి సొంత, దేశీ విత్తనాలు కాపాడుకోవటానికి ఈ సంఘం విత్తన నిధిని ఏర్పాటు చేసింది. విత్తనం రైతులు కొనే పనిలేదు. పది కిలోల విత్తనాలు తీసుకుంటే పంట పండించి 20 కిలోలు తిరిగి ఇవ్వాలి. అంతే. ఈ సామాజిక విత్తన బ్యాంకులో ఇప్పుడు 350 దేశీ రకాల విత్తనాలున్నాయి. 74 రకాల రాగులు, 10 రకాల కొర్రలు, 25 రకాల సామలు, 25 రకాల పప్పుధాన్యాలు, 80 కూరగాయల విత్తనాలు ఈ విత్తన బ్యాంకులో రైతులు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన 30 మంది రైతులతో దేశీ విత్తన ఉత్పత్తి చేయిస్తున్నారు. పంట దిగుబడులను దేవధాన్య ఎఫ్పీవో, సహజ ఆర్గానిక్స్ ఎఫ్పీవోల ద్వారా విక్రయిస్తున్నారు. సీడ్, మిల్లెట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ రైతులే నేరుగా వినియోగదారులకు సేంద్రియ ఆహారాన్ని అమ్మే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుండటం విశేషం.25% మంది చిరుధాన్యాలు తింటున్నారుమా ప్రాంతంలో రైతులు 2 వేల హెక్టార్లలో చిరుధాన్యాల మిశ్రమ సాగు చేస్తున్నారు. సుమారు 15 గ్రామాల రైతులు తమ ధాన్యాలను మా ప్రాసెసింగ్ యూనిట్లో ప్రాసెసింగ్ చేయించుకుంటున్నారు. మా యంత్రంలో 10 కిలోల చిరుధాన్యాలను కూడా మరపట్టించి బియ్యం తయారు చేసుకోవచ్చు. 2024లో దాదాపు 50 మెట్రిక్ టన్నుల మిల్లెట్లు ప్రాసెస్ చేశాం. మా సంఘం ఏర్పాటైనప్పుడు మా గ్రామంలో ఎవరూ చిరుధాన్యాలు తినేవారు కాదు. కానీ ఇప్పుడు కనీసం 25% మంది ప్రతిరోజూ చిరుధాన్యాల బియ్యంతో వండిన అన్నం తింటున్నారు. యూఎన్డీపీ ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డు మా బాధ్యతను మరింత పెంచింది. ఈ పురస్కారం మాకు మాత్రమే చెందినది కాదు. దేశంలో మహిళా రైతులందరికీ దీన్ని అంకితం చేస్తున్నాం. – బీబీజాన్, బీబీ ఫాతిమా స్వయం సహాయక సంఘం, కర్ణాటక, యూఎన్డీపీ ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డు గ్రహీత. -
పోషక లోపాలు తీర్చే చొప్ప!
దేశంలో పశువుల పోషకాహార లోటును పరిష్కరించడానికి పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్ ఒక సమర్థవంతమైన, సుస్థిరమైన పరిష్కారం. పంటలు పెరిగే దశలోనే వాటిలో అవసరమైన పోషకాల (జింక్, ఇనుము, రాగి వంటి సూక్ష్మపోషకాల) పరిమాణాన్ని, వాటి జీవ లభ్యతను సస్యవిజ్ఞాన పద్ధతుల్లో పెంపొందించడాన్నే బయోఫోర్టిఫికేషన్ అంటారు. బయోఫోర్టిఫికేషన్ మూడు విధాలు: 1. నేల ద్వారా ఎరువుల వినియోగం.. పొలం మట్టిలో లోపించిన పోషకాలను లేదా సూక్ష్మపోషకాలను నీటిలో కలిపి నేలకు అందిస్తారు. 2. పంటలపై పిచికారీ చేయడం.. ఎరువులను ద్రవరూపంలో నేరుగా మొక్కల ఆకులపై పిచికారీ చేస్తారు. దీని వల్ల మొక్కలు పోషకాలను వేగంగా గ్రహిస్తాయి. 3. సూక్ష్మజీవుల ప్రయోగం.. నేలలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను మట్టిలో కలుపుతారు. తద్వారా మొక్కలు నేల నుంచి పోషకాలను తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.నత్రజని ప్రాముఖ్యతపంట అభివృద్ధికి, పశుగ్రాస ఉత్పత్తికి నత్రజని చాలా కీలకమైన పోషకం. ఇది ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, పత్రహరితం, ఇతర ముఖ్యమైన అణువుల నిర్మాణానికి అవసరం. నత్రజని ఎరువులు మేత నాణ్యతను, ముఖ్యంగా పొడి పదార్థం, ముడి మాంసకృత్తుల సాంద్రతను పెంచుతాయి.పరిశోధనా ఫలితాల ప్రకారం, హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు వాడినప్పుడు, మొక్కజొన్న గ్రాసంలో జింక్ (15.3%), రాగి (7.5%), మాంగనీస్ (28.4%), ఇనుము (15.6%) వంటి సూక్ష్మపోషకాల స్థాయిలు పెరిగాయి. నత్రజని (120 కిలోలు/హెక్టారు)ని పశువుల ఎరువుతో కలిపి వాడటం వల్ల పశుగ్రాసంలో ముడి ప్రొటీన్లు 36.56% వరకు పెరిగినట్లు పరిశోధనా ఫలితాలు వెల్లడిస్తున్నాయి.గొర్రెల్లో జింక్ లోపం పోయిందిమొక్కజొన్న, అలసంద వంటి పశుగ్రాస పంటల పెరుగుదలకు, అధిక దిగుబడికి జింక్ చాలా ముఖ్యం. పశుగ్రాసంలో జింక్ లోపం ఉంటే పశువుల ఎదుగుదల తగ్గటం, పునరుత్పత్తి సమస్యలు, ఎముకలు, చర్మ కణజాలం దెబ్బతినటం జరుగుతాయి. 2020లో డా. గిరిధర్ బృందం బెంగళూరులో (ఐసీఏఆర్–ఎన్ఐఎన్íపీ) ఒక అధ్యయనం చేసింది. జింక్ ఎరువులను నేలలో వేసి పండించిన జొన్న చొప్పను జింక్ లోపం ఉన్న గొర్రెలకు 120 రోజులపాటు ప్రయోగాత్మకంగా తినిపించారు. హెక్టారుకు 25 కిలోల జింక్ సల్ఫేట్ వేస్తే జొన్న చొప్ప దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులు పెరిగింది. చొప్పలో జింక్ పరిమాణం 14.4 పీపీఎం మేర వృద్ధి చెందింది. బయోఫోర్టిఫైడ్ చొప్ప తిన్న గొర్రెల్లో జింక్ స్థాయి పెరగటంతో పాటు.. రక్తంలోని జింక్ పరిమాణం పెరిగింది. వ్యాధి నిరోధక శక్తి పెరిగింది.రాగితో పెరిగిన దిగుబడి పరిశోధనల ప్రకారం, ఓట్స్ పశుగ్రాస పంటకు నేల ద్వారా హెక్టారుకు 6 కిలోల రాగి అందించడం వల్ల దాని జీవలభ్యత పెరిగి దిగుబడి మెరుగుపడింది. అలాగే, విత్తిన 60–90 రోజుల్లో ఆకులపై 0.2% రాగిని పిచికారీ చేయటం వల్ల రాగి గ్రహణ శక్తి, దిగుబడి, ప్రొటీన్స్ గణనీయంగా పెరిగాయి. డా. సి.హెచ్. రామకృష్ణ బృందం హైదరాబాద్లో చేసిన పరిశోధన ఫలితాల ప్రకారం.. నేలకు హెక్టారుకు 25 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను సిఫారసు చేసిన ఎరువులతోపాటు దుక్కిలో వేస్తే.. పచ్చిమేతలో అత్యధిక జింక్ సాంద్రత (41.4 పీపీఎం) నమోదైంది. అలాగే, విత్తిన 15, 30, 45, 60 రోజుల తర్వాత 1% అన్నభేదిని ఆకులపై పిచికారీ చేస్తే అత్యధిక ఇనుము సాంద్రత (155.3 పీపీఎం) నమోదైంది. అంతేకాకుండా, ఈ పద్ధతులు సైలేజ్ (పాతరగడ్డి)లోని పోషక విలువలను కూడా మెరుగుపరిచాయి. అందువల్ల, ఇటువంటి బయోఫోర్టిఫైడ్ పశుగ్రాసం లేదా సైలేజ్ను ఎక్కువ కాలం మేతగా ఇవ్వడం వల్ల గొర్రెలలో శరీర బరువు, సగటు రోజువారీ పెరుగుదల, రక్తంలోని ఖనిజాల స్థాయిలను మెరుగుపరచవచ్చని నిరూపితమైంది. ఈ విధానం వల్ల నేల సారం పెరిగి పశుగ్రాస దిగుబడి పెరగడమే కాకుండా, ఇటు పశువుల్లో అటు మనుషుల్లోనూ ఉన్న ఖనిజ లవణాల లోపాలను సరిదిద్దవచ్చని ఈ అధ్యయనం వెల్లడించింది.జీవన ఎరువుల ప్రాముఖ్యతరసాయన ఎరువులు మితిమీరి వాడకం వల్ల భూమి నిస్సారమవడమే కాకుండా, పశుగ్రాసంలో పోషకాల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సవాలును ఎదుర్కోవడంలో మొక్కల పెరుగుదల ప్రోత్సహించే అజోటోబాక్టర్, అజోస్పిరిలియం వంటి జాతుల జీవన ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. జీవసంబంధమైన నత్రజని స్థిరీకరణ, ఫాస్ఫేట్ కరిగింపు, ఫైటో హార్మోన్ల ఉత్పత్తి వంటి చర్యల ద్వారా పోషకాల లభ్యతను పెంచుతాయి. ఇవి జీవసంబంధంగా నత్రజనిని స్థిరీకరించడం ద్వారా పంటల నాణ్యతను, దిగుబడిని మెరుగుపరుస్తాయి. ఈ సుస్థిర పద్ధతులను అవలంబించడం వల్ల నేల సారాన్ని కాపాడుకుంటూనే పశుపోషణను లాభసాటిగా మార్చుకోవచ్చు.గణనీయమైన మార్పు.. సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కూడిన బయోఫోర్టిఫికేషన్ వ్యూహాల అమలు ద్వారా దేశ పశుపోషణ రంగంతోపాటు, ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చు. అయితే, పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్ ద్వారా మేత పోషక విలువను పెంచే పద్ధతి అమలుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. నేలలోని పోషక అసమతుల్యతలు, ఉదాహరణకు అధిక ఫాస్ఫరస్ స్థా్థయిలు జింక్ శోషణను నిరోధించడం వంటివి మొక్కల పోషక గ్రహణ శక్తిని దెబ్బతీస్తున్నాయి. వేడిగాలులు, కరువులు, వర్షపాతంలో ఒడిదుడుకులు వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు పంట పెరుగుదలను, పోషకాల గ్రహణను నిరోధిస్తాయి. ఆర్థిక, సామాజిక అంశాలు కూడా ఈ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి. సూక్ష్మపోషక ఎరువులు, అధునాతన సాంకేతికతలతో కూడిన ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న రైతులు ఇటువంటి నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించలేక పోతున్నారు. పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్ పద్ధతులపై మరింత పరిశోధన జరగాలి. ఖర్చు–ప్రభావంపై దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరం. – డా. సి.హెచ్. రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్ (అగ్రానమీ), పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (9491562536) -
పశువైద్యంలో యాంటీబయాటిక్స్కు ప్రత్యామ్నాయం
పశువ్యాధుల చికిత్సలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని 90% వరకు తగ్గించే సాంప్రదాయ మూలికా చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసిన తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ డీన్ డా. ఎన్. పుణ్యమూర్తి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ఎత్నో–వెటర్నరీ మెడిసిన్ (ఈవీఎం)లకు శాస్త్రీయ ప్రామాణికతను నిరూపించటంలో, రైతుల చెంతకు చేర్చటంలో డా. పుణ్యమూర్తి విశేష కృషి చేశారు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) మహమ్మారికి అసలైన పరిష్కారం ఈవీఎం చికిత్సలేనని డా. పుణ్యమూర్తి తెలిపారు. యాంటీబయాటిక్స్ అవసరం లేకుండానే పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి తీవ్ర జబ్బులను ఈవీఎం చికిత్సలతో సమర్థవంతంగా అరికట్టవచ్చని శాస్త్రీయ పరీక్షలతో పాటు రైతుల అనుభవంలోనూ రుజువైందన్నారు. తమిళనాడు తంజావూరు సమీపంలోని వల్లం గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఆయన పశువైద్యంలో డాక్టరేట్ చేసి, తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ డీన్గా పనిచేసిన ఆయన 2001లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా బెంగళూరులోని టీడీయూ హెల్త్సైన్సెస్ అండ్ టెక్నాలజీతో కలిసి పరిశోధనలు కొనసాగించారు. యాంటీబయాటిక్స్ తదితర రసాయన ఔషధాలపై ఆధారపడకుండా తమ ఇంట్లోని దినుసులతోనే పశువ్యాధులకు రైతులే స్వయంగా చికిత్స చేసుకోవటానికి వీలుగా ఉండటం ఈవీఎంల ప్రత్యేకత. సిద్ధ వైద్య సూత్రాల ఆధారంగా సుమారు 50కి పైగా పశు వ్యాధులకు ఈవీఎం పద్ధతులను ఆయన రూపొందించారు. వీటి పనితీరును నిర్ధారించుకున్న జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) దేశవ్యాప్తంగా పశుపోషకులకు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే సిఫారసు చేస్తూ సత్ఫలితాలను నమోదు చేసింది. సంబంధిత చికిత్సల వీడియోలను తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో ఎన్డీడీబీ యూట్యూబ్ చానల్లో అందుబాటులో ఉన్నాయి.స్వచ్ఛమైన పాలు, గుడ్లు, పేడ, మూత్రం ఉత్పత్తే లక్ష్యం: డా. పుణ్యమూర్తి ‘మన దేశంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాలు, గుడ్లు, శుద్ధమైన పేడ, మూత్రం ఉత్పత్తికి ఈవీఎం చికిత్సల వ్యాప్తి ద్వారా కృషి చెయ్యటమే’ తన లక్ష్యమని డా. పుణ్యమూర్తి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పశువులు, కోళ్లకు వ్యాధులు రాకుండా చూడటం కోసం ప్రివెంటివ్ హెల్త్కేర్పై ప్రస్తుతం తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. యాంటీబయాటిక్ రహిత, రసాయన రహిత పశుపోషణ దిశగా తాను చేస్తున్న కృషికి పద్మశ్రీ పురస్కారం మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు.‘మన దేశంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాలు, గుడ్లు, శుద్ధమైన పేడ, మూత్రం ఉత్పత్తికి ఈవీఎం చికిత్సల వ్యాప్తి ద్వారా కృషి చెయ్యటమే’ తన లక్ష్యమని డా. పుణ్యమూర్తి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పశువులు, కోళ్లకు వ్యాధులు రాకుండా చూడటం కోసం ప్రివెంటివ్ హెల్త్కేర్పై ప్రస్తుతం తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. యాంటీబయాటిక్ రహిత, రసాయన రహిత పశుపోషణ దిశగా తాను చేస్తున్న కృషికి పద్మశ్రీ పురస్కారం మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు. -
విరిసిన సేద్య పద్మాలు!
వ్యవసాయం, పశుపోషణ, సహకార రంగాల్లో విశేష కృషి చేసిన 9 మందికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఐదుగురు శాస్త్రవేత్తలు, ముగ్గురు రైతు శాస్త్రవేత్తలు, ఒకరు ప్రముఖ సహకార వేత్త. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ, పూసా) మాజీ సంచాలకులు డా. అశోక్ కుమార్ సింగ్ (బాస్మతి వరి రకాల అభివృద్ధి), జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ, మొక్కల రకాలు రైతుల హక్కుల ప్రాధికార సంస్థల మాజీ చైర్మన్ డా. పి.ఎల్. గౌతమ్ (జీవవైవిధ్య పరిరక్షణ చట్టం, రైతుల విత్తన హక్కుల రక్షణ చట్టం రూపశిల్పి), తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్స్లర్ డా. కె.రామస్వామి (క్లైమేట్ ఒత్తిళ్లను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై పరిశోధన), రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ డా. జి.ఎల్. త్రివేది (ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధి), తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ డీన్ డా. ఎన్. పుణ్యమూర్తి (ఎత్నో–వెటర్నరీ మెడిసిన్) పద్మశ్రీకి ఎంపికయ్యారు. వీరితో పాటు రైతు శాస్త్రవేత్తలు దివంగత రఘుపత్ సింగ్ (ఉత్తరప్రదేశ్), జోగేష్ డ్యూరి (అస్సాం), శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర), దివంగత సహకార వేత్త మామిడి రామారెడ్డి (తెలంగాణ) పద్మశ్రీ 2026 పురస్కారాలకు ఎంపికయ్యారు.మాక్స్ చట్టం రూపశిల్పి రామారెడ్డితెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమలో సహకార సంఘాల పాత్రను బలోపేతం చేసేందుకు 50 ఏళ్లపాటు పాటుపడిన దార్శనిక సహకార నేత మామిడి రామారెడ్డి(83)కి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయనుంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సర్పంచ్గా, రాజేంద్రనగర్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. సహకార సమాఖ్య, కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ల ద్వారా సహకార వ్యవస్థ పటిష్టతకు రాజకీయాలకు అతీతంగా, స్వతంత్ర సహకార వేత్తగా నిబద్ధతతో సేవలందించారు. మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ (ఎంపీసీఎస్)లను ఏర్పాటు చేశారు. పీఏసీఎస్లలో ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యాన్ని నిరోధించేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమించి, చట్ట సవరణ సాధించారు. 1995లో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ(మాక్స్) చట్టం రూపకల్పనలో రామారెడ్డి కీలకపాత్ర పోషించారని 5 దశాబ్దాలుగా రామారెడ్డితో కలసి నడుస్తున్న సహకార ధర్మపీఠం వ్యవస్థాపక ధర్మకర్త సంభారపు భూమయ్య ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సహకార రంగంలో పద్మశ్రీ పురస్కారాన్ని గెల్చుకున్న తొలి నేత రామారెడ్డి కావటం సంతోషదాయకమన్నారు. ముఖ్యంగా మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలను, స్వయం సహాయక బృందాలను ఇతోధికంగా ప్రోత్సహించారు. వరంగల్, కరీంనగర్ ప్రాంత మహిళా సహకార డెయిరీ ఏర్పాటులో చోదక శక్తిగా నిలిచారని ఆయన తెలిపారు. దూరదృష్టి గల నేత: ఎన్డీడీబీసహకార సంస్థలను బలోపేతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన దూరదృష్టి గల నాయకుడు మామిడి రామారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావటం హర్షణీయమని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) పేర్కొంది. సహవికాస – సహకార అభివృద్ధి ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారతపై బలమైన దృష్టితో తెలంగాణ అంతటా గ్రామీణ జీవనోపాధి అవకాశాలను కల్పించారు. సహకార చట్టాలను రూపొందించడంలో, జాతీయ స్థాయి విధాన సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. వేలాది మంది సభ్యుల యాజమాన్యంలోని స్వావలంబనతో కూడిన సహకార సంస్థలను ఆయన వారసత్వం విశ్వాసం, గౌరవం, స్థిరమైన గ్రామీణాభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతుందని ఎన్డీడీబీ ఆకాంక్షించింది.శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర)వ్యవసాయ ఆవిష్కరణలతో ప్రసిద్ధి చెందిన రైతు శాస్త్రవేత్త శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర). పత్తి ఉత్పత్తిని పెంచే ‘దాదా లాడ్ పద్ధతి’ని ఆయన అభివృద్ధి చేసినందుకు పద్మశ్రీ అందుకోనున్నారు. అధిక సాంద్రతలో పత్తి విత్తటం, మొక్కను 3 దశల్లో కొమ్మలు, పిలకలను కత్తిరించటం ద్వారా దిగుబడిని పెంచటం దాదా లాడ్ టెక్నిక్ ప్రత్యేకత. పత్తి పంట కాలాన్ని కుదించటం ద్వారా గులాబీ పురుగు బెడద నష్టాన్ని నివారించటం మరో ప్రయోజనం. నాగపూర్లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సీఐసీఆర్) లాడ్ టెక్నిక్లో ప్రయోజకత్వాన్ని గుర్తించి, అధికారికంగా రైతులకు సిఫారసు చేయటం విశేషం. వర్షాధార, నీటిపారుదల సాగు పద్ధతుల్లోనూ సీఐసీఆర్ విస్తృత స్థాయిలో క్షేత్ర ప్రయోగాలు జరిపింది. ఈ టెక్నిక్ ద్వారా సగటున 48 నుంచి 76% వరకు పత్తి దిగుబడి పెరిగినట్లు రుజువైందని సీఐసీఆర్ ప్రకటించింది.రఘుపత్ సింగ్ (ఉత్తరప్రదేశ్)మొరాదాబాద్ జిల్లాలోని బిలారి ప్రాంతానికి చెందిన అభ్యుదయ రైతు రఘుపత్ సింగ్కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయనున్నారు. 55 పైగా అంతరించిపోతున్న కూరగాయల వంగడాలను సంరక్షించి రైతులకు తిరిగి పరిచయం చేశారు. దాదాపు 100 కొత్త రకాలను అభివృద్ధి చేశారు.జోగేష్ డ్యూరి (అస్సాం)ముగా పట్టు పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన జోగేష్ డ్యూరి పద్మశ్రీని అందుకోనున్నారు. ఆయన కృషి వేలాది గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచింది. ముగా పట్టుకు ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టింది. -
Sagubadi: హోమియోతో చీడపీడలకు చెక్!
వరి, మిరప వంటి పంటలతో పాటు మామిడి తదితర పండ్ల తోటల్లోనూ పురుగులు, తెగుళ్ల యాజమాన్యానికి హోమియో మందులు అత్యంత ప్రభావశీలంగా పనిచేస్తున్నాయని ఈ రంగంలో పదిహేనేళ్లుగా విశేష కృషి చేస్తున్న ప్రముఖ రైతు శాస్త్రవేత్త, అమేయ కృషి వికాస కేంద్రం వ్యవస్థాపకులు జిట్టా బాల్రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురంలోని తన పరిశోధనా క్షేత్రంలో అగ్రి హోమియోపతిపై బాల్రెడ్డి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. తొలుత తన క్షేత్రంలో వాడి, మంచి ఫలితాలు కనిపించిన తర్వాత ఆయన ఈ మందులను రైతులకు సూచిస్తున్నారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజెప్పే లక్ష్యంతో ‘అమేయ కృషి వికాస కేంద్రం’ పేరిట యూట్యూబ్ చానల్ ద్వారా వీడియోలను కూడా ఆయన రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. హోమియో మందులతో వ్యవసాయంపై ఆయన ‘సాక్షి సాగుబడి’తో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..మిరపలో చీడపీడలకు హోమియో మందులునల్లపేను (వెస్ట్రన్ బ్లాక్ త్రిప్స్)– ఆర్నేరియా డయాడెమా 30; రింగ్ స్పాట్ వైరస్ (బొబ్బర) – నెట్రమ్ సాలిసికమ్ 30, సాలిసిక్ ఆసిడ్ 30; ఎల్లో మొజాయిక్ వైరస్– జింజింబర్ 30, వాలెరినా 30; బూడిద తెగులు, కొమ్మెండు తెగులు– కూప్రమ్ మెటాలికమ్ 30; వేరుకుళ్లు, కాయకుళ్లు, కాండంకుళ్లు– బావిస్టా 30; తెల్లదోమ, పచ్చదోమ– కోక్సినెల్లా 30, సోరినమ్ 30; తుప్పు తెగులు, కాయ మచ్చ– బెల్లడోనా 30, కాల్కేరియాకార్బ్ 30; మెగ్నీషియం లోపం– మ్యాగ్ఫాస్ 30; జింక్ లోప నివారణ– జింకమ్మేట్ 30; బోరాన్ లోప నివారణ– బోరాన్ 30; లద్దె పురుగు– నక్స్వామికా 30, అజారిక్టా ఇండికా 30; తెల్ల లద్దె పురుగు, జపానీస్ బీటిల్– తూజా 30; పూత రాలటం– బావిస్టా 30; పూతరాలటం, వాతావరణ మార్పు– పెర్రంమేట్ 30; ఎదుగుదల లోపం, గిడసబారటం– కార్బోవెజ్ 30; దెబ్బతిన్న పంట కోలుకోవడానికి– బయోవేరా డిప్యూజా 30; పూత రాలకుండా– సికిల్ కార్ 30; పూత రావడానికి– అస్పగరిస్ 30 మందులను పిచికారీ చేసుకోవాలి.మామిడిమామిడి పూత రావటానికి – కాలి నైట్రికం 30, పల్సటిల్ల 30; పిందె రాలిపోకుండా – బావిస్టా 30; పచ్చదోమ/తెల్లదోమ నివారణకు – కోక్సినెల్లా 30, సోరినం 30 లేదా కోక్సినెల్లా 30, సల్ఫర్ 30 లేదా సోరినం 30, సల్ఫర్ 30; కాయ పెరుగుదలకు, తీపికి – ఆక్సాలిక్ ఆసిడ్ 30; సూటి మోల్డ్– సోరినం 30; బ్యాక్టీరియా మంగు– నాట్రం సాలిసికం 30, సాలిసిక్ ఆసిడ్ 30; పిందె దశలో త్రిప్స్, మైట్స్ నియంత్రణకు– తూజ 30; కాయకు కవరు కట్టే ముందు– సల్ఫర్ 30, సోరినం 30 వేర్వేరుగా పిచికారీ చేయాలి.కొబ్బరి కొబ్బరిలో కాపు తెప్పించటానికి, కాయ రాలకుండా నిలబెట్టుకోవటానికి రెండు కొత్త హోమియో మందులను తయారు చేసుకొని వాడాం. పూతలో 3 వంతుల కాపును నిలబెట్టుకున్నాం. కొబ్బరి చెట్లకు రెండు రకాల మందులు వాడుకోవాలి. గెలలు రావటానికి ఒకటి, కాయలు రాలకుండా కాపాడుకోవటానికి మరొకటి వేర్వేరుగా వాడుకోవాలి. 30 లీటర్ల నీటిలో 30 ఎం.ఎల్. మందు కలిపి వాడాలి. గడ్డపారతో చెట్టు చుట్టూ 4,5 నేలలో బొరియలు చేసి, వాటిలో పోయాలి. పది రోజులకోసారి వరుసగా 3 నెలలు వాడితే మంచి ఫలితం వస్తుంది. 6 నెలల తర్వాత మళ్లీ ఇవ్వొచ్చు. ఈ రెండు మందులు బయట దొరకవు. వీటితోపాటు 15 రోజులకోసారి పేడ ద్రావణం కూడా పోస్తున్నాం. తెల్లదోమ నివారణకు కోక్సినెల్లా 30, రెండు రోజులకు సల్ఫర్ 30, వారంలోగా సెమ్సిఫోగా 30, సల్ఫర్ 30 పిచికారీ చేసుకోవాలి.నత్తల నివారణకు..అధిక వర్షాల నేపథ్యంలో వరి, అనేక కూరగాయలు, బొప్పాయి తదితర పండ్ల తోటలకు కూడా ఆఫ్రికా నత్త బెడద ఏర్పడింది. నత్తల నివారణకు 20 లీటర్ల నీటిలో 2.5 ఎం.ఎల్. హెలిక్స్ టోస్టా 30 మందును కలిపి పిచికారీ చెయ్యాలి. ఒక స్ప్రే సరిపోతుంది. మరీ అవసరమైతే 10 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేస్తే చాలు.వరి20 లీటర్ల నీటిలో 2.5 ఎం.ఎల్. శైలీషియా 30 మందును కలిపి వరి విత్తన శుద్ధి చేసుకొని ఆరబెట్టిన తర్వాత మైకోరైజా పట్టించి మండె కట్టి నారు పోసుకోవాలి. ఇనుప ధాతువు లోప నివారణకు– ఫెర్రంమెట్ 30; నారు ఎర్రబారినప్పుడు– కార్బొవెజ్ 30; నాటేసిన మొక్క నిలదొక్కుకోవటానికి కాలెండుల్లా 30; వేరుకుళ్లుకు– బావిస్ట 30; మొగి పురుగు, తెల్లకంకి నివారణకు– నాటేసిన 20 రోజులకు ఒకసారి, చిరుపొట్ట దశలో మరోసారి తూజ 30; పాముపొడ, పచ్చ పురుగు– నక్స్ వామిక 30; దోమపోటు– కోక్సినెల్ల 30 ( మరీ అవసరమైతే సింసిఫ్యూగ 30, సోరినమ్ 30 వేర్వేరుగా వాడాలి); పోషకాల లోపనివారణ– పేడ ద్రావణం, డీఏపీకి బదులు– అమ్మోనియా ఫాస్ 30, యూరియాకు బదులు– యూరియా పోరిక 30; పొటాష్కోసం– కాలిమూర్ 30; జింక్ లోప నివారణకు– జింకం మేట్ 30; స్మట్ – తూజా 30, అగ్గితెగులు–బెల్లడోనా 30, కాల్కేరియా కార్బ్ 30 పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.పంటలకు హోమియో మందులను 30కన్నా తక్కువ పొటెన్సీలోనే వాడాలిద్రవ రూప హోమియో మందులు ప్రత్యేక హోమియో దుకాణాలలో లభిస్తాయి. ఒకే హోమియో మందు అనేక పొటెన్సీలలో అందుబాటులో ఉంటుంది. పంటలకు సూచించిన హోమియో మందులను 6 లేదా 12 లేదా 30 పొటెన్సీ కలిగినవి మాత్రమే వాడుకోవాలి. 6 లేదా 12 పొటెన్సీలు అందుబాటులో లేనప్పుడు 30 పొటెన్సీ హోమియో మందులు వాడుకోవటం ఉత్తమం. అంతకన్నా ఎక్కువ పొటెన్సీ గల మందులు వాడకూడదు. అవసరం కూడా లేదు. హోమియో మందులు ఏ రెంటినీ కలిపి చల్లకూడదు. దేనికి దానికే వాడుకోవాలి. మోతాదు కూడా 20 లీటర్ల ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. మాత్రమే వాడాలి. అంతకు మించి వాడితే దుష్ఫలితాలు వస్తాయి. హోమియో మందుల వల్ల సాధారణంగా ఎటువంటి దుష్ఫలితాలు రావటం ఉండదు. ఇతర వివరాలకు నా యూట్యూబ్ చానల్ అఝ్ఛy్చ జుటజీటజిజీ Vజీజ్చుట్చ జ్ఛుnఛీట్చఝ లో వీడియోలు చూడవచ్చు. పంటలకు హోమియో మందులను కొత్తగా వాడే రైతులు ముందు ఒక ఎకరంలో వాడి చూసుకొని ముందుకు వెళ్లాలని సూచన. 20 లీటర్ల ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. మందు చాలుద్రవ రూపంలో ఉండే హోమియో మందులు పంటలపై పిచికారీ చేసుకునేందుకు ప్రత్యేక పద్ధతిని పాటించటం అవసరం. ఒక లీటరు మంచినీటి సీసా తీసుకొని శుభ్రంగా కడిగి, సగానికి నీరు పోయాలి. ఎంపిక చేసుకున్న మందు 2,5 ఎంఎల్ను కొలిచి ఆ సీసాలోని నీటిలో కలిపి గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత సీసాను కిందికి పైకి లెక్కపెట్టి మరీ 50 సార్లు గిలక్కొట్టినట్టు ఉపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని 20 లీటర్ల థైవాన్ స్పేయర్ ట్యాంక్లో పోసుకొని, నీటిని నింపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎంత ఎక్కువగా ఉన్నా ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. కంటే ఎక్కువ మందు వాడవద్దు. అలా చేస్తే మందు పనిచేయదు. స్ప్రేయర్ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత హోమియో మందుల పిచికారీకి వాడితేనే ఫలితాలు వస్తాయి. వేడి నీటితో కడిగి పైపులు శుభ్రం చేయాలి. వేడి నీటితో శుభ్రం చేసి నీడలో పంపును, స్పేయర్ను, బాటిళ్లను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పెట్టుకున్నప్పుడే ఈ మందులు పనిచేస్తాయి. వీలుంటే హోమియో మందును పిచికారీ చేయడానికి ప్రత్యేకంగా ఒక స్ప్రేయర్ను వాడుకుంటే మంచిది. సూచించిన మందులను ఒక్కసారి (సింగిల్ డోస్) పిచికారీ చేస్తే చాలు సమస్య పరిష్కారం అవుతుంది. మరీ అవసరమైతే రెండోసారి చాలు. – జిట్టా బాల్రెడ్డి, ప్రముఖ రైతు శాస్త్రవేత్త, అమేయ కృషి వికాస కేంద్రం, రామకృష్ణాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా -
ప్రకృతి సేద్యం పొలాల్లోంచి వర్సిటీల్లోకి!
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రయోగశీలురైన రైతు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ఆచరిస్తూ వస్తున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్న ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాలను చూసి తోటి రైతులు నేర్చుకుంటూ వచ్చారు. మొదట్లో సంశయించిన ప్రభుత్వమే తదనంతరం ప్రకృతి వ్యవసాయం బహుముఖ ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్నేళ్లుగా ప్రోత్సహిస్తోంది. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) కూడా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు నియత వ్యవసాయ విద్యలోకి ప్రకృతి వ్యవసాయం చేరింది. దేశంలో 4 యూనివర్సిటీల్లో మాత్రమే ఇప్పుడు ఈ కోర్సులు ఉన్నాయి. మరికొన్ని యూనివర్సిటీల్లో ప్రకృతి వ్యవసాయం ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పరిశోధన కోర్సులను విధిగా ప్రారంభించాలని సూచిస్తూ భారతీయ వ్యవసా య పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జన రల్ ఎం.ఎల్. జాట్ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ హ యాంలో నడుస్తున్న, డీమ్డ్ వ్యవసాయ విశ్వవిద్యా లయాలన్నిటికీ ఇటీవల లేఖ రాశారు. ‘సుస్థిర వ్యవసాయం, రైతుల సంక్షేమం సాధించే క్రమంలో ప్రకృతి వ్యవసాయం జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆరో డీన్ల కమిటీ సిఫారసులు, జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాల ప్రకారం బీఎస్సీ ప్రకృతి సేద్యం కోర్సు పాఠ్యప్రణాళి కను రూపొందించి, ఆమోదించి, అన్ని యూనివర్సిటీలకూ పంపాం. ఇప్పటి కే కొన్ని యూనివర్సిటీలు కోర్సులు ప్రారంభించా యి. మిగతా యూనివర్సిటీలు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తాయని ఆశిస్తు న్నాను’ అని డా. జాట్ పేర్కొన్నారు. రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. విపత్తులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులకు, భూమి ఆరోగ్యం పునరు ద్ధరణకు, తక్కువ ఉద్గారాలను వెలువరించే వ్యవ సాయ పద్ధతులకు ఆదరణ పెరుగుతున్నందున ఉన్నత వ్యవసాయ విద్యలో ప్రకృతి సేద్య సంబంధమైన కోర్సుల ప్రాధా న్యం ఏర్పడిందని ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయ సాంకేతి కతలో నిష్ణాతులైన నవతరం శాస్త్ర వేత్తలు, విస్తరణ సిబ్బంది, ఎంటర్ ప్రెన్యూర్లను తయారు చేసే బృహత్ కార్యంలో విశ్వవిద్యాలయాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నానని డా. జాట్ పేర్కొ న్నారు. ఈ విషయంలో ఐసీఏఆర్ అన్నివిధాలా సహకారం అందిస్తుందన్నారు. లాభదాయకతే గీటురాయి చెయ్యాలిప్రకృతి వ్యవసాయంలో ఉన్నత విద్యాకోర్సులు ప్రారంభించమని ఐసీఏఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలను కోరటం సంతోషదాయకమని ప్రముఖ వ్యవసాయ నిపుణులు డాక్టర్ దేవేంద్ర శర్మ హర్షం వ్యక్తం చేశారు. అయితే, అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు ఆఖరి సంవత్సరం కరిక్యులంలో భాగంగా విద్యార్థులు చేపట్టే ఫీల్డ్ వర్క్ను కేవలం లాంఛనప్రాయంగా మిగల్చ కూడదు. ఫీల్డ్ వర్క్లో భాగంగా స్వయంగా ప్రకృతి వ్యవసాయం ఆచరించి, అందులో లాభదాయకతను నిరూపించుకున్న విద్యార్థులకు మాత్రమే డిగ్రీని ప్రదానం చెయ్యటం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన సూచించారు. -
ఐదడుగుల అరటి!
తుపాను గాలులకు అరటి చెట్లు విరిగి పడిపోవటం అనేది రైతును ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచే పరిస్థితి. ఈ నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు ఉపయోగపడే పొట్టి రకం అరటి ‘కావేరి వామన్’ అందుబాటులోకి వచ్చింది. ముంబైలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్), తిరుచ్చిలోని జాతీయ అరటి పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఎస్ఆర్సీబీ) సంయుక్తంగా ఈ సరికొత్త అరటి రకాన్ని రూపొందించాయి. విస్తారంగా సాగులో ఉన్న గ్రాండ్ నైన్ (జీ9) అరటి చెట్టు ఎత్తు 6–8 అడుగులు. దీని పంట కాలం 11–12 నెలలు. అయితే, గాలులకు ఇది ఒరిగిపోతుంది లేదా విరిగిపోతుంది. ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి దీనికి ఊత కర్రలను సైతం రైతులు అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, జీ9 అరటితోనే ఉత్పరివర్తన వికిరణ పద్ధతిలో పొట్టి అరటి ‘కావేరి వామన్’ రకాన్ని రూపొందించటం విశేషం. ఈ చెట్టు ఎత్తు 4.9 అడుగుల నుంచి 5.25 అడుగులు (150 నుంచి 160 సెం.మీ.. (59–63 అంగుళాల) పెరుగుతుంది. గెల స్థూపాకారంలో ఉంటుంది. మధ్యస్థ ఎత్తు ఉండే గెలలో 8–10 పండ్ల హస్తాలు ఉంటాయి. గెల బరువు 18 నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. రైతులు పొలాల్లో అధిక సాంద్రత పద్ధతిలో వాణిజ్య స్థాయిలో సాగు చెయ్యటానికే కాకుండా.. ఇంటిపంటలకు, టెర్రస్ గార్డెనింగ్ చేసే వారికి కూడా సౌలభ్యకరంగా ఉంటుంది.రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, దేశ ఆహార/ పౌష్టికాహార భద్రతకు దోహదపడేందుకు ట్రోంబే బనానా మ్యూటెంట్–9 (టీబీఎం–9) పొట్టి అరటి రకాన్ని అభివృద్ధి చేశామని బార్క్ తెలిపింది. టీబీఎం–9నే ఇటీవల భారత ప్రభుత్వం ’కావేరి వామన్’ పేరుతో నోటిఫై చేసింది. కావేరి వామన్ దేశంలోని మొట్టమొదటి మ్యూటెంట్ అరటి రకం మాత్రమే కాదు, బార్క్ అభివృద్ధి చేసి విడుదల చేసిన మొదటి పండ్ల జాతి కూడా కావటం విశేషం. కావేరి వామన్తో బార్క్ విడుదల చేసిన మెరుగైన పంట రకాల సంఖ్య 72కు చేరుకుంది.అయోనైజింగ్ రేడియేషన్ ద్వారా దేశంలో ఉద్యాన పంటల అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే కృషిలో కావేరి వామన్ విడుదల ఒక ప్రధాన అడుగు అని అణుశక్తి విభాగం కార్యదర్శి, అణుశక్తి కమిషన్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి ప్రశంసించారు.బార్క్ డైరెక్టర్ వివేక్ భాసిన్ మాట్లాడుతూ, స్థిరమైన వ్యవసాయానికి కీలకమైన కొత్త పంట రకాలను అభివృద్ధి చేయడంలో గామా కిరణాల ప్రేరేపిత మ్యూటాజెనిసిస్ కీలక పాత్రను పోషించిందన్నారు. గ్రాండ్ నైన్ అరటిని పండించే రైతులకు కావేరి వామన్ విడుదల ఒక వరం వంటిదన్నారు. బార్క్ రూపొందించిన ఈ కొత్త రకంపై తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా అనేక సంవత్సరాల పాటు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది. కఠినమైన క్షేత్రస్థాయి పరీక్షల తర్వాత మాతృరకం అయిన జీ9 రకం కంటే కావేరి వామన్ అనేక మేలైన ఫలితాలనిచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. పొడవుగా పెరిగే జీ9 రకం అరటి మొక్కలతో గాలుల తీవ్రత ఉండే ప్రాంతాల్లో రైతులు పెద్ద నష్టాలపాలవుతున్నారు. ఒరిగిపోకుండా, విరిగిపోకుండా చెట్లను కాపాడుకోవటానికి వెదురు లేదా సర్వి బాదులను ఆసరాగా పెడుతూ ఉంటారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. గాలులకు తట్టుకొని నిలబడే శక్తిగల కావేరి వామన్ కొత్త రకం పొట్టి వంగడంతో ఈ సమస్య తీరిపోతుంది. కావేరి వామన్ చెట్ల గెలలు ఒకటిన్నర నెలల ముందే కోతకు వస్తాయి. దీని అరటి పండు గ్రాండ్ నైన్ రకం అరటి పండ్ల మాదిరిగానే రుచిగా, నాణ్యంగా ఉంటాయి. -
సూపర్ ఫాస్ట్ కంపోస్టర్!
సేంద్రియ వ్యర్థాలను కేవలం 8 గంటల్లో కంపోస్టు ఎరువుగా మార్చే ఆధునిక టెక్నాలజీని బెంగళూరుకు చెందిన వేస్ట్ ఈజ్ గోల్డ్ అనే స్టార్టప్ రూపొందించింది. ఇంత సూపర్ ఫాస్ట్గా పోషకవంతమైన కంపోస్టు తయారు చేయగల మరో సంస్థ లేదు. 20 కేజీల నుంచి 10 టన్నుల చెత్తనైనా కేవలం ఎనిమిది గంటల్లో ఎటువంటి హానికరమైన వాయువులను వెలువరించకుండా కంపోస్టుగా మార్చేస్తోంది ఈ సంస్థ రూపొందించి గోల్డ్ కంపోస్టర్. ‘సేంద్రియ చెత్తను అత్యంత వేగంగా కంపోస్టుగా మార్చే సూక్ష్మజీవుల మిశ్రమాన్ని, బయోరియాక్టర్ టెక్నాలజీని ఉపయోగించుకునే నాచురల్ బయో మెకానికల్ ప్రాసెస్ను అనుసరిస్తున్నాం. టన్నుల కొద్దీ చెత్తనైనా ఒక్క రోజులోనే ఎరువుగా మార్చేస్తాం’ అంటున్నారు ఈ స్టార్టప్ అధినేత తివారి. ‘అధికంగా వేడిని ఉత్పత్తి చెయ్యకుండా సేంద్రియ వ్యర్థాలను అతివేగంగా విచ్ఛిన్నం చేస్తున్నందు వల్ల మిథేన్ వంటి హానికారక వాయువులు వెలువడకుండా చూస్తున్నాం. దీని వల్ల వ్యర్థాలను కంపోస్టుగా మార్చే పనిలో కాలుష్యం లేకుండా పోయింది. ఆక్సిజన్ను ఉపయోగించే సూక్ష్మజీవరాశిని, బయో రియాక్టర్ను ఏరోబిక్ డీకంపోజిషన్ పద్ధతిలో వాడటం వల్ల ఇది సాధ్యపడుతోంద’న్నారాయన. మేం తయారు చేసే కంపోస్టును తిరిగి మళ్లీ ఏ ప్రాసెసింగ్ చెయ్యాల్సిన అవసరం లేదని, నిల్వ చేసుకోవచ్చు. లాండ్స్కేపింగ్ కోసమైతే అదే రోజు వాడుకోవచ్చు. వ్యవసాయం కోసమైతే 3 నుంచి 7 రోజులు మాగిన తర్వాత ΄÷లాల్లో వేసుకుంటే పోషకాలు పుష్కలంగా భూమికి అందుతాయ’న్నారు తివారి. వండిన ఆహార వ్యర్థాలు, సేంద్రియ తడి చెత్త, ఎముకలు, మాంసం వ్యర్థాలు, ఈకలు, గుడ్ల పెంకులు, కూరగాయ వ్యర్థాలు, లేత కొబ్బరి బొండాల డొప్పలు, పండ్ల తోటల వ్యర్థాలు, గడ్డి కత్తిరింపులు, టిష్యూ పేపర్, ఎస్టీపీ వ్యర్థాలు.. వంటి వేటినైనా సరే తమ గోల్డ్ కంపోస్టర్ ద్వారా సమర్థవంతంగా 8 గంటల్లో కంపోస్టుగా మార్చవచ్చని తివారి చెబుతున్నారు. ఇది నిజంగా గోల్డ్ కంపోస్టరే. ఎందుకంటే, పట్టణ వ్యర్థాలను సేకరించిన తర్వాత అందులోని కుళ్లే సేంద్రియ వ్యర్థాలను, కుళ్లని ΄్లాస్టిక్ తదితర వ్యర్థాలను వేరు చేయటం పెద్ద పని. ఈ పనిని కూడా గోల్డ్ కంపోస్టరే చేసేస్తుందని తివారి చెబుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన ఆవిష్కరణగా చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కంపోస్టర్లను దేశంలో 150 చోట్ల నెలకొల్పారు. 2,500 టన్నుల చెత్తను 1,200 టన్నుల కంపోస్టుగా మార్చేయటం కూడా జరిగిందట. అయితే ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. పదేళ్ల ప్రయాణం, ప్రయాస దీని వెనుక ఉంది అన్నారు తివారి. ఈ గోల్డ్ కంపోస్టర్లను నగరాలు, పట్టణాల్లో కాలనీలు, వార్డులు, గేటెడ్ కమ్యూనిటీలు, అ పార్ట్మెంట్ల దగ్గర నెలకొల్పి ఎక్కడికక్కడే సేంద్రియ వ్యర్థాలను కంపోస్టుగా మార్చేస్తే.. నగరాలు, పట్టణాల మూలంగా చెత్త కొండలుగా పోగుపడే సమస్య ఇట్టే పరిష్కారమైపోతుంది. పార్కులకు, ఇంటిపంటలకు, పంట ΄÷లాలకు కూడా సిటీ కంపోస్టు పెద్ద పరిమాణంలో అందుబాటులోకి వస్తుంది. ఆల్ ద బెస్ట్ టు గోల్డ్ కంపోస్టర్! -
ట్రీ ఆఫ్ లైఫ్
కొబ్బరిలో అద్భుతమైన ఆరోగ్యదాయక లక్షణాలున్నాయి. కొబ్బరి ఒక చక్కని ఆహారం. ఆరోగ్యదాయకమైన కొబ్బరి నీరును, అద్భుతమైన నూనెను అందించే గొప్ప పంట. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో జీవనో పాధిని అందిస్తుండటం వలన దీన్ని ‘జీవన వృక్షం (ట్రీ ఆఫ్ లైఫ్)’గా పరిగణిస్తారు. కొబ్బరి శాస్త్రీయ నామం కోకోస్ న్యూసిఫెరా ఎల్ (అరేకేసి). కొబ్బరిని ఆహారంగా, ఆథ్యాత్మిక సాధనంగా, పానీయంగా, ఔషధ విలువలున్న నూనెగా ఉపయోగపడుతోంది. పీచుగా అనేక ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలకు ముడిసరుకుగా ఉపయోగపడుతోంది. 80 కంటే ఎక్కువ దేశాల్లో సుమారు కోటి కుటుంబాలు కొబ్బరిని తమ ప్రాథమిక ఆహారంగా, ఆదాయ వనరుగా ఉపయోగించుకుంటున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా సాగు చేస్తున్న, ఉపయోగించబడే చెట్టుగా మారింది. కొబ్బరి గానుగ నూనెను వంటకు వాడటం ఇటీవల కాలంలో బాగా పెరిగిన నేపథ్యంలో వండర్ ట్రీ ఆఫ్ లైఫ్పై స్పెషల్ ఫోకస్...కొబ్బరి ఆధారిత వ్యవసాయ విధానం తరతరాలుగా అభివృద్ధి చెందిన ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధ ఉదాహరణ. కొబ్బరి చెట్లు ఇంటి పంటల్లో/తోటల్లో ముఖ్యమైన భాగాలు. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు నాటుకోవటం అనేక దేశాల్లో సుదీర్ఘ కాలపు సంప్రదాయంగా కనిపిస్తుంది. ఇంటి తోటలలోని కొబ్బరి చెట్లు ఆ కుటుంబానికి జీవనాధార వ్యవస్థగా మారాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఇలా చెబుతోంది: కొబ్బరి తదితర పంటల వైవిధ్యంతో కూడిన ఇంటి/పెరటి పంటలు రైతు కుటుంబం ప్రాథమిక అవసరాలను తీర్చటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహార భద్రత, ఆదాయ భద్రత, ఉ పాధి భద్రత కల్పిస్తుంది. ప్రతికూల వాతావరణ విపత్తులను తట్టుకునే శక్తిని ఇంటి/పెరటి పంటలు మెరుగుపరుస్తాయి. ఇందుకోసం పెరటి తోటల్లో అనేక పంటలు, పశువులు, కోళ్లు, చేపల పెంపకం కూడా కలిసి ఉంటుంది. 15వ శతాబ్దపు మళయాళ కావ్యం ‘కృషి గీత’లో కేరళలో మధ్యయుగపు పర్యావరణ అనుకూల సాగు వ్యవస్థల ప్రస్తావన ఉంది. కొబ్బరి ఆధారిత వ్యవసాయ వ్యవస్థలను ఇందులో ప్రముఖంగా పేర్కొనటం విశేషం. కొబ్బరి సేద్యంలో ఉత్తమ వ్యవసాయ పద్ధతులు...నాణ్యమైన, స్వచ్ఛమైన లేక జన్యు స్వచ్ఛత కలిగిన కొబ్బరి నారు మొక్కల పూర్తి వివరాలు తెలుసుకొని నమ్మ దగ్గ నారు మొక్కలను ఎంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యానశాఖ విభాగం వారి గుర్తింపు పొందిన నర్సరీల నుంచి సేకరించుకొని జాగ్రత్త పడాలి. సంవత్సరం అంతా పండే పంట కాబట్టి నాణ్యత విషయంలో రాజీ పడకుండా నారు మొక్కలను శ్రద్ధగా ముందు జాగ్రత్తతో సేకరించుకొని నాటుకోవాలి. పచ్చి కొబ్బరి బోండం (చౌగాట్ ఆరెంజ్ డ్వార్ఫ్ అంటే నారింజ రంగు గల ΄÷ట్టి రకం) తెగులును తట్టుకునే/తెగులును ఎదుర్కొనే (కల్ప రక్ష, కల్ప శ్రీ కల్ప శంకర) రకాలను, కురిడి కొబ్బరి రకం (లక్షద్వీప్ మైకో) మొదలైనవి మేలు.నాటేందుకు అనుకూల నేలలు...కొబ్బరి సాగులో అతి ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, వెలుతురు బాగా ప్రసరించాలి. కొబ్బరికి అనుకూలమైన నేలలను ఎంచుకుంటే గాలి, వెలుతురు ప్రసరణ బాగా జరిగి నత్రజనిని, కర్బనాన్ని, ఆక్సిజన్ను బాగా గ్రహించి పంటలు బాగా ఎదగడానికి సహకరిస్తుంది. చెట్టు ఆకుల్లో కిరణ జన్య సంయోగ క్రియ సామర్థ్యం పెరగాలంటే ఖాళీ భూముల్లో సాధ్యమైనంత వరకు మొక్క నాటడం ఉత్తమం. కేరళలో ఎక్కువగా కొబ్బరి నారు మొక్కలను వెలుతురు కోసం పెద్ద చెట్ల కింద నాటుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి, వెలుతురు ప్రసరణ సక్రమంగా అందక లేత మొక్కలు చీడ పీడల తాకిడికి తీవ్రంగా గురి అవుతూవుంటాయి. అంతేగాక ఈ చెట్లు పూత పూయడానికి ఎక్కువ కాలాన్ని వెచ్చిస్తాయి కూడా! కొబ్బరి నారు మొక్కల్ని నీరు సరిగ్గా పారని భూముల్లో నాట కూడదు. ఇలా చేయడం వల్ల ప్రారంభ దశలో పోషకాలు సరిపడక వేర్ల శ్వాసక్రియ సక్రమంగా ఉండదు. ఒక వేళ ఈ పరిస్థితులలో పెరిగినా ఎదుగుదలలో ఆటంకం ఏర్పడి కాయల దిగుబడిలో ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. లేత మొక్కలకు ఎదిగెందుకు తగిన తేమ అవసరం. అదే తరుణంలో పాదులో నీరు నిలచే పరిస్థితిని తట్టుకోలేవు. కొబ్బరి చెట్లు ఎదగడానికి ముందుగానే మంచి వెలుతురు, గాలిలోని మూలకాలు బాగా గ్రహించేందుకు సహకరించే భూసారం అవసరం. అప్పుడే మొక్కలు బాగా ఎదుగుతాయి.పంటకు కావలసిన భూభౌతిక వనరులు...నిర్థిష్టమైన నియమం ప్రకారం ఒక సెంటు భూమి(40 చదరపు మీటర్ల)లో ఒకే ఒక్క కొబ్బరి నారు మొక్కను నాటే ఏర్పాటు చేసుకోవాలి. రైతులందరు కొబ్బరి సాగును ఏక పంటగా పెంచేటపుడు అన్ని మొక్కలకు 7.5మీ. “ 7.5 మీ.లు, ΄÷ట్టి రకాల మొక్కలను 7.0మీ గీ 7.0మీ. ల ఖాళీ స్థలం ఉండే విధంగా నాటాలి. పెరటి తోటలలాగా ఎక్కువ పంటలను కలిపి పండించే సమయంలో చెట్లకు గాలి బాగా సోకే విధంగా తక్కువ మొక్కలు నాటాలి. రాజీ పడకూడదు. నాటే సమయంలో తక్కువ స్థలం కేటాయిస్తే గాలి ఆడక చెడు వాసన ప్రబలి చీడపీడలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అంతర పంటలను అనుబంధంగా పండించడం వల్ల చీడపీడల నియంత్రణ బాగా జరుగుతుంది. తోటలో పక్షులు వాలడానికి పంగ కర్రలు, సన్నని కాడ కలిగినటువంటి పూల మొక్కలను గుంపులుగా పెంచితే చీడపీడల నెదుర్కొనేలా పర్యావరణ రక్షణ సేవలు పొందవచ్చు. కొబ్బరి తోటల్లో కొమ్ము పురుగును నివారించేందుకు కొబ్బరి ఆధారిత వివిధ పంటల సాగు ఏక పంటగా కొబ్బరి చెట్ల సాగుకంటే బాగా అనుకూలంగా ఉన్నట్లు రూఢి అయ్యింది.పంట రక్షణ...నారు మొక్కల జీవక్రియ పెంచడానికి, నారు మొక్కలను నాటిన తర్వాత స్యూడోమొనాస్ను నాలుగు ఏడు, పది నెలల్లో 50 గ్రా. చొప్పున వేస్తూండాలి. మొక్కల్ని నాటేటప్పుడు 100 గ్రాముల స్యూడోమోనాస్ ΄÷డితో ద్రావణం చేసి వేరు మొక్కలను అందులో ముంచి నాటాలి. నాటిన మొక్కల హద్దుల వెంబడి గ్లైరిసీడియా మొక్కలను పెంచుతూ, వాటి ఆకులను కత్తిరించి మొక్కల పాదులలో మల్చింగ్ వేయడం వల్ల భూసారంలో మేలు చేసే సూక్ష్మజీవులే గాక సేంద్రియ పదార్థం వల్ల భూభౌతికంగా రసాయనికంగా, జీవనసంబంధమైన ఎరువులు వృద్ధి అవుతాయి. సేంద్రియ సూక్ష్మ పోషకాలు కూడా అభివృద్ధి అయి అందుబాటులో ఉంటాయి. సేంద్రియ ఎరువు తయారవుతూండడం వల్ల పంటలకు పోషకాలు (బయో ఎంజైములు) చెట్ల ఎదుగుదలకు బాగా అనుకూలిస్తాయి. బాగా మగ్గిన వర్మికంపోస్టు (10గ్రా. ఒక చెట్టుకు) లేక పశువుల ఎరువు (ఒక కిలో / చెట్టుకు) వేప చెక్క (2కిలోలు / చెట్టుకు) (ట్రైకోడెర్మా కలిపి (250 గ్రా/ చెట్టుకు) లేత కొబ్బరి మొక్కకు నాటిన తొలి దశలో ఎరువుగా ఉపయోగించుకోవాలి.జీవవ్యర్థాల పునరుత్పత్తి వినియోగం...ఏప్రిల్ – మే, సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో జనుము, జీలుగ పంటల ఆకులను పచ్చి రొట్ట ఎరువుగా చెట్టుకు 100 గ్రాములు పాదులలో వేసినట్లయితే వాతావరణ సంబంధ నత్రజని మాత్రమే గాక కాల్షియం: నత్రజని నిష్పత్తి కూడా బాగా వృద్ధి అవుతుంది. పచ్చి రొట్ట ఎరువును వేయడం వల్ల భూమి లోపలి ΄÷రలలోకి గాలి పుష్కలంగా ప్రవహించేందుకు దోహదం చేస్తుంది. వేరు వ్యవస్థ బాగా వృద్ధి అవడం, తేమ కొరత ఉన్నా కూడా మొక్కలు నిలదొక్కుకుని పెరగడం గమనించవచ్చు.చెట్లకు నీటి పారుదల చాలా క్లిష్టమైన అంశం వేసవి కాలంలో తేమ కొరతను నివారించేందుకు చెట్టుకు 200 లీటర్ల నీటిని వారానికి ఒక్కసారి అందివ్వడం అతి ముఖ్యమైన విషయం. అత్యధిక ఉత్పత్తిని సాధించేందుకు బిందు సేద్యం అందిస్తూ వినియోగించ వలసిన నీటిని పూర్తిగా ఉపయోగించడం అన్నది మరొక విధానం. వర్షాకాలంలో కూడా తగిన విధంగా నీరు ఇవ్వాలి. కోస్తా తీరంలో సముద్రజలాల పారుదలకు వీలున్నప్పుడు 500ల గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో నాణ్యమైన వేప చెక్కను, పచ్చి రొట్ట ఎరువుగా పచ్చని ఆకులను చేర్చి వేసుకోవాలి. కొబ్బరి తోటల అభివృద్ధికో పథకంకొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల కోసం రైతులకు కొబ్బరి అభివృద్ధి బోర్డు సహాయం దరఖాస్తుకు చివరి తేదీ జూలై 31ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే సాగులో ఉన్న కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగు ద్వారా ఉత్పాదకతను పెంపొందించటం కోసం కొబ్బరి బోర్డు 2025–26 సంవత్సరానికి గాను రైతులు, రైతు బృందాలు, ఉత్పత్తిదారుల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కొబ్బరి ఆధారిత పంటల వ్యవస్థ ద్వారా ఉత్పాదకత మెరుగుదలకు క్లస్టర్ ప్రాతిపదికన, బోర్డు నియమ నిబంధనలకు లోబడి రైతు భాగస్వామ్య విధానం ద్వారా ప్రస్తుత తోటల్లో ఉత్పత్తి, ఉత్పాదకతలను మెరుగుపరచడానికి కొబ్బరి బోర్డు ఆర్థిక సహాయం అందిస్తుంది. సూచించిన ఫార్మాట్లో దరఖాస్తులు / ప్రతి పాదన లు ఈ నెల 31 లోగా పం పాలి. కీలకమైన ఉత్పాదకాలు, అంతర పంటలు నాటడం, సామగ్రి, పచ్చి ఎరువు విత్తనాలు, మొక్కల రక్షణ రసాయనాలు మొదలైన వాటి ఖర్చులకు బోర్డు సహాయం వరుసగా రెండు సంవత్సరాలు అందించనుంది. కూలీల ఖర్చులు, ఇతర అద్దె సేవలు, మౌలిక సదు పాయాల అభివృద్ధి మొదలైన వాటికి ఈ పథకం వర్తించదు. ఆసక్తిగల రైతు బృందాలు 2025–07–31 ఉదయం 10.30 గంటల్లోగా అవసరమైన పత్రాలతో పాటు సూచించిన ఫార్మాట్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతులు దరఖాస్తులను స్వయంగా లేదా పోస్టు ద్వారా ఇవ్వాల్సిన చిరునామా: డిప్యూటీ డైరెక్టర్, కొబ్బరి అభివృద్ధి బోర్డు, రాష్ట్ర కార్యాలయం, డోర్ నంబర్ 54–14/5–18ఎ, రోడ్ నెం.11, భారతి నగర్, నోవోటెల్ దగ్గర, రింగ్ రోడ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా – 520008.పోషకాలమయం కొబ్బరి నూనె!కొబ్బరి నూనెను తల నూనెగానే చాలా మంది ఉపయోగిస్తుంటారు. కానీ, పోషకాల నిలయమైన కొబ్బరి నూనెను వంటకు ఉపయోగించవచ్చు. మనుషుల ఆయుప్రమాణం ఎక్కువగా ఉండే కేరళ రాష్ట్రంలో వంటకు కొబ్బరి నూనెనే విరివిగా ఉపయోగిస్తారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు సమాచారం ప్రకారం.. ఈ నూనెలోని పోషకాలు, వంటకు ఉపయోగించే విధానాల గురించి తెలు సుకుందాం.ఆరోగ్యపరమైన ప్రయోజనాలుకొబ్బరి నూనె జీర్ణశక్తిని పెంచి వ్యాధులు, ఇన్ఫెక్ష న్లకు గురికాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇందులోని శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు హాని కలిగిస్తాయనుకుంటారు. కానీ అది నిజం కాదు. శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయి. దీన్లోని లారిక్ యాసిడ్ కొలెస్ట్రాల్.. రక్తపోటు వల్ల గుండెకు హాని కలగకుండా రక్షణనిస్తుంది కొబ్బరి నూనెలోని షార్ట్ అండ్ మీడియం చైన్ ఫ్యాటీ ఆమ్లాలు శరీర అధిక బరువును తగ్గిస్తాయి. అలాగే కొబ్బరినూనె వాడటం వల్ల ΄÷ట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా ఉంటుంది కొబ్బరినూనె వాడకం వల్ల థైరాయిడ్ ఇతర ఎండోక్రైన్ గ్రంథులు సక్రమంగా పనిచేస్తాయి శరీర మెటబాలిక్ రేటును పెంచుతుంది. ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది ఈ నూనెలో ఉండే యాంటీమైక్రోబియల్ లిపిడ్స్, లారిక్ యాసిడ్, కాప్రిలిక్ యాసిడ్లు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాల్ని కలిగి ఉంటాయి. కాబట్టి కొబ్బరి నూనె వాడకం వల్ల సంబంధిత వ్యాధులు దరి చేరవు కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి కూడా కొబ్బరి నూనెకు ఉంది.కొబ్బరి నూనెను వంటల్లో ఇలా వాడాలికొబ్బరి నూనె స్మోకింగ్ పాయింట్ 350 ఫారిన్హీట్ కాబట్టి ఈ నూనెను అన్ని రకాల వంటలకూ వాడొచ్చుకేకు వంటి వంటకాల్లో వెన్నకు బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగించొచ్చు అలాంటప్పుడు వెన్న పరిమాణంలో 25% తక్కువ కొబ్బరి నూనె వాడాలి పాప్కార్న్ తయారీకి కొబ్బరినూనెను వాడొచ్చు వర్జిన్ కోకోనట్ ఆయిల్ వెన్నలా ఉంటుంది. దీన్ని బటర్ మాదిరిగా బ్రెడ్ మీద పూసుకొని తినొచ్చు స్మూదీస్, సూప్స్, సాసుల్లో కలుపుకోవచ్చు ఈ నూనెతో అన్ని రకాల కూరగాయల వేపుళ్లు వండుకోవచ్చుపప్పు తాలింపులో వాడొచ్చు. ఆధారం: భారత ప్రభుత్వ సంస్థ ‘కొబ్బరి అభివృద్ధి బోర్డు’. -
సేంద్రియ పశుపోషణపై దృష్టి
‘ఆర్గానిక్ ఆహారోత్పత్తులు అనగానే మనకు చప్పున గుర్తొచ్చేది ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు. కానీ, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు కూడా ఆర్గానిక్ బుట్టలో ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తుంది. ప్రకృతి/సేంద్రియ సేద్య పద్ధతుల్లో సాగు చేస్తున్న రైతులు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ మంది మన దేశంలో ఉన్నారు. వారు పండిస్తున్న సేంద్రియ ఆహారాన్ని దేశీయంగా వినియోగిస్తుండడంతోపాటు చాలా రకాల సేంద్రియ ఉత్పత్తులను అనేక దేశాలకు మన దేశం ఎగుమతి చేస్తోంది. అయితే, సేంద్రియ పాలు/ పాల ఉత్పత్తులు, సేంద్రియ పశు / కోడి మాంసం తదితర ఉత్పత్తుల ఎగుమతి మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేదు.సేంద్రియ పశుపోషణ, సేంద్రియ కోళ్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి విధాన రూపుకల్పన కోసం కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఆర్గానిక్ లైవ్స్టాక్ ప్రొడక్షన్, సర్టిఫికేషన్ ప్రక్రియలకు సంబంధించి విధి విధానాలు, ప్రమాణాలను రూపొందించే కృషి ఊపందుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐసీఏఆర్ అనుబంధ సంస్థ జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఎన్ ఎంఆర్ఐ) ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తోంది. ఔత్సాహిక రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో ఇటీవల ఒక సమాలోచన కార్య శాలను సైతం ఎన్ ఎంఆర్ఐ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అసలు సేంద్రియ పద్ధతుల్లో పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం అంటే ఏమిటి? రసాయనాలు వాడకుండా పశుపోషణ ఎలా? వ్యాధుల నివారణ, చికిత్సకు రసాయనా లకు ప్రత్యామ్నాయం ఏమిటి? సేంద్రియ ధ్రువీకరణ పద్ధతులేమిటి? మన బలాబలాలు, సవాళ్లేమిటి? ఇటువంటి అంశాలపై విషయ నిపుణులు ‘సాక్షి సాగుబడి’తో ఏమన్నారంటే.. పంటలు/తోటలు లేదా జంతువులు / కోళ్లను రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు, హార్మోన్లు, అల్లోపతి మందులు వంటి సింథటిక్ ఉత్పాదకాలను ఉపయోగించకుండా పెంచటాన్ని సేంద్రియ వ్యవసాయంగా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. ఈ విధంగా రసాయ నాలు, జన్యుమార్పిడి ఉత్పాదకాలు వాడకుండా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచే ఆహారోత్పత్తులకు దేశ విదేశీ మార్కెట్లలో గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. ధ్రువీకరణ ప్రమాణాలకు అనుగుణంగా పెంచిన ఆరోగ్యదాయక మైన సేంద్రియ ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లతో పాటు సేంద్రియ పాలు, మాంసం, కోడిగుడ్లు, విలువ ఆధారిత సేంద్రియ ఆహారోత్పత్తులకు అధిక సొమ్ము చెల్లించటానికి ధనిక, మధ్యతరగతి వినియోగ దారులు వెనుకాడటం లేదు. ఈ ట్రెండ్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కనిపిస్తోంది. ప్రపంచ సేంద్రియ మార్కెట్ జోరుఆర్గానిక్ పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. సేంద్రియ పాల మార్కెట్ ఏటా 6% పెరుగుతోంది. 2020లో 2 వేల కోట్ల డాలర్లుగా ఉండగా, 2026 నాటికి 3,200 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. అదేవిధంగా సేంద్రియ మాంసం ఉత్పత్తుల మార్కెట్ 7% పెరుగుతోంది. 2020లో 1,500 కోట్ల డాలర్ల నుంచి 2025 ఆఖరు నాటికి 2 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఆర్గానిక్ ఎగ్ మార్కెట్ మరింత వేగంగా 12.5% పెరుగుతోంది. 2023లో 370 కోట్ల డాలర్ల వ్యాపారం జరగ్గా 2032 నాటికి ఇది 1,070 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. 20% పెరుగుతున్న దేశీయ మార్కెట్మన దేశంలో సేంద్రియ ఆహారోత్పత్తుల మార్కెట్ ఏటా 20% పెరుగుతోంది. కోవిడ్ తర్వాత సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. అనధికారిక పద్ధతుల్లో మార్కెటింగ్ ఊపందుకుంది. ఉత్పత్తిదారు నుంచి వినియోగదారులు నేరుగా కొంటున్నారు. ప్రభుత్వం ప్రకృతి/ సేంద్రియ పంటల సాగును చాలా ఏళ్లుగా విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు సేంద్రియ పాడి పశువుల పెంపకం, సేంద్రియ గొర్రెలు/మేకల పెంపకం, సేంద్రియ కోడిగుడ్లు, కోడి మాంసం పెంపకంపై ఇప్పుడు దృష్టి సారించింది. ఎన్ పీఓపీ, పీజీఎస్ సర్టిఫికేషన్లు2023–24లో మన దేశంలో 44.75 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగు జరుగుతోంది. దీనితో పాటు 28.5 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం నుంచి సేంద్రియ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలున్న నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ పీఓపీ) సర్టిఫికేషన్ కలిగిన రైతులు 36 లక్షల టన్నుల సేంద్రియ దిగుబడులు పండించారు. దేశీయంగా అమ్ముకోవడానికి ఉద్దేశించిన పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్) సర్టిఫికేషన్ ఉన్న రైతులు 6.20 లక్షల టన్నులు పండించారు. ఈ రెండు రకాల సర్టిఫికేషన్లు పంటలతో పాటు పాలు, మాంసం, గుడ్లు, తేనె, ఆక్వా ఉత్పత్తులకు కూడా ఇస్తారు. ఎగుమతులకు అవకాశాలు2023–24లో 2,61,029 టన్నుల (వీటి ఖరీదు రూ.4,008 కోట్లు) సేంద్రియ పత్తి, నూనెగింజలు, చెరకు, ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలను భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేశాం. అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్, శ్రీలంక, స్విట్జర్లాండ్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు మనం సేంద్రియ ఉత్పత్తులు అమ్మాం. ఆయా దేశాల సేంద్రియ ప్రమాణాలకు తగిన రీతిలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్లు మన రైతులు ఉత్పత్తి చేస్తే, వాటిని ఎగుమతి చేయటం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేసియా, కెనడా దేశాల్లో సేంద్రియ మాంసం, గుడ్లు, పాలు, తేనెకు డిమాండ్ ఉంది. ఆ మార్కెట్ల ప్రత్యేక నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు మౌలిక సదుపాయాలు, ఏర్పాటు చేసే పటిష్టమైన సమగ్ర విధానంతో పాటు రైతుల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ పశుపోషణలో ఎన్ ఎస్ఓపీ ప్రమాణాలు కీలకంసేంద్రియ పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తి చెయ్యాలనుకునే రైతులు, సంస్థలు నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ ఎస్ఓపీ) ప్రమాణాలు పాటించాలి. అవి: సహజ బ్రీడింగ్ పద్ధతులను అనుసరించటం.. జంతువుల ఆరోగ్యం– సంక్షేమానికి రక్షణ చర్యలు తీసుకోవటం.. సేంద్రియంగా పండించిన దాణాను, పశుగ్రాసాలను మేపటం.. పశువులను ఒకేచోట కట్టేసి ఉంచకుండా సహజ ప్రవర్తనను వ్యక్తీకరించేలా స్వేచ్ఛనివ్వటంతో పాటు ఒత్తిడిని తగ్గించడం ముఖ్యం. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అల్లోపతి ఔషధాలు, యాంటీబయాటిక్స్, హార్మోన్లు, పెరుగుదలకు బూస్టర్లు, దాణా మిశ్రమాలు మొదలైన వాటి వాడకంపై నూటికి నూరు శాతం నిషేధం పాటించాలి. పెంచే పశువులు, జీవాల జాతుల ఎంపిక.. దాణా, ఆరోగ్య సంరక్షణ, పెంపకం, పేడ, మూత్రాల నిర్వహణ, సేంద్రియ పెంపక పద్ధతులకు మారే కాలం, షెడ్ల నిర్మాణంలో మెళకువలు, విశాలమైన స్థలం ఆవశ్యకత, ప్రతి పశువుకు గుర్తింపు చిహ్నం ఇవ్వటం, రవాణా పద్ధతులు, వధ–కోత అనంతర నిర్వహణలో నిర్దిష్ట పద్ధతులు పాటించాలి. అన్ని విషయాలపై రికార్డులు తయారు చేయటం ముఖ్యమైన విషయం. ఈ ప్రమాణాలు పాటిస్తూ సేంద్రియ పద్ధతులను అలవాటు చేసుకోవటంలో రైతులకు, విస్తరణ సిబ్బందికి అవగాహన కల్పించటం కోసం హయత్నగర్లోని ‘క్రీడా’ ప్రదర్శన క్షేత్రంలో సేంద్రియ గొర్రెల పెంపక యూనిట్ను ప్రారంభించాం. ఎన్పీఓపీ ధ్రువీకరణ ప్రమాణాలు పాటిస్తున్నాం. సేంద్రియ పశుపోషణ ద్వారా పాలు, మాంసం, సేంద్రియ కోళ్ల పెంపకంలో ఆసక్తి గల రైతులు, రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్పీఓలు), సహకార సంఘాలకు ప్రామాణిక శిక్షణ ఇస్తాం. – డాక్టర్ పి. బస్వారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్ఐ), చెంగిచర్ల, హైదరాబాద్ 040–29801672ఏ జాతులనైనా సేంద్రియంగా పెంచవచ్చువిదేశాల్లో పంటలు పండించే పొలాలు, పశువుల్ని పెంచే క్షేత్రాలు కలిసి ఉండవు. మన దేశంలో పంటలు సాగు చేసే రైతులకు పశువుల పెంపకం కూడా ఉంటుంది. ప్రకృతి/సేంద్రియ సేద్యంలో పంటలు పండించే రైతుల పొలాల్లోనే సేంద్రియంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయి. వారి సొంత పంట వ్యర్థాలను, సొంత ధాన్యాలను పశువులకు మేపటం ద్వారా నాణ్యతా ప్రమాణాలను సులువుగా ఆచరించవచ్చు. నేల–పశువు–పంట.. ఈ మూడింటి మధ్య సేంద్రియ అనుసంధానం చెయ్యాలి. ఈ విషయంలో మన దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఉన్న నైపుణ్యాలు వరంగా ఉపయోగపడతాయి. విదేశాలతో పోల్చితే రసాయనాలకు పెద్ద పీట వెయ్యని దేశం మనది. వ్యవసాయ రసాయనాలు వాడకం తక్కువగా ఉన్న కొండ/గిరిజన ప్రాంతాలపై తొలుత దృష్టిని కేంద్రీకరించి, ప్రోత్సహించాలి. దేశీ, నాటు పశువులను మాత్రమే సేంద్రియ పెంపకానికి వాడాలనేం లేదు. సంకరజాతి పశువులను నిస్సందేహంగా పెంచవచ్చు. – డాక్టర్ మహేశ్ చందర్, ప్రధాన శాస్త్రవేత్త, జాతీయ పశుపోషణ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐవీఆర్ఐ), ఇజ్జత్నగర్, ఉత్తరప్రదేశ్పశు వ్యాధులకు సంప్రదాయ ఈవీఎం చికిత్స మేలుపశు వ్యాధుల నివారణలో, చికిత్సలో యాంటీబయాటిక్ ఔషధాలను అతిగా వాడుతూ వాటికి నిరోధకత పెంచుకోవటం ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. సుసంపన్న సంప్రదాయ సిద్ధ, ఆయుర్వేద విజ్ఞానంతో కూడిన మూలికా వైద్య చికిత్స (ఎత్నో వెటర్నరీ మెడిసిన్ –ఈవీఎం)ల ద్వారా పశువ్యాధులను జయించవచ్చు. 24 ఏళ్లుగా ఈవీఎంలపై కృషి చేస్తున్నా. వీటి పనితీరు ఎంత ప్రభావశీలంగా ఉందో 9 రాష్ట్రాల్లో 25 ఎన్ డీడీబీ అనుబంధ పాడి సహకార సంఘాల్లోని రైతుల అనుభవాలే తేటతెల్లం చేస్తున్నాయి. పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి అనేక తీవ్ర జబ్బులను సైతం కొద్ది రోజుల్లో ఈవీఎం మందులతో తగ్గించవచ్చని రుజువైంది. 11.2 లక్షల కేసుల్లో 80.4% జబ్బులు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీఎంల ప్రభావశీలతను గుర్తించింది. ఈవీఎంకు ఎవిడెన్ ్స బేస్డ్ మెడిసిన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, కచ్చితంగా ఫలితాలనిచ్చే పర్యావరణ హితమైన, ఆరోగ్యదాయకమైన చికిత్సలని గుర్తించాలి.– ప్రొ. ఎన్ . పుణ్యమూర్తి, ఎన్ డీడీబీ కన్సల్టెంట్, టిఎఎన్ యువిఎఎస్ విశ్రాంత ఆచార్యులు, తంజావూరు, తమిళనాడుసమగ్ర విధానం ద్వారా రైతులకు మార్గదర్శనంప్రకృతి/సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆర్గానిక్ మాంసం, గుడ్లు, పాలు/పాల ఉత్పత్తుల పెంపకంపై కూడా దృష్టిని కేంద్రీకరించింది. సేంద్రియ మాంస ఉత్పత్తుల పెంపకం, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పారిశ్రామికవేత్తల ఆకాంక్షలతో పాటు మా అనుభవాలను జోడించి కేంద్రానికి నివేదిక పంపుతాం. సమగ్ర విధాన రూపకల్పనకు ఇది దోహదం చేస్తుంది. సేంద్రియ పశుపెంపకంపై పరిశోధనలకు, విస్తరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. అపెడాలో సేంద్రియ పశు పెంపకం ప్రోత్సాహానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చెయ్యాలి. అమూల్ వంటి నమ్మదగిన బ్రాండ్ ద్వారా విక్రయిస్తే సేంద్రియ పాలు, గుడ్లు, మాంసం అధిక ధర ఇచ్చి కొనటానికి దేశంలో ప్రజలు ఆసక్తితో ఉన్నారు. యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు సేంద్రియ పాలు, మాంసం ఎగుమతి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసక్తి గల రైతులు మమ్మల్ని సంప్రదిస్తే మార్గదర్శనం చేస్తాం. – డా. ఎస్. బి. బర్బుదే, సంచాలకులు, ఐసీఏఆర్– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్ఐ), చెంగిచర్ల, హైదరాబాద్ – పంతంగి రాంబాబు -
మండే ఎండలతో ముప్పు తోటల సంరక్షణ ఎలా?
ఏటేటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో పండ్లు, కూరగాయలు, పూల తోటలకు ప్రతి వేసవీ పెను సవాలుగా మారుతోంది. 2024వ సంవత్సరంలో ప్రతి నెలా గత 190 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2025లో గడచిన మూడు నెలల తీరూ అంతే. సాధారణం కన్నా 4–5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకావటం మార్చిలోనే అనుభవంలోకి తెచ్చింది ఈ సంవత్సరం. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ అధిక ఉష్ణోగ్రతల నుంచి వివిధ ఉద్యాన తోటల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను సవివరంగా తెలియజేస్తున్నారు.మామిడి→ ప్రస్తుతం కాయలు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల వేసవిలో స్థిరమైన, తగినంత నీటి సరఫరా ఇవ్వాలి. → 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మామిడి చెట్లకు బిందుసేద్యం ద్వారా రోజుకు 4 నుంచి 5 గంటలు నీరు అందించాలి. → సాధారణ పద్ధతిలో నేల లక్షణాల ఆధారంగా 7 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటిని అందించాలి. → పండ్లకు కాగితపు సంచులు కడితే వేడి నుంచి రక్షించుకోవటానికి సహాయపడుతుంది. → నీటి యాజమాన్యం సరిగ్గా అమలు చేయకపోతే పండ్ల తొడిమె భాగంలో అబ్షిషన్ పొరలు ఏర్పడి పండ్లు రాలిపోవడానికి కారణమవుతాయి. → చెట్ల పాదులకు పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన (సేంద్రియ మల్చ్) ఏర్పాటు చేయాలి. → పొడి వాతావరణంలో తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫి్రపోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. → పండు ఈగ నివారణకు లింగ ఆకర్షక బుట్టల ఉచ్చులను ఉపయోగించాలి. → గోలికాయ దశలో మామిడి కాయలు ఉన్నప్పుడు జిఎ3 (50 పిపిఎం) ఒక లీటరు నీటికి 50 మిల్లీ గ్రాములు కలిపి పిచియారీ చేయటం ద్వారా రాలే కాయలను 15% తగ్గించుకోవచ్చు.ద్రాక్ష→ ప్రతి రోజూ కనీసం చెట్టుకు 6–8 లీటర్ల నీటిని అందించాలి. ∙పందిళ్లపై షేడ్నెట్స్ వేస్తే, ద్రాక్ష గుత్తులపై సూర్యరశ్మి పడకుండా చేయవచ్చు.ఆయిల్ పామ్→ ముదురు ఆయిల్ పామ్ చెట్లకు సుమారుగా ఒక రోజుకు గాను ఏప్రిల్ నెలలో 250–300 లీటర్లు, అదేవిధంగా మే నెలలో 300–350 లీటర్ల నీరు అందించాలి. → సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. ‘ఇసారియా ఫ్యూమాజోరోజియా’ జీవ శిలీంధ్ర నాశనిని వాడి సమర్థవంతంగా అరికట్టవచ్చు.→ కత్తిరించిన ఆకులను, మగ గెలలను, ఖాళీ గెలలను మొక్క మొదళ్లలో మల్చింగ్ వలె పరచాలి. తద్వారా నేలలోని నీటి తేమను కాపాడుకోవచ్చు.అరటి→ ఎండిన అరటి ఆకులు, వరి గడ్డి, మొక్కజొన్న గడ్డిని మల్చింగ్గా వేసి మొక్క మొదళ్లలో నీటి తేమను కాపాడాలి. → వేసవిలో నేరుగా సూర్యరశ్మి గెలలపై పడటం వలన గెలలు మాడిపోతాయి. తద్వారా వివిధ తెగుళ్లు ఆశించి కాయ / గెల కుళ్లిపోతుంది. కావున, నేరుగా సూర్యరశ్మి గెలలపై పడకుండా పక్కనే ఉన్న ఆకులను గెలలపై కప్పి గెల నాణ్యతను కాపాడాలి. → వెదురు / సర్వి /సుబాబుల్ వంటి కర్రలను వాడి అరటి చెట్టు కాండానికి ఊతం అందించాలి. లేదా టేపులను నాలుగు వైపులా కట్టాలి. తద్వారా వేసవి వడ గాలులకు అరటి చెట్లు పడిపోకుండా చూసుకోవచ్చు.కొబ్బరి→ పూత, కాత వస్తున్న చెట్లకు సుమారుగా 50–60 లీటర్ల నీటిని అందించాలి.→ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. దీని నివారణకు వేప నూనె (10,000 పిపిఎం) 2 మిల్లీ లీటర్లు / లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. 10–15 రోజుల అనంతరం ఇసారియా ఫ్యూమారోజియా అనే జీవ శిలీంధ్ర నాశినిని ఆకుల కింద భాగం తడిచేలా పిచికారీ చేస్తే పురుగు ఉధృతిని సమర్థవంతంగా నివారించవచ్చు. → పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడి నేలలోని నీటి తేమను కాపాడాలి.కూరగాయ తోటల రక్షణ ఎలా?టమాట→ అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా కాయలు/ పండ్లలో పగుళ్లు వస్తాయి. ఎండ దెబ్బ తగలటం వల్ల నాణ్యతలేని పండ్ల దిగుబడికి దారితీస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టమాటలో ఆకుముడత తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. → నీడనిచ్చే వస్త్రాలతో షేడ్నెట్ ఏర్పాటు చేసుకుంటే మొక్కలకు సూర్యకాంతి పడటం తగ్గుతుంది. నేల ఉష్ణోగ్రత, గాలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. → నేల తేమను నిలుపుకోవడానికి, నేల ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను తగ్గించడానికి మొక్క చుట్టూ వెండి రంగు ప్లాస్టిక్ మల్చింగ్ లేదా గడ్డిని వేయాలి. → అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల సమయంలో నేల తేమను త్వరగా కోల్పోతుంది. మొక్కలు ఆకుల ద్వారా తేమను బయటకు వదిలే ప్రక్రియ (బాష్పీభవనం) ద్వారా కోల్పోయిన తేమను తిరిగి పొందడానికి తగినంత, తరచుగా నీటిని అందించాలి. → వేడిగాలుల సమయంలో తగినంత పోషకాలను అందించాలి. సంక్లిష్ట ఎరువుల (19–19–19 లేదా 13–0–45)తో పాటు సూక్ష్మపోషక మిశ్రమాలను 3–5 రోజుల వ్యవధిలో రెండుసార్లు లీటరుకు 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేస్తే కూరగాయ పంటలు వేడి ఒత్తిడిని తట్టుకుంటాయి.→ బాష్పీభవనం తగ్గించడానికి కయోలిన్ 3–5% (30–50 గ్రా./లీ.) పిచికారీ చేయాలి. → వడలు తెగులు నియంత్రణ కోసం లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్తో నేలను తడపాలి. → వైరస్ తెగుళ్ల నివారణకు వ్యాధిసోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చ అట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించిన ప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనెతో పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి లీటరు నీటికి ఫి్రపోనిల్ను 0.2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ను 0.3 మి.లీ. మోతాదులో కలిపి పిచికారీ చేయాలివంగ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వంగ పంటను మొవ్వు, కాయతొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంది. → వీటి నియంత్రణకు ఎకరానికి 08–10 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసి, నివారణ చర్యగా లీటరు నీటికి 3 మి.లీ. చొప్పున వేప నూనె (10,000 పిపిఎం)ను కలిపి పిచికారీ చేయాలి. → పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఫ్లూబెండియామైడ్ మందును 0.25 మి.లీ. లేదా ఇమామెక్టిన్బెంజోయేట్ మందును 0.4 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.బెండ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బెండకాయలో పల్లాకు తెగులు వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉన్నాయి. → వ్యాధి సోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చఅట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించినప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్ను 0.3 మి.లీ. లేదా డయాఫెంథియురాన్ను 1.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కలు:కృష్ణవేణి – 9110726430పసుపు : మహేందర్ : 94415 32072మిర్చి : నాగరాజు : 8861188885 -
స్ఫూర్తిదాయక ‘సాగుబడి’
హరిత విప్లవం పుణ్యమాని ఆహారోత్పత్తిలో మనదేశం స్వయం సమృద్ధి సాధించింది. ఆహార ధాన్యాలు, కూరగాయాలు, పండ్లు అధికంగా పండించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన వ్యవసాయ రంగం ఎదిగింది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇంకోవైపు విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుచేసిన ఆహార ఉత్పత్తులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతున్నాయి. అధికోత్పత్తి ఆశతో మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఔషధాలు, మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయి. ప్రజలు, మూగజీవాల ఆరోగ్యాలకు హానికరంగా మారడంతో పాటు నేల సారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయక ఉత్పాదకత, ఆహార భద్రత, పర్యావరణ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నింటికి విరుగుడుగా రసాయనేతర సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం మళ్లీ తెరమీదకు వచ్చింది.భూ సారానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిన రసాయనిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా.. అతి తక్కువ సాగు ఖర్చుతో ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయం పురుడు పోసుకుంది. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో దీని గురించి రైతులకు, ఔత్సాహికులకు తెలియకుండా పోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే సాక్షి దినపత్రిక ఈ గురుతర బాధ్యతను భుజాన వేసుకుంది. పునరుజ్జీవన వ్యవసాయ కథనాలకు ‘సాగుబడి’ పేరుతో ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించి ముందడుగు వేసింది. ప్రకృతి, సేంద్రియ రైతుల స్ఫూర్తిదాయక కథనాలతో పాటు రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చింది. విత్తు దగ్గరి నుంచి విక్రయం వరకు.. అన్నదాతలకు ఉపయుక్తమైన సమాచారాన్ని ‘సాగుబడి’ సాధికారికంగా అందించింది. స్వల్ప వ్యవధిలోనే ‘సాగుబడి’ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు దిక్సూచిగా అత్యంత ఆదరణ చూరగొంది. ఇంటి పంటలు, సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు చేరువ చేసింది.చదవండి: తక్కువ ఖర్చుతో.. పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్‘సాగుబడి’లోని 2014-16 మధ్య కాలంలో ప్రచురితమైన ప్రకృతి వ్యవసాయ ప్రేరణాత్మక కథనాలను పుసక్తంగా ప్రచురించారు సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు. ప్రకృతి, సేంద్రియ సాగుకు సంబంధించిన అన్ని అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రకృతి వ్యవసాయంలో లబ్దప్రతిష్టులైన వారు, రైతు శాస్త్రవేత్తల ఇంటర్వ్యూలతో పాటు రైతులకు అవసరమయ్యే సమాచారాన్నంతా అందించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రచురించిన ఈ పుస్తకాన్ని చూస్తేనే అర్థమవుతుంది రచయిత నిబద్దత. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వారితో పాటు సేంద్రియ సాగు గురించి తెలుసుకోవాలకునే వారికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. రచయిత చెప్పినట్టుగా ఈ పుస్తకం ప్రకృతి వ్యవసాయానికి పెద్దబాలశిక్ష వంటిదే.సాగుబడి (మొదటి భాగం)ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి కథనాలుపేజీలు: 320;వెల: 600 /- ; రచన, ప్రతులకు:పంతంగి రాంబాబు,8639738658👉ఆన్లైన్లో సాగుబడి పుస్తకం కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
సమ్మిళిత అభివృద్ధికి సహకార నమూనా!
‘సమాజంలో ప్రతి ఒక్కరి కోసం మెరుగైన ప్రపంచాన్ని సహకార సంఘాలు నిర్మిస్తాయి...’ ఇదీ ఈ ఏడాది అంతర్జాతీయ సహకార దినోత్సవ నినాదం! జూలై మొదటి శనివారం నాడు సహకార దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ. ఈ జూలై 6న సహకార దినోత్సవ సంబురం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోట్లాది సహకారులు రకరకాల కార్యక్రమాల ద్వారా సరికొత్త ఆశలతో సహకార స్ఫూర్తిని మరోసారి చాటడానికి సమాయత్తమవుతున్నారు.మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకార శాఖను ఏర్పాటు చేసి అనేక సంస్కరణలు చేపట్టిన తర్వాత మన దేశంలో సహకార వ్యవస్థలో కొత్త కదలిక మొదలైంది. అంతకుముందు నుంచే రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సహకార శాఖలు ఉన్నప్పటికీ కేంద్రం స్థాయిలో వ్యవసాయ శాఖలో ఒక విభాగంగానే సహకార పాలన ఉంటూ వచ్చింది.అనాదిగా రైతులకు రుణాలు ఇచ్చే సొసైటీలుగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్లు) రైతుల ఆర్థిక సేవలకే పరిమితం కాకుండా ఇతర ప్రజల అవసరాలను కూడా తీర్చే వ్యాపార సంస్థగా ఉండాలని భావించి కేంద్ర సహకార శాఖ పీఏసీఎస్ లకు సరికొత్త బైలాస్ను నిర్దేశించటం ఒక కీలక పరిణామం. ఈ సేవలన్నీ పారదర్శకంగా అందించటం కోసం పీఏసీఎస్ లన్నిటినీ కంప్యూటరీకరించే పని జరుగుతోంది.పీఏసీఎస్ల తర్వాత సంఖ్యాపరంగా పాడి రైతుల సొసైటీలు, మహిళా సహకార సంఘాలు (ఉదా: లిజ్జత్ పాపడ్ను ఉత్పత్తి చేసే మహిళా సొసైటీ), చేనేత కార్మికుల సొసైటీలు, మత్స్యకారుల సొసైటీలు, గృహనిర్మాణ సొసైటీలు, ఉద్యోగుల సొసైటీలు, ప్రత్యేకించి కార్మికుల సొసైటీలు (ఉదా: కేరళలో ప్రసిద్ధమైన ఉరులుంగల్ నిర్మాణ కార్మికుల సొసైటీ) సైతం గతంలోనే ఏర్పాటు కావటం మనకు తెలిసిందే.గుజరాత్లో ఏర్పడిన చిన్న పిల్లల పొదుపు సహకార సంఘం పెద్ద హిట్ అయ్యింది. ఆధునిక కాలానికి అనుగుణంగా సరికొత్త వర్గాలు విలక్షణమైన సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లో చిన్నపాటి ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే పనివారి సహకార సంఘం కూడా ఏర్పాటైంది. ఈ–కామర్స్ సంస్థల్లో వస్తువులు పంపిణీ చేసే గిగ్వర్కర్ల సహకార సంస్థలు సైతం ఏర్పాటవుతున్నాయి.ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ గ్రామాల్లో, పట్టణాల్లో వయోవృద్ధుల జనాభా పెరుగుతోంది. పిల్లలు చదువులు/ ఉద్యోగాలు/ వ్యాపారాల కోసం దేశ విదేశాలకు వెళ్లిపోవటంతో గ్రామాలు/ పట్టణాలు/ నగరాల్లో వృద్ధులే మిగిలిపోతున్నారు. కొందరు వృద్ధాశ్రమాల్లో చేరుతున్నా ఇళ్లు వదిలి వెళ్లలేక, అక్కడే ఉండలేక పండుటాకులు నానా అగచాట్లు పడుతున్నారు.వీరి ప్రత్యేక ఆహార, వైద్య, సామాజిక అవసరాలు తీర్చే ప్రత్యేక సహకార సంఘాలు ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాల్లో విశేష సేవలు అందిస్తున్నాయి. ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసుకొని ఉమ్మడిగా భోజన ఏర్పాట్లు చేసుకోవటం దగ్గరి నుంచి.. ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసుకునే వరకు సభ్యులైన వృద్ధులకు అనేక సేవలు అందిస్తున్నాయి ఈ సొసైటీలు. తెలుగు రాష్ట్రాల్లోనూ వృద్ధుల సహకార సంఘాల అవసరం ఎంతో ఉంది.గుజరాత్లో సహకార వ్యవస్థతో గట్టి సంబంధం ఉన్న అమిత్ షా కేంద్ర సహకార మంత్రిగా ఇటీవలే రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సహకార వ్యాపారాన్ని దేశ విదేశాల్లో కొత్త పుంతలు తొక్కించాలన్నది తమ లక్ష్యమని మోదీ, అమిత్షా చెబుతున్నారు. సహకార రంగంలో ఢిల్లీ నుంచి తేదలచిన మార్పులన్నిటినీ క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది రాష్ట్ర సహకార శాఖలు. రాష్ట్రస్థాయిలో సహకార వ్యవస్థ చురుగ్గా పనిచేయాలంటే సలహా మండళ్లు కీలకం. వాటి జాడ లేకుండా పోయింది.సాచివేత ధోరణి, అవినీతి, మితిమీరిన రాజకీయ జోక్యం, జవాబుదారీతనం లోపించటం వంటి జాడ్యాలతో కునారిల్లుతున్న సహకార శాఖల్లో కొత్తగా సహకార స్ఫూర్తి వెల్లివిరియాలంటే రాష్ట్ర స్థాయిలోనూ సంస్కరణలు తేవాలి. అప్పుడే ‘సహకార నమూనా’ మేలైన సమ్మిళిత అభివృద్ధి మార్గంగా నిలుస్తుంది. వాతావరణ మార్పుల గడ్డు కాలంలో సహకార అభివృద్ధి నమూనా కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్ -
Sagubadi: చౌడు సాగుకు చేదోడు కొత్త బ్యాక్టీరియా!
'సాధారణ వరి వంగడాల పంటకు ఉప్పు నీరు తగిలితే ఆకులు పసుపు రంగులోకి మారిపోయి, ఎదుగుదల లోపించి, దిగుబడి తగ్గిపోతుంది. అయితే, కేరళ తీరప్రాంతంలో లోతట్టు మాగాణుల్లో ఉప్పు నీటిలోనూ పొక్కలి వరి వంగడం చక్కగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. ఇందుకు దోహదపడుతున్న మట్టి మర్మమేమిటి? అని అల్లాపుఝలోని సనాతన ధర్మ కాలేజీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి ఓ సరికొత్త బ్యాక్టీరియాను కనుగొన్నారు. పొక్కలి రకం వరి సాగయ్యే సేంద్రియ పొలాల్లోని మట్టిలో ఉండే సూడోమోనాస్ తైవానెన్సిస్ (పికె7) వల్లనే ఉప్పు నీటిని ఆ పంట తట్టుకోగలుగుతోందని వారు తేల్చారు.' కుట్టనాడ్ ప్రాంతంలో విస్తారంగా సాగయ్యే యుఎంఎ అనే రకం వరికి ఉప్పునీటి బెడద ఎక్కువైన నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగింది. పికె7తో పాటు పంట పెరుగుదలకు దోహదం చేసే రైజోబ్యాక్టీరియా (ఎస్.టి.–పిజిపిఆర్లు) కూడా వాడి యుఎంఎ రకం వరిని ప్రయోగాత్మకంగా సాగు చేసి చూశారు. ఈ బ్యాక్టీరియాలు వాడి సాగు చేస్తే హెక్టారుకు 7,595 కిలోల ధాన్యం దిగుబడి వస్తే.. వాడకుండా సాగు చేస్తే హెక్టారుకు 7,344 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. అంటే.. పికె7 బ్యాక్టీరియా ఉప్పు వల్ల కలిగే ప్రతికూలతను తట్టుకొని వరి పంట నిలబడే వ్యవస్థను సృష్టిస్తోందని అర్థమవుతోందని పరిశోధకులు నిర్థారణకు వచ్చారు. 2022 డిసెంబర్ – ఏప్రిల్ 2023 మధ్య కాలంలో జరిగిన ఈ అధ్యయన వివరాలతో కూడిన వ్యాసం జర్నల్ ఆఫ్ అగ్రానమీ అండ్ క్రాప్ సైన్స్లో ప్రచురితమైంది. మన చౌడు భూముల్లోనూ వరి, తదితర పంటల సాగుకు ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందేమో మన శాస్త్రవేత్తలు పరిశోధించాలి. 'పొక్కలి’ పొలంలో మట్టి సేకరణ 67.3 లక్షల హెక్టార్లలో చౌడు సమస్య.. మన దేశంలో చౌడు బారుతున్న నేలల (సాల్ట్–ఎఫెక్టెడ్ సాయిల్స్) విస్తీర్ణం ఇటీవల కాలంలో వేగంగా పెరుగుతోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కు చెందిన కేంద్రీయ చౌడు నేలల పరిశోధనా సంస్థ (సిఎస్ఎస్ఆర్ఐ) ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం మన దేశంలో 67 లక్షల 30 వేల హెక్టార్ల సాగు భూమి చౌడుబారింది. 2050 నాటికి ఇది రెట్టింపవుతుందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. భూములు చౌడుబారటం వల్ల మన దేశంలో ఏటా 1.68 కోట్ల టన్నుల పంట దిగుబడిని నష్టపోతున్నాం. ఈ పంట విలువ రూ. 23 వేల కోట్లు (2015 నాటి ధరల ప్రకారం). చౌడు భూముల్లో పంటలు బతకవు. బతికినా పెద్దగా పెరిగి దిగుబడినివ్వవు. వ్యవసాయోత్పత్తిని దెబ్బతీయటమే కాదు సాంఘిక–ఆర్థిక స్థితిగతులను సైతం చౌడు సమస్య అతలాకుతలం చేస్తుంది. మురుగునీటి పారుదల సదుపాయం సమర్థవంతంగా లేకపోవటం, భూముల్లో అతిగా నీరు నిల్వ ఉండిపోవటం ఇందుకు ప్రధాన కారణాలు. రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులు, పంటలకు అందించే భూగర్భ జలాల నాణ్యత నాసికరంగా ఉండటం కూడా తోడవుతున్నాయి. చౌడు సమస్య మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి దెబ్బతింటోంది. ఏటా వీరికి కలుగుతున్న నష్టం 630 కోట్ల డాలర్లని అంచనా. వంద దేశాల్లో 83.5 కోట్ల హెక్టార్ల భూమి చౌడుబారిన పడింది. ఇందులో మనుషుల పనుల వల్ల చౌడువారిన భూములు 7.6 కోట్ల హెక్టార్లు ఈ నేపధ్యంలో కేరళలో కనుగొన్న కొత్త సూక్ష్మజీవి చౌడు భూముల సాగులో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం..! 13న బయోచార్ సొసైటీ ఆవిర్భావం! కట్టె పులల్ల నుంచి పర్యావరణ హితమైన బయోచార్ (బొగ్గుపొడి) ఉత్పత్తిని, వాడకాన్ని పెంపొందించే సదుద్దేశంతో భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. బొగ్గుపొడి సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుంది. దీంతో పాటు నీటి శుద్ధి, పారిశుద్ధ్యం తదితర అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బయోచార్కు కార్బన్ క్రెడిట్స్ చేకూర్చే పరిస్థితులు ఉండటంతో జీవనోపాధులను పెంపొందించడానికి కూడా ఇది దోహదపడనుంది. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5–7 గంటల మధ్య హైదరాబాద్ యూసఫ్గూడలోని ఎన్.ఐ.–ఎం.ఎస్.ఎం.ఇ. కార్యాలయ ఆవరణలో బయోచార్ సొసైటీ ఆవిర్భావ సభ జరగనుంది. ఆర్.కె. మెహతా చైర్మన్గా, డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి ప్రెసిడెంట్గా, ఎస్.కె. గు΄్తా కార్యదర్శిగా భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. వివరాలకు.. 6305 171 362. 1 నుంచి పల్లెసృజన శోధా యాత్ర.. గ్రామీణుల్లో నిగూఢంగా దాగి ఉన్న తరతరాల జ్ఞానాన్ని శోధించడానికి, ప్రకృతితో మమేకమైన వారి జీవన విధానం గురించి తెలుసుకోవడానికి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి గ్రామం నుంచి గన్నారం గ్రామం వరకు చిన్న శోధాయాత్ర నిర్వహించనున్నట్లు పల్లెసృజన సంస్థ అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం తెలిపారు. మార్చి 1 నుంచి 3 వరకు జరిగే ఈ యాత్రలో రూ.500 రుసుము చెల్లించి ఆసక్తిగల వారెవరైనా ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 98660 01678, 99666 46276. నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్ ఆన్, ఆఫ్! -
Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్ ఆన్, ఆఫ్!
'రైతులు ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బంది. ఓ స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ పరికరం ద్వారా ఫోన్తో బోర్ మోటర్ను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో తయారైన ఎంబెడ్డెడ్ స్టార్టర్ ఇది. దొంగల భయం లేని ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్న రైతులు..' వరి, మొక్కజొన్న, మిర్చి.. ఇలా పంట ఏదైనా సమయానికి సాగు నీటిని అందించటం ముఖ్య విషయం. స్వయంగా పొలానికెళ్లి మోటారు స్విచ్ ఆన్, ఆఫ్ చేయటం సాధారణంగా రైతు చేసే పని. అయితే, ఏదైనా పని మీద రైతు ఊరికి వెళ్లాల్సి వస్తే.. పక్క పొలంలో రైతును బతిమాలుకొని పంటలకు నీళ్లు పెట్టేందుకు మోటర్ ఆన్, ఆఫ్ చేయించేవారు. ఇప్పుడు అలా ఎవర్నీ ఇబ్బంది పెట్టక్కర్లేదు, రైతు ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే, రైతు ఎంత దూర ప్రాంంతం వెళ్లినా సరే ఫోన్ నెట్వర్క్ ఉంటే చాలు.. మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పుడు అంటే అప్పుడు బోర్ మోటర్ను ఆన్ చేసుకోవచ్చు, పని పూర్తయ్యాక ఆఫ్ చేసుకోవచ్చు. న్యాస్త అనే స్టార్టప్ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతికతతో విలక్షణ స్టార్టర్ను అందుబాటులోకి తెచ్చారు. సిద్ధిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలంలో పలువురు రైతులు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ పరికరాన్ని మోటారు వద్ద అమర్చుకోవడం వలన ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా మోటర్ను ఆన్ చేసుకునే వెసులుబాటు ఏర్పడటంతో తమకు చాలా ఇబ్బందులు తప్పాయంటున్నారు రైతులు. నలుగురు యువ విద్యావంతులు స్థాపించిన ‘న్యాస్త’ స్టార్టప్ కంపెనీ రాజేంద్రనగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా యాజమాన్య సంస్థ (నార్మ్) ఎ–ఐడియాలో ఇంక్యుబేషన్ సేవలు పొంది రూపొందించిన ఈ పరికరంలో మొబైల్లో మాదిరిగానే ఒక సిమ్ కార్డు ఉంటుంది. దాని ద్వారా మెసేజ్ రూపంలో పొలంలో నీటి మోటర్కు సంబంధించిన సమాచారం.. అంటే మోటర్కు నీరు సరిగ్గా అందుతోందా? విద్యుత్తు ఓల్టేజి ఎంత ఉంది? మోటర్ నీటిని సరిగ్గా ఎత్తిపోస్తోందా లేదా? వంటి సమాచారం ఎప్పటికప్పుడు రైతు మొబైల్కు మెసేజ్లు వస్తాయి. సంవత్సరానికి ఒక్కసారి ఈ సిమ్కు రీచార్జి చేయిస్తే సరిపోతుంది. ఫోన్ సిగ్నల్స్ ఉండే ఎక్కడి నుంచైనా మోటర్ను ఆఫ్, ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నీరు లేకపోయినా, విద్యుత్తు హెచ్చుతగ్గులు వచ్చినా మోటర్ స్విచ్ ఆఫ్ అయిపోయి.. రైతుకు మొబైల్లో సందేశం వస్తుంది. ఉపయోగాలెన్నో.. ఎప్పుడు కావాలంటే అప్పుడు (అడ్హాక్ మోడ్) న్యాస్త మొబైల్ యాప్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏయే వేళ్లల్లో మోటర్ నడవాలి (ఇంట్రవెల్స్ మోడ్)?: భూగర్భంలో నీరు తక్కువగా ఉన్న చోట నిరంతరంగా బోర్లు నడిపితే కాలిపోతాయి. విద్యుత్తు ప్రసారం ఉండే సమయాలకు అనుగుణంగా మోటర్ను ఏ సమయానికి ఆన్ చెయ్యాలి? ఏ సమయానికి ఆఫ్ చేయాలి? అని టైమ్ సెట్ చేస్తే చాలు. ఆ ప్రకారంగా అదే ఆన్ అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. షెడ్యులర్ మోడ్: ప్రతి రోజు ఒకే సమయంలో ఆన్ అయ్యేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా టైం ఫిక్స్ చేసుకోవడం వలన ప్రతి రోజు పంటలకు సాగు నీళ్లు తగిన మోతాదులో అందించే అవకాశం ఉంటుంది. దొంగల భయం లేదు.. వరి, కూరగాయలు, పామాయిల్, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్న 117 మంది రైతులు ఈ స్టార్టర్ ద్వారా లబ్ధిపొందుతున్నారని న్యాస్త స్టార్టప్ సహ వ్యవస్థాపకులు భార్గవి (83673 69514) తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో ఈ ఎంబెడ్డెడ్ స్టార్టర్ పనిచేస్తుంది. అందువల్ల పొలంలో నుంచి ఎవరైనా ఇతరులు దీన్ని దొంగతనంగా తీసుకెళ్లినా వారు వినియోగించలేరని, దాన్ని ఆన్ చేయగానే మొబైల్ నెట్వర్క్ ద్వారా దాని లొకేషన్ ఇట్టే తెలిసిపోతుందని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. ఓవర్ ద ఎయిర్ (ఒ.టి.ఎ.) సర్వర్ ద్వారా ఈ స్టార్టర్లను తాము నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటామని, సాంకేతికంగా అప్డేట్ చేయటం చాలా సులభమన్నారు. రైతు ఒక్క సిమ్ ద్వారా అనేక మోటర్లను వాడుకోవటం ఇందులో ప్రత్యేకత అని ఆమె వివరించారు. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్ధిపేట ఈ పరికరం లేకపోతే వ్యవసాయమే చేయకపోదును! 8 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నా. పొలానికి సుమారుగా 600 మీటర్ల దూరం నుంచి సాగు నీరు సరఫరా చేస్తున్నా. దూరంలో బోర్ ఉండటంతో పైప్లు చాలా సార్లు ఊడిపోతుండేవి. అప్పుడు మోటర్ను బంద్ చేసేందుకు అంత దూరం నడచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారానే మోటర్ను ఆన్, ఆఫ్ చేస్తున్నా. సెల్ఫోన్తో బోర్ మోటర్ ఆఫ్, ఆన్ చేయడం అందుబాటులోకి రావడంతో చాలా ఇబ్బందులు తప్పాయి. ఈ పరికరం లేకపోతే నేను వ్యసాయం కూడా చేయకపోదును. – నాగర్తి తిరుపతి రెడ్డి (94415 44819), మాచాపూర్, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా ఊరికి వెళ్లినా ఇబ్బంది లేదు.. ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బందులు ఉండేవి. పక్కన రైతును బతిమిలాడుకునే వాళ్లం. అదే ఇప్పుడు న్యాస్త స్టార్టర్తో ఎక్కడికైనా ఫంక్షన్కు, ఊరికి సంతోషంగా వెళ్లి వస్తున్నా. అక్కడి నుంచే మోటర్ను సెల్ఫోన్లో నుంచే ఆన్, ఆఫ్ చేస్తున్నా. ఇది ఎంతో ఉపయోకరంగా ఉంది. – పంపరి సత్తయ్య (9989385961), చిన్నకోడూరు, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Dr Anandi Singh Rawat: అర్థం చేసుకోవడం ముఖ్యం -
‘సాక్షి సాగుబడి' రాంబాబు, 'సాక్షి టీవీ' కిషోర్ లకు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి సాగుబడి’ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు బుధవారం హైటెక్స్లో జరిగిన హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ ఫంక్షన్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి చేతుల మీదుగా ఉత్తమ ప్రింట్ అగ్రికల్చరల్ జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు. 37 ఏళ్లుగా పాత్రికేయుడిగా సేవలందిస్తున్న రాంబాబు గతంలో విశాలాంధ్ర, ఆంధ్రభూమి డైలీలో పనిచేశారు. గత 15 ఏళ్లుగా సాక్షిలో పనిచేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తికి విశేష కృషి చేస్తూ ట్రెండ్ సెట్టర్గా పేరుగాంచారు. ప్రతి మంగళవారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని దశాబ్దకాలంగా రైతు జన రంజకంగా నిర్వహిస్తున్నారు. పన్నెండేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలపై కథనాలు రాస్తూ ప్రాచుర్యంలోకి తెస్తున్న ఆయన గత సంవత్సరంగా ‘సాక్షి ఫన్డే’లో ప్రపంచవ్యాప్తంగా అర్బన్ అగ్రికల్చర్ పోకడలపై కాలమ్ రాస్తున్నారు. ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్, స్వతంత్ర శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్ వలి, మట్టి సేద్య నిపుణుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి వంటి ఉద్ధండుల విశేష కృషిని తెలుగు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవటంలో రాంబాబు కృషి చేస్తున్నారు. అదేవిధంగా, గ్రామీణులు, రైతు శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన అనేక యంత్ర పరికరాలను వెలుగులోకి తేవడంలో విశేష కృషి చేసినందుకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) 2017లో జాతీయ పురస్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాక్షి పత్రిక తరఫున రాంబాబు స్వీకరించిన విషయం తెలిసిందే. చేవెళ్ల ఎంపీ జి. రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ ఛానళ్లలో సేవలందిస్తున్న పాత్రికేయులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు పలువురు పురస్కారాలు అందుకున్నారు. ఇక సాక్షి టీవీలో సీనియర్ ప్రజంటర్ గా చేస్తోన్న DV నాగ కిషోర్ ఉత్తమ న్యూస్ ప్రజంటర్ గా అవార్డు అందుకున్నారు. 23 సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో న్యూస్ ప్రెజంటర్గా, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు కిషోర్. రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన డిబేట్ లను సాక్షి టీవీ వేదికగా నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో పీజీతో పాటు ఎం.కాం., ఎంబీఏ చదువుకున్న కిషోర్, గతంలో రేడియో ప్రజంటర్ గా కూడా పని చేశారు. కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో రిపోర్టింగ్ చేసిన అనుభవం కిషోర్ కు ఉంది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రౌండ్ రిపోర్టులు అందించారు కిషోర్. చదవండి: రోజుకు రూ. 1500.. ఎకరంన్నరలో ఏటా 4 లక్షలు! ఇలా చేస్తే లాభాలే! విద్యార్థులకు స్కాలర్ షిప్లు.. ఆర్థికంగా వెనుకబడిన మీడియా సిబ్బంది కుటుంబంలో చురుకైన విద్యార్థులకు హై బిజ్ టీవీ ఆసరాగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాంటి 10 మంది స్టూడెంట్స్ ను ఎంపిక చేసి వారికి రూ. 25 వేల స్కాలర్ షిప్ ఇచ్చింది. రెసొనెన్స్ జూనియర్ కాలేజీల(ఐఐటీ-జేఈఈ, నీట్) సహకారంతో ఈ ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ సందర్భంగా రెసొనెన్స్ విజయగాథను తెలియజేసే కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. స్కాలర్ షిప్ పొందిన విద్యార్థుల వివరాలు: ఎన్. సాయిప్రియ - పదో తరగతి (10 జీపీఏ) - జడ్పీ స్కూల్ తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా (D/O అశోక్ - రిపోర్టర్, ఆంధ్రజ్యోతి) ఇస్క పునీత్ అభిషేక్, ఇంటర్ (94.5%), హైదరాబాద్ (S/O రాజేశ్ బాబు - సూర్య డెయిలీ) ఎం. త్రిశూల్, 9వ తరగతి (10 జీపీఏ), ప్రేరణ కాన్సెప్ట్ స్కూల్, నల్లగొండ (S/O శ్రీనివాస్ - హన్స్ ఇండియా) ఎం. వేద సహస్ర, ప్రస్తుతం 9వ తరగతి, భాష్యం వనస్తలిపురం, గ్రేడ్ ఏ-1 (D/O శ్రీనివాస్ - వీ6 కెమెరామెన్) ఎం. హాసిని, 6వ తరగతి, శ్రీ చైతన్య టెక్నో, మెహదీపట్నం, ఏ+ (D/O పూర్ణచందర్ - ఆర్ఎండి విభాగం, టైమ్స్ ఆఫ్ ఇండియా) షేక్ రమీజా, బీఎస్సీ (అగ్రికల్చర్) 3వ సంవత్సరం, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఏ+ (D/O షేక్ మస్తాన్ - ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి ఎడిషన్) పి. జైవంత్, 9వ తరగతి, భద్రాచలం పబ్లిక్ స్కూల్, ఏ1 (S/0 పీవీ సత్యనారాయణ - హన్స్ ఇండియా, ఖమ్మం) ఎ. స్రవంతి, ఎంబీబీఎస్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నల్లగొండ (D/O శ్రీనివాస్ - జీ24 ఎక్స్ కెమెరామెన్) హజి హాసిని, పదో తరగతి, టీఎస్ఎస్ డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్, ఎకర్ల (D/O గోపీకుమార్, ఎక్స్ ప్రజా శక్తి, కామారెడ్డి) పి. శరణ్య, 5వ తరగతి, సెయింట్ ఆన్స్ తార్నాక, ఏ+ (D/O ప్రవీణ్, వాయిస్ ఆఫ్ వర్డ్స్) చదవండి: ప్రకృతిని, ఆవులను నమ్ముకున్నారు.. 40 సెంట్లు.. రూ.3 లక్షలు! హెచ్.ఎం.ఎ-2023 కార్యక్రమానికి డాక్టర్ రంజిత్ రెడ్డి (ఎంపీ), ఈవీ నర్సింహారెడ్డి - ఐఏఎస్ (వీసీ & ఎండీ టీఎస్ ఐఐసీ), నరేంద్ర రామ్ నంబుల (సీఎండీ - లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి. చక్రధర్ రావు (ప్రెసిడెంట్ -ఐపిఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం. రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్ - భారతి సిమెంట్స్), వి. రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ - క్రెడాయ్), ఎం. రాజ్ గోపాల్ (ఎండీ - హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (సీఈవో - హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు హాజరయ్యారు. -
Omaha City: ఇంటి పంటలకు నెలవు
ఒమాహా నగరఒమాహా.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన నెబ్రాస్కాలోని ముఖ్య నగరం. ఇక్కడ సేంద్రియ ఇంటి పంటల ఉద్యమం తామర తంపరగా విస్తరించింది. నగరంలో ఎటు చూసినా చిన్న చిన్న కమ్యూనిటీ కిచెన్ గార్డెన్స్ ఉంటాయి. అక్కడక్కడా విస్తారమైన అర్బన్ గార్డెన్లు కనిపిస్తాయి. సుమారు 5 లక్షల జనాభా గల ఒమాహాలో ఆఫ్రికన్ అమెరికన్లు(12%), ఆసియన్లు(5%) సహా వివిధ జాతులవారుంటారు. వారంతా తమవైన సంప్రదాయ సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా కమ్యూనిటీలను పోషించుకునే పనిలో వున్నారు అంటే అతిశయోక్తి లేదు. నగరంలోని ఖాళీ స్థలాల్లో పంటలు పండించేందుకు 2014లో ఒమాహా ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనుమతించిన తర్వాత కమ్యూనిటీ గార్డెన్ల సంఖ్య 58కి పెరిగింది. ఖాళీ స్థలాలను ఆకర్షణీయమైన హరిత ప్రదేశాలుగా మార్చారు. ఆహార లభ్యత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం కూరగాయలు, ఆకుకూరలను పెంచుతున్నారు. కమ్యూనిటీ గార్డెన్లు కిరాణా దుకాణాలకు ఎప్పుడూ చూసి ఎరుగని దేశీయ ఆహారోత్పత్తులను అందిస్తూండటం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలనాటి విక్టరీ గార్డెన్స్ మాదిరిగా.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒమాహాలో ‘విక్టరీ గార్డెన్స్’ ఉండేవని మేరీ కార్పెంటర్ తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘కూరగాయలు, పండ్లు పెంచుకునే పెరటి తోట ప్రతి ఒక్కరికీ ఉండేది. ఆస్పరాగస్, బంగాళదుంపలు, టొమాటోలు, బ్లాక్ రాస్ బేర్రీస్, ద్రాక్ష వంటివన్నీ యుద్ధ కాలంలో పండించుకొని తినే వాళ్ళం. తరువాతి కాలంలో కిరాణా దుకాణాల్లో సంవత్సరం పొడవునా అన్నీ అమ్మటంతో ఆ తోటలు చాలా వరకు అదృశ్యమయ్యాయి. 80 ఏళ్ల తర్వాత మళ్లీ పెరటి తోటలు కొత్తగా వెలుస్తున్నాయి.. మంచిదే’ అన్నారు మేరీ హ్యాపీగా. తమదైన తాజా ఆహారంపై ఆసక్తి ఒమాహా ‘ఆధునిక అర్బన్ అగ్రికల్చర్ గురు’గా చెప్పదగిన వ్యక్తి జాన్ పోర్టర్. నెబ్రాస్కా ఎక్స్టెన్షన్ ఆఫీస్లో విద్యాధికారి. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని స్థానికంగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి, ఆ ఉద్యమం వెనుక ఉన్న కథపై ఆసక్తిని కల్పించినందున నగరంలో తోటలు విస్తరిస్తున్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి దాన్ని మరింత పెంచింది. అన్నింటికంటే, తమదైన తాజా ఆహారం తినాలన్న ఆకాంక్ష ఇందుకు మూలం అన్నారు జాన్. సిటీ స్ప్రౌట్స్లో తొలి అడుగులు.. సిటీ స్ప్రౌట్స్ ఒమాహాలో సేంద్రియ ఇంటి పంటల సాగును అలవాటు చేసిన స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యమైనది. ఇప్పుడు ఈ సంస్థ 45 చిన్నపాటి గార్డెన్ ప్లాట్లను నిర్వహిస్తోంది. ఉత్తర ఒమాహాలోని డెకాటూర్ అర్బన్ ఫార్మ్లో పండ్ల చెట్లు, బెర్రీ పొదలను భారీ సంఖ్యలో పెంచుతోంది. కమ్యూనిటీ గార్డెన్స్, అర్బన్ ఫామ్ల మధ్య వ్యత్యాసం గురించి చెబుతూ సిటీ స్ప్రౌట్స్ మేనేజర్ షానన్ కైలర్ .. ‘నిర్దిష్ట కమ్యూనిటీ కోసం తరచుగా ఎత్తైన మడుల్లో కూరగాయలను పండించేది కమ్యూనిటీ గార్డెన్. అర్బన్ వ్యవస్థ క్షేత్రం కూరగాయలు, పండ్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంది. సిటీ స్ప్రౌట్స్ ప్రతిరోజూ వందలాది స్థానిక కుటుంబాలకు తాజా ఆహారాన్ని ఉచితంగా అందిస్తుంది. తాజా ఆహారాన్ని అందించటానికి అర్బన్ ఫారమ్స్ నిజంగా చక్కని మార్గం’ అంటారు. నాన్సీ విలియమ్స్ ‘నో మోర్ ఎంప్టీ పాట్స్’ను ద్వారా ఆహార స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ‘పాప్–అప్ ఒయాసిస్’ గార్డెన్.. దేశీయ వంగడాలు సాగయ్యే కమ్యూనిటీ గార్డెన్. గత దశాబ్దంలో ఒమాహాలో ఉద్భవించిన డజన్ల కొద్దీ కొత్త కమ్యూనిటీ గార్డెన్లలో ఇదొకటి. హార్టికల్చరిస్ట్ నాన్సీ స్కాట్ తదితరులు అందులో పంటలు పండిస్తున్నారు. గస్ వాన్ రోన్న్ ‘ఒమాహా పెర్మాకల్చర్’ను స్థాపించి ఒమాహాలోని ఆడమ్స్ పార్క్ పరిసరాల్లోని ఖాళీ స్థలాలను ఆర్గానిక్ గార్డెన్స్గా మార్చారు. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
ముళ్లు లేని బ్రహ్మజెముడు.. పశుగ్రాసంతో పాటు ఆహార పంటగా! పాలలో వెన్నశాతం పెరిగి
Spineless Cactus: ముళ్లులేని బ్రహ్మజెముడు కరువు పాంతాల్లో వేసవి పశుగ్రాస పంటగా ఉపయోగపడుతోంది. అతి తక్కువ నీటితోనే బ్రహ్మజెముడు మొక్క బతుకుతుంది. ఇతర ఏ ఇతర పశుగ్రాస పంటల కన్నా తక్కువ నీటితోనే బతకగలదు. మెక్సికో, జోర్దాన్ వంటి దేశాల్లో కరువు/ఎడారి ప్రాంతాల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల్లో అంతర్భాగంగా మారిన ఈ పంట ఇప్పుడు మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు పుణే కేంద్రంగా పనిచేస్తున్న బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇందుకోసం విశేష కృషి చేస్తుండటం విశేషం. ఒక్కసారి నాటుకుంటే దశాబ్దాల తరబడి నిరంతరం పశుగ్రాసం అందుబాటులో ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్లలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన తర్వాత అనంతపురం జిల్లాలో రైతులకు ఈ పంటను ‘సెర్ప్’ సహాయంతో నాలుగేళ్ల క్రితం పరిచయం చేశారు. బ్రహ్మజెముడు పశుగ్రాస పంట మాత్రమే కాదు, ఆహార పంట కూడా. దీని ఆకులను కూరగా వండుకొని కూడా తింటారు. ముళ్లు లేని బ్రహ్మజెముడు సాగు ఇలా.. నాటే కాలం: వర్షాకాలం తర్వాత అక్టోబర్ నుంచి మార్చి వరకు. స్థల ఎంపిక: నీరు నిలవని తేలికపాటి నేలలు అనుకూలం. ఏ ఇతర పంటలు పండని నిస్సారమైన సాగు భూములు, బంజరు భూములు, రాళ్ల భూములు, ఇసుక భూముల్లోనూ ముళ్లులేని బ్రహ్మజెముడు పెరుగుతుంది. 2 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తులో మడుల (బెడ్స్)ను సిద్ధం చేసి ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులు నాటాలి. ఆకులను నాటడానికి సిద్ధం చేయటం: కనీసం ఒక సంవత్సరం వయసున్న ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్కల ఆకులనే కోసి, నాటుకోవచ్చు. నాటడానికి ముందు వాటిని నీడలో 15 రోజులు ఉంచాలి. కోసిన వెంటనే నాటకూడదు. వడపడి తేమ తగ్గిన తర్వాత నాటాలి. శుద్ధి చేసి నాటాలి: శిలీంద్ర తెగుళ్లు నివారించడానికి జాగ్రత్తవహించాలి. నాటడానికి ముందు ట్రైకోడెర్మా విరిడి ద్రావణంలోద్రావణంలో ఆకులను ముంచిన తర్వాత నాటాలి. నాటే దూరం: సాళ్ల మధ్య 3 మీటర్లు, మొక్కల మధ్య 2 మీటర్ల (667 మొక్కలు/ఎకరం) దూరంలో నాటాలి. ఆకును చెట్టు నుంచి కోసిన భాగం మట్టిలోకి వెళ్లేలా నాటాలి. ఎత్తుమడిపై ఈ ఆకుపై ఎండపడే విధంగా తూర్పు వైపు తిప్పి నిటారుగా ఉండేలా నాటండి. ఎరువు: నాటేటప్పుడు ఎకరానికి 2 టన్నుల చొప్పున బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో పాటు 60:30:30 ఎరువులు వేయండి. నాటిన ఏడాది తర్వాత నుంచి ఆకులు కోసుకొని పశువులకు మేపవచ్చు లేదా తిరిగి నాటుకోవచ్చు. ∙నీటి నిర్వహణ: మొక్కలు (ఆకులు) నాటిన 10 రోజుల వరకు మొక్కలకు నీరు పెట్టవద్దు. తర్వాత 15 రోజుల వ్యవధిలో మొక్కకు 1–2 లీటర్ల నీరు పోయాలి. మొదటి ఏడాది కలుపు తీసెయ్యాలి. ఆకుల దిగుబడి: నాటిన తర్వాత ఏడాది తర్వాత నుంచి ఆకులు కోసుకోవచ్చు. కింది వైపు ఉండే రెండు, మూడు ఆకులు అలాగే ఉంచి ఆ పైన పెరిగిన ఆకులను చాకుతో కోయాలి. మేపటం: ముళ్లు లేని బ్రహ్మజెముడు ఆకులను చిన్న ముక్కలుగా కోసి మేకలు/గొర్రెలు/పశువులకు ఇతర పచ్చి మేతకు బదులుగా 30% మేరకు తినిపించవచ్చు. చౌడు, నల్ల భూములు పనికిరావు! పశుగ్రాసం కొరతను అధిగమించడానికి పశువులు, గొర్రెలు, మేకలు పెంచుకునే కరువు ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులతో ముళ్లులేని బ్రహ్మజెముడు సాగు చేయిస్తున్నాం. నీటి ఎద్దడి ఉండే ప్రాంత భూముల్లో ఈ మొక్కలు నిశ్చింతగా పెరుగుతాయి. నీరు నిల్వ ఉండే నల్ల నేలలు, చౌడు భూముల్లో ఈ మొక్కలు పెరగవు. 2018 నుంచి అనంతపురం జిల్లాలో 82 మంది రైతులకు ముళ్లులేని బ్రహ్మజెముడు నాటిస్తున్నాం. వీటి ఆకులు నాటితే చాలు. పుణే లోని బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి 4 రకాల ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను తెప్పించి ‘సెర్ప్’ ఆధ్వర్యంలో రైతులకు పంచాం. ముళ్లులేని బ్రహ్మజెముడును మార్చి వరకు నాటుకోవచ్చు. నాటుకోవడానికి ఆకులు కావాలనుకునే రైతులు సంప్రదించవచ్చు. టిష్యూకల్చర్ పద్ధతిలో నర్సరీ పెంచుకునే ఆసక్తి ఉన్న వాళ్లకు శిక్షణ ఇస్తాం. – సురేష్ (99892 04816), బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధి, అనంతపురం ఎండాకాలంలో ఏపుగా పెరుగుతుంది ముళ్లులేని బ్రహ్మజెముడును మూడేళ్ల క్రితం వేసవిలో నాటాను. ఒక ఎకరంలో ఎత్తుమడులు నాటాను. 5 ఎకరాల జామ తోట చుట్టూతా అడుగు ఎత్తున సరిహద్దు గట్టు వేసి దానిపైన కూడా నాటాము. ఒక సంవత్సరం పాటు 15 రోజులకు ఒకసారి నీరు పోశాం. తర్వాత నుంచి నీరు పోయటం లేదు. మూడేళ్లకు ఇప్పుడు 6 నుంచి 8 అడుగుల ఎత్తు పెరిగాయి. ఈ మొక్కలు వర్షాకాలంలో పెద్దగా పెరగవు. ఎండాకాలంలో ఏపుగా పెరుగుతాయి. నీరు నిల్వ ఉండకూడదు. ఎంత ఎత్తు మీద అంత మంచిది. ఒక సంవత్సరం పెరిగిన తర్వాత నుంచి బ్రహ్మజెముడు ఆకులు కోసి, ముక్కలు చేసి.. ఆవులు, గేదెలతో పాటు 100 పొట్టేళ్లకు కూడా ఇతర పశుగ్రాసం లేనప్పుడు మేతగా వేసేవాళ్లం. ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులు మంచి పశుగ్రాసం. పశువులు ఏవైనా ఇష్టంగా తింటాయి. ఆవుల పాలలో వెన్న 1–2% వరకు పెరిగింది. రైతులు కొందరు ఇంతకు ముందే ఈ ఆకులను తీసుకెళి నాటుకున్నారు. ఆకును రూ. 20కి ఇస్తున్నాను. – అలవల వెంకటేశ్వర రెడ్డి , ఫోన్: 90006 16717, ముళ్లులేని బ్రహ్మజెముడు రైతు, గుత్తి, అనంతపురం జిల్లా – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: Sagubadi: తినడానికి పనికొచ్చేదని అప్పట్లో తెలీదు.. సముద్రపు పాలకూర.. ప్రొటీన్లు పుష్కలం... Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. -
నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్టాప్ పొలం!
పారిస్.. ఫ్రాన్స్ రాజధాని. అత్యంత జనసాంద్రత కలిగిన యూరోపియన్ రాజధానులలో ఒకటి. కాంక్రీటు అరణ్యంగా మారిపోవటంతో పచ్చని ప్రదేశాల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. అన్నే హిడాల్గో అనే మహిళ 2014లో మేయర్గా ఎన్నికైన తర్వాత పారిస్ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణ పచ్చదనంతో అన్నే సంతృప్తి చెందలేదు. విస్తారమైన వాణిజ్య సముదాయాల పైకప్పులను పచ్చని సేంద్రియ పంట పొలాలుగా మార్చాలని ఆమె సంకల్పించారు. అర్బన్ కిచెన్ గార్డెన్స్ నిర్మించే సంస్థలను ప్రోత్సహించడానికి నిర్మాణాత్మక కార్యాచరణ చేపట్టి సఫలీకృతులవుతున్నారు. పారిస్లో అర్బన్ అగ్రికల్చర్ విస్తీర్ణాన్ని 100 హెక్టార్లకు విస్తరించాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నారు మేయర్ అన్నే హిడాల్గో. పారిస్కల్చర్ రూఫ్టాప్లపైన, పాత రైల్వే ట్రాక్ పొడవునా, భూగర్భ కార్ల పార్కింగ్ ప్రదేశాల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లో సేంద్రియ పంటలు, పుట్టగొడుగుల సాగును ప్రోత్సహిస్తు న్నారు. ‘ద పారిస్కల్చర్స్’ పేరిట అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్లకు ప్రోత్సాహం ఇచ్చే పథకానికి మేయర్ శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అత్యాధునిక మిద్దె (రూఫ్టాప్) పొలాలు నగరం అంతటా వెలుస్తున్నాయి. వాటిల్లో ‘నేచర్ అర్బైన్’ అతి పెద్దది. దక్షిణ పారిస్లో అద్భుతమైన కొత్త ఎగ్జిబిషన్ హాల్ భవనం పైన 14,000 చదరపు మీటర్ల (3.45 ఎకరాల) విస్తీర్ణంలో ఈ రూఫ్టాప్ ఫామ్ ఏర్పాటైంది. రోజుకు వెయ్యి కిలోల సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్ గ్రీన్స్, స్ట్రాబెర్రీ తదితర పండ్లను ఉత్పత్తి చేస్తున్న ‘నేచర్ అర్బైన్’లో 20 మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్టాప్ క్షేత్రంగా ఇది పేరుగాంచింది. పారిస్ వాసులకు లెట్యూస్, టొమాటోలు, స్ట్రాబెర్రీలు, దుంపలు, తులసి, పుదీనా, ఇతర తాజా 35 రకాల సేంద్రియ పండ్లు, కూరగాయ లతో పాటు ఔషధ, సుగంధ మొక్కలను ‘నేచర్ అర్బైన్’ అందిస్తోంది. కరోనా మహమ్మారి మొదటి దఫా లాక్డౌన్ ముగిసిన తర్వాత .. నగరాల్లోనే సాధ్యమైనంత వరకు సేంద్రియ ఆహారోత్పత్తుల ఆవశ్యకతను చాటిచెబుతూ ‘నేచర్ అర్బైన్’ ప్రారంభమైంది. ఆక్వాపోనిక్స్.. హైడ్రోపోనిక్స్.. రూఫ్టాప్ పొలంలో రసాయన ఎరువులు, పురుగుమందులు, శిలీంద్రనాశినులు వాడరు. ఆక్వాపోనిక్స్, హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. మట్టిని వాడరు. పోషకాలు, ఖనిజాలు, జీవన ఎరువులతో కూడిన పోషక ద్రావణం కలిపిన నీటిని మొక్కల వేర్లకు అందిస్తూ పంటలను 10% నీటితోనే సాగు చేస్తున్నారు. నిలువు ప్లాస్టిక్ స్తంభాలలో లెట్యూస్, తులసి, పుదీనా మొక్కలు ఏరోపోనిక్స్ పద్ధతిలో ఏపుగా పెరుగుతుంటాయి. (క్లిక్ చేయండి: పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!) వీటికి ఎదురుగా, సన్నగా, అడ్డంగా ఉండే ట్రేలలో కొబ్బరి పొట్టులో నోరూరించే దేశవాళీ చెర్రీ టొమాటోలు, నాటు వంకాయలు, టొమాటోలు, కీర దోస తదితర కూరగాయలను పెంచుతున్నారు. పారిస్ వాసులు స్వయంగా తామే ఈ రూఫ్టాప్ పొలంలో పంటలు పండించుకోవడానికి ఎత్తు మడులతో కూడిన ప్లాట్లను ఏడాదికోసారి అద్దెకిస్తారు. 140 కూరగాయల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. నగరవాసులకు సాగు నేర్పడానికి పారిస్ నగరపాలక సంస్థ ఒక ప్రత్యేకమైన స్కూల్ను కూడా ప్రారంభించింది. పారిస్ నగరపాలకుల ప్రయత్నాల వల్ల స్థానికుల ఆహారపు అవసరాలు తీరేది కొద్ది మేరకే అయినప్పటికీ, తద్వారా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఒనగూరే బహుళ ప్రయోజనాలు మాత్రం అమూల్యమైనవి! – పంతంగి రాంబాబు -
పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!
మురికివాడల్లో నిరుపేదల సంక్షేమం కోసం ఆహార ధాన్యాలు, పప్పులు ఉప్పులను ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం మనకు తెలుసు. వాటితో పాటు సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలను అందుబాటులోకి తెస్తోంది రియో డి జనీరో (బ్రెజిల్) నగరపాలక సంస్థ! రియో ఎంతో అందమైన నగరం. అంతే కాదు.. విశాలమైన మనసున్న మహానగరం కూడా! సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను మడుల్లో పెంచటాన్ని నేర్పించటం ద్వారా సేంద్రియ ఆహారాన్ని వెనుకబడిన ప్రజల్లోనూ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే బృహత్తర లక్ష్యాన్ని పెట్టుకున్నారు రియో నగర మేయర్ ఎడ్వర్డో పేస్. తొలినాళ్లలో ప్రభుత్వ నిధులతో గార్డెన్లను నిర్వహించటం, తదనంతరం స్థానికులే స్వయంగా నిర్వహించుకుని కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది రియో నగర పర్యావరణ శాఖలోని ప్రత్యేక ఉద్యాన విభాగం. పేదల ఇళ్ళకు దగ్గర్లోనే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో వేలకొలది ఎత్తు మడులు నిర్మించి, అక్కడి వారితోనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయించి, ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. 2006లో ప్రారంభమైన ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ‘హోర్టాస్ కారియోకాస్’ (‘రియోవాసుల కూరగాయల తోట’ అని దీని అర్థం) సంఖ్య గత 16 ఏళ్లలో 56కి పెరిగింది. వీటిలో 29 మురికివాడల్లో, 27 నగరంలోని పాఠశాలల్లో ఉన్నాయి. దాదాపు 50,000 కుటుంబాలు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్లో నిమగ్నమై ఉన్నాయి. గత సంవత్సరానికి మొత్తం 80 టన్నుల ఆకుకూరలు, కూరగాయలను వీటిలో పండించి, పంపిణీ చేశారు. ఇది కొందరికి తాజా ఆహారం దొరికింది. మరికొందరికి ఈ గార్డెన్స్లో పని దొరకటంతో ఆదాయం సమకూరింది. కరోనా కష్టకాలంలో ఈ గార్డెన్లు తమని ఎంతో ఆదుకున్నాయని ప్రజలు సంతోషపడుతున్నారు. ఆహారం ఎంతో అవసరమైన జనం నివాసమున్న చోటనే కమ్యూనిటీ అర్బన్ గార్డెన్లను మరింతగా విస్తరించాలని రియో నగర పాలకులు సంకల్పించారు. రియో నగర ఉత్తర ప్రాంతంలోని మూడు మురికివాడల్లో నిర్మించిన గార్డెన్లను విస్తరింపచేసి ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ను నెలకొల్పాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఆ గార్డెన్ ఏకంగా 15 ఫుట్ బాల్ కోర్టులంత ఉంటుందట. అంటే, దాదాపు 11 హెక్టార్ల విస్తీర్ణం అన్నమాట! 2024 నాటికి ఈ కల సాకారం కాబోతోంది! ప్రతినెల లక్ష కుటుంబాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొందుతాయి. అర్బన్ అగ్రికల్చర్కు ఉన్న శక్తి ఏపాటిదో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటున్నారు జూలియో సీజర్ బారోస్. ‘హోర్టాస్ కారియోకాస్’ పథకం అమలుకు రియో డి జనీరో మునిసిపల్ పర్యావరణ విభాగం తరఫున ఆర్గానిక్ గార్డెనింగ్ డైరెక్టర్ హోదాలో శ్రీకారం చుట్టిన అధికారి ఆయన. ‘మా ప్రాజెక్ట్ లక్ష్యం అందమైన తోటను నిర్మించడం కాదు. నగరంలోనే సేంద్రియ ఆహారాన్ని పండించి ఎంత మందికి అందించగలమో చూడాలన్నదే’ అని బారోస్ చెప్పారు. మురికివాడల్లో నివాసం ఉండే వారినే తోట మాలులుగా, సమన్వయకర్తలుగా నియమిస్తారు. వారికి స్టైఫండ్ ఇస్తారు. పండించిన కూరగాయల్లో 50% మురికివాడల్లోని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. మిగిలిన 50% తోటమాలులకు ఇస్తారు. వాళ్ళు ఇంట్లో వండుకొని తినొచ్చు లేదా అక్కడి వారికే సరసమైన ధరలకు అమ్ముకోనూ వచ్చు. ప్రతి తోటకు కొంత కాలమే ప్రభుత్వ సాయం అందుతుంది. చివరికి స్వతంత్రంగా మారాల్సి ఉంటుంది అని బారోస్ చెప్పారు. ఆర్థిక లాభాలతో పాటు, ఒకప్పుడు పరిసరాల్లో సాధారణంగా ఉండే మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి ప్రజలు దూరంగా ఉండటంలో ఈ ప్రాజెక్ట్ మరింత పెద్ద సామాజిక ప్రయోజనాన్ని అందిస్తుందని బారోస్ అంటారు. – పంతంగి రాంబాబు -
‘ప్రకృతి’ పరిశోధనలకు పెద్ద పీట
ఆహారంతో పాటు మనం తింటున్న రసాయనాలే క్యాన్సర్ తదితర మహమ్మారి జబ్బుల్ని కలిగిస్తున్నాయని మీకు తెలుసా? కలుపు మందు తయారీ కంపెనీపై అమెరికన్ ప్రజలు 9 వేలకు పైగా నష్టపరిహారం కేసులు వేశారని మీకు తెలుసా? రసాయనిక అవశేషాల్లేని, రోగ కారకం కాని స్వచ్ఛమైన ఆహారం.. అంటే ‘అమృతాహారం’ తీసుకునే వారు బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉంటారని తెలుసా? అటువంటి అమృతాహారం రానున్న కొద్దేళ్లలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవాలన్న మహాయజ్ఞం ప్రారంభమైంది. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విప్లవాన్ని ప్రతి గ్రామానికీ, ప్రతి రైతుకూ, ప్రతి పొలానికీ విస్తరింపజేయడానికి దార్శనికతతో రాచబాటలు వేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుల భాగస్వామ్యంతో వచ్చే 7–8 ఏళ్లలో రాష్ట్రం మొత్తాన్నీ దశలవారీగా ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లించడానికి నిర్మాణాత్మకమైన ప్రణాళికతో కదులుతున్నారు. బృహత్తరమైన ఈ కలను సాకారం చేసుకోవడానికి ఈ నెల 7న తొలి అడుగు వేశారు. ప్రకృతి వ్యవసాయ పరిశోధన, అధ్యయన అకాడమీని జర్మనీ ప్రభుత్వ ఆర్థిక, సాంకేతిక తోడ్పాటుతో పులివెందులలో ప్రారంభించారు. పశుసంపదపై పరిశోధనకు గతంలో అత్యున్నత వసతులతో ఏర్పాటు చేసిన ‘ఐజి కార్ల్’ ఆవరణలో (‘ఇండో–జర్మన్ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ – ఐజిఎఎఆర్ఎల్–‘ఐజి ఆర్ల్’గా మార్చారు.) ఇది ఏర్పాటైంది. ప్రపంచ ప్రకృతి వ్యవసాయ పరిశోధన చరిత్రలోనే అదొక సుదినం. ఆంధ్రప్రదేశ్లో సుమారు 6,30,000 మంది రైతులు ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంలో ముందంజలో ఉన్నారు. ఈ కృషికి మెచ్చిన జర్మనీ ప్రభుత్వం ఐజి ఆర్ల్ నెలకొల్పటానికి రూ.174 కోట్ల గ్రాంటు ప్రకటించటం విశేషం. పరిశోధనలకు, రైతు శాస్త్రవేత్తల శిక్షణతో పాటు దేశ విదేశీ శాస్త్రవేత్తలకు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు ఇది వేదికగా నిలుస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, 365 రోజుల పంటల సాగు వంటి పలు రైతు ఆవిష్కరణల వెనుక శాస్త్రీయత, ఎదుర్కొంటున్న సవాళ్లపై పరిశోధనా పత్రాలను వెలువరిస్తుంది. రాష్ట్రంలోని ఇతర 25 జిల్లాల్లోని 7 జిల్లాల్లో ఐజి ఆర్ల్కు అనుబంధ పరిశోధన, అధ్యయన కేంద్రాలను నెలకొల్పుతారు. మిగతా జిల్లాల్లోనూ ప్రత్యేక పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. విభిన్న వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, వైవిధ్య పంటలు, తోటల సరళికి అనుగుణంగా మెట్ట, మాగాణి భూముల్లో ప్రకృతి సేద్య నమూనాలపై పరిశోధనలు చేస్తారు. ఆర్బీకే స్థాయిలోనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతులను ఎంపిక చేసి, ఐజి కార్ల్లో వారికి మూడేళ్ల పాటు ఆచరణాత్మక శిక్షణ ఇచ్చి, వారి జ్ఞానాన్ని మరింత పరిపుష్టం చేస్తారు. అధికారిక గుర్తింపుగా సర్టిఫికెట్లు ఇస్తారు. రాష్ట్రంలో 10,800 రైతు భరోసా కేంద్రాలు రైతులకు గ్రామస్థాయిలో చేదోడుగా ఉంటున్నాయి. ప్రతి ఆర్బీకేలో ప్రకృతి వ్యవసాయంలో నిష్ణాతులైన సర్టిఫైడ్ రైతు శాస్త్రవేత్తను నియమించడం ద్వారా స్థానికంగా రైతులను ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రకృతి వ్యవసాయోత్పత్తులకు ఆర్బీకే ద్వారానే ఆర్గానిక్ సర్టిఫికేషన్ను సమకూర్చుతారు. వీటిని సముచిత ధరకు విక్రయించుకునేందుకు సైతం ఆర్బీకే వేదికగా నిలుస్తుంది. ఆ విధంగా మిగతా రైతులు సైతం రసాయనాలను పూర్తిగా వదిలేసి, తనకున్న మొత్తం పొలాన్ని దశలవారీగా మూడేళ్లలో ప్రకృతి సేద్యంలోకి మళ్లించడం వీలవుతుంది. మన రైతు శాస్త్రవేత్తల అనుభవాలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చక్కని ఆచరణాత్మక అపూర్వ పాఠాలుగా నిలుస్తాయనటంలో సందేహం లేదు. ఇందుకోసం లక్ష మంది సర్టిఫైడ్ ప్రకృతి రైతు శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చే విధంగా, వచ్చే ఐదేళ్లలో కనీసం 200 అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను ప్రచురించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్మాణమైన భవనాలు సిద్ధంగా ఉండటంతో ‘ఐజీ ఆర్ల్’ ఈ ఖరీఫ్ నుంచే పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏపీ ప్రభుత్వ ప్రకృతి సేద్య విస్తరణ రోడ్మ్యాప్లో మరో ముఖ్య అంకం ఏమిటంటే... ఈ ఆవరణలోనే వచ్చే ఏడాది కల్లా అంతర్జాతీయ స్థాయి ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించటం. దేశంలోనే ఇది మొట్టమొదటి ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం అవుతుంది. ప్రకృతి వ్యవసాయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు పీహెచ్డీ కోర్సులను ఈ విశ్వవిద్యాలయం ఆఫర్ చేయనుంది. సీఎం జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో వ్యవస్థీకృతం అవుతున్న ఐజి ఆర్ల్, ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) ఉపాధ్యక్షులు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ఛాన్సలర్ అయిన టి.విజయకుమార్ పర్యవేక్షణలో వేరూనుకోనుంది. వ్యవసాయ విద్య, పరిశోధనలను ప్రకృతి బాట పట్టించి కొత్త పుంతలు తొక్కించాలన్న ఏపీ ప్రభుత్వ సంకల్పాన్ని భారత ప్రభుత్వం సైతం గుర్తించి ప్రోత్సహిస్తుండటం కలిసి వచ్చింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన, పశు పరిశోధన, విస్తరణ సంస్థలు సైతం ప్రకృతి సేద్యంపై దృష్టి సారించటం శుభసూచకం. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
జీవ భద్రతకు ‘జన్యు సవరణ’ కూడదు!
‘జన్యు మార్పిడి’ చేసిన (జెనిటికల్లీ మాడిఫైడ్–జీఎం) వంగ డాల ఉత్పత్తి, జన్యు మార్పిడి ఆహారోత్పత్తులకు సంబంధించి మన దేశంలో కఠినమైన జీవ భద్రతా నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ సాంకేతికత ప్రజల ఆరోగ్యాన్నీ, రైతుల జీవనో పాధినీ, పర్యావరణాన్నీ వెనక్కి తీసుకోలేని రీతిలో ప్రభావితం చేయగలిగినదై ఉండటం వల్లనే మనం పటిష్ఠమైన జీవ భద్రతా చట్టం రూపొందించుకున్నాం. మన దేశంలో ఇప్పటికి ప్రభుత్వ అనుమతి పొందిన ఏకైక జీఎం పంట బీటీ పత్తి మాత్రమే. జీవ భద్రతాపరమైన సమస్యల కారణంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో బీటీ వంగ, బీటీ ఆవాలు తదితర జన్యు మార్పిడి వంగడాలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇన్నాళ్లూ అన్ని రకాల ‘జన్యు మార్పిడి’ పంటలకు వర్తించే కఠిన జీవ భద్రతా నిబం ధనల పరిధి నుంచి కొన్ని రకాల ‘జన్యుపరంగా సవరించిన’ (జీనోమ్ ఎడిటెడ్) పంటలను పూర్తిగా మినహా యిస్తూ భారత ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వు జారీచేయటం పట్ల నిపుణులు, పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం–1989 నిబం ధనల ప్రకారం... జన్యు మార్పిడి సాంకేతికతలకు సంబంధించిన అంశాలన్నీ కేంద్ర పర్యావరణ శాఖకు అనుబంధంగా ఉన్న జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రయిజల్ కమిటీ (జీఈఏసీ) పరిధిలోకి వస్తాయి. అయితే, వాణిజ్యపరమైన దృష్టితో మొక్కల్లో ‘జన్యు సవరణ’ చేసే రెండు రకాల ప్రక్రియలను ఈ నిబంధనల పరిధి నుంచి పూర్తిగా మినహాయిస్తూ ఈ ఏడాది మార్చి 30న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ నుంచి ‘ఆఫీస్ మెమో’ జారీ అయ్యింది. ఈ మెమో జన్యు సాంకేతి కతలను మూడుగా వర్గీకరిం చింది. ఒక జాతి మొక్కలోకి వేరే జాతి జన్యువును చొప్పిం చటమే ‘జన్యు మార్పిడి’. పంట మొక్కల్లో ఉన్న కొన్ని జన్యువులను పనిచేయకుండా చేయటం /తొలగించటం లేదా కొన్ని జన్యువుల ప్రొటీన్ వ్యక్తీ కరణ తీరులో మార్పులు చేయ టమే ‘జన్యు సవరణ’. ఈ రెండు జన్యు సవరణ ప్రక్రియ లలో ఇతర జాతుల నుంచి జన్యు మార్పిడి జరగటం లేదు కాబట్టి... జీఈఏసీ పర్యవేక్షించే కఠిన జీవ భద్రతా నియమా వళి పరిధి నుంచి జన్యు సవరణ పంటలను పూర్తిగా మినహా యిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంటే, జీనోమ్ ఎడిటెడ్ మొక్కలపై పరిశోధన, అభివృద్ధి, నిర్వహణలో నిమగ్నమైన ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశోధనా సంస్థలు ఇక మీదట జీఈఏసీ నుంచి ఏ అనుమతులూ తీసుకునే పనిలేదు. జన్యు సాంకేతికతలను నియంత్రించే విషయంలో రాజీ ధోరణితో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం ఉప సంహరించుకోవాలని ఆహార, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వాళ్లు డిమాండ్ చేశారు. ఆహార జీవ భద్రతనూ, పర్యావర ణాన్నీ, మన ఎంపిక స్వేచ్ఛనూ పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జీఎం ఫ్రీ ఇండియా కోకన్వీనర్లు కపిల్ షా, శ్రీధర్ రాధాకృష్ణన్ డిమాండ్ చేశారు. ‘భారత రాజ్యాంగం అప్పగించిన నియంత్రణ బాధ్యతను ప్రభుత్వం విస్మరించటం తగదు; జన్యు మార్పిడి మాదిరిగానే జన్యు సవరణలను కూడా అత్యంత జాగరూకత, ముందస్తు జాగ్రత్తలతో పూర్తిగా నియంత్రించవలసిన అవ సరం ఉందని ప్రభుత్వం గుర్తించా’లన్నారు. ‘జన్యు మార్పిడి, జన్యు సవరణ ప్రక్రియలను విభజించి చూడటం అశాస్త్రీయం మాత్రమే కాదు, అత్యంత ప్రమాద భరితం కూడా! జీఈఏసీ పరిధి నుంచి జన్యు సవరణ ప్రక్రియలను మినహాయించటం తగ’దని అలయన్స్ ఫర్ సస్టయినబుల్ అగ్రికల్చర్ కన్వీనర్ కవితా కురుగంటి వ్యాఖ్యా నించారు. జన్యు సవరణ ప్రక్రియ చేపట్టే క్రమంలో ఇతర జాతుల డీఎన్ఏ మార్పిడి చోటు చేసుకోదని చెప్పలేమని స్వతంత్ర విధాన విశ్లేషకుడు డా. దొంతి నరసింహారెడ్డి కేంద్రా నికి రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. ఆరేళ్ల క్రితం దక్షిణ కొరియాలో ఓ శాస్త్రవేత్త రంగు పుట్టగొడుగులకు జన్యు సవరణ చేసినప్పుడు స్వల్ప మాత్రంగా అన్య డీఎన్ఏ మార్పిడి కూడా అసంకల్పంగా జరిగినట్లు తర్వాత తేలిందన్నారు. అందువల్ల, ప్రభుత్వం జన్యు సవరణ ప్రక్రియలను కూడా పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థ పరిధిలోనే ఉంచాలని కోరారు. జన్యు మార్పిడితో పాటు జన్యు సవరణ ప్రక్రియలను సైతం జీవ భద్రతా నియంత్రణ వ్యవస్థల పరిధిలోనే ఉంచటం ద్వారా జన్యు కాలుష్యానికి ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరించ జాలదు. ఈ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటే వెనక్కి తీసుకోలేని దుష్పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని అందరూ గ్రహించాలి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం) -
ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!
యుద్ధం, కోవిడ్... విధ్వంసంతో పాటు సరికొత్త అవకాశాలనూ వెంట తెచ్చాయి. కోవిడ్ మహమ్మారి రోగ నిరోధక శక్తినిచ్చే ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తుల ఆవశ్యకతను జనబాహుళ్యం గుర్తెరిగేలా చేసింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం సృష్టిస్తున్న సంక్షోభం వల్ల భరించలేనంతగా పెరుగుతున్న రసాయనిక ఎరువుల ధరలు సేంద్రియ ప్రత్యామ్నాయాలకున్న ప్రాధాన్యాన్ని పెంచాయి. ప్రకృతి వ్యవసాయ వ్యాప్తిపై మరింతగా దృష్టిని కేంద్రీకరించేలా పాలకులనూ, రైతులనూ పురికొల్పుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందులను పూర్తిగా పక్కన పెడితే పంట దిగుబడులు కుదేలై ఆహార భద్రతకు ముప్పు వస్తుందనే భయాందోళనలకు ఇప్పుడు తావు లేదు. ఆంధ్రప్రదేశ్లో అనేక ఏళ్లుగా అమల్లో ఉన్న ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయ అనుభవాలే ఇందుకు ప్రబల నిదర్శనాలు. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు గ్రామస్థాయిలో మద్దతు వ్యవస్థలను నెలకొల్పటం ద్వారా నిర్మాణాత్మక కృషి చేస్తే... ప్రతి రైతునూ ప్రకృతి వ్యవసాయం వైపు దశలవారీగా మళ్లించటం... ఖర్చులు తగ్గించుకుంటూ సంతృప్తికరమైన దిగుబడులు సాధించడం సుసాధ్యమేనని ఆంధ్రప్రదేశ్ అనుభవాలపై థర్డ్ పార్టీ అధ్యయనాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. సుసంపన్నమైన ఈ అనుభవాలు మనకే కాదు ప్రపంచ దేశాలకూ గొప్ప ఆశాకిరణంగా కనిపిస్తున్నాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) వంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలే చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధరలు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రతి ఆర్నెల్లకూ రెట్టింపయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. రసాయనిక ఎరువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నకొద్దీ కేంద్ర ప్రభుత్వం ఎరువులపై ఇస్తున్న రాయితీని కూడా తగ్గిస్తోంది. అంతిమంగా రైతుకు ఎరువులు మోయలేని భారంగా మారి పోతున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఇప్పటికే తడిసి మోపెడైంది. 2020–21లో రూ. 1,27,921 కోట్లుండగా, 2021–22 నాటికి రూ. 1,40,122 కోట్లకు చేరింది. ఈ సంవత్సరం ఇది ఇంకా పెరుగుతుంది. రసాయనిక ఎరువుల ధరలు విపరీతంగా పెరగడమే కాదు, లభ్యత కూడా తగ్గిపోతున్నందున... అవసరానికి మించి రసాయనిక ఎరువుల వాడకాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. దీనితోపాటు, రసాయనికేతర సుస్థిర ప్రత్యామ్నాయాల వైపు వెళ్లటమే శాశ్వత పరిష్కారం. ఆంధ్రప్రదేశ్లో రసాయనిక ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రకృతి వ్యవసాయ విస్తరణ వల్లనే ఇది సాధ్యమవుతోంది. ప్రకృతి సేద్యం విస్తారంగా సాగులో ఉన్న కర్నూలు జిల్లాలో 2020–21తో పోలిస్తే 1,25,427 టన్నుల ఎరువుల వాడకం తగ్గింది. ఏపీలో 2020–21లో 42.26 లక్షల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువుల వినియోగం జరిగింది. 2021–22 నాటికి ఇది 36.22 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గింది. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) రసాయనాల విచ్చలవిడి వాడకం సహా అస్థిర వ్యవసాయ పద్ధతుల వల్ల భూమి ఉత్పాదక శక్తిని కోల్పోతున్నది. ఇప్పటికే 35% సాగు భూమి నిస్సారమై ఎడారిగా మారిపోయింది. 2045 నాటికి 13.5 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ వల్ల సొంత భూములను వదిలి పొట్ట చేతపట్టుకొని వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. (చదవండి: ప్రపంచ ఆహార భద్రతకు ప్రమాదం) వ్యవసాయం... ప్రకృతి వనరులపైన ఆధార పడిన జీవనోపాధి. అది ప్రకృతి వనరులను, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ప్రకృతి వనరులు, పర్యావరణం తిరిగి వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన దేశంలో సగానికి పైగా ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయం మీద ఆధారపడి వున్నారు. కాబట్టి, పర్యావరణంలో వస్తున్న మార్పుల్ని తట్టుకునే దిశగా వ్యవసాయం మారాల్సిన అవసరం వుంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని దశల వారీగా విస్తరింపజేయడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో పెరిగే జనాభాకు సైతం ఆహార భద్రతన్విగలుగుతాం. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్ -
సిరిధాన్యాలతో మెట్ట రైతుకు మేలు.. ఏపీ ప్రభుత్వ చర్యలు సంతోషదాయకం!
రబీలో బోర్ల కింద రైతులు వరికి బదులు చిరుధాన్యాల సాగును చేపట్టేలా తగిన ధర కల్పించడం, మిల్లెట్ బోర్డును సత్వరం ఏర్పాటు చేయడం, ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామాలను మీరెలా చూస్తున్నారు? నాలుగు వర్షాలొస్తే మెట్ట భూముల్లో పండే సిరిధాన్యాల (అవి చిరుధాన్యాలు కావు.. సిరిధాన్యాల)ను ప్రోత్సహిస్తూ జగన్ గారి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం చాలా సంతోషదాయకం. నీటి పారుదల సదుపాయం ఉన్న ప్రాంతాల్లో రైతులపై ప్రభుత్వాలు దృషికేంద్రీకరిస్తూ వస్తున్నాయి. పేదరికంలో మగ్గుతున్న వర్షాధార వ్యవసాయదారుల అభ్యున్నతిపై, నిర్లక్ష్యానికి గురైన సిరిధాన్యాల సాగు, వినియోగంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తున్నదని వినటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ప్రయత్నాల వల్ల అల్పాదాయ మెట్ట ప్రాంత రైతాంగం ఆదాయం పెరుగుతుంది. సిరిధాన్యాలను సాగు చేస్తే మనుషులకు అవసరమైన పౌష్టికాహారం అందటంతోపాటు భూమికి, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఆహారం 95% భూమి ద్వారానే అందుతోంది. భూసారం అడుగంటిన నేపథ్యంలో ‘నేలల ఆరోగ్యమే మన ఆరోగ్యం’ అన్న భావనను మీరు ఎలా చూస్తున్నారు? రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల మూలంగా భూసారం క్షీణించింది. నిస్సారమైన భూముల్లో సైతం సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలను రసాయనాలు వాడకుండా సహజ పద్ధతుల్లో పండించుకోవచ్చు. ఈ పంటలు మనుషుల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించి ఆరోగ్యవంతంగా మార్చడంతోపాటు భూసారాన్నీ పెంపొందిస్తాయి. సిరిధాన్యాల ద్వారా ఒనగూరే ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాల గురించి తెలుగు నాట మీరు సభలు, సమావేశాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కదా.. ప్రజా స్పందన ఎలా ఉంది? ప్రజలు, రైతులు సానుకూలంగా స్పందిస్తున్నారు. సిరిధాన్యాల సాగు విస్తీర్ణంతో పాటు వినియోగం పెరుగుతోంది. నేను చెప్పిన పద్ధతుల్లో కషాయాలను వాడటం, సిరిధాన్యాలను, ఇతర సంప్రదాయ ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటున్న దీర్ఘరోగుల ఆరోగ్యం క్రమంగా స్థిమితపడుతోంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవటం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ మార్పు మరింత వేగవంతం కావాలంటే సంప్రదాయ పంటలను, వికేంద్రీకరణ విధానాలను పాలకులు ప్రోత్సహించాలి. జన్యుమార్పిడి పంటలు, జన్యుమార్పిడి ఆహారోత్పత్తుల దిగుమతులకు గేట్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను ఇటీవలే విడుదల చేసింది. ఎప్పటి నుంచో జన్యుమార్పిడి ఆహారాన్ని వినియోగిస్తున్న అమెరికాలో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేసిన మీరు ఈ పరిణామాలపై ఏమనుకుంటున్నారు? పారిశ్రామిక వ్యవసాయ సాంకేతికతల ద్వారా ఉత్పత్తయ్యే ఆహారోత్పత్తుల ద్వారా మన ఆరోగ్యానికి, ప్రకృతికి కూడా నష్టం కలుగుతుంది. సహజ పద్ధతుల్లో పండించుకోవడంతో పాటు వికేంద్రీకరణ పద్ధతుల్లో ప్రజలే శుద్ధి చేసుకొని స్థానికంగా అందుబాటులోకి తెచ్చుకునే అద్భుతమైన మన దేశీయ సంప్రదాయ ఆహారోత్పత్తుల ద్వారా మాత్రమే ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పడానికి ప్రబల నిదర్శనాలు ఉన్నాయి. షుగర్, బీపీ వంటి జీవనశైలి జబ్బులు పెచ్చుమీరుతున్నప్పటికీ తాము తింటున్న ఆహారానికి– జబ్బులు రావడానికి మధ్య నేరుగా సంబంధం ఉందని ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారా? సిరిధాన్యాలను పండించడం, ఖరీదైన ప్రాసెసింగ్ యంత్రాల అవసరం లేకుండా స్వయంగా మిక్సీల ద్వారా శుద్ధి చేసుకొని వినియోగించడం ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అక్కడక్కడా ప్రారంభించారు. సిరిధాన్యాల సాగును ప్రోత్సహించడంతోపాటు వీటిని ఎలా వండుకొని తినాలో ప్రజలకు రుచి చూపాలి. అన్ని జిల్లాల్లో సిరిధాన్యాల ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలి. వినియోగం పెరిగితే రైతులు పండించే సిరిధాన్యాలకు మార్కెట్లో మంచి ధర కూడా వస్తుంది. ఎద్దు గానుగ నూనెలు, తాటి/ ఈత / జీలుగ బెల్లం ఆవశ్యకతను మీరు నొక్కి చెబుతున్నారు. ప్రజలందరికీ వీటిని అందుబాటులోకి తేవటం సాధ్యమేనా? ఎద్దు గానుగ నూనెల వాడకం పెరగటంతో ఎద్దు గానుగలు చాలా చోట్ల ఏర్పాటవుతున్నాయి. ప్రతి గ్రామంలో నూనె గింజలు సాగు చేసుకొని, అక్కడే నూనెలు ఉత్పత్తి చేసి వాడుకోవాలి. తాటి/ ఈత / జీలుగ చెట్లు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. వీటి నీరాతో గ్రామాల్లోనే ఎక్కడికక్కడ బెల్లం ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే సమీప భవిష్యత్తులోనే ప్రజలందరికీ అందించవచ్చు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోబోతున్నాం కదా. మీ అభిప్రాయం..? అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం జరుపుకునే దిశగా సన్నాహకంగా ఒకటీ అరా సమావేశాలు మాత్రమే తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు -
సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం!
తెలుగు రాష్ట్రాల్లో పంట భూముల గురించి కొన్ని దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్న వ్యవసాయ శాస్త్ర నిపుణులు డాక్టర్ వి. రామమూర్తి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా ఏర్పాటైన ‘జాతీయ మట్టి సర్వే–భూ వినియోగ ప్రణాళిక సంస్థ (ఎన్.బి.ఎస్.ఎస్–ఎల్.యు.పి.)’ బెంగళూరు ప్రాంతీయ కార్యాలయంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఆయన సేవలందిస్తున్నారు. స్థానిక సాగు భూముల తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులను బట్టి ఏయే పంటలను సాగు చేసుకుంటే ఫలితం బాగుంటుందో సూచనలు ఇవ్వటంలో ఆయన నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటిందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు, రైతులు జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని కనీసం 0.7కైనా పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారాయన. ఇటీవల హైదరాబాద్లో డా. రామమూర్తితో ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భూసారం స్థితిగతులను గత కొన్ని దశాబ్దాలుగా మీరు అధ్యయనం చేస్తున్నారు కదా.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? భూసారం స్థాయిని తెలిపే సూచిక సేంద్రియ కర్బన శాతమే. మట్టి పరీక్షతో దీన్ని తెలుసుకోవచ్చు. అధికం (0.7%–అంతకన్నా ఎక్కువ), మధ్యస్థం (0.4–06%), అత్యల్పం (0.3– అంతకన్నా తక్కువ) స్థాయిల్లో సేంద్రియ కర్బనాన్ని లెక్కగడతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంట భూముల స్థితిగతులపై 30 ఏళ్ల క్రితం పరీక్షలు చేసినప్పుడు సేంద్రియ కర్బనం సగటున మధ్యస్థంగా (అంటే.. 0.5%కు మించి) ఉండేది. నాలుగేళ్ల క్రితం పరీక్షించినప్పుడు 0.2–0.3%కి తగ్గిపోయింది. పంటలు బాగా పండాలంటే కనీసం 1% అయినా సేంద్రియ కర్బనం ఉండాలి. మనది ఉష్ణమండల ప్రాంతం కాబట్టి 1% కష్టం అనుకున్నా.. 0.7 నుంచి 0.9 వరకైనా పెంచుకోగలగాలి. సేంద్రియ కర్బనమే నేలకు, పంటకు ప్రాణం. పౌష్టికాహార భద్రతకు ఇది చాలా ముఖ్యం. సేంద్రియ కర్బనం అంతగా ఎలా తగ్గింది? రసాయనిక ఎరువులు మరీ ఎక్కువగా వాడుతున్నారు. పశువుల ఎరువు, పచ్చి రొట్ట ఎరువులను చాలా మంది రైతులు వాడటం లేదు. ఒకే పంట వేస్తున్నారు. ప్రతి ఏటా అదే సాగు చేస్తున్నారు. ఏయే పంటల్లో ఎక్కువ వాడుతున్నారు? వరి, పత్తి, మిర్చి పంటలకు రసాయనిక ఎరువులు ఎక్కువ వేస్తున్నారు. ఎంత అవసరమో గమనించకుండా పక్క రైతును చూసి వేస్తున్నారు. పురుగుమందుల పిచికారీలు కూడా అంతే. అందుకే సేంద్రియ కర్బనం తగ్గిపోతోంది. రసాయనిక కలుపు మందులూ కారణమేనా? ఖచ్చితంగా. రసాయనిక ఎరువులతో భూమిలో వానపాములు నశించాయి. పురుగుమందులు, కలుపు మందులతో భూమిలో సూక్ష్మజీవరాశి వంద శాతం నశిస్తోంది. రైజోబియం బాక్టీరిఆయ, ఆక్టినోమైసిట్స్, మైకోరైజా వంటి మేలు చేసే సూక్ష్మజీవరాశి పూర్తిగా అంతరించిపోతోంది. పరిష్కారం ఏమిటి? పంటల సాగు పదికాలాల పాటు బాగుండాలంటే మనం చేసే పనుల వల్ల భూసారానికి ఏమవుతుందో కూడా గమనించుకోవాలి. సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవటం అత్యవసరం. పంట బాగా పండాలంటే 16 స్థూల, సూక్ష్మ పోషకాలు ఉండాలి. మట్టిలో సేంద్రియ కర్బనం ఎంత ఎక్కువ ఉంటే పంటలకు వీటి లభ్యత అంత ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ కర్బనం 0.2% ఉన్న భూముల్లో పోషకాలు మరీ అడుగంటిపోయాయి. సాగు పద్ధతిలో మార్పులు చేసుకొని సేంద్రియ కర్బనం పెంచుకోవాలి. అంతర పంటలతో సమస్య తీరుతుందా? పత్తి వంటి ప్రధాన పంట మధ్యలో 3 సాళ్లకు ఒక సాలు పప్పుధాన్యాలు వేసుకుంటే మంచిది. అంతర పంటల వల్ల ఆర్థికంగా రైతుకు రిస్క్ తగ్గుతుంది. ఒక పంట పోయినా మరో పంట ఆదుకుంటుంది. సేంద్రియ కర్బనం పెంచుకోవడానికైతే అంతర పంటలతో 30–40% ప్రయోజనం ఉంటే పంట మార్పిడి వల్ల వంద శాతం ఉంటుంది. వరుసగా 3,4 ఏళ్లు పంట మార్పిడి చేస్తూ రసాయనిక ఎరువులతోపాటు పశువుల ఎరువు, పచ్చి రొట్ట ఎరువులు వేసుకుంటూ ఉంటే సేంద్రియ కర్బనంలో మార్పు కనిపిస్తుంది. పంట భూములు పూర్తిగా నిస్సారమైపోకుండా ఉండాలంటే పట్టుబట్టి సేంద్రియ కర్బనాన్ని 0.7%కి పెంచుకోవటం ముఖ్యం. సేంద్రియ సేద్యం వైపు మళ్లాల్సిందేనా? రసాయనిక వ్యవసాయం నుంచి ఒకేసారి ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలోకి వెళ్తే సడన్గా దిగుబడులు తగ్గుతాయి. రసాయనిక, సేంద్రియ ఎరువులు సమతూకంగా వాడుతూ సమీకృత సేద్యం చేపట్టాలి. క్రమంగా కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోకి మారాలి. క్రమంగా సేంద్రియ కర్బనం పెరుగుతుంది కాబట్టి దిగుబడులు తగ్గకుండానే సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఏయే జిల్లాల్లో భూములు ఏయే పంటలకు అనుకూలమో మీ సంస్థ చెప్తోంది కదా..? అవును. దేశవ్యాప్తంగా పొటెన్షియల్ క్రాప్ జోన్స్ ప్రకటించాం. ఆయా భూముల స్వభావం, భూసార పరిస్థితులు, ఆ ప్రాంత వాతావరణం, వర్షపాతం, అక్కడి ప్రజల ఆసక్తి, మార్కెట్ స్థితిగతులపై 20 ఏళ్ల క్రితం నాటి నుంచి సమాచారం సేకరించి.. శాస్త్రీయంగా పొటెన్షియల్ క్రాప్ జోన్స్ నివేదికలు ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పత్తి, వరి, జొన్న, వేరుశనగ పంటలకు ఏయే జిల్లాలో ఎన్ని హెక్టార్ల భూమిలో చాలా బాగా, ఒక మాదిరిగా, కొంతమేరకు ఆయా పంటల సాగుకు అనువుగా ఉన్నాయో చెప్పాం. తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు పొటెన్షియల్ క్రాప్ జోన్స్పై మండల స్థాయి వివరాలను విశ్లేషించి 71 పంటలను పరిశీలించాం. ఏయే జిల్లాల్లో సాగుకు ఏయే పంటలు అనుకూలమో సూచించాం. ప్రతి జిల్లాకు 3 నుంచి 20 అనుకూల పంటలు సూచించాం. ఈ పనికి రెండేళ్లు పట్టింది. ఈ సమాచారాన్ని మార్కెట్ ఇంటెలిజెన్స్ సమాచారంతో జోడించి విశ్లేషించుకొని మేం సూచించిన అనుకూల పంటల జాబితాలో నుంచి ఏ పంటలు సాగు చేయాలో ప్రభుత్వం, రైతులు నిర్ణయించుకోవాలి. ఈ అవగాహన రసాయనిక సేద్యంతోపాటు ప్రకృతి సేద్యం చేసే రైతులకూ ఉపయోగమేనా? సాగు పద్ధతిని బట్టి, నమూనాలు సేకరించే ఎండ, వానా కాలాలను బట్టి మారిపోయే అంశాల ఆధారంగా మేం ఈ అంచనాలకు రావటం లేదు. ఏ రైతుకైనా పొటెన్షియల్ క్రాప్ జోన్ల సమాచారం ఉపయోగకరమే. (డా. రామమూర్తి ఈ–మెయిల్: (ramamurthy20464@gmail.com ) – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
బియ్యం, గోధుమల్లో ‘డి’ విటమిన్!
ప్రకృతి సిద్ధంగా కొన్ని ఆహారోత్పత్తుల్లో కొన్ని రకాల విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు, పలు సంస్థలు జన్యుమార్పిడి ప్రక్రియ ద్వారా ఆశించిన విటమిన్ను ఏదో ఒక ‘వంగడం’లోకి చొప్పించి, ఆ వ్యవసాయోత్పత్తిలో ఆ విటమిన్ వచ్చేలా చేయడానికి వ్యయ ప్రయాసలకోర్చి ‘జన్యుమార్పిడి’ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా, జన్యుమార్పిడి వంటి సంక్లిష్ట ప్రక్రియ అవసరం లేకుండానే.. పంట ఏదైనా సరే.. మనకు అవసరమైన విటమిన్లను వ్యవసాయోత్పత్తుల్లో పుష్కలంగా రాబట్టుకునే సహజ సేద్య మెళకువలను తాను రూపొందించానని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆయన తన ఇంటి ముందే వున్న 60 సెంట్ల భూమిని (ఇందులోనే డి విటమిన్ వచ్చేలా గోధుమ పంటను సాగు చేస్తున్నారు), కీసర సమీపంలో తన వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగశాలలుగా మార్చారు. వరి, గోధుమ పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే క్రమంలో కొన్ని సహజ మిశ్రమాలను వినియోగించడం ద్వారా వరి బియ్యం, గోధుమల్లో గతంలో విటమిన్ ఎ, సి, తాజాగా విటమిన్ ‘డి’ని రాబట్టానని ఆయన ప్రకటించారు. తన పొలంలో నుంచే పై మట్టిని, (4–6 అడుగుల) లోపలి మట్టిని సేకరించి ఎండబెట్టి.. ఈ మట్టిని పంటలకు సేంద్రియ ఎరువుగా, సేంద్రియ పురుగుమందుగా వాడటంపై వెంకటరెడ్డి గతంలో చేసిన ఆవిష్కరణలు పత్రికలు, టీవీ ఛానల్స్, యూ ట్యూబ్ వీడియోల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల రైతులక్కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎడారి మిడతల దండు పంట ను ఆశించకుండా చేయడానికి కూడా మట్టి ద్రావణం దోహదపడిందని ఆయన చెప్పటం మనకు తెలుసు. ‘వైపో’ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ ఆవిష్కరణల పరంపరను దిగ్విజయంగా కొనసాగిస్తున్న చింతల వెంకటరెడ్డి వ్యవసాయోత్పత్తుల్లో విటమిన్ ఎ., సి.లతో పాటు ‘డి’ రాబట్టుకునే సాగు పద్ధతులపై అనేక ఏళ్ల పాటు విస్తృత ప్రయోగాలు చేసి నిర్థారణకు వచ్చారు. ఈ ప్రయోగాల ఫలితాలను క్రమపద్ధతిలో రాసి పేటెంట్ కోసం ధరఖాస్తు పంపారు. పేటెంట్ పొందటానికి దీర్ఘకాలం పడుతుంది. మొదట మన దేశంలో పేటెంట్ కోసం 2019 ఆగస్టు 02న ధరఖాస్తు పంపారు (దీనిపై ఇంకా పేటెంట్ మంజూరు కాలేదు). ఆ తర్వాత, 2020 ఆగస్టు 1న ‘అంతర్జాతీయ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూ.ఐ.పి.ఓ.– వైపో)కు ధరఖాస్తు పంపారు. ఈ ధరఖాస్తుపై స్పందించిన వైపో ఈ నెల 11న చింతల వెంకటరెడ్డి ‘మొక్కల్లో పోషక విలువలను పెంపొందించే మిశ్రమం’ గురించి తన వెబ్సైట్లో పబ్లికేషన్ విడుదల చేసింది (ఇంటర్నేషనల్ పబ్లికేషన్ నంబర్: డబ్ల్యూ.ఓ. 2021/024143 ఎ1). ‘వైపో’ ఇచ్చిన పబ్లికేషన్ పేటెంట్ కాదు. అయితే, చింతల వెంకటరెడ్డి మాదిరిగా రసాయనాలు వాడకుండా, జన్యుమార్పిడి చేయకుండా ఒక సేంద్రియ మిశ్రమం ద్వారా వ్యవసాయోత్పత్తుల్లో డి విటమిన్ తదితర విటమిన్లను పొందటానికి ఉపయోగడపడే మిశ్రమం గురించి గతంలో ఏ దేశంలోనూ ఎవరికీ మేధో హక్కులు ఇవ్వలేదని వైపో పేర్కొంది. 130 దేశాల్లోని జాతీయ స్థాయి పేటెంట్ కార్యాలయాలకు ధరఖాస్తు చేసుకొని పేటెంట్ హక్కులు పొందవచ్చిన వైపో పబ్లికేషన్ మార్గాన్ని సుగమం చేసింది. కాల్షియంను దేహం గ్రహించాలన్నా, ఎముక పుష్టి కలగాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా డి విటమిన్ ఆవశ్యకత చాలా ఉంది. పెద్దలకు రోజుకు 1,000 ఇంటర్నేషనల్ యూనిట్(ఐ.యు.)లు, పిల్లలకు 400 ఐ.యు.లు అవసరం. డి విటమిన్ తక్కువగా ఉన్న వారికి, ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్న వారికి ఇంకా ఎక్కువ మోతాదులో డి విటమిన్ అవసరం ఉంటుంది. సూర్యరశ్మిలో డి విటమిన్ ఉంటుంది. ఎండలో తిరగని వారు పుట్టగొడుగులు (ఎండబెట్టినవి) తిని విటమిన్ డి కొరతను తగ్గించుకోవచ్చు. అయితే, అదేదో రోజువారీగా తినే ఆహార ధాన్యాల్లోనే వుంటే మరింత మేలు కదా! ఏ పంట అయినా సరే.. ఏ పంట దిగుబడులోనైనా డి., ఎ., సి. విటమిన్లు వచ్చేలా చేయవచ్చని నా అనుభవంలో రుజువైంది. వరి, గోధుమ, జొన్న, కొర్ర తదితర ధాన్యాలు.. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపల్లో వేటిలోనైనా ఈ విటమిన్లు వచ్చేలా చేయవచ్చు. జన్యుమార్పిడి అవసరం లేదు. ప్రత్యేక రసాయనాలు వాడనకవసరం లేదు. ప్రకృతిలో అందరికీ ఎక్కడపడితే అక్కడ దొరికే ఆహారోత్పత్తులనే వాడి కావల్సిన విటమిన్లను పంట దిగుబడుల్లో వచ్చేలా చేయవచ్చు. ఈ ఆవిష్కరణకు ‘వైపో’ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ వెలువడటం సంతోషదాయకం. భారత పేటెంట్ కోసం వేచి చూస్తున్నాను. క్యారట్, మొక్కజొన్న పిండి, చిలగడ దుంపలను వాడి రైతులు ఎవరైనా తమ పంట ఉత్పత్తుల్లో విటమిన్ డి రాబట్టుకోవచ్చు. ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించి, తిని రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే నా లక్ష్యం. ఈ టెక్నిక్తో పండించిన ఆహారోత్పత్తులను దేశవిదేశాల్లో వాణిజ్య పరంగా విక్రయించాలనుకునే వ్యక్తులు/సంస్థలు మాత్రం ముందుగా నాతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. – పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి, ప్రముఖ రైతు శాస్త్రవేత్త, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్ మిశ్రమ ద్రావణం ఎంత మోతాదులో వెయ్యాలి? ఎకరానికి ఒక విడత సరిపడా ద్రావణాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. 2 కిలోల క్యారట్లు, 2 కిలోల చిలగడ దుంపలు, 2 కిలోల మొక్కజొన్న గింజల పిండిని ఉపయోగించాలి. క్యారట్లు, చిలగడదుంపలను ముక్కలు కోసి ఉడకబెట్టి, ఒక లీటరు నీరు కలిపి మిక్సీలో వేసి.. ద్రవ రూపంలోకి మార్చాలి. ఆ తర్వాత మొక్కజొన్న పిండిని ఇందులో కలపాలి. ఈ ద్రావణాన్ని 200 లీటర డ్రమ్ము నీటిలో కలిపి పంటకు అందించాలి. వరి, గోధుమ వంటి ధాన్యపు పంటల్లో అయితే, బిర్రు పొట్ట దశ నుంచి గింజ గట్టి పడే దశ వరకు సుమారు నెల రోజుల వ్యవధిలో 4–5 సార్లు ఈ ద్రావణాన్ని అందించాలి. కూరగాయ, పండ్లు తదితర పంటల్లో అయితే, పూత, పిందె దశలో 4–5 సార్లు పంటకు ఈ ద్రావణాన్ని ఇవ్వటం ద్వారా డి విటమిన్ ను పొందవచ్చు అని వెంకటరెడ్డి తెలిపారు. ఎ, సి విటమిన్ల కోసం ఏం చేయాలి? ‘ఎ’ విటమిన్ పంట ఉత్పత్తుల్లో రావాలని మనం అనుకుంటే.. చిలకడదుంప లేదా పాలకూర లేదా క్యారెట్లు 2 కేజీలు తీసుకొని ఉడికించి మిక్సీ పట్టించి, 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి, ఎకరం విస్తీర్ణంలో పంటలకు అందించాలి. ‘సి’ విటమిన్ రావాలి అనుకుంటే.. టమాటా లేదా ఉసిరి లేదా నారింజ లేదా బత్తాయి, నిమ్మ కాయలను 2 కిలోలు తీసుకొని ముక్కలు కోసి రసం తీసి, 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి ఒక ఎకరానికి అందించాలి అని వెంకటరెడ్డి వివరించారు. పొలానికి కాలువల ద్వారా పారించే నీటిలో ఈ ద్రావణాన్ని కలపటం కన్నా.. రెయిన్ డ్రిప్ ద్వారా అందిస్తే.. మొదట మొక్కలకు, తర్వాత నేలకు రెండు విధాలా కూడా పోషకాలు అందుతాయి. పంట పొలంలో 3 అడుగుల ఎత్తున ఇనుప సెంట్రింగ్ ఫ్రేమ్ పైన ‘రెయిన్ డ్రిప్’ ప్లాస్టిక్ ట్యూబ్లను అమర్చి, పంటకు 1 కేజీ ప్రెజర్తో వెంకటరెడ్డి నీరు అందిస్తున్నారు. క్యారెట్, చిలగడ దుంప,మొక్కజొన్న పిండితో మిశ్రమం.. ‘డి’ విటమిన్ కోసం ప్రత్యేకించి వరి, గోధుమలను వెంకటరెడ్డి సాగు చేస్తూ వచ్చారు. తన టెక్నిక్ను పాటిస్తే.. ధాన్యాల్లోనే కాదు, కూరగాయలు, దుంప పంటలు, ఆకుకూరలు, క్యాబే జీ వంటి పూల జాతి కూరగాయల్లో కూడా విటమిన్ డి పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. క్యారెట్, చిలగడ దుంప, మొక్కజొన్నల మెత్తని పిండి.. వీటితో తయారు చేసిన మిశ్రమ ద్రావణాన్ని 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి ‘రెయిన్ డ్రిప్’ ద్వారా వరి, గోధుమ పంటలకు పిచికారీ చేశామని ఆయన తెలిపారు. పంట పొట్ట దశలో ఉన్పప్పుడు నెల రోజుల్లో 4–5 దఫాలు ఈ ద్రావణాన్ని నీటితోపాటు పంటకు అందించాలని ఆయన తెలిపారు. వీటిలోని కెరొటినాయిడ్స్ను పంట మొక్కలు గ్రహించడం ద్వారా విటమిన్ ‘డి’ ఆ పంట దిగుబడుల్లో కనిపించిందని ఆయన తెలిపారు. వరి, గోధుమల్లో విటమిన్ డి తెప్పించడం కోసం 2011 నుంచి ప్రయోగాలు చేస్తున్నానని, 2018లో సక్సెస్ అయ్యానని, తదుపరి కూడా అనేక పంటలు పండించి నిర్థారణకు వచ్చానని చింతల వెంకటరెడ్డి తెలిపారు. ఓల్డ్ ఆల్వల్లో ప్రస్తుతం తన ఇంటి ఎదుట పొలంలో కూడా గోధుమ పంటను డి విటమిన్ కోసం పండిస్తున్నారు. 15 ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లోనే ఆయన ద్రాక్ష, వరి, గోధుమ తదితర పంటలు పండిస్తున్నారు. ఎకరానికి ఏటా 5–6 క్వింటాళ్ల ఆముదం పిండి వేస్తుంటారు. పంటలపై పైమట్టి, లోపలి మట్టి పిచికారీ చేస్తుంటారు. గోధుమ మొలకలు, వరి మొలకలను మరపట్టించి, ద్రావణంగా తయారు చేసి పంటలపై పిచికారీ చేస్తుంటారు. డి విటమిన్ బియ్యం, గోధుమలను చూపుతున్న వెంకటరెడ్డి ఏ పంటలో ‘డి’ విటమిన్ ఎంత? క్యారెట్, మొక్కజొన్న పిండి, చిలగడదుంపలతో తయారు చేసిన మిశ్రమాన్ని వాడటం వల్ల వరి బియ్యంలో కన్నా, గోధుమల్లో అధిక పాళ్లలో డి విటమిన్ వస్తున్నట్లు చింతల వెంకటరెడ్డి గుర్తించారు. 2019 రబీ పంటలో పండించిన గోధుమల్లో(దిగుబడి హెక్టారుకు 4.68 టన్నులు) 100 గ్రాములకు 1,606 ఇంటర్నేషనల్ యూనిట్లు (ఐ.యు.లు) డి విటమిన్ ఉండగా, 2020 ఖరీఫ్లో పండించిన పంటలో 100 గ్రాములకు 1,803 ఐ.యు.ల మేరకు డి విటమిన్ ఉన్నట్లు విమ్తా లాబ్లో చేయించిన పరీక్షల్లో తేలిందని వెంకటరెడ్డి తెలిపారు. 2019 రబీలో పండించిన వరి బియ్యంలో 100 గ్రాములకు 136 ఐ.యు.ల మేరకు, 2019 ఖరీఫ్లో పండించిన వరి బియ్యం (దిగుబడి హెక్టారుకు 9.68 టన్నులు)లో 100 గ్రాములకు 102.70 ఐ.యు.ల మేరకు విటమిన్ డి వచ్చిందని ఆయన వివరించారు. -
‘సాగుబడి’ రాంబాబుకు జీవన సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి సాగుబడి’డెస్క్ ఇన్చార్జ్, సీనియర్ న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబుకు 2019 సంవత్సరానికి గాను ప్రతి ఏటా రైతు దినోత్సవం సందర్భంగా కర్షక సాధికార సంఘటన (కేఎస్ఎస్) అందించే మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జీవన సాఫల్య పురస్కారం లభించింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విశిష్ట సేవలందించిన తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు రైతులు, పాత్రికేయులు, శాస్త్రవేత్తలకు కె.ఎస్.ఎస్ ఈ పురస్కారాలను అందిస్తోంది. పంతంగితో పాటుగా పసుపు విత్తన రైతు పిడికిటి చంద్రశేఖర ఆజాద్ (తెలంగాణ), ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు అన్నే పద్మావతి (నూజివీడు), టీ న్యూస్ చేను–చెలక ఎడిటర్ విద్యాసాగర్, సైంటిస్ట్ డా.సురేంద్రరాజులకు ఈ అవార్డు లభించింది. ఈమేరకు కేఎస్ఎస్ అధ్యక్షుడు మారం కరుణాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెలది పురుషోత్తంరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న రాజేంద్రనగర్లోని ‘వాలంతరి’లో జరిగే సభలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. -
కరువు కాలపు క్రాంతిదర్శి!
* థాయ్లాండ్ పంట ‘ఆపిల్ బేర్’ సాగుతో అధికాదాయం * మూడున్నర ఎకరాల తోట.. రోజుకు 3 టన్నుల దిగుబడి * అరగంట డ్రిప్ నీటితోనే అద్భుత ఫలితాలు.. కరువు కసిగా కోరలు చాస్తున్నప్పుడు.. కర్షకుడే తన సేద్య వ్యూహాన్ని సరికొత్తగా తిరగ రాసుకోవాలి. సేద్యానికి కొత్త ఊపిరిపోసే పంటల కోసమో.. పండ్ల తోటల కోసమో ప్రపంచమంతా వెతకాలి. అంతేకాదు.. ప్రతి నీటి బొట్టునూ అపూర్వ సామర్థ్యంతో వినియోగించుకుంటూనే.. స్థిరంగా నికరాదాయాన్నిచ్చే సరికొత్త వంగడాలను ఆవిష్కరించుకోవాలి. ఈ చారిత్రక అవసరాన్ని సకాలంలో గుర్తించిన వారే క్రాంతిదర్శి. ఆ కోవకు చెందిన సృజనాత్మక కృషీవలుడే గుంటక కృష్ణారెడ్డి. థాయ్లాండ్కు చెందిన ‘ఆపిల్ బేర్’తోపాటు అనేకానేక సరికొత్త ఉద్యాన పంటలపై ఆయన దృష్టి సారించారు. మార్కెట్లో అమ్ముడుపోయే కొత్త పంటలను, బెట్టను తట్టుకునే ఉద్యాన పంటలను ఎంచుకోవడం కృష్ణారెడ్డిని కరువు కాలపు విజేతగా నిలబెట్టాయి... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపిల్ బేర్ను ‘తెలంగాణ ఆపిల్’గా గుర్తించి ప్రోత్సహిస్తోంది! మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు సమీపంలోని చెర్లపల్లికి చెందిన రైతు గుంటక నాగిరెడ్డి కుమారుల్లో చిన్నవాడు కృష్ణారెడ్డి. డిగ్రీ వరకు చదువుకొని సబ్ఇన్స్పెక్టర్గా ఎంపికైన కొద్ది రోజులకే ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. ఆది నుంచీ ఉద్యాన పంటలపై ఆసక్తి కలిగిన ఆయన న్యూజిలాండ్లో ఉద్యాన తోటల కంపెనీలో పని చేశారు. తదనంతరం కొంతకాలం పాటు ఆస్ట్రేలియా వెళ్లి.. అనేక ఉద్యాన తోటల సాగులో అనుభవం గడించిన తర్వాత 2004 అక్టోబర్లో స్వస్థలానికి తిరిగొచ్చారు. తండ్రి పంచి ఇచ్చిన 18 ఎకరాల పొలంలో సేద్యం ప్రారంభించారు. బోర్లు తప్ప మరో నీటి వనరు లేదు. బోరులో ఇంచ్ నీరు మాత్రమే పడ్డాయి. ఇంత తక్కువ నీటితో ఏం పంటలు పండిస్తాం? ఏం ఆదాయం వస్తుంది? ఈ పరిస్థితుల్లో వ్యవసాయం కొనసాగించాలంటే తక్కువ నీటితో అధికాదాయాన్నిచ్చే పంటలపై దృష్టి సారించడం ఒక్కటే మార్గమని తలచిన కృష్ణారెడ్డి దేశాటన ప్రారంభించారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొన్నిచోట్ల 2 వేల అడుగుల లోతు నుంచి ఇంచ్ నీటిని తోడి లేదా ట్యాంకర్లతో నీరు తెచ్చి దానిమ్మ తోటలు పెంచి, దేశంలోకెల్లా నాణ్యంగా, అధిక దిగుబడి తీయడం ఆయనను ఆకర్షించింది. అంతే.. పదెకరాల్లో 5 వేల దానిమ్మ మొక్కలు నాటారు. ఢిల్లీ ఐఐటీ నిపుణుల సలహా మేరకు 25 లక్షల లీటర్ల వాటర్ పాండ్ నిర్మించడం ద్వారా నీటి ఇబ్బందులను అధిగమించారు. దానిమ్మ ఎడారి పంట. దీనికి కొద్ది నీరైనా చాలునంటారాయన. ఆ ధైర్యంతోనే 2005 నాటికి 18 ఎకరాల్లోనూ దానిమ్మ తోట వేశారు. నాలుగైదేళ్లు గడిచేటప్పటికి దానిమ్మ చెట్టుకు 50-60 కిలోల వార్షిక దిగుబడి సాధించారు. పన్నెండేళ్ల పాటు అధిక ఫలసాయాన్నిచ్చిన దానిమ్మతోట 2014 నుంచి మెత్తబడింది. కాండానికి పగుళ్లు రావడం వంటి సమస్యలు రావడంతో కృష్ణారెడ్డి క్రమంగా దానిమ్మ తోటను తీసేస్తూ.. ఇతర పంటల వైపు దృష్టి సారించారు. దానిమ్మ సాగులో ఆయనకున్న పట్టు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు వందలాది మంది రైతుమిత్రులను సంపాదించి పెట్టింది. రోజూ ఉదయం 2 గంటలు వాట్సప్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తుంటారు. నూరేళ్ల పంట ‘ఆపిల్ బెర్’! వాతావరణ సారూప్యతల వల్ల థాయ్లాండ్లోని ఉద్యాన పంటలు మనకు నప్పుతాయని కృష్ణారెడ్డి గ్రహించారు. రెండేళ్ల క్రితం ఆ దేశానికి వెళ్లి ఉద్యాన తోటలు పరిశీలించి.. తెలంగాణ, రాయలసీమ వంటి కరువు ప్రాంతాల్లోనూ కనీస దిగుబడినిచ్చే మేలైన పంటలేమి ఉన్నాయో శోధించి.. తొలుత ఆపిల్ బెర్ను ఎంపిక చేశారు. 80 ఆపిల్ బెర్ మొక్కలు తెచ్చి దానిమ్మ చెట్ల మధ్యలో నాటారు. దానిమ్మ తోట నరికేసేటప్పటికి ‘ఆపిల్ బెర్’ చేతికి అందివచ్చింది. ఇప్పుడు మూడున్నర ఎకరాల్లో కృష్ణారెడ్డి ఆపిల్ బెర్ సాగు చేస్తున్నారు. సాళ్ల మధ్య 13 అడుగులు, మొక్కల మధ్య 10 అడుగుల దూరంలో నాటారు. డ్రిప్ ద్వారా తగుమాత్రంగా నీటిని, ద్రవరూప ఎరువులను అందిస్తున్నారు. 1,300 మొక్కలు నాటగా.. ఆడవి పందుల దెబ్బకు 300 మొక్కలు పాడయ్యాయి. ఇది మూడో ఏడాది. రోజుకు 3 టన్నుల ఆపిల్ బెర్ దిగుబడి వస్తోంది. దీనికి చీడపీడల బెడద చాలా తక్కువ. మందులను రెండుసార్లు పిచికారీ చేస్తే చాలు. వందేళ్ల వరకు ఈ తోట దిగుబడినిస్తుందని కృష్ణారెడ్డి తెలిపారు. నాటిన 6 నెలలకు పూత పూస్తుంది. మరో మూడున్నర నెలలకు కాయలు కోతకు వస్తాయి. కాయ 90-130 గ్రాముల వరకు పెరుగుతుంది. ఆకుపచ్చ, ఎరుపు ఆపిల్ బెర్ రకాలున్నాయి. కిలో ఆపిల్ బెర్ ధర రూ. 25 గ్రీన్ ఆపిల్ను థాయ్ లోకల్ రేగుతో గ్రాఫ్టింగ్ చేయడంతో ఆపిల్ బేర్ రుచిలో, పోషక విలువలలో ఆపిల్కు తీసిపోదు. గుండె, కిడ్నీ, లివర్ ఆరోగ్య పరిరిక్షణకు ఉపకరిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం తినదగినది. ఎన్ని కాయలు తిన్నా మొహం మొత్తనిది కావడంతో ఆపిల్ బెర్కు మంచి మార్కెట్ ఉందని కృష్ణారెడ్డి అన్నారు. కిలో రూ. 25 చొప్పున.. పది కిలోల అట్టపెట్టెల్లో పెట్టి విక్రయిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు, విజయవాడ మార్కెట్లకు పంపుతున్నారు. మెట్ట పొలాల్లో ఆపిల్ బేర్ను సాగు చేయడానికి ఎకరానికి రూ. 30 వేల వరకు మూల పెట్టుబడి అవుతుందని.. ఎంత కాదన్నా కిలో ధర రూ. 3 నుంచి 10 వరకు ఉంటుందని.. కనీసం రూ. 20 వేల నుంచి 50 వేల వరకు నికరాదాయం వస్తుందని కృష్ణారెడ్డి చెబుతున్నారు. పోషణ, నీటి యాజమాన్యం బాగుంటే ఆపిల్ బేర్ దిగుబడి చెట్టుకు తొలి ఏడాది 10-15 కిలోలు, రెండో ఏడాది 100 కిలోలు, 3వ ఏడాది 100-150 కిలోల వరకు వస్తుంది. డ్రిప్ ద్వారా కూడా నీరివ్వలేని కరువు పరిస్థితులొచ్చినా చెట్టుకు ఏడాదికి కనీసం 50 కిలోల దిగుబడైనా వస్తుందని ఆయన అన్నారు. రైతు తోటను కౌలుకిచ్చుకున్నా మంచి ఆదాయం వస్తుందన్నారు. అందువల్లనే ఈ పంటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఆపిల్’గా ప్రకటించి ప్రోత్సహిస్తోందన్నారు. తోట ఒకటే.. సీజన్లు రెండు.. ఆపిల్ బెర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఏడాదిలో రెండు సీజన్లలో పంట తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చని కృష్ణారెడ్డి వివరించారు. తోటలో ఉన్న సగం చెట్ల నుంచి జూన్ - ఆగస్టు నెలల్లో, మిగతా సగం చెట్ల నుంచి జనవరి - మార్చి నెలల్లో పంట తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చన్నారు. మామిడి వంటి తోటల్లో ఇలాంటి సదుపాయం ఉండదని, దేశవ్యాప్తంగా ఒకే సీజన్లో దిగుబడి వస్తుంది కాబట్టి రైతుకు గిట్టుబాటు కాదన్నారు. ఆపిల్ బెర్ పంట పూర్తయిన తర్వాత చెట్టు మొదలును 1-2 అడుగుల ఎత్తున పూర్తిగా నరికేయాలి. తర్వాత పెరిగే పిలకల్లో 4 కొమ్మలను నిలువుగా పెరగనివ్వాలి. ఆ కొమ్మలకే పూలు, కాయలు వస్తాయి. మొదలు నరికేసిన 9 నెలల్లో కాయలు కోతకు వస్తాయి. డ్రిప్ నీరు ఒకే చోట ఇవ్వాలి.. కృష్ణారెడ్డి సాగు పద్ధతి సునిశిత పరిశీలనతో కూడి ఉంటుంది. దానిమ్మ.. మిరప.. పసుపు.. ఆపిల్ బేర్.. పంట ఏదైనా రైతు విజయం సాధించాలంటే నీటి యాజమాన్యమే కీలకమని ఆయన అంటారు. పంట పాడైనా, బాగున్నా అందుకు కారణం నీటి యాజమాన్యమే. ముఖ్యంగా డ్రిప్ ద్వారా తోటలకు నీరందించేటప్పుడు.. మొదట్లో ఎక్కడైతే డ్రిప్పర్ నీటిని వదులుతుందో.. చెట్టు తన పీచు వేళ్ల(సక్కర్ జోన్)ను ఆ ప్రాంతంలో విస్తరింపజేస్తుంది. అదే చోట, నిర్ణీత సమయానికి నీటి కోసం వేళ్లు ఎదురుచూస్తుంటాయి. అందువల్ల డ్రిప్ లైను అటూ ఇటూ కదిలిపోకుండా 20 అడుగులకో చోట యాంకిల్ పైపులతో కట్టి ఉంచడం ముఖ్యం. రోజుకు చెట్టుకు 4 లీటర్ల నీటితోనే.. చెట్టు వద్ద భూమిలో పీచు వేళ్లు అల్లుకొని ఉన్న 8 అంగుళాల లోతు మట్టి తడిస్తే చాలు. తల్లి వేరు దిగినంత 10 అడుగుల లోతు వరకు నీటిని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ అవగాహనతోనే కృష్ణారెడ్డి ప్రత్యేక డ్రిప్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు ఫామ్పాండ్లో నిల్వచేసుకున్న నీటిని.. రోజూ ఉదయం అరగంట సేపు చెట్టుకు 4 లీటర్ల చొప్పున అందిస్తున్నారు. కరెంటు ఉండి, నీరు అందుబాటులో ఉంటే .. సాయంత్రం పూట మరో అరగంట నీటిని ఇస్తున్నారు. సాధారణ డ్రిప్తో ఖర్చయ్యే నీటిలో సగం నీటితోనే కరువు కాలంలోనూ ఆపిల్ బేర్ తోటను కాపాడుకోగలుగుతున్నారు. కృష్ణారెడ్డి ప్రస్తుతం 60% సేంద్రియ పద్ధతిలో, 40% రసాయనిక పద్ధతిలో తోటకు ద్రవరూపంలో పోషకాలను అందిస్తున్నారు. పండ్లకు సరైన సేంద్రియ మార్కెట్ అభివృద్ధి చెందితే.. పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి మంచి దిగుబడులు పొందడానికి ఇబ్బందేమీ లేదని ఆయన అన్నారు. బండి ఎరువుతో 10 బండ్ల ఎరువు తయారీ పశువుల ఎరువును నేరుగా పొలంలో వేయకుండా.. దాన్ని పది రెట్లు పెంపొందించి వాడుకునే పద్ధతిని కృష్ణారెడ్డి అనుసరిస్తున్నారు. నాణ్యమైన బండి పశువుల ఎరువును సేకరించి, దానితో 3 నెలల్లో స్వల్ప ఖర్చుతో పది బండ్ల ఎరువును తయారు చేస్తున్నారు. ఒక పొర పశువుల ఎరువు వేసి, దానిపైన డీ కంపోజ్డ్ బ్యాక్టీరియా చల్లి, దానిపైన ఒక పొర చెరువు మట్టి, చేను మట్టి.. ఇలా పలు వరుసలుగా వేస్తూ.. 3 నెలల్లో పుష్కలంగా సూక్ష్మజీవరాశి కలిగిన సేంద్రియ ఎరువును తయారు చేసి పంటలకు వాడుతున్నారు. ఇలా చేస్తే పంట భూమిలో స్వల్ప కాలంలోనే హ్యూమస్ (జీవనద్రవ్యం) వృద్ధి చెంది భూమి సారవంతమవుతుందని, ఆ పంట కాలంలోనే దిగుబడుల పెంపునకు ఉపయోగపడుతుందని ఆయన చెబుతున్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు వినూత్నంగా, బహుముఖ వ్యూహంతో ముందడుగేసే రైతే నిలబడగలుగుతాడు. రైతులోకానికే వెలుగుబాటను చూపగలుగుతాడు.. అటువంటి ధన్యజీవి గుంటక కృష్ణారెడ్డి. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : పోల్కంపల్లి గాండ్ల నాగరాజు ఇక ‘లోగాన్’ పండ్ల సాగు నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో పండే పండ్ల తోటల రకాలపై నిరంతరం అధ్యయనం చేస్తున్న కృష్ణారెడ్డి మరికొన్ని థాయ్లాండ్ వంగడాలపై దృష్టి కేంద్రీకరించి రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. లోగాన్ పండ్ల తోటను రెండెకరాల్లో సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. లోగాన్: నాటిన రెండేళ్లకు దిగుబడి వస్తుంది. సపోట, కివీ పండ్ల రుచి కలగలిసి ఉంటుంది. మార్కెట్ ధర కిలో రూ. 200. రైతుకు నికరంగా రూ. 20 వచ్చినా చాలు. ఆల్టైమ్ గుచ్ఛా లెమన్ : నిమ్మ సాధారణంగా మూడున్నరేళ్లకు కాపుకొస్తుంది. ఇది ఏడాదిన్నరలోనే కాపుకొస్తుంది. కిలో రూ. 40 వరకు ధర పలుకుతుంది. జామ.. థాయ్ బిగ్ బాస్: అర కిలో వరకు బరువు పెరుగుతుంది. తియ్యగా ఉంటుంది. విత్తనాలు తక్కువ. కిలో పెరిగే రకమూ ఉంది. కానీ జనం కొనరు. థాయ్ మునగ: అధిక దిగుబడినిస్తుంది. కాయలో గుజ్జు బాగా ఉంటుంది. ఏడాదిన్నరలో పూర్తిస్థాయి దిగుబడినిస్తుంది. కిలో రూ. 40 వరకు ఉంటుంది. థాయ్ బ్లాక్ జామున్: 60 గ్రా. బరువు పెరుగుతుంది. 3 ఏళ్లకు దిగుబడినిస్తుంది. 10 అడుగులు పెరిగిన చెట్టు పిలక కత్తిరించి, కొమ్మలను తాళ్లతో లాగి కట్టాలి. హార్టికల్చరే మెట్ట రైతు కల్చర్ కావాలి! పత్తి వంటి సీజనల్ పంటలకన్నా నీటి ఎద్దడిలోనూ కనీస భరోసా ఇవ్వగలిగిన పండ్ల తోటల సాగుతోనే మెట్ట ప్రాంత రైతులకు శాశ్వతంగా మేలు జరుగుతుంది. బెట్టను తట్టుకొని కనీస దిగుబడినిచ్చే థాయ్లాండ్కు చెందిన పండ్ల తోటల సాగు తెలంగాణ, రాయలసీమ రైతులకు చాలా అనువైనవని అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఆపిల్ బేర్ను రెండేళ్లు సాగు చేసి అన్ని విషయాలూ ఆకళింపు చేసుకున్న తర్వాతే రైతులకు సిఫారసు చేస్తున్నాను. త్వరలో రెండెకరాల్లో లోగాన్ పండ్ల తోట నాటబోతున్నాను. నీరు, డబ్బు తక్కువగా ఉన్న రైతులు కూడా ఆత్మహత్యల బారిన పడకుండా భరోసాతో బతకాలి. నేనున్నా లేకున్నా నేను పరిచయం చేసిన పంటలు రైతులకు అండగా ఉండాలి. అదే నా లక్ష్యం. - గుంటక కృష్ణారెడ్డి (96663 28231), చెర్లపల్లి, జడ్చర్ల, మహబూబ్నగర్ జిల్లా -
సాగు ఖర్చు తగ్గేదెలా?
పంట పొలాల్లో మరణ మృదంగం మోగిస్తున్న వ్యవసాయ సంక్షోభాన్ని నిలువరించడం ఎలా? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ప్రశ్నపై దృష్టిని కేంద్రీకరించింది. వ్యవసాయ పరిశోధనల సారాన్ని స్వయంగా సేద్యం చేస్తున్న యువ రైతులకు నేరుగా అందించడానికి వీలుగా శిక్షణ ఇవ్వడం మేలని విశ్వవిద్యాలయం భావించింది. దూరవిద్య ద్వారా తెలుగులో 3 నెలల సర్టిఫికెట్ కోర్సును నిర్వహించాలని, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, కేవీకేలలో వారానికో రోజు కాంటాక్టు క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇంతకీ యువ రైతులకు ఏయే అంశాలపై శిక్షణ అవసరం? 9 జిల్లాల నుంచి 77 మంది యువ రైతులను ఈ నెల 1న హైదరాబాద్లోని విస్తరణ విద్యా సంస్థకు పిలిపించి వారి అభిప్రాయాలను సేకరించారు. అనేక ఇతర అంశాలతోపాటు.. రసాయనిక ఎరువులు, పురుగు, కలుపు మందుల ఖర్చు పెచ్చుమీరిందని.. ఈ ఖర్చులు తగ్గించే సమగ్ర సేంద్రియ/ప్రకృతి సాగు పద్ధతుల్లో శిక్షణనివ్వాలని యువ రైతులు కోరారు. అయితే, వర్మీ కంపోస్టు, జీవన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం తప్ప.. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంపై ఇప్పటి వరకు సమగ్ర పరిశోధనా విభాగాన్నే తెరవని మన విశ్వవిద్యాలయం(తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఈ విషయంలో ఎంతో ముందున్నాయి).. ఇక యువ రైతులకెలా నేర్పిస్తుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ పద్ధతులను ఏళ్ల నాటి నుంచి అవలంబిస్తూ అనేక పంటల్లో సత్ఫలితాలు సాధిస్తున్న చిన్న, పెద్ద రైతులతోపాటు విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్తలు/ అధికారులూ లేకపోలేదు. వీరి తోడ్పాటుతో యువ రైతులకు నిక్షేపంగా శిక్షణ ఇవ్వొచ్చు. అయితే విశ్వవిద్యాలయ నిబంధనలు అందుకు ఒప్పుకుంటాయా? ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు పాటించకుండా ఖర్చు తగ్గేదెలా? రైతుల అభిలాష నెరవేరేదెలా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి! ఖర్చు తగ్గే సాగు పద్ధతులు నేర్పాలి! రెండెకరాల్లో పత్తి, ఎకరన్నరలో వరి, ఎకరంలో టమాటా పండిస్తున్నం. వ్యవసాయం ఖర్చు బాగా పెరిగిపోయింది. గిట్టుబాటు కావటం లేదు. శిక్షణ ద్వారా కూలీల ఖర్చు తగ్గించుకునే సాగు పద్ధతులను నేర్చుకోవాలనుకుంటున్న. డీఏపీ బస్తా రూ. 1,200కు పెరిగిపోయింది. కూలి రూ. 200 దాటింది. సేంద్రియ ఎరువులను రైతులు ఎవరికివారు సొంతంగా తయారు చేసుకోవడంపై శిక్షణ ఇవ్వాలి. - మద్ది శ్రావణి(93924 84542), యువ మహిళా రైతు, మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా రైతు కొడుకును రైతుగా నిలబెట్టే శిక్షణ కావాలి ఎరువులు, పురుగుమందులు, కలుపుమందుల మోతాదుపై రైతుల్లో అవగాహన లేదు. వీటిని విచక్షణారహితంగా వాడేస్తున్నందున ఖర్చు పెరుగుతోంది. డిగ్రీ చదివిన నా వంటి రైతులు కూడా పక్క వాళ్లను చూసి ఎక్కువగా వాడేయాల్సి వస్తోంది. వీటిపై పూర్తి అవగాహన కలిగించేలా శిక్షణ ఇవ్వాలి. అన్ని పంటల్లో పూర్తిస్థాయిలో సొంత విత్తనం తయారుచేసుకోవడం, మాక్ సొసైటీల ఏర్పాటుపై అవగాహన కలిగించాలి. రైతుల కోసం ప్రత్యేక తెలుగు టీవీ ఛానల్ ప్రారంభించాలి. సెల్ ద్వారా పంట ఫొటోలు పంపితే శాస్త్రవేత్తలు సూచనలు ఇవ్వాలి. రైతు కొడుకును రైతుగా నిలబెట్టే భరోసా ఇచ్చేలా శిక్షణ సమగ్రంగా ఉండాలి. - రాకం దేవేందర్(97015 59376), లింగయ్యగిరి, చెన్నారావుపేట మండలం, వరంగల్ జిల్లా అధికాదాయాన్నిచ్చే పంటలపైనే ఆసక్తి! తాతలు తండ్రుల నాటి నుంచి సాగు చేస్తున్న వరి, పత్తి వంటి సంప్రదాయక పంటల సాగుపై చిన్న కమతాలున్న యువ రైతులకు బొత్తిగా ఆసక్తి లేదు. ధనిక రైతులకే పరిమితమైన అధికాదాయాన్నిచ్చే పంటలపై వీరికి ఆసక్తి ఉంది. పూలు, పండ్ల తోటల సాగు, చేపల పెంపకం, పాడి పెంపకంలో ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. అధికాదాయాన్నిచ్చే పంటలకు పెట్టుబడి ఎక్కువ అవసరమైనప్పటికీ.. అయినావాళ్లు నలుగురూ కలిసి సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సబ్సిడీలకన్నా సమాచారం, శిక్షణ ఇవ్వడం అవసరం. చిన్న రైతులకు వ్యవసాయ సూచనలు, సలహాలు అందటం లేదు. - పొడిచేటి సురేందర్, నకిరేకల్(90303 69300), నల్లగొండ జిల్లా సేంద్రియ సాగుపై ఊరూరా ప్రదర్శన క్షేత్రాలు పెట్టాలి 18 ఎకరాల్లో పత్తి, వరి, కంది పండిస్తున్నా. పాలిహౌస్లతో పెద్ద రైతులకే ఉపయోగం. చిన్న రైతులందరికీ ఉపయోగపడే సేంద్రియ సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయం చేయడంపై ప్రతి గ్రామంలో రెండెకరాల్లో ప్రదర్శన క్షేత్రాలను విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. అనుభవజ్ఞులైన ప్రకృతి వ్యవసాయదారులు, సేంద్రియ రైతులతో శిక్షణ ఇప్పించడం అవసరం. అన్ని పంటల విత్తనాలు తయారు చేసుకోవడం.. స్ప్రేయర్లు, చిన్న యంత్రపరికరాలు, మోటార్ల మరమ్మతులు చేయడం.. 50-100 కోళ్లు పెంచుకోవడం, పశువ్యాధులకు చికిత్స చేయడం.. ప్రతి ఊళ్లో కొందరు యువ రైతులకు శిక్షణ ఇప్పించాలి. సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, వాటి ద్వారా లబ్ధిపొందడంపై శిక్షణ ఇవ్వాలి. ఆవులు, గేదెలను 50% సబ్సిడీ మీద ఇవ్వాలి. - పల్లె రమాదేవి (90003 02289), మహిళా రైతు, ఎత్బార్పల్లె, రంగారెడ్డి జిల్లా యువ రైతులకు గోఆధారిత సాగు నేర్పించాలి అనేక దేశవాళీ వరి వంగడాలు, కూరగాయలను సాగు చేస్తున్నా. 4 ఏళ్ల నుంచి గోఆధారిత వ్యవసాయం చేస్తున్నా. ప్రతి రైతుకూ ఆవులుండాలి. పాడి-పంట ఉంటేనే రైతుకు లాభం. పశువుల ఎరువు కొనుక్కొని వేస్తే రైతుకు మిగిలేదేమీ ఉండదు. గోమూత్రం, వేపనూనె పిచికారీ చేస్తున్నాను. గోమూత్రం పిచికారీ వల్ల వైరస్ తెగుళ్లు రావడం లేదు. ఖర్చు బాగా తగ్గింది. దిగుబడి బాగుంది. యువ రైతులకు ఈ పద్ధతులను నేర్పిస్తే.. వ్యవసాయంలో నిలబడగలుగుతారు. పత్తి, సోయా వంటి వాణిజ్య పంటలతోపాటే అంతరపంటలుగా చిరుధాన్యాలు, కూరగాయలు పండించుకుంటే చిన్న రైతులకు తిండి కరువుండదు. ఈ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. - ఎన్. మన్మోహన్రెడ్డి (85001 47354), చించోలిబీ, సారంగపూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా దిగుబడి తగ్గి.. తెగుళ్లు పెరుగుతున్నాయి! మా గ్రామాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం పదేళ్ల క్రితమే దత్తత తీసుకుంది. అన్ని పొలాల్లోనూ డ్రిప్ ఏర్పాటు చేసుకొని కూరగాయలే పండిస్తున్నాం. ఎకరానికి 7 టన్నులు కోళ్ల పెంట, డీఏపీ తదితర ఎరువులు వేస్తున్నాం. ప్రతి సంవత్సరం దిగుబడి తగ్గుతోంది. తెగుళ్లు పెరుగుతున్నాయి. క్యాబేజీ 2010 వరకు ఎకరానికి 20 టన్నులు పండేది. ఇప్పుడు 5-6 టన్నులకు తగ్గింది. ఎండుతెగులుకు శాస్త్రవేత్తలూ పరిష్కారం చూపలేకపోతున్నారు. క్యారెట్ మొక్కలు 4 ఆకులు వేసిన తర్వాత పడిపోయి చనిపోతున్నాయి. టమాటా సాగులో మల్లి సమస్యకు పరిష్కారం లేదు. స్థానిక అధికారులకు ఈ సమస్యలపై అవగాహన శూన్యం. సమస్య ఇదీ అని చెప్పినా రోజులు గడుస్తున్నా పరిష్కారం ఏమిటో చెప్పే నాథుడే లేడు. ఫోన్ ద్వారా ఫొటో పంపితే ఒకటి, రెండు రోజుల్లో పరిష్కారం చూపే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంతకన్నా ఆలస్యమైతే పంట చేయిదాటిపోతుంది. పురుగుమందుల కంపెనీల శాస్త్రవేత్తలు తరచూ పొలాల్లోకి వస్తూనే ఉంటారు. తమ కంపెనీ ఉత్పత్తులనే వాడాలని ఎవరికి వారు ఊదరగొడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. యాంత్రీకరణలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. కర్ణాటకలో క్యారెట్ సీడ్ వేయడం, దుంపలు పీకడం, కడగడం వంటి పనులన్నీ యంత్రాలతోనే చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. అటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తేవాలి. ఖర్చు, తెగుళ్లు తగ్గి దిగుబడి పెరిగే సాగు పద్ధతులపై శిక్షణ కావాలి. - యువ రైతులు దేవేందర్రెడ్డి, శంకర్, సుఖేష్రెడ్డి, దీపక్రెడ్డి(98669 66162) చనువల్లి, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా - సేకరణ: పంతంగి రాంబాబు, ఫొటోలు: మోహన్


