విరిసిన సేద్య పద్మాలు! | Sagubadi: Eight agri experts among 2026 Padma award winners | Sakshi
Sakshi News home page

విరిసిన సేద్య పద్మాలు!

Feb 3 2026 6:20 AM | Updated on Feb 3 2026 6:20 AM

Sagubadi: Eight agri experts among 2026 Padma award winners

వ్యవసాయం, పశుపోషణ, సహకార రంగాల్లో విశేష కృషి చేసిన 9 మందికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఐదుగురు శాస్త్రవేత్తలు, ముగ్గురు రైతు శాస్త్రవేత్తలు, ఒకరు ప్రముఖ సహకార వేత్త. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌ఐ, పూసా) మాజీ సంచాలకులు డా. అశోక్‌ కుమార్‌ సింగ్‌ (బాస్మతి వరి రకాల అభివృద్ధి), జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ, మొక్కల రకాలు రైతుల హక్కుల ప్రాధికార సంస్థల మాజీ చైర్మన్  డా. పి.ఎల్‌. గౌతమ్‌ (జీవవైవిధ్య పరిరక్షణ చట్టం, రైతుల విత్తన హక్కుల రక్షణ చట్టం రూపశిల్పి), తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ డా. కె.రామస్వామి (క్లైమేట్‌ ఒత్తిళ్లను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై పరిశోధన), రాజేంద్ర ప్రసాద్‌ సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ డా. జి.ఎల్‌. త్రివేది (ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధి), తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ డీన్  డా. ఎన్‌. పుణ్యమూర్తి (ఎత్నో–వెటర్నరీ మెడిసిన్‌) పద్మశ్రీకి ఎంపికయ్యారు. వీరితో పాటు రైతు శాస్త్రవేత్తలు దివంగత రఘుపత్‌ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌), జోగేష్‌ డ్యూరి (అస్సాం), శ్రీరంగ్‌ దేవబా లాడ్‌ (మహారాష్ట్ర), దివంగత సహకార వేత్త మామిడి రామారెడ్డి (తెలంగాణ) పద్మశ్రీ 2026 పురస్కారాలకు ఎంపికయ్యారు.

మాక్స్‌ చట్టం రూపశిల్పి రామారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమలో సహకార సంఘాల పాత్రను బలోపేతం చేసేందుకు 50 ఏళ్లపాటు పాటుపడిన దార్శనిక సహకార నేత మామిడి రామారెడ్డి(83)కి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయనుంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సర్పంచ్‌గా, రాజేంద్రనగర్‌ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. సహకార సమాఖ్య, కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ల ద్వారా సహకార వ్యవస్థ పటిష్టతకు రాజకీయాలకు అతీతంగా, స్వతంత్ర సహకార వేత్తగా నిబద్ధతతో సేవలందించారు. 

మల్టీపర్పస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (ఎంపీసీఎస్‌)లను ఏర్పాటు చేశారు. పీఏసీఎస్‌లలో ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యాన్ని నిరోధించేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమించి, చట్ట సవరణ సాధించారు. 1995లో మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(మాక్స్‌) చట్టం రూపకల్పనలో రామారెడ్డి కీలకపాత్ర పోషించారని 5 దశాబ్దాలుగా రామారెడ్డితో కలసి నడుస్తున్న సహకార ధర్మపీఠం వ్యవస్థాపక ధర్మకర్త సంభారపు భూమయ్య ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సహకార రంగంలో పద్మశ్రీ పురస్కారాన్ని గెల్చుకున్న తొలి నేత రామారెడ్డి కావటం సంతోషదాయకమన్నారు. ముఖ్యంగా మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలను, స్వయం సహాయక బృందాలను ఇతోధికంగా ప్రోత్సహించారు. వరంగల్, కరీంనగర్‌ ప్రాంత మహిళా సహకార డెయిరీ ఏర్పాటులో చోదక శక్తిగా నిలిచారని ఆయన తెలిపారు. 

దూరదృష్టి గల నేత: ఎన్‌డీడీబీ
సహకార సంస్థలను బలోపేతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన దూరదృష్టి గల నాయకుడు మామిడి రామారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావటం హర్షణీయమని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్‌డీడీబీ) పేర్కొంది. సహవికాస – సహకార అభివృద్ధి ఫౌండేషన్‌ ద్వారా మహిళా సాధికారతపై బలమైన దృష్టితో తెలంగాణ అంతటా గ్రామీణ జీవనోపాధి అవకాశాలను కల్పించారు. సహకార చట్టాలను రూపొందించడంలో, జాతీయ స్థాయి విధాన సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. వేలాది మంది సభ్యుల యాజమాన్యంలోని స్వావలంబనతో కూడిన సహకార సంస్థలను ఆయన వారసత్వం విశ్వాసం, గౌరవం, స్థిరమైన గ్రామీణాభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతుందని ఎన్‌డీడీబీ ఆకాంక్షించింది.

శ్రీరంగ్‌ దేవబా లాడ్‌ (మహారాష్ట్ర)
వ్యవసాయ ఆవిష్కరణలతో ప్రసిద్ధి చెందిన రైతు శాస్త్రవేత్త శ్రీరంగ్‌ దేవబా లాడ్‌ (మహారాష్ట్ర). పత్తి ఉత్పత్తిని పెంచే ‘దాదా లాడ్‌ పద్ధతి’ని ఆయన అభివృద్ధి చేసినందుకు పద్మశ్రీ అందుకోనున్నారు. అధిక సాంద్రతలో పత్తి విత్తటం, మొక్కను 3 దశల్లో కొమ్మలు, పిలకలను కత్తిరించటం ద్వారా దిగుబడిని పెంచటం దాదా లాడ్‌ టెక్నిక్‌ ప్రత్యేకత. 

పత్తి పంట కాలాన్ని కుదించటం ద్వారా గులాబీ పురుగు బెడద నష్టాన్ని నివారించటం మరో ప్రయోజనం. నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సీఐసీఆర్‌) లాడ్‌ టెక్నిక్‌లో ప్రయోజకత్వాన్ని గుర్తించి, అధికారికంగా రైతులకు సిఫారసు చేయటం విశేషం. వర్షాధార, నీటిపారుదల సాగు పద్ధతుల్లోనూ సీఐసీఆర్‌ విస్తృత స్థాయిలో క్షేత్ర ప్రయోగాలు జరిపింది. ఈ టెక్నిక్‌ ద్వారా సగటున 48 నుంచి 76% వరకు పత్తి దిగుబడి పెరిగినట్లు రుజువైందని సీఐసీఆర్‌ ప్రకటించింది.

రఘుపత్‌ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌)
మొరాదాబాద్‌ జిల్లాలోని బిలారి ప్రాంతానికి చెందిన అభ్యుదయ రైతు రఘుపత్‌ సింగ్‌కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయనున్నారు. 

55 పైగా అంతరించిపోతున్న కూరగాయల వంగడాలను సంరక్షించి రైతులకు తిరిగి పరిచయం చేశారు. దాదాపు 100 కొత్త రకాలను అభివృద్ధి చేశారు.

జోగేష్‌ డ్యూరి (అస్సాం)
ముగా పట్టు పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన జోగేష్‌ డ్యూరి పద్మశ్రీని అందుకోనున్నారు. ఆయన కృషి వేలాది గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచింది. 

ముగా పట్టుకు ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement