పోషక లోపాలు తీర్చే చొప్ప! | Sagubadi: Agronomic biofortification of fodder crops | Sakshi
Sakshi News home page

పోషక లోపాలు తీర్చే చొప్ప!

Feb 24 2026 6:26 AM | Updated on Feb 24 2026 6:26 AM

Sagubadi: Agronomic biofortification of fodder crops

పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్‌ పద్ధతులతో పశుపోషణలో సత్ఫలితాలు

దేశంలో పశువుల పోషకాహార లోటును పరిష్కరించడానికి పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్  ఒక సమర్థవంతమైన, సుస్థిరమైన పరిష్కారం. పంటలు పెరిగే దశలోనే వాటిలో అవసరమైన పోషకాల (జింక్, ఇనుము, రాగి వంటి సూక్ష్మపోషకాల) పరిమాణాన్ని, వాటి జీవ లభ్యతను సస్యవిజ్ఞాన పద్ధతుల్లో పెంపొందించ­­డాన్నే బయోఫోర్టిఫికేషన్‌ అంటారు. 

బయోఫోర్టిఫికేషన్  మూడు విధాలు: 
1. నేల ద్వారా ఎరువుల వినియోగం.. పొలం మట్టిలో లోపించిన పోషకాలను లేదా సూక్ష్మ­పోష­కాలను నీటిలో కలిపి నేలకు అందిస్తారు. 
2. పంట­లపై పిచికారీ చేయడం.. ఎరువులను ద్రవరూపంలో నేరుగా మొక్కల ఆకులపై పిచికారీ చేస్తారు. దీని వల్ల మొక్కలు పోషకాలను 
వేగంగా గ్రహిస్తాయి. 
3. సూక్ష్మజీవుల ప్రయోగం.. నేలలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను మట్టిలో కలుపుతారు. తద్వారా మొక్కలు నేల నుంచి పోషకాలను తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

నత్రజని ప్రాముఖ్యత
పంట అభివృద్ధికి, పశుగ్రాస ఉత్పత్తికి నత్రజని చాలా కీలకమైన పోషకం. ఇది ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, పత్రహరితం, ఇతర ముఖ్యమైన అణువుల నిర్మాణానికి అవసరం. నత్రజని ఎరువులు మేత నాణ్యతను, ముఖ్యంగా పొడి పదార్థం, ముడి మాంసకృత్తుల సాంద్రతను పెంచుతాయి.
పరిశోధనా ఫలితాల ప్రకారం, హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు వాడినప్పుడు, మొక్కజొన్న గ్రాసంలో జింక్‌ (15.3%), రాగి (7.5%), మాంగనీస్‌ (28.4%), ఇనుము (15.6%) వంటి సూక్ష్మపోషకాల స్థాయిలు పెరిగాయి. నత్రజని (120 కిలోలు/హెక్టారు)ని పశువుల ఎరువుతో కలిపి వాడటం వల్ల పశుగ్రాసంలో ముడి ప్రొటీన్లు 36.56% వరకు పెరిగినట్లు పరిశోధనా ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

గొర్రెల్లో జింక్‌ లోపం పోయింది
మొక్కజొన్న, అలసంద వంటి పశుగ్రాస పంటల పెరుగుదలకు, అధిక దిగుబడికి జింక్‌ చాలా ముఖ్యం. పశుగ్రాసంలో జింక్‌ లోపం ఉంటే పశువుల ఎదుగుదల తగ్గటం, పునరుత్పత్తి సమస్యలు, ఎముకలు, చర్మ కణజాలం దెబ్బతినటం జరుగుతాయి. 2020లో డా. గిరిధర్‌ బృందం బెంగళూరులో (ఐసీఏఆర్‌–ఎన్‌ఐఎన్‌íపీ) ఒక అధ్యయనం చేసింది. జింక్‌ ఎరువులను నేలలో వేసి పండించిన జొన్న చొప్పను జింక్‌ లోపం ఉన్న గొర్రెలకు 120 రోజులపాటు ప్రయోగాత్మకంగా తినిపించారు. హెక్టారుకు 25 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వేస్తే జొన్న చొప్ప దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులు పెరిగింది. చొప్పలో జింక్‌ పరిమాణం 14.4 పీపీఎం మేర వృద్ధి చెందింది. బయోఫోర్టిఫైడ్‌ చొప్ప తిన్న గొర్రెల్లో జింక్‌ స్థాయి పెరగటంతో పాటు.. రక్తంలోని జింక్‌ పరిమాణం పెరిగింది. వ్యాధి నిరోధక శక్తి పెరిగింది.

రాగితో పెరిగిన దిగుబడి 
పరిశోధనల ప్రకారం, ఓట్స్‌ పశుగ్రాస పంటకు నేల ద్వారా హెక్టారుకు 6 కిలోల రాగి అందించడం వల్ల దాని జీవలభ్యత పెరిగి దిగుబడి మెరుగుపడింది. అలాగే, విత్తిన 60–90 రోజుల్లో ఆకులపై 0.2% రాగిని పిచికారీ చేయటం వల్ల రాగి గ్రహణ శక్తి, దిగుబడి, ప్రొటీన్స్‌ గణనీయంగా పెరిగాయి. డా. సి.హెచ్‌. రామకృష్ణ బృందం హైదరాబాద్‌లో చేసిన పరిశోధన ఫలితాల ప్రకారం.. నేలకు హెక్టారుకు 25 కిలోల చొప్పున జింక్‌ సల్ఫేట్‌ను సిఫారసు చేసిన ఎరువులతోపాటు దుక్కిలో వేస్తే.. పచ్చిమేతలో అత్యధిక జింక్‌ సాంద్రత (41.4 పీపీఎం) నమోదైంది. అలాగే, విత్తిన 15, 30, 45, 60 రోజుల తర్వాత 1% అన్నభేదిని ఆకులపై పిచికారీ చేస్తే అత్యధిక ఇనుము సాంద్రత (155.3 పీపీఎం) నమోదైంది. 

అంతేకాకుండా, ఈ పద్ధతులు సైలేజ్‌ (పాతరగడ్డి)లోని పోషక విలువలను కూడా మెరుగుపరిచాయి. అందువల్ల, ఇటువంటి బయోఫోర్టిఫైడ్‌ పశుగ్రాసం లేదా సైలేజ్‌ను ఎక్కువ కాలం మేతగా ఇవ్వడం వల్ల గొర్రెలలో శరీర బరువు, సగటు రోజువారీ పెరుగుదల, రక్తంలోని ఖనిజాల స్థాయిలను మెరుగుపరచవచ్చని నిరూపితమైంది. ఈ విధానం వల్ల నేల సారం పెరిగి పశుగ్రాస దిగుబడి పెరగడమే కాకుండా, ఇటు పశువుల్లో అటు మనుషుల్లోనూ ఉన్న ఖనిజ లవణాల లోపాలను సరిదిద్దవచ్చని ఈ అధ్యయనం వెల్లడించింది.

జీవన ఎరువుల ప్రాముఖ్యత
రసాయన ఎరువులు మితిమీరి వాడకం వల్ల భూమి నిస్సారమవడమే కాకుండా, పశుగ్రాసంలో పోష­కాల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సవాలును ఎదుర్కోవడంలో మొక్కల పెరుగుదల ప్రోత్సహించే అజోటోబాక్టర్, అజోస్పిరిలియం వంటి జాతుల జీవన ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. జీవసంబంధమైన నత్రజని స్థిరీకరణ, ఫాస్ఫేట్‌ కరిగింపు, ఫైటో హార్మోన్ల ఉత్పత్తి వంటి చర్యల ద్వారా పోషకాల లభ్యతను పెంచుతాయి. ఇవి జీవసంబంధంగా నత్రజనిని స్థిరీకరించడం ద్వారా పంటల నాణ్యతను, దిగుబడిని మెరుగుపరుస్తాయి. ఈ సుస్థిర పద్ధతులను అవలంబించడం వల్ల నేల సారాన్ని కాపాడుకుంటూనే పశుపోషణను లాభసాటిగా మార్చుకోవచ్చు.

గణనీయమైన మార్పు.. 
సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కూడిన బయోఫోర్టిఫికేషన్‌ వ్యూహాల అమలు ద్వారా దేశ పశుపోషణ రంగంతోపాటు, ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చు. అయితే, పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్‌ ద్వారా మేత పోషక విలువను పెంచే పద్ధతి అమలుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. నేలలోని పోషక అసమతుల్యతలు, ఉదాహరణకు అధిక ఫాస్ఫరస్‌ స్థా్థయిలు జింక్‌ శోషణను నిరోధించడం వంటివి మొక్కల పోషక గ్రహణ శక్తిని దెబ్బతీస్తున్నాయి. 

వేడిగాలులు, కరువులు, వర్షపాతంలో ఒడిదుడుకులు వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు పంట పెరుగుదలను, పోషకాల గ్రహణను నిరోధిస్తాయి. ఆర్థిక, సామాజిక అంశాలు కూడా ఈ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి. సూక్ష్మపోషక ఎరువులు, అధునాతన సాంకేతికతలతో కూడిన ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న రైతులు ఇటువంటి నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించలేక పోతున్నారు. పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్‌ పద్ధతులపై మరింత పరిశోధన జరగాలి. ఖర్చు–ప్రభావంపై దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరం. 
– డా. సి.హెచ్‌. రామకృష్ణ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (అగ్రానమీ), 
పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ (9491562536)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement