అతను–ఆమె
ఐవీఎఫ్
సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు కృత్రిమ గర్భధారణ నిజంగా ఒక వరమే. అయితే ఇందులోనూ అంతా పూర్తిగా సానుకూలంగానే జరుగుతుందని చెప్పడానికి లేదు. వందమంది దంపతులు ఐవీఎఫ్ ప్రక్రియకు వెళ్తే అందులో కేవలం 40% నుంచి 50% మందికే విజయావకాశాలు ఉంటాయి. కారణాలు తెలియని సంతాన లేమి ఉన్న దంపతుల్లో చాలామందికి ఈ ప్రక్రియ ఉపయోగపడకపోవచ్చు. అయితే ఇప్పటికి ఉన్న పరిజ్ఞానంతో దాదాపు సగం మంది దంపతులకు ఇది ఉపయోగపడుతుండటం నిజంగా శుభపరిణామమే. ఇప్పటివరకు సానుకూతలను మాత్రమే చూస్తూ వచ్చినవారికి ఇందులోనూ కొన్ని ప్రతికూలతలు ఉంటాయని చెప్పేందుకే ఈ కథనం.
ఐవీఎఫ్ అనుసరించిన అందరికీ గర్భం రావాలనీ లేదా గర్భం నిలవాలని లేదు. అనేక రకాల కారణాల వల్ల కొందరికి గర్భం నిలవకపోవచ్చు. కొందరిలో పిండం నాణ్యత సరిగా లేకపోయినా, గర్భాశయంలో లేదా ఎండోమెట్రియమ్ పొరలో ఏవైనా బయటకు తెలియని... లేదా బయటకు కనిపించని అత్యంత సూక్ష్మమైన సమస్యలేవైనా ఉంటే గర్భం రాకపోవచ్చు. అలాంటప్పుడు... రెండుమూడు సార్లు ఐవీఎఫ్ పద్ధతిలోనూ గర్భం రానప్పుడు అవసరాన్ని బట్టి దాత నుంచి స్వీకరించిన అండాలను లేదా శుక్రకణాలను లేదా పిండాన్ని తీసుకుని ప్రయత్నించవచ్చు. ఇలా దాత నుంచి అండాలనో లేదా శుక్రకణాలనో స్వీకరించాల్సి వస్తే ఆ విషయాన్ని తప్పనిసరిగా ఆ దంపతులకు వివరించి, వారి అంగీకారం ఉంటేనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే దంపతులు ఈ దశలోనూ నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. అప్పటికీ కుదరకపోతే సరోగసీ కోసం ప్రయత్నించవచ్చు.
ఎంబ్రియో ఫ్రీజింగ్: ఐవీఎఫ్ ప్రక్రియలో ఫలదీకరించి రూపొందిన పిండాల సంఖ్యను బట్టి, ఒకసారి ఒకటి లేదా రెండు పిండాలను గర్భాశయంలోకి పంపి, మిగతా వాటిని ‘విట్రిఫికేషన్’ అనే పద్ధతి ద్వారా ఫ్రీజ్ చేసి భద్రపరుస్తారు. ఇలా భద్రపరచడాన్ని ‘క్రయోప్రిజర్వేషన్’ అంటారు. ఐవీఎఫ్ ప్రక్రియ మొదటిసారి సఫలం కానప్పుడు, అలా భద్రపరచిన పిండాలను తీసుకొని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. లేదా ఇంకొకసారి గర్భం దాల్చాలనుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. పరిశోధనలకు ఇవ్వవచ్చు. లేదా వాటిని నిర్జీవపరచమని కోరవచ్చు. వీటిలో ఏది జరగాలన్నా దంపతుల పూర్తి అనుమతితో మాత్రమే చేయాలి.
ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (ఎఫ్ఈటీ): ఐవీఎఫ్ నిర్వహించాక పిండాలు ఏర్పడిన 3వ రోజు నుంచి 5వ రోజు లోపు వాటిని గర్భాశయంలోకి పంపుతారు. ఏవైనా కారణాలతో ఆ నెలలో గర్భం నిలవకపోతే, ముందుగా ఫ్రీజ్ చేసి ఉంచుకున్న ఎంబ్రియోను మరుసటి నెలలో పంపుతారు. దీనికంటే ముందు గర్భాశయపొర (ఎండోమెట్రియమ్) బాగా ఏర్పడటానికి మందులు ఇచ్చి, ఈ ప్రక్రియనంతా స్కానింగ్లో పర్యవేక్షిస్తూ, గర్భాశయంలోకి ఎంబ్రియోను పంపుతుంటారు. కొంతమందిలో ఐవీఎఫ్ చేసిన నెలలో హార్మోన్స్ సరిగా లేకపోయినా, గర్భాశయపొర సరిగా ఏర్పడకపోయినా, పిండాలను ఫ్రీజ్ చేసి, మళ్లీ ఆ తర్వాతి నెలలో గర్భాశయం లోపలికి పంపుతారు. అంటే.... ఫ్రోజెన్ ఎంబ్రియోను ట్రాన్స్ఫర్ చేస్తారు.
ఐవీఎఫ్ – కాంప్లికేషన్లు..
ముందుగా చెప్పుకున్నట్టుగా ఐవీఎఫ్ పూర్తిగా సానుకూలంగానే జరిగే ప్రక్రియ కాదు. కొన్ని కొన్ని దుష్ఫలితాలూ కనిపించవచ్చు. ఔషధం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ లాగే వాటిని చూడాల్సి ఉంటుంది. వాస్తవంగా సంతానం పొందే అంశంతో పోలిస్తే ఇవి అంత పెద్దవి కావని గ్రహించాలి. ఆ కాంప్లికేషన్లు చూద్దాం.
→ ఐవీఎఫ్ ప్రక్రియ కోసం వాడే మందుల వల్ల కొందరిలో కొన్నిసార్లు వారి వారి శరీర తత్వాలను బట్టి తలనొప్పి, వికారం, చిరాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
→ అండాలను బయటకు తీసేటప్పుడు కొందరిలో బ్లీడింగ్ కనిపించవచ్చు. కొందరిలో పేగులకు, మూత్రాశయానికి, రక్తనాళాలకు ఇన్ఫెక్షన్స్ రావచ్చు.
→ ఐవీఎఫ్లో కొందరిలో ఒక్కోసారి కవలపిల్లలు, ముగ్గురు పిల్లలు (ట్రిప్లెట్స్) కూడా పుట్టే అవకాశాలుంటాయి. ఈ కారణంగా కొందరిలో నెలలు నిండకుండానే కాన్పులు అవడం, పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండటం వంటి పరిణామాలూ కనిపించవచ్చు. అయితే ఒకే ఒక పిండాన్ని ప్రవేశపెట్టడం (సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్) ద్వారా కవలలు, ట్రిప్లెట్స్ పుట్టడాన్ని చాలావరకు నివారించవచ్చు.
ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్: కొందరిలో ఒక్కొక్కసారి శరీరతత్వాన్ని బట్టి మరీ ఎక్కువ అండాలు తయారై, వాటి విడుదలకు వాడే హెచ్సీజీ అనే ఇంజెక్షన్ వల్ల అండాశయాల వాపు, కడుపులోకి నీరు చేరడం, కడుపులో నొప్పి, వాంతుల వంటి దుష్ఫరిణామాలు కనిపించవచ్చు. మరికొందరిలో కడుపుబ్బరం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల తీవ్రమైన ఆయాసం వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. అయితే ఇటీవల డాక్టర్లు పాటించే కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని వ్యూహాత్మకమైన చర్యల ద్వారా ఈ దుష్ప్రభావాలను (కాంప్లికేషన్లను) పూర్తిగా నివారించవచ్చు. ప్రస్తుతమున్న సాంకేతికతతో ఈ కాంప్లికేషన్లను చాలావరకు తగ్గించడం సాధ్యమే.
గర్భాశయంలో కాకుండా ట్యూబుల్లో పిండం పెరగడం (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) : కొందరిలో ఐవీఎఫ్ ప్రక్రియలో భాగంగా గర్భాశయంలోకి పంపించిన పిండం కొద్దిగా ముందుకు వెళ్లి, ట్యూబ్లో అంటుకొని, అక్కడే పిండం పెరుగుదల జరిగే అవకాశాలూ ఉంటాయి.
గర్భస్రావాలు: ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినవాళ్లలో మొదటి మూడు నెలలలప్పడు (మొదటి ట్రైమిస్టర్లో) గర్భస్రావం (అబార్షన్) జరిగేందుకు అవకాశాలెక్కువ. ఈ పరిణామం జరగడానికి సాధారణ గర్భం దాల్చినవాళ్లలోనూ అవకాశమున్నప్పటికీ... సాధారణంగా మహిళకు కొంచెం ఎక్కువ వయసు ఉన్నప్పుడు, పిండం నాణ్యత సరిగా లేనప్పుడు ఇలాంటి అబార్షన్లకు అవకాశాలు కాస్త ఎక్కువ.
మానసిక ఒత్తిడి: ఐవీఎఫ్ ప్రక్రియ కాస్త డబ్బు ఖర్చు, మానసిక ఒత్తిడితో కూడుకున్న ప్రక్రియ. ఓపిక కూడా చాలా అవసరం. ఒకపక్క డబ్బు పెట్టుకుంటూనే, సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఓపిగ్గా తిరుగుతూ కాస్త ఎక్కువ సమయాన్నే ఇందుకోసం వెచ్చించాలి. ఇంత చేశాక కూడా గర్భం తప్పక నిలుస్తుందన్న గ్యారంటీ ఉండదు కాబట్టి ఈ కారణాలతో కాబోయే దంపతుల్లో... ముఖ్యంగా తల్లికావాలని కోరుకుంటున్న మహిళకు ఆందోళన, టెన్షన్, కొన్ని సమయాల్లో డిప్రెషన్ వంటివి కలిగే అవకాశాలుంటాయని గుర్తుంచుకోవాలి.
గర్భాశయ దానం
అన్ని దానాలలోకెల్లా గొప్పదేది అని అడిగితే అన్నదానం, నేత్రదానం, రక్తదానం అని చెప్పడం మనం తరచూ వింటూ ఉంటాం. కాని పిల్లల్ని కనాలని కలలుగని, కనలేకపోతున్నామని వ్యధ చెందే మహిళలకి మాత్రం గర్భాశయ దానం అన్నింటికన్నా మిన్న. యునైటెడ్ కింగ్డమ్లో గ్రేస్ డేవిడ్సన్ అనే మహిళ అరుదైన వ్యాధి కారణంగా పుట్టుకతోనే గర్భాశయం లేకుండా పుట్టింది. అయితే గ్రేస్ తన ఆశని వదులుకోలేదు. తన జీవిత భాగస్వామి ఆంగస్తో కలిసి ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోలను రూపొందించి భద్రపరుచుకుంది.
పిల్లలంటే ఎంతో ఇష్టపడే గ్రేస్ పరిస్థితి చూసి ఆమె అక్క ఏమీ పర్డీ తన గర్భాశయాన్ని చెల్లెలికి దానం చేయాలని నిర్ణయించుకుంది. ఏమీ అప్పటికే ఇద్దరు పిల్లల తల్లి కావడంతో ప్రాసెస్కి ఎవరూ అడ్డు చెప్పలేదు. 2023లో ఆక్స్ఫర్డ్లో గంటల తరబడి సాగిన ఆపరేషన్లో డాక్టర్లు గ్రేస్కు గర్భాశయాన్ని విజయవంతంగా అమర్చారు. ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలో క్వీన్ చార్లెట్స్ అండ్ చెల్సియా హాస్పిటల్లో గ్రేస్ ఆడబిడ్డ(ఏమీ ఇసబెల్) కు జన్మనిచ్చింది. ఈ జననం యూకే వైద్యచరిత్రలో ఓ మైలురాయిలా నిలిచిపోయింది.
మరణించినా, మాతృత్వం బతికింది..
ఏడాది తిరగక ముందే ఇంగ్లాండ్కు చెందిన గ్రేస్ బెల్ అనే మహిళకి గ ర్భాశయం లేదు. అయితే మరణించిన ఓ మహిళ నుంచి గర్భాశయం సేకరించి ‘వూంబ్ ట్రాన్స్ప్లాంట్ యూకె ఎక్స్పెరిమెంట్’ కార్యక్రమం లో భాగంగా డాక్టర్లు ఆపరేషన్ చేసి గ్రేస్కి గర్భాశయాన్ని మార్పిడి చేశారు. మర ణించిన దాత నుంచి గర్భాశయాన్ని తీసి మార్పిడి చేయడం బ్రిటన్లో ఇదే తొలిసారి. ఆపరేషన్ జరిగిన కొద్దిరోజుల తర్వాత వైద్యులు ఫ్రీజ్ చేసి ఉంచిన ఎంబ్రియోల్లో ఒక దాన్ని గ్రేస్ గర్భాశయంలో ప్రవేశపెట్టగా ఆమె గర్భం దాల్చింది. 2025 డిసెంబర్ 12న గ్రేస్ బెల్ ఓ మగబిడ్డ(హ్యుగో రిచర్డ్ నార్మన్ పావెల్)కు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పిల్లల్ని కనే భాగ్యాన్ని విధి ఇవ్వకపోయినా, బిడ్డల్ని కనాలన్న సంకల్పం ఈ ఇద్దరు మహిళల్ని మాతృమూర్తులుగా మార్చింది.
డాక్టర్ పల్లవి చలసాని
సీనియర్ కన్సల్టెంట్
ఫెర్టిలిటీ స్పెషలిస్ట్


