ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థి తల్లి భావోద్వేగభరిత కామెంట్స్‌ | What Says Mother Of NEET Aspirant Who Died? | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థి తల్లి భావోద్వేగభరిత కామెంట్స్‌

Jul 26 2026 3:37 PM | Updated on Jul 26 2026 3:46 PM

What Says Mother Of NEET Aspirant Who Died?

నాగ్‌పూర్: నీట్ పేపర్ లీక్‌లపై దేశవ్యాప్తంగా భారీ నిరసనలు చెలరేగిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం (జులై 25న) రాజీనామా చేశారు. అయితే, దాంతో ఏమి సాధిస్తారని నీలమ్ చతుర్వేది అనే మహిళ ప్రశ్నించారు. ఆమె కూతురి పేరు ఆకాంక్ష చతుర్వేది. ఆమె 18 ఏళ్ల నీట్ అభ్యర్థి. ఈ ఏడాది నీట్ పరీక్ష రద్దు అయిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురై, మే 20న నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకుంది.

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో నీలమ్‌ చతుర్వేది మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకునే ఏ చర్యా తన కూతురిని తిరిగి తీసుకురాలేదని, అయినా ఆమెకు న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నానని చెప్పారు. పేపర్ లీక్ నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నామని, కానీ రాజీనామాతో బాధ్యత ముగిసిపోదని అన్నారు.

"ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మేము సంతృప్తి చెందలేదు. విద్యార్థుల నిరసనకు మా మద్దతు కొనసాగుతుంది. పేపర్ లీక్‌కు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించాలి" అని ఆమె డిమాండ్‌ చేశారు.

తండ్రికి రెండు సార్లు గుండెపోటు 
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆకాంక్ష.. నీట్ పరీక్షకు ప్రిపరేషన్‌ కోసం కుటుంబంతో కలిసి నాగ్‌పూర్‌కు వెళ్లింది. పరీక్ష సన్నద్ధత కోసం ఓ కోచింగ్ సంస్థలో చేరింది. మే 3న నీట్ పరీక్ష రాసిన ఆకాంక్ష, పరీక్ష బాగా జరిగిందని చెప్పిందని ఆమె తల్లి గుర్తుచేశారు. అయితే పరీక్ష రద్దు అయిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

"ఆకాంక్ష తండ్రికి ఇప్పటికే రెండు సార్లు గుండెపోటు వచ్చింది. ఆయనకు పక్షవాతం కూడా వచ్చింది. ఇప్పుడు మా బాధ్యత ఎవరు తీసుకుంటారు? నా కుమార్తె బతికి ఉంటే అన్నీ చూసుకునేది" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాంక్ష తన చేతిరాతతో రాసిన ఆత్మహత్య లేఖలో తాను ఎదుర్కొన్న తీవ్ర మానసిక భారాన్ని వివరించింది.

"అమ్మా, నాన్నా... మీ కుమార్తె బాగా చదివి డాక్టర్ అవుతుందని మీరు నమ్మారు. కానీ మరోసారి నీట్ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు. మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వస్తాయని నమ్మకం ఉండేది. ఇప్పుడు మళ్లీ అంతే బాగా రాస్తాననే నమ్మకం లేదు. అమ్మా, నాన్నా... నన్ను క్షమించండి. నేను అన్నీ నాశనం చేశాను" అని ఆమె లేఖలో రాసింది.

కుటుంబ సభ్యుల మాటల్లో, కుమార్తె చదువు కోసం ఆమె తండ్రి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్ది భూమిలో వ్యవసాయం చేస్తూనే, నాగ్‌పూర్‌లో వంటమనిషిగా పని చేసి కుటుంబ ఖర్చులు, కోచింగ్ ఫీజులు భరించారు.

ఆకాంక్ష మామ జగదీశ్ ప్రసాద్ చతుర్వేది మాట్లాడుతూ.. పరీక్ష రాసి ఇంటికి వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషంగా కనిపించిందన్నారు. మొదట 650కు పైగా మార్కులు వస్తాయని ధైర్యంగా చెప్పిన ఆమె, పేపర్ లీక్ విషయం తెలిసిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురై, తినడం తగ్గించి, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం మానేసిందని తెలిపారు. "ఇలా జరుగుతుందని మేమెప్పుడూ ఊహించలేదు" అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement