టీ20 ముంబై లీగ్లో భారత టీ20 ప్లేయర్ శివమ్ దూబే శివాలెత్తిపోయాడు. ఈ టోర్నీలో అంధేరి ఆర్క్స్కు సారథ్యం వహిస్తున్న అతడు.. ఆకాశ్ టైగర్స్తో ఇవాళ (జూన్ 11) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఫలితంగా అతడి జట్టు ఫైనల్కు దూసుకుపోయింది.
ఈ మ్యాచ్లో తొలుత బంతితో (3-0-16-1) రాణించిన దూబే.. ఆతర్వాత బ్యాటింగ్లో చెలరేగిపోయాడు. ప్రత్యర్ది నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. 26 బంతుల్లో ఓ బౌండరీ, 5 సిక్సర్లతో విరుచుకుపడి అజేయమైన 45 పరుగులు చేశాడు.
తద్వారా అతడి జట్టు మరో 9 బంతులు మిడిలుండగానే విజయతీరాలకు చేరింది. లక్ష్య ఛేదనలో దూబేకు దివ్యాంశ్ సక్సేనా (34), ప్రసాద్ పవార్ (26), గౌరవ్ జాథర్ (11 నాటౌట్) సహకరించారు. ఈ జట్టు స్టార్ ఆటగాళ్లు ముషీర్ ఖాన్ (0), అర్జున్ టెండూల్కర్ (13) ఈ మ్యాచ్లో నిరాశపరిచారు.
అంతకుముందు ఆకాశ్ టైగర్స్ తరఫున ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ (34), జయ్ గోకుల్ బిస్తా (35) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును తాకలేదు. అంధేరి బౌలర్లలో అశుతోష్ 2 వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, ముషీర్ ఖాన్, శివమ్ దూబే, ప్రసూన్ సింగ్, అజయ్ మిశ్రా తలో వికెట్ తీశారు.


