రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది సినిమా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతుంటే..మరోవైపు జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు కూడా పెద్దిలో జాన్వీ కపూర్ని చూపించిన తీరును తప్పుపడుతున్నారు.
(చదవండి: 'మీ రాకా కోసం ఎదురు చూస్తున్నా..' బన్నీకి పెద్ది రిప్లై)
ఇప్పటికే జయాబచ్చన్, నిత్యామీనన్, అదా శర్మ లాంటి వాళ్లు దీనిపై రియాక్ట్ అయ్యారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా పెద్ది వివాదంపై స్పందించింది. తన కొత్త సినిమా ‘భారత్ భాగ్య విధాత’సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. ‘సెట్లో ఏదైనా సీన్ హీరోయిన్లకు ఇబ్బందిగా అనిపిస్తే, వెంటనే చెప్పాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది' అని ఆమె అభిప్రాయపడింది.
‘నేను చూసినంతవరకు సినిమాల్లో హీరోయిన్లను ఒక వస్తువుగా చూపించాలని ఏ డైరెక్టర్ అనుకోడు. కొన్నిసార్లు వాళ్లకు తెలియకుండానే అలా జరిగిపోతుంది. కొంతమంది మగాళ్లు నాలుగు గోడల మధ్యే కూర్చొని కథను రాసుకుంటారు. వాళ్లకు ఆడవాళ్ల కోణం అర్థం కాదు. రాసిన సీన్ అసభ్యకరంగా ఉంటుందని వాళ్లు గ్రహించలేరు. కాబట్టి, ఒక మహిళగా మీరు మీ దృక్కోణాన్ని పంచుకుంటూ, 'అవును, మాకు ఇలాగే అనిపిస్తోంది,' లేదా 'ఇది చూడటానికి బాగోలేదు' అని చెప్పవచ్చు. చాలా వరకు, వారు మీతో ఏకీభవిస్తారు. అంతేకానీ దర్శకుడు చెప్పింది చేసుకుంటూ పోతే.. మనం కూడా దానికి అంగీకరించినట్లే అవుతుంది’ అని హీరోయిన్లకు కంగనా సలహా ఇచ్చింది.


