ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి రేపిన ఎయిరిండియా ప్రమాదం జరిగిన ఏడాది గడిచినా ఆ విషాదం అందరి గుండెల్లోనూ ఇంకా పచ్చిగానే ఉంది. ఆప్తులను కోల్పోయిన గుండెకోతను ఒక్కో కుటుంబంజీవితకాలం మోయాల్సి రావడం అత్యంత విషాదకరం. అయితే ఈ ప్రమాదంనుంచి బతికి బట్టకట్టిన ఒకే ఒక్కడు విశ్వాస్కుమార్ రమేష్ (Vishwash Kumar Ramesh) ఇపుడు ఆయన ఆరోగ్య, మానసిక పరిస్థితి ఎంటి? ఎలా ఉన్నారు?
ప్రమాద స్థలం నుండి 12 మంది సిబ్బందితో సహా 241 మందిలో టీ-షర్ట్పై రక్తపు మరకలతో, చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని నడుచుకుంటూ వచ్చిన మృత్యుంజయుడు రమేష్. అంతటి విషాదంలోనూ అనూహ్యంగా మృత్యుముఖంనుంచి బైటపడిన రమేష్ చిత్రాలు అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా వైరలయ్యాయి. ఈ ప్రమాదం జరిగి ఏడాది పూర్తైనా తానింకా పూర్తిగా నిద్రపోలేక పోతున్నానని, తీవ్రమైన ఆందోళన (యాంగ్జైటీ) ఆనాటి చేదు జ్ఞాపకాలతో నరకం అనుభవిస్తున్నాను అంటూ విశ్వాస్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
బతికే ఉన్నా.. కానీ
ప్రస్తుతం యూకేలోని లెస్టర్ (Leicester) లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న 39 ఏళ్ల రమేష్, ఈ ప్రమాదంలో తన సోదరుడు అజయ్ను కోల్పోయారు. ఈ విపత్తు ఒక వ్యక్తిగా తనను పూర్తిగా మార్చేసిందని ఆయన చెప్పారు. "నేను ప్రాణాలతో బయటపడ్డానని అనుకుంటున్నారు కానీ మూసి ఉన్న తలుపుల వెనుక నేను అనుభవిస్తున్న బాధ ఎవరికి తెలియదు. నేను బతికున్నందుకు గ్రేటే. కానీ బతికి ఉన్నాను అన్నది కథలో ఒక భాగం మాత్రమే. ఆ తర్వాత అనుభవిస్తున్న నరకాన్ని మాటల్లో చెప్పలేను. శారీరకంగా, మానసికంగా , ఆర్థికంగా బాధపడుతూనే ఉన్నాను" అని రమేష్ పేర్కొన్నారు.
"సోదరుడిని కోల్పోవడం, తీవ్రమైన మానసిక గాయాలు, అసలు ఇది ఎలా, ఎందుకు జరిగిందనే దానిపై నిరంతరం వేధించే సమాధానం లేని ప్రశ్నలతో జీవిస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆవేదన బాధితులైన ప్రతి కుటుంబాల్లోనూ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రజలకు నిజాయితీ, నిష్పాక్షికమైన సమాధానాలు అవసరం. జరిగిన దాన్ని మార్చలేం, కానీ బాధిత కుటుంబాలకు సమాధానం తెలియాలి. న్యాయం జరగాలి’’ అని డిమాండ్ చేశారు.
భయం గుప్పిట్లో జీవితం
రమేష్ కుటుంబ సలహాదారు, లెస్టర్కు చెందిన కమ్యూనిటీ లీడర్ సంజీవ్ పటేల్ రమేష్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అతను ప్రస్తుతం ఎవరి సాయం లేకుండా గడద దాటి బైటికి రాలేకపోతున్నాడు. అతను తీవ్రమైన మానసిక గాయానికి (ట్రామా) గురయ్యాడు. బహుశా ఆ గాయాల గుర్తులు అతని జీవితాంతం ఉండిపోవచ్చు అని చెప్పారు. ఈ ప్రమాదానికి గురైన ప్రతి కుటుంబం నరకాన్ని అనుభవిస్తోంది. కానీ విశ్వాస్, అతని కుటుంబానికి జరిగిన నష్టం ఊహించలే నిదన్నారు.
ఇదీ చదవండి: కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ!
ఆ 32 సెకన్లలో ఏం జరిగింది?
గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లడానికి బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ (విమానం) టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లకే, అక్కడే మెడికల్ కాలేజీ హాస్టల్ మరియు క్యాంటీన్ భవనాన్ని బలంగా ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో విమానంలో ఉన్న 12 మంది సిబ్బందితో సహా 241 మంది ప్రయాణికులు కాగా, విమానం పడిన భవనంలో మరో 19 మంది ఉన్నారు.
ఇదీ చదవండి : 90 నిమిషాల్లో రూ. 30 కోట్లు : ఈ లెక్కలతో మతిపోవాల్సిందే!


