కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. దీంతో, మమతకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.
కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మార్చి 9వ తేదీన కోల్కతాలోని ఎస్ప్లనేడ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని పురిగొల్పేలా ప్రసంగించారంటూ వచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్లో జీరో–ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఆ కేసును ఎస్ప్లనేడ్ పరిధిలోని హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దేశ సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మమత వ్యాఖ్యలు చేశారంటూ సిలిగురిలోని సైబర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.
తుషార్ కాంతి దాస్ అనే వ్యక్తి జూన్ 5న నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, తృణమూల్ కాంగ్రెస్ ఈ కేసును రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించింది. మమతా బెనర్జీపై ఇటీవల నమోదైన పలు ఫిర్యాదుల్లో ఇది మరో కేసుగా మారింది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.


