ఢిల్లీ: ఆరేళ్ల క్రితం ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)) ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురైన కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్కు శిక్ష ఖరారు చేసింది ఢిల్లీ కోర్టు. ఇప్పటికే ఈ కేసులో తాహీర్ హుస్సేన్ దోషిగా తేల్చిన కోర్టు.. జీవిత ఖైదును శిక్షగా ఖరారు చేసింది.
ఈ కేసులో ఐదుగుర్ని దోషులుగా తేల్చిన కోర్టు.. తాజాగా వారికి జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు కోర్టు అదనపు సెషన్స్ జడ్జి (ASJ) ప్రవీణ్ సింగ్, మరణశిక్ష విధించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను తిరస్కరించి జీవితఖైదు విధించారు.
కాగా, 2020, ఫిబ్రవరి 25వ తేదీన సీఏఏ అల్లర్ల సమయంలో ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని చాంద్బాగ్ ప్రాంతంలోని ఓ డ్రైనేజీలో పడేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఆ రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అంకిత్ శర్మ ఇక తిరిగి రాలేదు. ఆ రోజు అప్పుడే ఇంటికి వచ్చిన అంకిత్ శర్మ.. అల్లరి మూకలు స్థానికంగా రెచ్చిపోవడం గమనించారు. దాంతో బయటకు వెళ్లి వారిని సద్దుమణిచే యత్నం చేశారు. అలా ఆప్ కౌన్సిలర్గా ఉన్న హుస్సేన్ ఇంటికి వెళ్లిన అంకిత్ శర్మ హత్యకు గురయ్యారు.
ఆ సమయంలో అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేసి డ్రెయిన్లో పడేశారు. తన కొడుకు ఎంతకీ ఇంటికీ రాకపోయే సరికి ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు తండ్రి రవీందర్ కుమార్. దాంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. ఓ యువకుని మృతదేహం డ్రెయిన్లో ఉన్న విషయం గమనించడంతో అతను అంకిత్ శర్మగా నిర్దారణ అయ్యింది. దీనిపై హుస్సేన్తో పాటు 11 మందిపై కేసు నమోదైంది. అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేశారు. విచారణలో అంకిత్ శర్మ 51 కత్తిపోట్లకు గురైనట్లు తేలింది.
2023. మార్చిలో , అల్లర్లు, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం, హత్య, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు సంబంధించి హుస్సేన్తో సహా 11 మంది నిందితులపై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఆ సమయంలో తన గ్రూపును హుస్సేన్ రెచ్చగొట్టారనే ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు సమర్ధించడంతో వారికి జైలు శిక్ష పడింది.
తన బెయిల్కు చేసుకున్న అభ్యర్థనను కూడా అంతకుముందు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. హుస్సేన్పై అభియోగాలు తీవ్రంగా ఉండటంతో బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. గత తీర్పులో వారిని దోషులుగా తేల్చగా, తాజాగా వారికి శిక్షలు ఖరారు చేసింది.


