సాక్షి,బెంగళూరు: కావేరీ నదీ జలాల వివాదం నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో జరగాల్సిన చర్చలను కర్ణాటక రద్దు చేసుకుంది. ఈ క్రమంలో తమిళనాడు సీఎం విజయ్, ఆయన బృందం ఇప్పుడు కర్ణాటకకు రావడం అంత మంచిది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ కర్ణాటక పర్యటనను వాయిదా వేసుకోవాల్సిందిగా తాము తమిళనాడు ప్రభుత్వానికి సలహా ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు సీఎం విజయ్ ఇక్కడికి వస్తే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 12న కర్ణాటక వ్యాప్తంగా బంద్కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి.
ఈ వివాదం ప్రభావం సినిమాలపైనా పడింది. కర్ణాటకలో తమిళనాడు సీఎం విజయ్ నటించిన తాజా చిత్రం ‘జనగాయన్’ ప్రదర్శనను థియేటర్లలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లపై కన్నడ సంఘాలు దాడులు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


