సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే నటుడు విజయ్ సీఎంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ తనదైన మార్కు చూపిస్తూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగా, ఇప్పుడు తమిళ సినీ రంగంలో మరో స్టార్ హీరో ధనుష్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ప్రచారం జోరందుకుంది.
తమిళనాడు వ్యాప్తంగా తన అభిమాన సంఘాలకు ప్రత్యేకమైన జెండా,చిహా్నలను (తెలుపు, ఎరుపు రంగు నక్షత్రం) కేటాయించడం, జిల్లాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. 2031 నాటికి ధనుష్ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమం మారింది.
ధనుష్ వ్యాఖ్యల చర్చ
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పరిధిలో నిర్వహించిన నిధుల సేకరణ, రక్తదాన శిబిరం , విద్యా సహాయ వితరణ కార్యక్రమంలో నటుడు ధనుష్ పాల్గొని అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. 2002 నుంచి 24 సంవత్సరాలుగా తనకు అండగా నిలిచారని అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.అభిమానులు తనకు విస్తృతమైన కుటుంబం. జీవితంలో ఎవరు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో చెప్పలేం, అందుకే మానసికంగా, శారీరకంగా బలంగా ఉండండి అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అభిమానులకు పలు ఉపదేశాలు ఇస్తూనే ఆయన జాతీయ అవార్డుల గురించి స్పందించి ఉండటం తాజాగా చర్చకు దారి తీసింది. కాగా, ధనుష్ చూపిన బాటలోనే నడుస్తామని, తమ నాయకుడు ధనుష్ చెప్పినట్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నామని, ఆయన మార్గదర్శకత్వంలో తమిళనాడు అంతటా పర్యటించి, ప్రజలకు సేవ చేస్తామని, . 2031 నాటికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడులో మంచి మార్పు తీసుకువస్తారని ఆశిస్తున్నామని అభిమానులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.


