ఢిల్లీలో జరిగిన భేటీలో కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్రెడ్డి, మీనాక్షి, మహేశ్గౌడ్ తదితరులు
ప్రభుత్వం, పార్టీ మధ్య కలహాలు పెరిగినట్లు నివేదికలొచ్చాయి..
మంత్రులు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు..
ఎమ్మెల్యేలపై వారికి దృష్టి లేదు
సమన్వయం చేసుకోకుంటే మేమే రంగంలోకి దిగుతాం..
పార్టీలో సమన్వయ లోపాలను సరిదిద్దేలా చర్యలకు మీనాక్షికి ఆదేశం
రేపు ఢిల్లీలో పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం
సీఎం, పీసీసీ చీఫ్, ఇన్చార్జీల భేటీలో కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలు, అంతర్గత పోరుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కొరవడటం.. జిల్లాల్లో మంత్రుల ఏకఛత్రాధిపత్యం.. ఎమ్మెల్యేల నియోజకవర్గాల స్థాయి అభివృధ్ధి పనుల్లో జాప్యంపై వరుసగా వస్తున్న ఫిర్యాదులపై రాష్ట్ర నాయకత్వాన్ని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. కొన్ని నెలలుగా జిల్లాల స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలించిన కాంగ్రెస్ హైకమాండ్, ప్రభుత్వం–పార్టీ మధ్య సమన్వయం గాడి తప్పుతోందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జితో జరిగిన సమావేశంలో పార్టీ వ్యవహారాలపై స్పష్టమైన హెచ్చరికలు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
అందరిదీ సొంత అజెండానే..
రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి, సంస్థాగత వ్యవహారాల, ఎస్ఐఆర్ కొనసాగుతున్న తీరుపై రెండు గంటలపాటు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి తెప్పించుకున్న నివేదికలు, ఇంచార్జీలు ఇచ్చిన నివేదికలపై అధిష్టాన పెద్దలు సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ శ్రేణులకు చేరడం లేదని, పార్టీ నుంచి వచ్చే అభిప్రాయాలు ప్రభుత్వానికి వెళ్లడం లేదని, మంత్రులు–ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడిందని వచ్చిన నివేదికలపై గట్టిగానే చర్చ జరిగినట్లు సమాచారం.
చాలామంది మంత్రులు తమ తమ శాఖలు, నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని, జిల్లాల వారీగా పార్టీని సమన్వయం చేసే బాధ్యత కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని పార్టీ పెద్దలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రులు సొంత నియోజకవర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, నిధుల కేటాయింపుల్లోనూ వారికి ప్రాధాన్యమిచ్చుకుంటూ జిల్లా ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు అందాయని రాష్ట్ర నేతల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. మంత్రుల స్థాయిలోనూ, కార్పొరేషన్ పదవుల్లో ఉన్న నేతలు తమ సొంత అజెండా, సొంత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నాలు తప్ప, పార్టీ ఇమేజ్కు పెద్దగా దోహదం చేయడం లేదన్న అంశంపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగానే ఎస్ఐఆర్ ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల భాగస్వామ్యం కొరవడిందన్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.
షబ్బీర్..సామేల్..డీసీసీల వ్యవహారాలపై ప్రశ్నలు
తమకు అందించిన నివేదికల్లోని అంశాలను ప్రస్తావిస్తూ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతల నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. ముఖ్యంగా యాదాద్రి దేవస్థాన పాలకమండలి ఎంపికలో జిల్లా నేతల అభిప్రాయాలను కోరకపోవడం, జిల్లా నేతలను విస్మరించారని ఫిర్యాదులు రావడం, పీసీసీని లక్ష్యంగా చేసుకుంటూ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యలు చేయడం, యూత్ కాంగ్రెస్ నేత వ్యవహారంలో జరిగిన వివాదం, ఇటీవల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చుట్టూ జరిగిన పరిణామాలు, ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రంగా స్పందించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. మండల కమిటీల ఏర్పాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న ఆరోపణలతో అనేక జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా మాట్లాడినట్లు తెలిసింది. అభివృద్ధి నిధుల కేటాయింపు, అధికార యంత్రాంగం స్పందన, స్థానిక సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేల సూచనలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాలపైనా అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం.
రంగంలోకి హైకమాండ్
రాష్ట్ర పరిస్థితిని గాడిన పెట్టేందుకు హైకమాండ్ రంగంలోకి దింగింది. పార్టీ సమన్వయాన్ని కాపాడే క్రమంలో మొదటి అడుగుగా బుధవారం ఢిల్లీలో పార్టీ పీసీసీ సమన్వయ కమిటీ భేటీని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతోపాటే.. మీనాక్షికి పార్టీ–ప్రభుత్వ సమన్వయాన్ని బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహించడం, విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించడం, బహిరంగ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోమని స్పష్టమైన కేతాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ నేతల విషయంలో అవసరమైతే హైకమాండ్ నేరుగా జోక్యం చేసుకుంటుందని, ఏఐసీసీ పరిశీలకులను పంపి అవసరమైన చర్యలకు దిగుతామనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.


