సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 15 (పంద్రాగస్టు) నుంచి రెండున్నర లక్షల కొత్త పింఛన్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ముందుగా ప్రథమ ప్రాధాన్యత కింద ఒంటరి మహిళలు, వితంతువులకు ఇస్తామన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వపరంగా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు.
ఇటీవల మహబూబాబాద్లో కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నట్టు మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సీతక్క స్పందిస్తూ.. కొత్తపింఛన్లు ఇచ్చేందుకు శాఖాపరంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే.. బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు సంబంధించిన కార్యకలాపాలు, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పథకాల పురోగతి తదితరాలపై సీఎం రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ జలసిరి కార్యక్రమం, వీబీజీ రామ్జీ అమలు తీరు, చేయూత పింఛ న్ల పథకం తీరుతెన్నులను పరిశీలించనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.


