లీకుల వెనుక లింకేంటి?
ర్యాంకులు వస్తున్న వాళ్లఅకడమిక్ నేపథ్యం ఏమిటి?
మెటీరియల్, ఆన్లైన్వ్యవహారంపై కూడా ఆరా
అన్ని వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు కోచింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. ఆ కేంద్రాల సమగ్ర వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రాల నుంచీ నివేదికలు కోరింది. ముఖ్యంగా నీట్, జేఈఈ కోచింగ్ కేంద్రాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం జాతీయ స్థాయిలో కుదిపేయడంతో లీక్పై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ మొదలు పెట్టాయి. ఈ క్రమంలో కోచింగ్ కేంద్రాల పాత్ర ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా వర్గాలు ఇచ్చిన ఈ సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మూలాల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని భావిస్తునట్టు తెలుస్తోంది. కేంద్రం కోరిన వివరాల సేకరణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్రానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారం సేకరించామని, మరింత లోతుగా వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పారు.
రూ. 62 వేల కోట్ల వ్యాపారం..
దేశవ్యాప్తంగా 7 కోట్లకుపైగా విద్యార్థులు ఏదో రకమైన కోచింగ్ తీసుకుంటున్నారు. ఇందులో ఒకటవ తరగతి నుంచి పోస్టు–గ్రాడ్యుయేషన్, నీట్, జేఈఈ వంటి ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు కోచింగ్ తీసుకునే వాళ్లున్నారు. కొన్ని సంస్థలు ఆన్లైన్లో, మరికొన్ని ఆఫ్లైన్లో కోచింగ్ వ్యాపారం చేస్తున్నాయి. వీటి వ్యాపారం రూ. 62 వేల కోట్ల వరకూ ఉంటుందని కేంద్రం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. మరో రెండేళ్లలో ఈ వ్యాపార సామ్రాజ్యం రెండింతలు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా పలు రాష్ట్రాల బోర్డ్ పరీక్షలకు, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ కేంద్రాలే కీలకం. వీటితో పాటు వృత్తిపరమైన సీఏ, సీఎస్, క్యాట్, గేట్కూ కోచింగ్ షరామామూలే. యూపీఎస్సీ, రైల్వే, బ్యాకింగ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు కోచింగ్ కేంద్రాలే శరణ్యం. ఈ నేపథ్యంలో కోచింగ్ కేంద్రాల మధ్య విపరీతమైన పోటీ వాతావరణం నెలకొంటోంది.
లీకుల వెనుక లాలూచీ..: కోచింగ్ కేంద్రాలకు విద్యార్థుల ర్యాంకులే పెద్ద ప్రచార సాధనం. ఈ పబ్లిసిటీ కోసం అవి ఎంత దూరమైనా వెళ్తున్నాయనేది నిఘా వర్గాల సమాచారం. ఈ క్రమంలో పరీక్ష విధానంలో కీలక భూమిక పోషిస్తున్న ప్రభుత్వ సంస్థల్లోని వారిని లోబర్చుకుంటున్నాయి. వారి ద్వారానే పేపర్ లీక్లకు తెర తీస్తున్నాయి. ఇండియాటుడే గత ఏడాది నిర్వహించిన సర్వే ప్రకారం 2019 నుంచి 2024 వరకూ 19 రాష్ట్రాల్లో 65 ప్రధాన పరీక్షల్లో పేపర్ లీక్ అయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రతి ఘటన వెనుక కోచింగ్ కేంద్రాల ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా నిర్థారించాయి. పూర్తి స్థాయి విచారణలో మాత్రం సాక్ష్యాలను తారుమారు చేయడంలో, కీలక సాక్ష్యాలు దర్యాప్తు సంస్థల చేతికి అందకుండా చేయడంలో కోచింగ్ కేంద్రాలు విజయం సాధిస్తున్నాయి.ఫలితంగానే దర్యాప్తు ముందుకు కదలడం లేదు.
పూర్వాపరాలే ఆధారమా?
రాష్ట్రాలను కేంద్రం పలు అంశాలపైవివరాలు కోరింది. కోచింగ్ కేంద్రాల్లో చేరుతున్నవాళ్ల డేటాను విశ్లేషించాలని సూచించింది. ఎంతమంది చేరుతున్నారు? ఎంత చెల్లిస్తున్నారు? వాళ్లు ఏయే ర్యాంకులు సాధిస్తున్నారు? పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన సంవత్సరాల్లో ప్రధాన ర్యాంకులు పొందిన వారి వివరాలు ఏమిటి? వాళ్ల అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే వివరాలు కోరింది.
దీనిద్వారా అకడమిక్గా మార్కులు తక్కువ వచ్చినా, కోచింగ్ ద్వారా ర్యాంకులు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేయాలనేది కేంద్రం ఆలోచన. దీంతోపాటు కోచింగ్ కేంద్రాల యజమానుల ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెడుతున్నారు. ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని కోట్లు సంపాదించారనేది తెలుసుకుంటారు. దీంతో పాటు సర్వర్ల ద్వారా పరీక్ష సమయంలో కోచింగ్ కేంద్రాలు పంపిన సందేశాలు.. పత్రాలను విశ్లేషించాలని కేంద్రం సూచిస్తోంది. మరోవైపు కోచింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, వాళ్ల నేపథ్యంపై కూడా వివరాలు కోరింది.


