ల్యాండ్‌ మాఫియా తప్పుదోవ పట్టిస్తోంది | Ranganath comments on high court verdict: Telangana | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ మాఫియా తప్పుదోవ పట్టిస్తోంది

Jul 28 2026 1:21 AM | Updated on Jul 28 2026 1:21 AM

Ranganath comments on high court verdict: Telangana

కోర్టు ధిక్కార కేసులన్నీ వాళ్లు దాఖలు చేసినవే

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: లోతుకుంట భూముల కేసులో హైకోర్టు తీర్పు నేపథ్యంలో సోమవారం హైడ్రా కమిషనర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.  ‘హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగ స్ఫూర్తిననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, 48 (ఏ) ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షిస్తున్నా. మార్కెట్లో వీటి విలువ రూ.1.50 లక్షల కోట్లు (17 బిలియన్‌ డాలర్లు). ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా ఈ రెండేళ్లల్లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీగా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం. ల్యాండ్‌ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పు దోవ పట్టిస్తున్నారు. 

అంతా బడా భూ కబ్జాదారులే..
లోతుకుంట భూమి విషయంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన భూమిని శాంతా శ్రీరామ్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కాజేయాలని చూసింది. అనుమతులు లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్‌ గుట్టలను బ్లాస్టింగ్‌ చేస్తూ వందల చెట్లను నరికేసింది. సేవ్‌ ది రాక్స్‌ సొసైటీ, పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల ఉందని చెబుతూ లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డర్‌ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద ధిక్కరణ కేసు వేశారు. నా మీద 63 ధిక్కరణ కేసులు ఉన్నాయి.

వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో రూ.వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్‌లు కట్టాలని చూస్తున్న సంధ్యా శ్రీధర్‌రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లారెడ్డి, క్రిమినల్‌ మాఫియాగా చలామణి అవుతూ రూ.వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ అడ్డు పడటమే హైడ్రా కమిషనర్‌గా నేను చేసిన తప్పు.

కోర్టుల పట్ల నమ్మకం, చట్టాల పట్ల గౌరవం ఉంది
నా మీద ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు వీళ్లంతా వేసినవే. వాటిని నేను చట్ట పరంగానే ఎదుర్కొంటా. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం ఉంది. చట్టాల పట్ల గౌరవంతోనే పని చేస్తూ వస్తున్నా. గతంలో, ఇప్పుడు, మున్ముందు ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుంచి 100 శాతం ఫలితాలు ఇవ్వటమే లక్ష్యంగా ఉంటా. అలాగే పని  చేస్తున్నా. భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో పని చేస్తా..’ అని రంగనాథ్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement