సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు వీలుగా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో త్వరలోనే ‘ఫ్యామిలీ రిజిస్టర్’ (కుటుంబ రికార్డు) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.
పౌరులందరికీ ఒకే రకమైన ప్రామాణిక కుటుంబ రికార్డును అందించడమే లక్ష్యంగా ఈ సరికొత్త వ్యవస్థను రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల డేటాను ప్రాతిపదికగా తీసుకుని ఈ ఫ్యామిలీ రిజిస్టర్ను ప్రభుత్వం సిద్ధం చేయనుంది. దీని ద్వారా ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల వివరాలన్నింటినీ ఒకే రిజిస్టర్లో భద్రపరుస్తారు. దీనివల్ల వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో కుటుంబ వివరాల ధృవీకరణ ప్రక్రియ చాలా సులభతరం కానుంది.
రెండు రోజుల్లోనే సర్టిఫికెట్
ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దరఖాస్తు విధానం: పౌరులు తమకు సమీపంలోని మీసేవా కేంద్రాల ద్వారా లేదా ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న కేవలం రెండు పని దినాల్లోనే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ను జారీ చేసేలా అధికారులు ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నారు.
ఒకే రికార్డు.. అనేక సేవలు
ప్రస్తుతం వేర్వేరు ప్రభుత్వ పథకాలకు వేర్వేరు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి వస్తోంది. కానీ, ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే.. అన్ని రకాల ప్రభుత్వ సేవలకు, సంక్షేమ పథకాల లబ్ధికి ఈ ‘ఒకే కుటుంబ రికార్డు’ ప్రామాణికంగా మారుతుంది. దీనివల్ల ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించనున్నారు.


