పాలనలో బీజేపీ విఫలం: బీజేడీ
● రైతులకు అన్యాయం
● కుప్ప కూలిన శాంతిభద్రతలు
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పాలన పూర్తిగా విఫలమైందని, శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ప్రతిపక్ష బిజూ జనతా దళ్ (బీజేడీ) బాహాటంగా ఆరోపించింది. మంగళ వారం స్థానిక దిగువ పీఎంజీ వద్ద పెద్ద ఎత్తున రైతుల ప్రదర్శన నిర్వహించింది. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు మాస్టర్ క్యాంటీన్ స్క్వేర్ వద్ద గుమిగూడారు. తరువాత దిగువ పీఎంజీకి ఊరేగింపుగా వెళ్లారు. అక్కడ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా బీజేడీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ ప్రసంగిస్తూ మండీలలో విస్తృతమైన అవకతవకలు చోటుచేసుకున్నాయని పాలన వైఫల్యాన్ని ఎండగట్టారు. ప్రభుత్వం రైతులకు మద్దతుగా కట్టు కథలు అల్లుతున్న వాస్తవాలు వైఫల్య పాలనకు అద్దం పడుతున్నాయని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ప్రసంగాలు, కథనాలతో ప్రభుత్వ పాలన సాధ్యం కాదని హితవు పలికారు. ప్రభుత్వ వాగ్దానాలు క్షేత్రస్థాయిలో వాస్తవ అమలు ప్రభుత్వ పారదర్శక పాలన ప్రతిబింబిస్తాయన్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నప్పటికీ కీలకమైన ఎన్నికల వాగ్దానాలు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదని సభాముఖంగా ఆరోపించారు. గత బీజేడీ పాలనలో చేపట్టిన చొరవలను ఆయన ప్రస్తావిస్తు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టడం, రైతులకు ఆర్థిక సహాయం అందించే కాలియా పథకం అమలును ప్రస్తావించారు. నీటిపారుదల విస్తరణ, సంస్థాగత రుణ మద్దతు వంటి చర్యలతో తమ ప్రభుత్వం రైతాంగానికి వెన్నంటి ప్రోత్సహించిందన్నారు. రైతాంగం నుంచి వరి కొనుగోలులో పలు చట్టవిరుద్ధమైన పద్ధతులు అవలంభించడం ఎంత మాత్రం తగదన్నారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ అక్రమాలు అరికట్టడానికి ప్రత్యేక దళం ఏర్పాటు, మిల్లర్లు, అధికారుల లాలూచీ నివారణ, వ్యవసాయ పెట్టుబడుల సబ్సిడీపై 150 క్వింటాళ్ల పరిమితి తొలగింపు, 48 గంటల్లోపు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) చెల్లింపుల నిర్ధారణ, 72 గంటల్లోపు బహిరంగ పొలాల్లో పడి ఉన్న వరిని సేకరించడం వంటి దిద్దుబాటు చర్యలు, ప్రతిపాదిత చర్యలను కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు నవీన్ పట్నాయక్ తెలిపారు. రైతాంగం సమగ్ర సంక్షేమానికి తమ విన్నపాలను ప్రభుత్వం పెడ చెవిన పెట్టి కచ్చితమైన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఇది అత్యంత విచారకర చర్యగా పేర్కొన్నారు. విపక్ష హోదాలో బిజూ జనతా దళ్ శాసన సభలో రైతుల సమస్యలను నిరంతరం లేవనెత్తుతోంది. రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితిపై బీజేడీ అధినేత ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగం సమస్యలను పరిష్కరించేంత వరకు బీజేడీ ఆందోళన నిరవధికంగా కొనసాగుతందని విపక్ష నేత నవీన్ పట్నాయక్ సభాముఖంగా ప్రకటించారు.
పాలనలో బీజేపీ విఫలం: బీజేడీ


