జయపురం జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్
జయపురం: అవిభక్త కొరాపుట్లో చారిత్రిక, ప్రధాన పట్టణం జయపురంను జిల్లా కేంద్రంగా జయపురం జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కు శుక్రవారం చేరింది. జయపురం నుంచి జయపురం జిల్లా కార్యాచరణ కమిటీ ప్రతినిధి బృందం భువనేశ్వర్ వెళ్లి రాష్ట్ర రెవెన్యూ, విస్తరణ నిర్వాహక శాఖల మంత్రి సురేష్ పూజారిని కలిసి జయపురం ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతినిధి బృందం సమర్పించిన వివరాలను పరిశీలించిన మంత్రి.. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామన్నాని జయపురం జిల్లా కార్యాచరణ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న కొరాపుట్ జిల్లాలో జయపురం సబ్ డివిజన్లోని 5 సమితిలతో పాటు, కొరాపుట్ సబ్డివిజన్ లమతాపుట్, నందపూర్ సమితులను కలిపి ప్రత్యేక జయపురం జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను ప్రతినిధి బృందం మంత్రికి గట్టిగా వినిపించింది. అందుకు కమిటీ రూపొందించిన ప్రతిపాదిత జయపురం జిల్లా మ్యాప్ను అందజేసింది. మంత్రిని కలిసిన వారిలో జయపురం జిల్లా కార్యాచరణ కమిటీ సభ్యులు బులు దేవ శర్మ, గుప్త పాణిగ్రహి, సతీష్ నందా, షణ్ముఖ శ్రీను, ప్రకాశ్ మిశ్రా, ఆనంద మిశ్రా, సిద్ధు పాత్రో, తదితరులు ఉన్నారు. రెవెన్యూ మంత్రిని కలిసిన ప్రతినిధిలు జయపురం జిల్లా డిమాండ్ వినతిపత్రం సమర్పించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవటంతో ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
జయపురం జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్


