బ్రహ్మోత్సవాలు
వైభవంగా కల్యాణ వేంకటేశుని..
రాయగడ:
పారిశ్రామిక ప్రాంతమైన జేకేపూర్లో గల భూసమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరం స్వర్ణోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారిపూజా కార్యక్రమాలు మందిర ప్రధాన అర్చకులు పొందూరు వెంకట ప్రదీప్, అంపోలు రంగనాథ్ ఆచార్యుల ఆధ్వర్యంలో జరిగాయి. బరంపురానికి చెందిన అంపోలు అనంత వెంకట శ్రీనివాస్ ఆచార్యులు, విశాఖపట్నంకు చెందిన గోపీనంబాళ్ల శేషాచార్యుల ఆధ్వర్యంలో స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి వారికి పుష్పాభిషేకంతో పాటు పూలతో అలంకరించారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు మందిరం ముఖ ద్వారం వద్ద పురోహితులు ప్రత్యేకమైన పూజలతో కలశ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో వందల సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 108 కలశాలతో సమీపంలో గల నాగావళి నది వద్దకు వెళ్లి అక్కడ గంగమ్మ తల్లిని పూజించి కలశాల్లో నాగావళి నదీ జలాలను ఊరేగింపుగా మందిరం వద్దకు తీసుకువచ్చారు. తీసుకువచ్చిన నదీ జలాలను జాగ్రత్త పరిచారు. ఈ కార్యక్రమంలో మందిరం కమిటీ ఉపాధ్యక్షుడు పట్నాన గౌరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
గోవింద మాల దీక్షాధారణ
ఉత్సవాల్లో భాగంగా మందిరం వద్ద గోవింద మాల దీక్షను ధరించారు. ఈ ఉత్సవాల్లో దీక్షను ధరించిన వారు స్వామి వారికి భక్తిశ్రద్ధలతో పూజలను నిర్వహించేందుకు సహకరించడంతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందజేసే సేవా కార్యక్రమాల్లొ పాల్గొంటారు. మాల దీక్షను ధరించే వారు మార్చి 1 వ తేదీతో దీక్షను మందిరం వద్దే విరమిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి మందిర ప్రాంగణంలో ప్రత్యేకమైన వేదికను నిర్వాహకులు రూపొందించారు. వేదిక వెనుక స్వామి వారి నామంతో పాటు శంఖు, చక్రం వంటివి అమర్చారు. అదేవిధంగా వేదిక ముందు భాగంలో గరుడ విగ్రహాలు వందనాలు చెబుతున్నట్లు రూపొందించిన వేదిక అందరినీ ఆకట్టుకుంటుంది.
నేడు శ్రీరామ చంద్ర స్వామి వారి కల్యాణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీరామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. కల్యాణోత్సవం అనంతరం విశేష హోమాలు, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు ఉంటాయి.
బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాలు


