దివ్యాంగులను ప్రోత్సహిద్దాం
జయపురం: దివ్యాంగులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, వారికి అండగా నిలిస్తే క్రీడా పోటీల్లో రాష్ట్ర,, జాతీయ స్థాయిలో విజయఢంకా మోగిస్తారని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. శనివారం కొరాపుట్ జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను జయపురం సమితి పూల్బెడ ప్రాంతంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా రంగంలో కొరాపుట్ జిల్లాను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు దివ్యాంగ క్రీడాకారులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. కొరాపుట్ జిల్లా సామాజిక సురక్షా విభాగం, దివ్యాంగ స్వసస్థీకరణ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో 260 మంది దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారు. షాట్పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, వీల్చైర్ రేస్, పరుగు, లాంగ్జంప్, హైజంప్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, జయపురం సమితి చైర్మన్ తిలోత్తమ ముదులి, జయపురం సమితి బీడీఓ శక్తి మహాపాత్రో, జిల్లా సామాజిక భద్రతాధికారి తరుణ తపన్ ప్రహరాజ్, జయపురం సబ్ డివిజన్ సామాజిక భద్రతాధికారి సౌధామణి ప్రధాన్, అధ్యాపకులు రబి శతపతి, కొరాపుట్ బ్లైండ్ స్కూల్ క్రీడా ఉపాధ్యాయులు చంద్రశేఖర పట్నాయిక్, జయపురం సమితి అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి గగణబిహారి దాస్, పీఈటీ రంజిత్ కుమార్ ప్రధాన్, సూర్యకాంత ముదులి, శ్వణ కుమార్ మండంగీ, రమేష్కుమార్ భోల్, బొబిత ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులను ప్రోత్సహిద్దాం


