అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
ఇచ్ఛాపురం: రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట గ్రామానికి చెందిన కొండొలోల సాయికుమార్ని పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నం నాయుడు తెలిపారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఆదివారం విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 9వ తేదీన అప్పన్నపేటలోని ఒక ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి, సుమారు ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.6,500ల నగదు దొంగలించినట్లు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆదివారం పట్టణ ఎస్ఐకి వచ్చిన సమాచారం మేరకు స్థానిక రైల్వేస్టేషన్కు పట్టణ పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఆవరణలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సాయికుమార్ని పట్టుకొని విచారించారు. ఈ విచారణలో నిందితుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 28 దొంగతనాలు చేసి జైలుకి కూడా వెళ్లినట్లు నిర్దారణ అయ్యింది. నిందితుని వద్దనుంచి స్థానిక స్టేషన్లో నమోదైన కేసుతో పాటు నరసన్నపేట, ఆమదాలవలస, మెళియాపుట్టి, జేఆర్పురం, విజయనగరం–1 టౌన్ స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించిన 48 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.10,500లు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ ముకుందరావు, క్రైమ్ సిబ్బంది బషీర్ తదితరులు పాల్గొన్నారు.


