రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలోని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలలో చదువుతూ హస్టల్లో ఉంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈమె అంబొదల ప్రాంతానికి చెందిన గీతా మాఝిగా గుర్తించారు. ఆదివారం రాత్రి హఠాత్తుగా గీత అస్వస్థతకు గురైంది. దీంతో హాస్టల్ నిర్వాహకులు సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంతజరిగినా హాస్టల్ నిర్వాహకులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని.. ఇదంతా వారి నిర్లక్ష్యం కారణంగానే తన కూతురు చనిపోయిందని సోమవారం అంబొదల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న గీతా మాఝి సొంత ఇల్లు వసతి గృహానికి కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న కొందోబలిజోడి గ్రామంలో ఉంది. ఆదివారం తీవ్రఅస్వస్థతకు గురైన గీత విషయం హాస్టల్ నిర్వాహకులు ఆమె తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం అందివ్వకపోవడం విచారకరం. ఇదిలాఉండగా హాస్టల్ ప్రధానోపాధ్యాయుడుగా విఽ దులు నిర్వహిస్తున్న కొలాబామన మూర్తి, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణమని పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు నమోదు కావడంతో కేసు మలుపు తిరిగింది.


