మార్చి 5న కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన
భువనేశ్వర్: మార్చి 5న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా 2 రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. మార్చి 5న సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేక వైమానిక దళ విమానంలో న్యూ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుతారు. మర్నాడు 6వ తేదీ ఉదయం కటక్ ముండులిలో జరిగే సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం ఖుర్దా జిల్లా జట్నీలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్ యూ), సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) భువనేశ్వర్ క్యాంపస్కు శంకుస్థాపన చేస్తారు. భువనేశ్వర్లోని ఎన్ఎఫ్ఎస్ యూ ట్రాన్సిట్ క్యాంపస్ను వర్చువల్ మోడ్ ద్వారా ప్రారంభిస్తారు. ఆ మధ్యాహ్నం కేంద్ర మంత్రి అమిత్ షా భువనేశ్వర్లోని ఇడ్కో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నవీన్ న్యాయ్ సంహిత ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారు. వివిధ విభాగాల ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడానికి కేంద్ర మంత్రి పర్యటన దష్ట్యా, గొడిసాహి, ముండులి రహదారిని బ్లాక్ టాపింగ్ చేయడంతో పాటు లైటింగ్, శుభ్రపరచడం, అవసరమైన సుందరీకరణ చేయాలని ఆదేశించారు. కటక్ జిల్లా మేజిస్ట్రేట్ వర్చువల్ మోడ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి సందర్శన యొక్క వివరణాత్మక షెడ్యూల్, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, రూట్ ప్లాన్, వేదిక వద్ద సంబంధిత సన్నాహాలపై సమావేశంలో చర్చించారు. కేంద్ర హోం శాఖ మంత్రి సందర్శనను సజావుగా విజయవంతం చేయడానికి నిర్ణీత సమయ వ్యవధిలో అన్ని సన్నాహాలను పూర్తి చేయాలని, అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్ర హోం, పరిశ్రమలు, సమాచార, ప్రజా సంబంధాల అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, కేంద్ర హోం శాఖ మంత్రి రాష్ట్ర పర్యటన సన్నాహాలు గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యోగేష్ బహదూర్ ఖురానియా, సహకార శాఖ కమిషనర్ మరియు కార్యదర్శి రాజేష్ ప్రభాకర్ పాటిల్, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్, ఖుర్దా జిల్లా మేజిస్ట్రేట్, సంబంధిత వివిధ విభాగాల కార్యదర్శులు, సీనియర్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కటక్ జిల్లా కలెక్టర్ వర్చువల్ మోడ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.


