కనుల విందుగా..
● శేషవాహనంపై స్వామి వారి ఊరేగింపు
● నేటితో ముగియనున్న
బ్రహ్మోత్సవాలు
రాయగడ: జేకేపూర్లోని భూసమేత కల్యాణ వేంకటేశ్వర మందిరం స్వర్ణోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం స్వామి వారిని పురవీధుల్లొ శేష వాహనంపై ఊరేగించారు. ఆదిశేశువుపై స్వామి శోభాయమానంగా భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులకు అభయమిస్తు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఊరేగింపులో స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ భక్తులకు స్వామివారు దర్శనభాగ్యం కలగడంతో అంతా పులకించిపోయారు. గోవింద..గోవింద అంటూ మధురమైన నామస్మరణాలతో ప్రాంతం ఆధ్యాత్మికంగా మారుమ్రోగిపోయింది. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ, వేదపారాయణం, విశేష హోమ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మందిరం ప్రాంగణంలోని కల్యాణ మండపంలో శుక్రవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ఈ వ్రతాల్లో దంపతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతుండటంతో రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న గురువారం సాయంత్రం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మందిర కమిటీ అధ్యక్షులు వినయ్ ద్వివేది, ఉపాధ్యక్షులు పట్నాన గౌరీశంకర్, సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి వద్ద ప్రత్యక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీర్వచనాలు తీసుకున్న సబ్ కలెక్టర్ జెన్న మందిరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
నేడు ముగింపు..
గత నెల 23వ తేదీ నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.


