పోలీసులకు రైఫిల్ షూటింగ్ పోటీలు
భువనేశ్వర్: జాజ్పూర్ జిల్లా బొయిరి పోలీస్ శిక్షణ సంస్థ (పీటీఐ) ప్రాంగణంలో 54వ రాష్ట్ర పోలీసు రైఫిల్ షూటింగ్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిఘా విభాగం డైరెక్టర్ ఆర్పీ కోచే గౌరవ కవాతుతో స్వాగతించారు. ఈ సందర్భంగా కోచే మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బందిలో రైఫిల్ షూటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడమే పోటీల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. పోటీలో పాల్గొనే ప్రతి పోటీదారుడు తమ ఉత్తమ నైపుణ్యత ప్రదర్శించాలని ఆయన ప్రోత్సహించారు. జాతీయ స్థాయిలో ఒడిశా పోలీసులు తమ ప్రత్యేక ఖ్యాతిని, గుర్తింపును కొనసాగించాలని పిలుపునిచ్చారు. క్రీడా స్ఫూర్తి, బలమైన ఆత్మవిశ్వాసంతో పోటీని విజయవంతం చేయాలని అభినందించారు. రాష్ట్రంలోని వివిధ శ్రేణులు, బెటాలియన్ల నుంచి 16 పోలీసు జట్లు ఈ చాంపియన్షిప్లో పాల్గొన్నాయి. 265 మంది పురుషులు, నలుగురు మహిళలు సహా మొత్తం 269 మంది ఆటగాళ్లు ఈ చాంపియన్షిప్లో పాల్గొన్నారు. ఈ పోటీలు వచ్చే నెల 1వ తేదీ వరకు కొనసాగుతాయి.
ఈ చాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐజీపీ (ఎస్ఏపీ) గజవియే సతీష్ కుమార్, బొయిరి పీటీఐ కమాండెంట్ అశోక్ కుమార్ దెహురి, కటక్ 6వ ఒడిశా సాయుధ పోలీసు దళం (ఓఎస్ఏపీ) కమాండెంట్ సూర్య నారాయణ మల్లిక్, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయ క్రీడా అధికారి నీల మాధవ్ స్వంయి అనేక మంది సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.


