భువనేశ్వర్: రంగుల పండగ ఆనందమయం కావాలి. ఈ సందర్భంగా రసాయనపూరిత రంగులు నివారించి ప్రకృతి సహజమైన రంగులను వినియోగించాలని ఒడిశా గ్రామీణ అభివృద్ధి, మార్కెటింగ్ కమిటీ (ఒర్మాస్) పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా స్థానిక యూనిట్ – 8 ఎస్ఐఆర్డీ క్యాంపస్లో పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ ఆధ్వర్యంలోని రంగోత్సవ్–2026 ప్రారంభించారు. ఈ నెల 4వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతుంది. సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన రంగులతో హోలీ వేడుకలను ఆనందమయంగా జరుపుకునేందుకు ప్రేరణగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలు ఉత్పత్తి చేసిన సహజ రంగులతో ఈ వర్గం ఉత్పత్తి చేసిన సంప్రదాయ రుచికరమైన వంటకాలు, చక్కటి హస్తకళలు, చేతితో తయారు చేసిన గృహోపకరణాలు వంటి విస్తృత శ్రేణి గ్రామీణ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. లాభాపేక్ష లేకుండా గిట్టుబాటు ధరలకు ఈ ఉత్పతుల్ని నగర వాసులకు విక్రయిస్తున్నట్లు ఈ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ మంత్రి రవి నారాయణ్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగోత్సవం సురక్షితమైన రంగులు, మహిళా సాధికారత యొక్క అందమైన కలయిక అని తెలిపారు. ఎస్హెచ్జీ మహిళలు తయారుచేసిన సహజ రంగులను ఉపయోగించడం ద్వారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఒర్మాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డాక్టర్ మోనికా ప్రియదర్శిని మాట్లాడుతూ రంగోత్సవం గ్రామీణ ఒడిశా మహిళా వ్యవస్థాపకుల నైపుణ్యాలను ప్రతిబింబిస్తుందన్నారు. ఒర్మాస్ వారిని ఆధునిక మార్కెట్తో అనుసంధానించడానికి, వారి పనికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వడానికి నిబద్ధతతో అండగా నిలుస్తుందన్నారు. ఈ చొరవతో ఎస్హెచ్జీ ఉత్పత్తులు అధిక నాణ్యత ప్యాకేజింగ్, బ్రాండింగ్ ద్వారా ప్రధాన స్రవంతి మార్కెట్లలో ప్రవేశం పొందగలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాన ఆకర్షణ
ఈ ప్రదర్శనలో సహజ రంగులు పసుపు, బీట్రూట్, పువ్వుల వంటి సహజ పదార్థాల నుండి రసాయన రహిత మూలికలతో తయారు చేసిన హోలీ రంగులను గిట్టుబాటు ధరలకు విక్రయిస్తున్నారు. ఈ రంగులు చర్మానికి, పర్యావరణానికి పూర్తిగా సురక్షితం.


