భువనేశ్వర్: మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)లో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వలస ఒడియా ప్రజల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సూచనల మేరకు జరిగిన ఈ సమావేశంలో హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ ఆర్పీ కోచే, ఒడిశా మో పరిబార్ డైరెక్టర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బిజయకేతన్ ఉపాధ్యాయ్, కార్మిక శాఖ కమిషనర్ ఇంద్రమణి త్రిపాఠి, వివిధ విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో వలస వెళ్లిన ఒడియా ప్రజలకు, వారి కుటుంబాలకు సాధ్యమైనంత మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. సంబంధిత విభాగాలన్నీ అప్రమత్తంగా ఉంటు అనుక్షణం మారుతున్న పరిస్థితిని నిశితంగా గమనించాలని ప్రఽముఖ కార్యదర్శి సూచించారు. విదేశాల్లో ఉంటున్న ఒడియా ప్రజలకు సకాలంలో సహాయం, విశ్వసనీయమైన సమాచారాన్ని అందజేయడంలో చక్కని సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయ పౌరులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాత్రింబవళ్లు పని చేసే 24 గంటల టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 800–4634342, వాట్సాప్ నంబర్ +971543090571ను జారీ చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిస్పందన యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా మో పొరిబార్, రాష్ట్ర హోం (స్వరాష్ట్ర) శాఖ, రాష్ట్ర కార్మిక డైరెక్టరేట్ ప్రమఖులతో కూడిన ప్రత్యేక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. తాజా సమాచారం, సకాలంలో సహాయాన్ని సులభతరం చేసేందుకు ప్రీతీష్ పండాను ఒడిశా మో పరిబార్కు నోడల్ అధికారిగా నియమించారు. మధ్యప్రాచ్యంలోని ఒడియాలకు సంబంధించిన మద్దతు కోసం ఆయనను 9583321964 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సమావేశానికి హాజరైన రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ వై. బి. ఖురానియా తెలిపారు. సంబంధిత అధికారులందరినీ అప్రమత్తం చేశామని, పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన అన్నారు. పరిస్థితికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను కఠినంగా పర్యవేక్షిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని నివారించడానికి అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ తెలియజేశారు.


