హైటెక్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
భువనేశ్వర్: వివాహ వేడుకలో ద్రవ నైట్రోజన్ పదార్థాలు, పానీయాలు సేవనంతో ఆకస్మిక అనారోగ్యానికి గురైన యువకుడిని హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం అరుదైన శస్త్ర చికిత్సతో ప్రాణాలు కాపాడారు. స్థానిక జగన్నాథ్ నగర్కు చెందిన సంజీవ్ త్రిపాఠి అనే 34 ఏళ్ల వ్యక్తి కడుపు వాపు వ్యాధితో హైటెక్ ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించి తక్షణమే ఐసీయూలో చేర్చి నిర్వహించిన సీటీ స్కాన్లో నైట్రోజన్ గ్యాస్ ప్రభావం కారణంగా అతని కడుపులో 3 నుంచి 4 సెంటీ మీటర్ల రంధ్రం ఏర్పడిందని తేలింది. ప్రాణాలు కాపాడేందుకు గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ ప్రేమానంద్ పట్నాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. కడుపులోని రంధ్రం మూసివేయడంతో ముప్పు తప్పింది. హైటెక్ వైద్య నిపుణుల బృందం సమయస్ఫూర్తితో తీసుకున్న చర్యలు అభినందనీయమని హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి హర్షం వ్యక్తం చేశారు.


