పోలీసులు మర్యాదపూర్వకంగా ఉండాలి: ఐజీ
భువనేశ్వర్: పోలీసు దళంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో యూనిఫామ్ను గౌరవించాలని, ప్రజల్లో మర్యాదపూర్వక సభ్యతకు ప్రాధాన్యత కల్పించాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రేంజ్) సత్యజిత్ నాయక్ అన్నారు. రాష్ట్రంలోని ఒక సీనియర్ పోలీసు అధికారి విభిన్నంగా ఎరట్రి జుట్టుతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టిని ఆకట్టుకుంది. తక్షణమే రంగు మార్చుకుని సహజ వర్ణ జుట్టుతో హాజరు కావాలని కోరారు. జగత్సింగ్పూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రష్మీ రంజన్ దాస్ (49) ఎరన్రి రంగు వేసిన జుట్టుతో విధులకు హాజరు అవుతున్న ఫోటోలు ఆన్లైన్ వీక్షకులను విభిన్నంగా ఆకర్షించడంతో వెలుగులోకి వచ్చాడు. ఈ సంఘటనపై అతని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. రష్మీ రంజన్ దాస్ జుట్టు రంగును మార్చుకోవాలని ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రేంజ్) సత్యజిత్ నాయక్ ఆదేశించారు. కేశాలంకరణకు సంబంధించి నిర్దిష్ట నియమం లేనప్పటికీ సిబ్బంది సాధారణ శైలి కొనసాగించాలని సీనియర్ అధికారులు భావిస్తున్నారు. రష్మీ రంజన్ దాస్ తన ప్రదర్శనను పునఃపరిశీలించుకోవాలని గతంలో అనధికారికంగా సలహా ఇచ్చిన పాటించలేదని అధికార వర్గాలు తెలిపాయి. యూనిఫాంలో ఉన్న వ్యక్తికి తగినట్లుగా, మర్యాదగా వ్యవహరించాలని, అతని కేశాలంకరణ సహజంగా ఉంచుకోవాలని అధికారికి నచ్చజెప్పమని జగత్సింగ్పూర్ పోలీసు సూపరింటెండెంట్ ఆదేశించినట్లు ఐజీ తెలిపారు. అధికారికి మర్యాదగా ఉండాలని మౌఖికంగా తెలియజేశారు. ప్రతీది లిఖితపూర్వక ఆదేశాల ప్రకారం జరగదు. కానిస్టేబుళ్ల నుంచి సీనియర్ అధికారుల వరకు పోలీసు సేవలోని ప్రతి ఒక్కరూ యూనిఫామ్ను గౌరవించాలని, మర్యాదకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన అన్నారు.


