మంత్రివర్గ ఆమోదం
12 ప్రతిపాదనలకు..
భువనేశ్వర్: స్థానిక లోక్ సేవా భవన్ కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన శనివారం రాష్ట్ర మంత్రివర్గం 35వ సమావేశం జరిగింది. సమావేశం తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మీడియాకు వివరించారు. మంత్రి వర్గం ఆమోదం కోసం 10 విభాగాలు 12 ప్రతిపాదనలను సమావేశంలో ప్రవేశ పెట్టారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. వీటిలో ఒడియా భాష, సాహిత్యం మరియు సంస్కృతి శాఖ, పరిశ్రమల శాఖ, జలవనరుల శాఖ, కార్మిక, ఉద్యోగుల రాష్ట్ర బీమా శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యాయ, సహకార సంస్థలు, వాణిజ్యం, రవాణా, ఉక్కు, గనుల శాఖ, శాసన సభ వ్యవహారాల శాఖ నుంచి ఒక్కొక్కటి వంతున, ప్రజా పరిపాలన, ప్రజా ఫిర్యాదుల శాఖ నుంచి 2 ప్రతిపాదనలు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వీటిలో ఒక ప్రతిపాదన ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న 17వ శాసనసభ 6వ విడత ఆమోదానికి సంబంధించినది.
మంత్రి వర్గం కీలక ఆమోదాలు
రాష్ట్ర సహకార విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జల వనరుల శాఖ మళ్లింపు వ్యవస్థకు రూ. 362 కోట్లు మంజూరుకు మార్గం సుగమం చేసింది. సింగపూర్, దుబాయ్లకు విమానాలు ఈ ఏడాది మార్చి నెల వరకు కొనసాగుతాయి. తదుపరి సేవల పొడిగింపు, కొనసాగింపు విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని మంత్రి వర్గం తీర్మానించింది.
రాష్ట్రంలో రక్షణ, అంతరిక్ష పరికరాలు నిర్మాణం కోసం ఢెంకనాల్ గొజొమొరా ప్రాంతంలో రూ. 17,250 కోట్ల పెట్టుబడితో 1100 ఎకరాల భూమిలో కళ్యాణి గ్రూప్ ఇంటిగ్రేటెడ్ న్యూ ఏజ్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ను నిర్మిస్తుంది. దీని ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 20,000 మంది యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి వర్గం అభిప్రాయపడింది. కంబైన్డ్ టెక్నికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ రూల్స్, 2022 సవరణ, ఒడిశా యూనిఫామ్డ్ సర్వీస్ పర్సనల్ సెలక్షన్ కమిషన్ రూల్స్, 2026 ప్రకటన, ఒడిశా సుపీరియర్ జ్యుడీషియల్ సర్వీస్, జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్, 2007 సవరణకు మంత్రి వర్గం అంగీకరించింది.
మంత్రివర్గ ఆమోదం


