రైతుల సమస్యలు పరిష్కరించాలి
● కృషక్మంచ్ నాయకుల డిమాండ్
జయపురం: జిల్లాలో ధాన్యం మండీలలో నెలకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొరాపుట్ జిల్లా కృషక మంచ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కృషక్ మంచ్ కార్యదర్శి నరేంద్ర ప్రధాన్ నేతృత్వంలో రైతులు కొరాపుట్ జిల్లా సివిల్ సప్లయ్ జయపురం కార్యాలయ అధికారిని కలిసి జిల్లా కలెక్టర్కు ఉద్దేశించి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండీలలో ధాన్యం కొనేందుకు సిబ్బంది అనేక కారణాలు చూపుతున్నారని, మండీల్లో తగిన సౌకర్యాలు లేక పోవటం, మిల్లర్లు ధాన్యం కొనకపోవటంతో జిల్లాలోని అన్ని మండీలలో లక్షలాది క్వింటాళ్ల ధాన్యం పడి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు టోకెన్లు ఇచ్చే ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. రైతుల నిస్సహాయతను ఆసరాగా తీసుకొని మిల్లర్లు ధాన్యంలో నాణ్యత లేదనే కారణాన్ని చూపిస్తూ క్వింటాకు ఐదు నుంచి 15 కేజీలు వరకూ అదనంగా ధాన్యాన్ని తీసుకుంటున్నారని వినతి పత్రంలో వివరించారు. ధాన్యం రవాణా ఖర్చులు, హేండిలింగ్ ఖర్చులు, ఖాళీ బస్తాల పైకం చెల్లించాలని కృషక మంచ్ డిమాండ్ చేసింది. తాము చేసిన ఆరోపణలపై నిష్పక్షంగా దర్యాప్తు జరిపి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులను కలిసినవారిలో కృషక్ మంచ్ జిల్లా కార్యదర్శితో పాటు రైతులు సిద్దార్థ త్రిపాఠీ, సంజయ బెహర, బిది భూషణ త్రిపాఠీ, రణేంద్రప్రసాద్హత్త, పూర్ణ చంద్రనాయిక్, పి.వెంకటరావు, పల్లి రాజు, రాజేంద్రనాయిక్ ఉన్నారు.


