దోపిడీ ప్రయత్నం భగ్నం
జయపురం: పెద్ద ఎత్తున దోపిడీ చేసేందుకు సన్నద్ధమైన దోపిడీ దొంగల ముఠా ప్రయత్నాన్ని జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఆరుగురు దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు బొరిగుమ్మ సబ్డివిజన్ పోలీసు అధికారి సత్యబ్రత లెంక వెల్లడించారు. దుండగుల నుంచి పెద్ద ఎత్తున మారణాయుధాలను స్వాధీన పరచుకున్నట్లు ఆయన పత్రికా ప్రతినిధులకు వెల్లడించారు. ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తులై దుండగులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారు పాత బొరిగుమ్మ నివాసి లయిచన్ హరిజన్, బాసు హరిజన్, బొరిగుమ్మ హటపొదర్ వాసి గగణ ప్రధాన్, శాంతూన్ మహంతి, కొలాగుడ వాసి పూర్ణ హరిజన్, హరిహర హరిజన్ అని వెల్లడించారు. జనవరి 29 వ తేదీన రాత్రి బొరిగుమ్మ పోలీసు స్టేషన్ ఏఎస్ఐ గోపాల హరిజన్, ఏఎస్ఐ బసంత నాగ్ల నేతృత్వంలో రాత్రి పెట్రోలింగ్ జరుపుతున్నారు. ఆ సమయంలో కొంత మంది దుండగులు కొశాగుడ కూడలి వద్ద దోపిడీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందగా వెంటనే వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాక చూసి దుండగులు పరుగులు తీశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు వారిని వెంబడించారు. మొదట ముగ్గురు దుండగులను పట్టుకున్నారు. మిగతా ముగ్గురు పారి పోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలించగా తెల్లవారు జాము నాలుగున్నర సమయంలో పారిపోయిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. వారి నుంచి కత్తులు, ఇనుప రాడ్లు, చాకులు కర్ర లాఠీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.


