మర్రిగుడ దోపిడీ కేసు ఛేదన
పర్లాకిమిడి: గజపతి జిల్లా సెరంగో పోలీసుస్టేషన్ పరిధిలో మర్రిగుడ గ్రామంలో ఈనెల 25న జరిగిన పట్టపగలు చోరీని పోలీసుల బృందం ఛేదించి ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నట్టు ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా శనివారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ దొంగతనంలో 300 గ్రాముల బంగారు వస్తువులు, 80 గ్రాముల వెండి వస్తువులు, నగదు ఒకలక్షా 89వేలు పట్టుబడినట్టు ఆర్.లక్ష్మీకళ్యాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. రాణిపేట పంచాయతీలోని డీపీఓ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దొంగతనానికి సంబంధించిన సమాచారం అందజేశారు. 300 గ్రాముల బంగారం విలువ సుమారు రూ.45లక్షలు ఉంటుందని ఎస్పీ పండా తెలియజేశారు.
గత నెల 25వ తేదీని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి, ఆర్.లక్ష్మీ కళ్యాణీ తన కుటుంబసభ్యులతో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి మందిరానికి దర్శనానికి వెళ్లారు. తిరిగి అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో మర్రిగుడ తన ఇంటికి చేరుకోగా ఇంటిలో అల్మరా పగులగొట్టి బంగారం, నగదు కొల్లగొట్టినట్టు గుర్తించారు. జనవరి 26న గుమ్మా బ్లాక్ సెరంగో పోలీసు స్టేషన్లో ఆర్.లక్ష్మీకళ్యాణి ఫిర్యాదు చేశారు. దీనిపై హెడ్క్వార్టర్ డీఎస్పీ అమితావ్ పండా ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీమ్ను జిల్లా ఎస్పీ ఏర్పాటుచేసి పదిరోజుల్లో దొంగతనం మిస్టరీని ఛేదించారు. ఆర్.లక్ష్మీకళ్యాణీ ఇంటిలో పట్టపగలు వారి ఇంట్లోకి ముగ్గురు జొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. మూడో దొంగ బయటకాపలా కాశాడు. కాజేసిన బంగారం, వెండి వస్తువులు సమీపంలో అటవీ ప్రాంతంలో గొయ్యి తీసి పాతిపెట్టినట్టు ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియ జేశారు. పోలీసులు దర్యాప్తు చేసి అనుమానంగా ఉన్న దొంగలను పట్టుకుని విచారించగా వారు దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. బంగారం, వెండి వస్తువులు శనివారం ఉదయం పాతిపెట్టిన స్థలంలో సెరంగో పోలీసులు సాక్షుల సహాయంతో బయటకు తీసుకొచ్చి విలేకరుల సమక్షంలో ప్రవేశపెట్టారు. మొత్తం బంగారం 300 గ్రాముల వస్తువులు, 80 గ్రాముల వెండి వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. నగదు విషయంపై నిందితులను తర్వాత విచారించనున్నట్టు పోలీసు అధికారులు తెలియజేశారు. నిందితులు ముగ్గురు మర్రిగుడకు చెందిన మరాటి గిరిబాబు, అరుణ్ కుమార్ ప్రధాన్, పరిడా గ్రామానికి చెందిన మురళీ నాయక్ను శనివారం జిల్లా కోర్టుకు తరలించారు. ఇంటి యజమాని ఆర్.లక్ష్మీకళ్యాణీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నది. ఈ దోపిడీకి పాల్పడి పదిరోజుల్లో మిస్టరీని ఛేదించిన జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండాను దుశ్శాలువతో కాశీనగర్ సమితి మాజీ చైర్మన్ ఛిత్రి సింహాఽద్రి, లక్ష్మీ కళ్యాణీలు సత్కరించారు.
మర్రిగుడ దోపిడీ కేసు ఛేదన


