అన్ని వర్గాలకు బడ్జెట్ అనుకూలం: ముఖ్యమంత్రి
● బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనాలకు దూరం: విపక్ష నేత
● యువతకు నిరుత్సాహం: పీసీసీ చీఫ్
భువనేశ్వర్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2026 –27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రాష్ట్ర పర్యావరణ అనుకూల సరుకు రవాణా, పర్యాటక రంగాలకు అనుకూలంగా ఉంది. దీంతో రాష్ట్రంలో ఖనిజ ప్రాంతాలు, జల మార్గాలు, వన్యప్రాణుల పర్యాటకంతో రాష్ట్రం కొత్త వన్నె దిద్దుకుంటుంది. 2026–27 కేంద్ర బడ్జెట్ సుస్థిర గ్రీన్ లాజిస్టిక్స్, జీవన వైవిధ్యం ఆధారిత పర్యాటక రంగం వృద్ధికి మార్గం సుగమం చేసింది. హరిత పర్యావరణం పరిరక్షణతో ఆర్థికంగా బలోపేత చొరవలతో కేంద్ర బడ్జెట్లో ఒడిశా ఉనికి ప్రత్యేక గుర్తింపు సాధించింది. పర్యావరణ అనుకూల సరుకు రవాణా పురోగతికి రాష్ట్రంలో జాతీయ జల మార్గం (నేషనల్ వాటర్ వే) – 5 కొత్త బడ్జెట్లో చోటు చేసుకుంది. జాతీయ జలమార్గం 5 తాల్చేర్, అంగుల్, కళింగ నగర్లను అనుసంధానపరుస్తుంది. రానున్న ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అమలు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రకటించింది. ఈ కారిడార్ తాల్యేరు, అంగుల్ వంటి ఖనిజ కేంద్రాలను కళింగనగర్ వంటి పారిశ్రామిక సమూహాలు, పారాదీప్, ధామ్రా వద్ద ఓడరేవులతో అనుసంధానపరుస్తుంది. ఈ చర్య లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచి కార్బన్ కాలుష్యం తగ్గిస్తుంది. జాతీయ జల మార్గం పరిసర ప్రాంతాలు పారిశ్రామిక విస్తరణకు నోచుకుంటాయని భావిస్తున్నారు.
పాత మాట
ఖనిజ సంపన్న ప్రాంతాలు, పారిశ్రామిక కేంద్రాలను ఓడ రేవులకు అనుసంధానించడానికి జాతీయ జలమార్గాలు యోచన కొత్తదేమి కాదు. ఇది దశాబ్ద కాలం నాటి ప్రతిపాదన. ఇంత వరకు ఈ ప్రతిపాదన క్షేత్రస్థాయిలో ఎటువంటి పురోగతిని నోచుకోలేదని నవీన్ పట్నాయక్ గుర్తు చేశారు. ఒడిశాలో అరుదైన భూమి కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనను విపక్ష నేత స్వాగతించారు. రాష్ట్రం అనేక కీలక ఖనిజాల ఉత్పత్తిలో అగ్రగామిగా కొనసాగుతుంది. ఈ విలువైన వనరులతో దేశ నిర్మాణానికి ఎల్లవేళల్లో దోహదపడుతుందన్నారు. నగరాల మధ్య ఏడు హై–స్పీడ్ రైలు కారిడార్లను ‘గ్రోత్ కనెక్టర్లు’గా అభివృద్ధి చేయాలనే ప్రకటనలో ఒడిశాకు స్థానం కల్పించకపోవడం దురదృష్టకరం. ఈ చర్య రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టును రాష్ట్రంలో బీజేపీ సర్కారు రద్దు చేసింది. ప్రజల అవసరాలను నిర్లక్ష్యం చేయడం యథావిధిగా కొనసాగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రముఖ సర్క్యూట్ల ప్రస్తావన లేకపోవడం విచారకరం. వజ్ర త్రిభుజం సహా అనేక ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ, బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి కోసం పర్యాటక కేంద్రీకృత పథకంలో ఒడిశాను మినహాయించడం దురదృష్టకర చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో సహజ వనరులను కొల్లగొట్టేందుకు మాత్రమే కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం వనరుల కేటాయింపు విషయానికి పూర్తిగా నీళ్ళొదినట్లు సమగ్ర పరిశీలనలో స్పష్టం అవుతుందని విపక్ష నేత తెలిపారు.
బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనాలకు దూరం:
నవీన్ పట్నాయక్
కేంద్ర ప్రభుత్వం ఆది వారం సమర్పించిన 2026 బడ్జెట్ పై విపక్ష నేత నవీన్ పట్నాయక్ పెదవి విరిచారు. బడ్జెట్ ఒడిశా మరియు రాష్ట్ర ప్రజలకు చెప్పుకోదగ్గ ప్రయోజనాలను అందించలేదని నిరుత్సాహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, ఉద్యోగ సృష్టి, రాష్ట్రానికి రావాల్సిన అదనపు కేటాయింపులపై దృష్టి సారించి వృద్ధి వేగాన్ని పెంచుతుందనే ఆశ నీరు గార్చిందని వ్యాఖ్యానించారు.
యువతకు నిరుత్సాహం: పీసీసీ చీఫ్
కేంద్ర బడ్జెట్ 2026 పై ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ యువతకు ఏమీ అందించలేదని పురోగతి రంగంలో విఫలమవుతుందని అన్నారు. పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తారు. ఈ బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఏమీ లేదు. దిశానిర్దేశం లేకుండా దార్శనికత మరియు నిర్ధిష్ట విధానం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. కొత్త బడ్జెట్ రుణ భారం పెంచుతుందన్నారు. దేశాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.


