మూఢ నమ్మకాలు ఇంకా మిగిలి ఉన్నాయి
పర్లాకిమిడి: కంప్యూటర్ యుగంలో కూడా చేతబడి, చిల్లంగి వంటి మూఢ నమ్మకాలు నమ్ముతున్నారని సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్ అన్నారు. చేతబడి చేస్తున్నారన్న వ్యక్తిపై కేసు పెట్టినా.. విచ్ హాంటింగ్ చట్టం కింద కేవలం మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని, మరికొన్ని కేసుల్లో అస్సలు వారికి అరెస్టు కూడా చేయబోమని సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవా నంద నాయక్ అన్నారు. ఆయన స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా స్థాయి విచ్క్రాఫ్ట్ నిషేధ చైతన్య కార్యక్రమంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రెవెన్యూ ఏడీఎం మునీంద్ర హానగ, జిల్లా సంక్షేమశాఖ అధికారిని మనోరమా దేవి, జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో, సీడీఎంఓ మానసిక నిపుణులు ప్రాణరంజన్ నాయక్, న్యాయవాది ప్రమోద్ రవుళో తదితరులు పాల్గొన్నారు. ఒడిషాలో కేందుఝార్, మయూర్భంజ్, కంధమాల్, రాయగడ, గజపతి జిల్లాలో మారుమూల గ్రామాల్లో చేతబడి పేరిట అనేక కుటుంబాలని గ్రామస్తులు హతమార్చిన సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయని, న్యాయశాఖ ఎన్ని చట్టాలు చేసినా ప్రజలు ఇంకా మూఢనమ్మకాలు విడిచి పెట్టడం లేదని రెవెన్యూ ఏడీఎం మునీంద్ర హానగా అన్నారు. చేతబడి, దెయ్యం పట్టడం అనేది అపోహా మాత్రమే అని.. అట్టాంటి రోగులు గత ఏడాది జిల్లాలో 1200 మందిని చికిత్సచేసి ఇంటికి పంపించామని జిల్లా మానసిక వైద్యులు ప్రాణ్ రంజన్ నాయక్ తెలిపారు. చేతబడి, చిల్లంగి వంటి మూఢవిశ్వాసాలుపై ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు వివిధ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులు కోరారు. ఈ జిల్లా స్థాయి చిల్లంగి నిషేధ సచేతన కార్యక్రమాన్ని జిల్లా ప్రోగ్రాం, ప్రొటెక్షన్ అధికారి సరలా పాత్రో అధ్యక్షత వహించగా, సీసీడీ స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ అడ్డాల జగన్నాధ రాజు, ఇతర మెడికల్ సిబ్బంది హాజరయ్యారు.


